
శివాలయానికి రూ.1.16లక్షల విరాళం
చిట్యాల: మండలంలోని నవాబుపేట గ్రామంలో నిర్మిస్తున్న శివాలయానికి గోపాలపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణాచార్యులు(మూకయ్య) చిన్న కుమారుడు రంగాచార్యులు రూ.లక్ష పదహారు వేలు విరాళం అందజేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు కసిరెడ్డి రత్నాకర్రెడ్డి సోమవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు రఘునందన్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ముగిసిన వసంత
నవరాత్రి ఉత్సవాలు
రేగొండ: కొత్తపల్లిగోరి మండలకేంద్రంలోని నవదుర్గ ఆలయంలో తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన వసంత నవరాత్రి ఉత్సవాలు సోమవారం ముగిశాయి. చివరి రోజు ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు. దుర్గమాతను బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు సూదనబోయిన విష్ణు యాదవ్, పెండ్యాల రాజు, రాంబాబు, వేణు, నరేష్, అనిల్, బాబురావు, వీరేశం, రాజు, విమల పాల్గొన్నారు.
ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్
భూపాలపల్లి అర్బన్: సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో అన్ని సింగరేణి పాఠశాలల్లో ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ నిర్వహించనున్నట్లు ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి జి.శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాలిసెట్ రాసే విద్యార్థుల కోసం ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో శిక్షణ తరగతులను ఈ నెల 10వ తేదీన ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సింగరేణి కార్మికుల పిల్లలతో పాటు పరిసర గ్రామాల విద్యార్థులు కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాలిటెక్నిక్ ద్వారా అపారమైన ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు.
మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్డెస్క్
భూపాలపల్లి అర్బన్: రాజీవ్ యువ వికాసం స్కీం దరఖాస్తులను ఆన్లైన్లో నమోదుచేసేందుకు మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్డెస్క్ను ఏర్పాటుచేసినట్లు మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత ధృవీకరణ పత్రాలను కార్యాలయంలోని రూమ్ నంబర్ 12లో అందజేయాలని సూచించారు.
ఆరోగ్యంగా జీవించడం మానవుడి హక్కు
భూపాలపల్లి అర్బన్: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలని.. ఆరోగ్యంగా జీవించడం మానవుడి హక్కు అని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జయరాంరెడ్డి తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ హాలులో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జడ్జి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. న్యూట్రిషన్ ఆహారం తీసుకుంటూ, వ్యాయామం, యోగ లాంటి అలవాట్లను కలిగి ఉంటే రోగాలు దరిచేరవన్నారు. వేసవిలో పనిచేసే ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు విరివిగా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఉమాదేవి, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
కారు పల్టీ..
ముగ్గురికి గాయాలు
గోవిందరావుపేట: మండల పరిధిలోని పస్రా గుండ్లవాగు కార్నర్ సమీపంలో ఛత్తీస్గఢ్కు చెందిన ఓ కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకోగా ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన సత్తేంద్ర వరంగల్ వైపునకు కారులో వస్తుండగా వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టి రోడ్డు కింద పడిపోయింది. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన ఇతర వాహనదారులు 108 వాహనానికి సమాచారం అందించగా అక్కడకు చేరుకున్న సిబ్బంది గాయపడిన వారిని ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

శివాలయానికి రూ.1.16లక్షల విరాళం