
రేపు జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం
ఖమ్మంమయూరిసెంటర్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈనెల 5న ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నట్లు తెలిసింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుంది. ఈ సభ ఏర్పాట్లు, జన సమీకరణ బాధ్యతలు అప్పగించే విషయమై కేసీఆర్ చర్చించనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఈనెల 5న ఉదయం 10గంటలకు ఎర్రవెల్లిలోని తన ఫామ్హౌజ్లో భేటీ కానున్నట్లు తెలిసింది. ఈ సమావేశానికి ఎంపీలతో పాటు ఎమ్మెల్సీ, జిల్లాల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు రావాలని సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
శిక్షణతో నాయకత్వం, మెరుగైన బోధన
ఖమ్మంసహకారనగర్: పదోన్నతి పొందిన ప్రధానోపాద్యాయులు, ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాల ద్వారా మెరుగైన బోధన చేయొచ్చని ఇన్చార్జి డీఈఓ సామినేని సత్యనారాయణ తెలిపారు. ఇటీవల పదోన్నతి పొందిన ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు 1,078 మందికి రెండు రోజుల పాటు ఇచ్చే శిక్షణ గురువారం మొదలైంది. ఖమ్మంలోని ఏడు కేంద్రాల్లో శిక్షణ ఇస్తుండగా ఇన్చార్జ్ డీఈఓ మాట్లాడారు. హెచ్ఎంలకు నాయకత్వం, పాఠశాల అభివృద్ధి, లక్ష్యాల సాధన, బోధనాభ్యాసన ప్రక్రియల నిర్వహణ, తల్లిదండ్రులతో సంబంధాలు, ఆదర్శ పాఠశాలల నిర్వహణపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే, సబ్జెక్ట్ ఉపాధ్యాయులకు బోధన లక్ష్యాలు, పాఠ్యపుస్తకాలపై అవగాహన, పాఠ్యప్రణాళిక రూపకల్పన, మూల్యాంకన పద్ధతులపై శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ అధికారి రవికుమార్, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.
తెలంగాణను
అగ్రగామిగా నిలపాలి
కూసుమంచి: మత్స్యకారులకు ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవడం ద్వారా చేపల ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి నాగులునాయక్ సూచించారు. పాలేరులోని పీ.వీనర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో జిల్లాకు చెందిన ఎస్టీ మత్స్యకారులకు మూడు రోజుల పాటు ఇవ్వనున్న శిక్షణ గురువారం ప్రారంభం కాగా ఆయన మాట్లాడారు. పాలేరులో మత్స్యకారులకు శిక్షణ ఇస్తుండడం అభినందనీయమన్నారు. అనంతరం పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్, శాస్త్రవేత్తలు రవీందర్, భార్గవి, అశ్వారావుపేట ఆత్మా బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ శ్రీనివాసరావు చేపల పెంపకం, దాణా తయారీపై అవగాహన కల్పించారు.
జేఈఈ మెయిన్స్కు 49మంది గైర్హాజరు
ఖమ్మంసహకారనగర్: జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రెండో రోజైన గురువారం ఉదయం సెషన్లో 543 మందికి 512 మంది, మధ్యాహ్నం సెషన్కు 533 మందిలో 515 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు విజయ ఇంజనీరింగ్ కళాశాల, శ్రీచైతన్య, బొమ్మ, ఎస్బీఐటీ కళాశాలల్లో నిర్వహిస్తుండగా రెండు సెషన్లలో కలిపి 49మంది గైర్హాజరయ్యారని నిర్వాహకులు వెల్లడించారు.
జిల్లాలో రెండు బార్లకు నోటిఫికేషన్
ఖమ్మంక్రైం: జిల్లా కేంద్రంలో ఎనిమిదేళ్ల క్రితం మూతపడిన రెండు బార్లను కొత్త వారికి అప్పగించేలా ఎకై ్సజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలుచోట్ల లైసెన్స్ ఫీజు చెల్లించకుండా మూతపడిన బార్లు తిరిగి తెరిచేలా నోటిఫికేషన్ ఇవ్వగా జాబితాలో జిల్లా కూడా ఉంది. ఖమ్మం ఎకై ్సజ్ స్టేషన్ –1 పరిధిలో రెండు బార్ల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న వారు రూ.లక్ష చెల్లించి ఈనెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల ఆధారంగా వేలం నిర్వహించి ఖరారు చేయనున్నారు. జిల్లాలో ప్రస్తుతం 37బార్లు కొనసాగుతుండగా, కొత్తవి ఏర్పాటైతే ఈ సంఖ్య 39కు చేరుతుంది.

రేపు జిల్లా బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం