
యూటా వ్యాలీ యూనివర్సిటీలో కాల్చి చంపిన దుండగుడు
విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం ఇస్తుండగా దూసుకొచ్చిన తూటా
మెడ నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
కిర్క్ హత్యకు రాడికల్ వామపక్షవాదులే కారణమని ఆగ్రహం
కిర్క్కు ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’ను ప్రకటించిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సన్నిహితుడిగా, సంప్రదాయవాదిగా పేరుగాంచిన చార్లీ కిర్క్(31) దారుణ హత్యకు గురయ్యాడు. అమెరికాలో యూటా రాష్ట్రంలోని ఉటా వ్యాలీ స్టేట్ యూనివర్సిటీలో బుధవారం ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా 150 మీటర్ల దూరంలో ఓ భవనం పైభాగంలో మాటువేసిన గుర్తుతెలియని వ్యక్తి తుపాకీ గురిపెట్టాడు.
ఒకే ఒక్క తూటాకు చార్లీ కిర్క్ అక్కడికక్కడే నేలకొరిగాడు. గత ఏడాది పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పుల తరహాలోనే ఈ కాల్పులు జరగడం గమనార్హం.
యూనివర్సిటీ ప్రాంగణంలో తెల్లరంగు టెంట్ మధ్యలో కూర్చొని విద్యార్థుల ప్రశ్నలకు మైక్రోఫోన్లో సమాధానం చెబుతుండగా హఠాత్తుగా బుల్లెట్ దూసుకొచ్చింది. రాజకీయ యువజన సంఘం ‘టరి్నంగ్ పాయింట్ యూఎస్ఏ’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చర్చా కార్యక్రమంలో గత పదేళ్లలో అమెరికాలో తుపాకీ హింసాకాండలో ట్రాన్స్జెండర్ల పాత్ర ఎంతవరకు ఉందన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చిన వెంటనే బుల్లెట్ ఆయన మెడను చీలుస్తూ దూసుకెళ్లింది.
మెడ ఎడమభాగం నుంచి రక్తం బయటకు చిమ్మింది. తీవ్రంగా గాయపడిన కిర్క్ అక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని యూటా రాష్ట్ర గవర్నర్ స్పెన్సర్ కాక్స్ తేల్చిచెప్పారు. కిర్క్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. తమ రాష్ట్రానికి ఇదొక చీకటి రోజు, దేశానికి విషాదభరిత దినమని అని చెప్పారు. హంతకుడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. అతడికి మరణశిక్ష తప్పదని పేర్కొన్నారు.
తొక్కిసలాట.. విషాద ఛాయలు
కిర్క్ హత్య తర్వాత యూనివర్సిటీలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. బుల్లెట్ పేలిన శబ్దం వినిపించడం, వెంటనే కిర్క్ కింద పడిపోవడం చూసి విద్యార్థులు ప్రాణభయంతో పరుగులు తీశారు. స్వల్పంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు పడిపోయారు. ఆ సమయంలో అక్కడ దాదాపు 3,000 మంది ఉన్నారు. అరుపులు, రోదనలతో విషాదం అలుముకుంది. ఈ గందరగోళం మధ్యే నల్లరంగు దుస్తుల్లో ఉన్న హంతకుడు అందరి కళ్లుగప్పి సులభంగా తప్పించుకున్నాడు.
అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, ఈ ఘటనతో వారికి సంబంధం లేదని తేలింది. అనంతరం వారిని వదిలేశారు. హత్యకు సంబంధించి పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారాయి. యూనివర్సిటీ పోలీసు డిపార్టుమెంట్కు చెందిన ఆరుగురు అధికారులతోపాటు కిర్క్ సొంత భద్రతా సిబ్బంది ఘటనా స్థలంలోనే విధుల్లో ఉన్నా వేలాది మంది సమక్షంలో హత్య జరగడం గమనార్హం.

మహోన్నత వ్యక్తి: ట్రంప్
తన మద్దతుదారుడైన చార్లీ కిర్క్ మృతిపట్ల డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అతడొక మహోన్నత వ్యక్తి అని శ్లాఘించారు. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియాలో ఒక పోస్టుచేశారు. వైట్హౌస్ నుంచి ఒక వీడియోను విడుదల చేశారు. సత్యం, స్వేచ్ఛ కోసం కిర్క్ అమరుడయ్యాడని కొనియాడారు. కిర్క్ హత్యకు విప్లవæ వామపక్షవాదులే కారణమని ఆరోపించారు. కిర్క్కు అమెరికా అత్యున్నత పౌర పురస్కారమైన ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’ను ట్రంప్
గురువారం ప్రకటించారు.

ఎవరీ కిర్క్?
చార్లీ కిర్క్ అలియాస్ చార్లెస్ జేమ్స్ కిర్క్ 1993 అక్టోబర్ 14న ఇల్లినాయిస్లో జన్మించాడు. రాజకీయాల్లో చురుగ్గా పని చేస్తున్నాడు. 2012లో 18 ఏళ్ల వయసులో షికాగోలో టరి్నంగ్ పాయింట్ యూఎస్ఏ అనే సంస్థను మరో వ్యక్తితో కలిసి స్థాపించాడు. ఆయనకు భార్య ఎరికా లేన్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ట్రంప్ పెద్ద కుమారుడైన డొనాల్ట్ ట్రంప్ జూనియర్కు కిర్క్ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడు. అంతేకాదు రచయితగా, రేడియో వ్యాఖ్యాతగా కూడా గుర్తింపు పొందాడు. మీడియా రంగంలోనూ అడుగుపెట్టాడు. టరి్నంగ్ పాయింట్ యూఎస్ఏ సంస్థకు డొనాల్డ్ ట్రంప్ అండగా నిలుస్తున్నారు. భారతీయులకు అమెరికా వీసాలు ఇవ్వడాన్ని కిర్క్ పలు సందర్భాల్లో వ్యతిరేకించాడు. అమెరికన్ కారి్మకుల స్థానాన్ని భారతీయులు ఆక్రమించుకున్నారని, వారికి ఇక వీసాలు ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించాడు.
ఇదీ చదవండి: ఆయనతో జాగ్రత్త.. ట్రంప్ మనవరాలికి నెటిజన్ల సూచన
తుపాకీ స్వాదీనం
కిర్క్కు చంపడానికి దుండగుడు ఉపయోగించిన బోల్డ్–యాక్షన్ రైఫిల్ను స్వా«దీనం చేసుకున్నట్లు ఎఫ్బీఐ గురువారం ప్రకటించింది. దానిపై వేలిముద్రలు, ఇతర ఆధారాల కోసం ల్యాబ్లో పరీక్షిస్తున్నట్లు పేర్కొంది. దుండగుడి ఆచూకీ ఇంకా లభించలేదని, గాలింపు కొనసాగుతోందని వెల్లడించింది. అతడు కాలేజీ విద్యార్థి కావొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలియజేసింది.