ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల జువాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ బూర్గుల కవితకు కాకతీయ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ప్రకటించారు. కేయూ జువాలజీ విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి పర్యవేక్షణలో ఆమె సమర్పించిన పరిశోధనా సిద్ధాంత గ్రంథానికి డాక్టరేట్ లభించింది. ఈ సందర్భంగా కవితను మంగళవారం కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జాకీరుల్లా, జువాలజీ విభాగాధిపతి డాక్టర్ సునందతో పాటు అధ్యాపకులు అభినందించారు.
మత్స్యకారులకు
కొనసాగుతున్న శిక్షణ
కూసుమంచి: మండలంలోని పాలేరు శ్రీ పీ.వీ.నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో ఖమ్మం జిల్లాకు చెందిన షెడ్యూల్డ్ కులాల మత్స్యకారులకు ఇస్తున్న శిక్షణ మంగళవారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా గడ్డిపల్లి కేవీకే సీనియర్ శాస్త్రవేత్త బి.లవకుమార్ పాల్గొని జలాశయాల్లో పెంచే వివిధ రకాల చేపపిల్లల విత్తనాల ఎంపికపై అవగాహన కల్పించారు. తెలంగాణను ఆక్వా హబ్గా మార్చేందుకు మత్స్యకారులు అధునాతన విధానాలు పాటగించాలని తెలిపారు. అనంతరం కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్, శాస్త్రవేత్తలు శాంతన్న, రవీందర్ మాట్లాడగా వివిధ రకాల వలల తయారీపై శిక్షణ ఇచ్చారు.
మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో కాంస్యపతకం
ఖమ్మం స్పోర్ట్స్: గోవాలో ఇటీవల జరిగిన జాతీయస్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో ఖమ్మంకు చెందిన రిటైర్డ్ ఇన్స్పెక్టర్ కె.నర్సయ్య బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్నారు. గోవాలో ఈనెల 16నుంచి 23వ తేదీ వరకు పోటీలు జరగగా పతకం సాధించిన ఆయన జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ జట్టులో స్థానం దక్కించుకుని థాయ్లాండ్లో జరిగే అంతర్జాతీయ టోర్నీకి ఎంపికయ్యారు. ఈసందర్భంగా 75ఏళ్ల వయస్సులో ప్రతిభ చూపిన నర్సయ్యను బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంటా వెంకట్రావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కర్నాటి వీరభద్రం, వి.చంద్రశేఖర్తో పాటు జట్ల శ్రీను, సుదర్శన్రావు, పి.రవిమారుత్, కమర్తపు మురళి, సత్యనారాయణ, బాలసాని ఆనంద్, పి.యుగంధర్, ఆర్.శ్రీనివాస్రెడ్డి అభినందించారు.
ప్రభుత్వాస్పత్రిలో
‘కాయకల్ప’ బృందం
పెనుబల్లి: పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రిని కాయకల్ప బృందం మంగళవారం తనిఖీ చేసింది. ఈసందర్భంగా ఆస్పత్రి ఆవరణలో పరిశుభ్రత, వైద్యసేవలు, రికార్డుల నిర్వహణ, ఫార్మసీలో మందు లభ్యత వివరాలు ఆరా తీశారు. అలాగే, చికిత్స కోసం వచ్చిన వారితో మాట్లాడుతూ వైద్యసేవలు ఎలా అందుతున్నాయో తెలసుకున్నారు. ఈ బృందంలో డాక్టర్ ఎస్. సోమరాజు, సిబ్బంది పి.రేవతి, బి.రజిని, కె.ప్రమీల ఉన్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్ కిరణ్కుమార్ తెలిపారు.
జీప్ను తగలబెట్టిన
గుర్తుతెలియని వ్యక్తులు
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలం బేతుపల్లిలో ఓ ఇంటి ముందు పార్కు చేసిన జీప్ను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి పెట్రోల్ పోసి దహనం చేశారు. గ్రామంలో చాంద్పాషా ఇంటి ముందు నిలిపిన జీప్పై అర్ధరాత్రి వేళ కారులో వచ్చిన కొందరు వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించగా మంటలు వ్యాపించాయి. స్థానికులు గుర్తించి వచ్చేలోగా దుండగులు పారిపోయారు. ఈ ఘటనలో జీప్ పూర్తిగా కాలిపోగా, చాంద్పాషా మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అసిస్టెంట్ ప్రొఫెసర్కు డాక్టరేట్
అసిస్టెంట్ ప్రొఫెసర్కు డాక్టరేట్
అసిస్టెంట్ ప్రొఫెసర్కు డాక్టరేట్