
క్రీడాప్రాంగణాల్లో పిచ్చిమొక్కలు
జనగామ రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం పట్టణాలతోపాటు ప్రతీ పంచాయతీ పరిధిలో క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేసింది. ప్రభుత్వ భూములు ఉన్న చోట మైదానాలు సిద్ధం వేశారు. కానీ నిర్వహణ లేకపోవడంతో పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన క్రీడామైదానాలను పట్టించుకునే వారే కరువయ్యారు. జిల్లా వ్యాప్తంగా 281 గ్రామ పంచాయతీలు, 201 ఆమ్లెట్ విలేజ్లు ఉండగా మొత్తం 483 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు గుర్తించి 450 వరకు నిర్మాణాలు పూర్తి చేశారు. ఏడాదిన్నర నుంచి గ్రామాల్లో సర్పంచ్లు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్యులు ప్రత్యేక అధికారులు పట్టించుకోక ఆదరణ కరువైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
నిధుల దుర్వినియోగం
క్రీడాప్రాంగణాల ఏర్పాటుకు గత ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చుచేసింది. ప్రతీ పంచాయతీలో సుమారు రూ. 50వేల నుంచి రూ. 2 లక్షల వరకు ఖర్చు చేసింది. పట్టణాల్లో కొంత అదనంగా నిధులు వెచ్చించింది. జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీల్లో అనువుగా ఉన్న చోట క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. ఒక్కొక్క క్రీడా ప్రాంగణానికి రూ.2 లక్షల వరకు వెచ్చించినా.. క్రీడా సామగ్రి అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు అటువైపు చూడటం లేదు. ప్రస్తుతం వేసవి సెలవుల దృష్ట్యా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రాంగణాలు బాగు చేయాలని కోరుతున్నారు.
నిబంధనలు ఇలా
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద క్రీడా ప్రాంగణాల ఏర్పాటు చేపట్టారు. ఆయా గ్రామాల్లో క్రీడా స్థలానికి ఎకరం విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టి ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ కోర్టులు, లాంగ్ జంప్, హై జంప్ పీట్లు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఎంపిక చేసిన స్థలం చుట్టూ ఫెన్షింగ్ మాదిరిగా గానుగ, గుల్మోహార్, నిమ్మ, చింత, వేదురు, తంగేడు చెట్లు నాటాలని సూచించారు.
గ్రామాలకు దూరంగా..
ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతీ గ్రామ పంచాయతీలో ఎకరం స్థలంలో అన్ని రకాల వసతులతో ప్రాంగణం ఏర్పాటు చేయాల్సి ఉండగా కొన్ని గ్రామాల్లో స్థలం లభించకపోవడంతో అందుబాటులో ఉన్న స్థలంలో నిర్మించారు. కొన్ని గ్రామాల్లో ఊరికి దూరంగా ఉండడంతో వాటిని చూసే నాఽథుడు కరువయ్యారు. లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ప్రాంగణాలు పనికి రాకుండా పోతున్నాయి. ప్రాంగణాలు ఎలా ఉన్నాయో జిల్లా అధికారులు పర్యవేక్షించిన దాఖలాలు లేవు. ఇప్పటికై న ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి క్రీడాప్రాంగణాలను వినియోగంలోకి తీసుకురావాలని క్రీడాకారులు కోరుతున్నారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు..
గ్రామీన క్రీడాకారులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. క్రీడలపై ఆసక్తి ఉన్నప్పటికీ క్రీడాస్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారు. పట్టణాలు, గ్రామాల్లో ఉన్న క్రీడా ప్రాంగణాలు అలంకార ప్రాయంగా మారాయి. వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి.
– ఎడ్ల శ్రీనివాస్, మరిగడి
గ్రామీణ క్రీడాకారులను
ప్రోత్సహించాలి..
గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేలా ప్రభుత్వం కృషి చేయాలి. గతంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు వినియోగంలోకి తీసుకురావాలి. యువతను ప్రోత్సహించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలి.
– సురేందర్, కబడ్డీ జాతీయ క్రీడాకారుడు
రూపురేఖలు కోల్పోతున్న ఆటస్థలాలు
జిల్లా వ్యాప్తంగా
483 గ్రామాల్లో ఇదే పరిస్థితి
పట్టించుకోని సంబంధిత అధికారులు

క్రీడాప్రాంగణాల్లో పిచ్చిమొక్కలు

క్రీడాప్రాంగణాల్లో పిచ్చిమొక్కలు

క్రీడాప్రాంగణాల్లో పిచ్చిమొక్కలు