నిర్వహణకు నిధులేవి..? | - | Sakshi
Sakshi News home page

నిర్వహణకు నిధులేవి..?

Published Sun, Feb 16 2025 1:18 AM | Last Updated on Sun, Feb 16 2025 1:17 AM

నిర్వ

నిర్వహణకు నిధులేవి..?

కాటారం: రైతువేదికల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. మూడేళ్లుగా నిధుల మంజూరు లేకపోవడంతో రైతు వేదికల నిర్వహణ ఏఈఓలకు గుదిబండగా మారింది. సొంత ఖర్చులతో నిర్వహణ వెల్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది.

క్షేత్రస్థాయిలో సేవలు అందేలా..

రైతువేదికల్లో తాగునీరు, విద్యుత్‌ సరఫరా వసతుల ఏర్పాటుతో పాటు స్టేషనరీ, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రతీ మంగళవారం రైతు నేస్తం, రైతు శిక్షణ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. రైతువేదికల్లో సమావేశాలు నిర్వహించినప్పుడు హాజరైన రైతులు, ఇతరులకు టీ, బిస్కెట్లు అందజేయడంతో పాటు ఇతరత్రా వాటి కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నిర్వహణ ఖర్చుల కింద గత ప్రభుత్వం నెలకు రూ.9వేలు అందిస్తామని ప్రకటించింది.

మూడేళ్లుగా నిలిచిన నిధులు..

జిల్లాలో 45 క్లస్టర్లలో 45 రైతువేదికలు ఉన్నాయి. ఇందులో డిసెంబర్‌ 2021 నుంచి ఏప్రిల్‌ 2022 వరకు ఐదు నెలల పాటు నెలకు రూ.9వేల చొప్పున గతంలో ప్రభుత్వం నిర్వహణ నిధులు అందజేసినట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు. 2022 మే నుంచి ఇప్పటి వరకు మూడేళ్లుగా ప్రభుత్వం రైతువేదికల నిర్వహణ కోసం నిధులు విడుదల చేయకపోవడంతో విస్తరణ అధికారులు నెల నెలా ఖర్చులు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. ఒక్కో రైతు వేదికకు నెలకు రూ.9వేల చొప్పున 36 నెలలకు గాను సుమారు రూ. 3.24 లక్షలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.

అన్నింటి భారం ఏఈఓలపైనే...

రైతు వేదికల నిర్వహణకు ప్రభుత్వం దీర్ఘకాలికంగా నిధులు మంజూరు చేయకపోవడంతో ఏఈఓలపై భారం పడుతుంది. కనీసం మరుగుదొడ్ల నిర్వహణ, పారిశుద్ద్యం, కరెంటు బిల్లుల చెల్లింపు, రైతులతో సమావేశాలు, ప్రభుత్వ చేపట్టిన రైతునేస్తం ముఖాముఖి కార్యక్రమాల నిర్వహణ సమయంలో టీ, బిస్కెట్లు, స్వీపర్‌ జీతం వంటి వాటికి నిధులు లేకపోవడంతో అన్నింటిని తామే భరించాల్సి వస్తుందని ఏఈఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఏఈఓల వద్ద డబ్బులు లేకపోవడంతో విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు సైతం నిలిచిపోయినట్లు తెలుస్తోంది. రైతు వేదికల్లో ప్రజా ఉపయోగ కార్యక్రమాలు, వివిధ శాఖల సమావేశాల నిర్వహణ సైతం జరుగుతుంది. సమావేశం తర్వాత వేదికను శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత ఏఈఓలపై పడుతోంది. రైతువేదికల్లో అటెండర్‌ నుంచి ఏఈఓ వరకు అన్ని పనులు ఏఈఓలే చూసుకోవాల్సిన దుస్థితి నెలకొంటుంది. మరోవైపు మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి, పైప్‌లైన్‌, నల్లాలు వంటివి సమకూర్చుకోవడానికి నిధులు లేక ఏఈఓలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు, వరదలు, కోతుల బెడద కారణంగా జిల్లాలోని పలు రైతు వేదికల్లో మరమ్మతు పనులు నెలకొనగా నిధులు లేక అవి అలానే ఉండిపోతున్నాయి. రైతు వేదికల నిర్వహణ కోసం నెల నెలా నిధులు మంజూరు మంజూరు చేస్తే ఇబ్బందులు ఉండవని వ్యవసాయ విస్తరణాధికారులు పేర్కొంటున్నారు.

నిధుల విడుదల నిలిచిపోయింది

జిల్లాలోని రైతు వేదికల నిర్వహణ కోసం గతంలో ఐదు నెలలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం అందజేసింది. ప్రస్తుతం మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్న విషయం వాస్తవమే. విద్యుత్‌ బిల్లుల చెల్లింపు, పారిశుద్ద్య నిర్వహణ కష్టతరంగా ఉంది. ప్రభుత్వం నిధులు మంజురు చేస్తుందేమో చూడాలి.

– విజయ్‌భాస్కర్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

మూడేళ్లుగా రైతువేదికలకు అందని నిధులు

తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణకు ఏఈఓల పాట్లు

ఇబ్బందులు పడుతున్న వ్యవసాయశాఖ అధికారులు

జిల్లా సమాచారం..

మండలాలు – 12

రెవెన్యూ గ్రామాలు – 215

గ్రామపంచాయతీలు – 242

అగ్రికల్చర్‌ డివిజన్లు – 2

(భూపాలపల్లి, మహదేవపూర్‌)

క్లస్టర్లు – 45

రైతు వేదికలు – 45

ఏఈఓలు – 45

రైతులు – 1,16,756

పంట సాగు – 2.52 లక్షల ఎకరాలు

No comments yet. Be the first to comment!
Add a comment
నిర్వహణకు నిధులేవి..?1
1/2

నిర్వహణకు నిధులేవి..?

నిర్వహణకు నిధులేవి..?2
2/2

నిర్వహణకు నిధులేవి..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement