మందుల కొరతకు చెక్
జగిత్యాల: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులను మందుల కొరత వేధిస్తోంది. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితో పాటు కోరుట్లలో ఏరియా ఆస్పత్రి, ఆయా మండలాల్లో సీహెచ్సీలు, పీహెచ్సీలు, సబ్సెంటర్లు, యూపీహెచ్సీలు ఉండగా ఇటీవలే పల్లె దవాఖానాలు ఏర్పాటయ్యాయి. అలాగే మున్సిపాలిటీల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఆస్పత్రుల్లో మందుల కొరత ఉండటంతో రోగులకు సరైన వైద్యం అందడం లేదు. వైద్యులు పరీక్షలు చేసి చికిత్స చేస్తున్నప్పటికీ మందుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో బాధితులు బయట కొనుగోలు చేసుకుంటున్నారు. దీంతో మెడికల్ షాపుల నిర్వాహకులు గ్రామీణ ప్రాంతాల ప్రజల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారని ఆరోపణలున్నాయి.
108 రకాల మందులు ఉండాల్సిందే..
● ఇటీవల ఏర్పడిన కమిటీ జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించింది. జనరల్తో పాటు అన్ని ఆస్పత్రుల్లో కచ్చితంగా రోగులకు అవసరమయ్యే 108 రకాల మందులు అందుబాటులో ఉండాల్సిందేనని వైద్యులు నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు సైతం తీసుకుంటున్నారు.
● ఏటా ప్రభుత్వం మందుల కోసం రూ.కోట్లు కేటాయిస్తున్నా చాలా చోట్ల లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఆస్పత్రుల్లో మందులు లేకుంటే వెంటనే జిల్లా కేంద్రంలోని డ్రగ్ స్టోర్స్కు ఇండెంట్ పెట్టాలి.
● కానీ, వైద్యుల నిర్లక్ష్యమో, సిబ్బంది పట్టింపులేనితనమో మందుల సరఫరాలో కొంత జాప్యం జరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కమిటీ ఏర్పాటు కావడంతో ఇక నుంచి మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది.
● మందులు సక్రమంగా అందడం లేదని బాధితులు ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేసిన ఘటనలున్నాయి.
తనిఖీలతో పాటు మందుల సరఫరా
ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులను నిత్యం తనిఖీ చేయడంతో పాటు, వాటిలో మందులు ఉన్నాయా లేవా అని గుర్తించనున్నారు. ఒకవేళ అవసరం మేరకు మందులు లేకుంటే సంబంధిత వైద్యులతో వెంటనే ఇండెంట్ పెట్టించి సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ప్రత్యేక కమిటీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ప్రైవేటులో దోపిడీ..
ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు పూర్తిస్థాయిలో మందులు ఇవ్వకపోవడంతో ప్రైవేటు మెడికల్ షాపులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు జనరిక్ మందులు అంటగడుతూ అందినకాడికి దోచుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. రూ.2 ధర ఉన్న గోలిని రూ.30కి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ మెడికల్ షాపులపై అధికారులు నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల గోలీలు ఉండాల్సిందే
ఇటీవల సమావేశంలో నిర్ణయం
పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ
రోగులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం
‘గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్
గ్రామానికి చెందిన రమేశ్కు ఇటీవల బీపీ పెరగడంతో పాటు జ్వరం వచ్చింది. వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి రావడంతో వైద్యులు పరీక్షలు చేసి మందులు రాశారు. కానీ, అక్కడ పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో లేవు. దీంతో బాధితుడు బయట డబ్బులకు కొన్నాడు.. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో మందులు లేకపోవడంతో బాధితులు ప్రైవేట్గా కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈనేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మందుల సరఫరాపై నిఘా పెట్టింది. అన్ని రకాల మందులు ఆస్పత్రిలో ఉండాలని ఆదేశాలు రావడంతో జిల్లాలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో డీఎంహెచ్వోతో పాటు ఇద్దరు వైద్యులు ఉంటారు. వీరు ఎప్పటికప్పుడు మందుల కొరత ఉంటే వెంటనే అందుబాటులో
ఉంచేలా చర్యలు తీసుకుంటారు’.
జిల్లాలో..
జనరల్ ఆస్పత్రి 1
ఏరియా ఆస్పత్రి 1
సీహెచ్సీలు 3
పీహెచ్సీలు 17
యూపీహెచ్సీలు 5
బస్తీ దవాఖానాలు 5
సబ్సెంటర్లు 151
పల్లె దవాఖానాలు 71
ప్రతీ ప్రభుత్వ ఆస్పత్రిలో మందులు అందుబాటులో ఉండాల్సిందే. ఆయా ఆస్పత్రుల్లో మందులు ఉన్నాయా లేవా వైద్యులు సరిచూసుకుని మా దృష్టికి తీసుకువస్తే సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రతీ రోగికి మందులు అందాలి. ఎలాంటి జాప్యం జరిగినా చర్యలు తీసుకుంటాం.
– ప్రమోద్కుమార్, డీఎంహెచ్వో
మందుల కొరతకు చెక్
Comments
Please login to add a commentAdd a comment