71 కేంద్రాలకు బ్యాలెట్‌ బాక్సులు | - | Sakshi
Sakshi News home page

71 కేంద్రాలకు బ్యాలెట్‌ బాక్సులు

Published Thu, Feb 27 2025 12:16 AM | Last Updated on Thu, Feb 27 2025 12:16 AM

71 కేంద్రాలకు బ్యాలెట్‌ బాక్సులు

71 కేంద్రాలకు బ్యాలెట్‌ బాక్సులు

● పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశాం ● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

జగిత్యాల: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సత్యప్రసాద్‌ తెలిపారు. బుధవారం జగిత్యాల వివేకానంద స్టేడియంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ నుంచి పోలింగ్‌ కేంద్రాలకు బ్యాలెట్‌ బాక్సులను బస్సుల్లో పంపించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. పోలింగ్‌కు జిల్లాలో 71(51 పట్టభద్రులు, 20 టీచర్స్‌) కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్లు 3,50,280 మంది ఉండగా, 27,088 మంది టీచర్‌ ఓటర్లు ఉన్నారన్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని తెలిపారు. ఓటర్లు ఓటరు గుర్తింపు కార్డుతోపాటు, కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి, ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

144 సెక్షన్‌ అమలు..

పోలింగ్‌ విధులు సమర్థంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఆదేశించారు. బుధవారం జగిత్యాల మినీస్టేడియంలో డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను పరిశీలించి, మాట్లాడారు. అధికారులకు ఎన్నికల ప్రక్రియపై శిక్షణ ఇచ్చామని, పట్టభద్రులు, ఉపాధ్యాయులు ప్రశాంతమైన వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతతోపాటు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. ఆయన వెంట అడిషనల్‌ కలెక్టర్‌ లత, ఆర్డీవో మధుసూదన్‌, డీఎస్పీ రఘుచందర్‌ ఉన్నారు.

ఓటుహక్కు వినియోగించుకోండి

రాయికల్‌: పట్టభద్రులు, టీచర్లు గురువారం జరిగే పోలింగ్‌లో తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సూచించారు. బుధవారం రాయికల్‌ పట్టణంలోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఆర్డీవో జివాకర్‌ రెడ్డి, తహసీల్దార్‌ ఖయ్యూం, ఎంపీవో సుష్మ పాల్గొన్నారు.

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

కోరుట్ల: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను బుధవారం కలెక్టర్‌ సత్యప్రసాద్‌ పరిశీలించారు. పోలింగ్‌ బూత్‌ల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. ఎన్నికల నియమావళి పాటించాలని సూచించారు. ఆర్డీవో జివాకర్‌ రెడ్డి, తహసీల్దార్‌ కిషన్‌, ఎస్సై శ్రీకాంత్‌ తదితరులున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement