నలుగురు సైబర్ నేరగాళ్ల అరెస్ట్
సిరిసిల్లక్రైం: మీసేవ, మనీ ట్రాన్స్ఫర్, ఆన్లైన్ కేంద్రాలే లక్ష్యంగా ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు సైబర్ నేరగాళ్లలో నలుగురిని రాజన్నసిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని భీవండికి చెందిన విలేశ్పటేల్, చిరాగ్ రమేశ్ పెథాడ్, జితేంద్ర సోమాభాయ్, నీలేశ్ జైసింగ్ను సోమవారం రిమాండ్కు తరలించారు. మరొకరు భీవండికి చెందిన దాసరి మురళి పరారీలో ఉన్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం వెల్లడించారు. దాసరి మురళి రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ సమీపంలోని అగ్రహారంలో గల ఓ ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడు ఇనుకొండ మహేశ్కు ఫోన్చేసి సివిల్ హాస్పిటల్ డాక్టర్ రాజిరెడ్డిగా పరిచయం చేసుకున్నాడు. మీ షాపులో డబ్బులు చేతికిస్తే కమీషన్ తీసుకొని తన బ్యాంక్ ఖాతాకు టాన్స్ఫర్ చేయాలని కోరగా మహేశ్ అంగీకరించాడు. ఒకరిని పంపిస్తానని అతను డబ్బులు ఇస్తాడని తనకు మనీ ట్రాన్స్ఫర్ చేయాలని కోరాడు. అదేవిధంగా సిరిసిల్లకు చెందిన ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వాహకుడికి మురళి ఫోన్ చేసి డిగ్రీ కాలేజీ యజమాని రాజిరెడ్డిగా పరిచయం చేసుకున్నాడు. తమకు 110 బిర్యానీలు పార్సిల్ కావాలని ఆర్డర్ చేశాడు. అయితే అడ్వాన్స్ పంపాలని నిర్వాహకుడు కోరగా అగ్రహారంలోని మహేశ్ ఆన్లైన్ సెంటర్కు వెళ్లి ఫోన్ చేస్తే అతను రూ.5వేలు ఇస్తాడని తెలిపాడు. ఇది నమ్మిన ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు అగ్రహారంలోని ఆన్లైన్ సెంటర్కు వెళ్లి మురళికి ఫోన్చేసి మహేశ్కు ఇచ్చాడు. ఫోన్లో మురళి చెప్పినట్లుగా రూ.25 వేలు ఒకసారి, రూ.40 వేలు మరోసారి గూగుల్ పే ద్వారా మహేశ్ ట్రాన్స్ఫర్ చేశాడు. తనకు రూ.65 వేలు ఇవ్వాలని మహేశ్ కోరగా నివ్వెరపోవడం ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వాహకుడి వంతైంది. మీరే నాకు రూ.5వేలు ఇవ్వాలని బిర్యానీ ఆర్డర్ కోసం ఫోన్లో మాట్లాడిన వ్యక్తి చెబితేనే వచ్చినట్లు తెలిపాడు. ఇద్దరు మోసపోయామని గ్రహించిన వారు వెంటనే వేములవాడ పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, సైబర్ సెల్ టీం జునైద్, గంగిరెడ్డి, మహేశ్, ఎస్సై ప్రేమానందం, సంపత్లతో స్పెషల్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం భీవండిలో నలుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న దాసరి మురళి కోసం గాలిస్తున్నారు. ఈ ఐదుగురిపై దేశవ్యాప్తంగా 54 ఫిర్యాదులు ఉన్నట్లు తెలిపారు. మరో వందకు పైగా ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉందని ఎస్పీ పేర్కొన్నారు. వీరి వెనుక ఉండి ప్రధాన పాత్ర పోషించిన గుజరాత్కు చెందిన కీలక నిందితుడిని పట్టుకునేందుకు స్పెషల్టీమ్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రధానపాత్ర పోషించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. సమావేశంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరొకరు పరారీ
ఆన్లైన్ సెంటర్లు లక్ష్యంగా మోసాలు
దేశవ్యాప్తంగా 50కి పైగా కేసులు
రాజన్నసిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్
Comments
Please login to add a commentAdd a comment