చాతకొండ బెటాలియన్‌ అభివృద్ధికి రూ.20 లక్షలు | - | Sakshi
Sakshi News home page

చాతకొండ బెటాలియన్‌ అభివృద్ధికి రూ.20 లక్షలు

Apr 9 2025 1:00 AM | Updated on Apr 9 2025 1:00 AM

చాతకొండ బెటాలియన్‌ అభివృద్ధికి రూ.20 లక్షలు

చాతకొండ బెటాలియన్‌ అభివృద్ధికి రూ.20 లక్షలు

ఖమ్మంమయూరిసెంటర్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండలోని ఆరో బెటాలియన్‌లో అభివృద్ధి పనుల కోసం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తన ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి రూ.20 లక్షలు కేటాయించారు. ఈ మేరకు నిధుల కేటాయింపు లేఖను బెటాలియన్‌ కమాండెంట్‌ డి.శివప్రసాద్‌రెడ్డి, ఆర్‌ఐ జీ.వీ.రామారావుకు మంగళవారం ఖమ్మంలో అందజేశారు. ఎంపీ ల్యాడ్స్‌ నిధులు మంజూరు చేస్తే బెటాలియన్‌లో సెల్యూటింగ్‌ డయాస్‌, గ్యాలరీ నిర్మాణ పనులు చేపడతామని వారు వెల్లడించగా, ఎంపీ రూ.20లక్షలు కేటాయించారు. ఈ సందర్భంగా ఎంపీకి కమాండెంట్‌ కృతజ్ఞతలు తెలిపారు.

గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి మే 10న పరీక్ష

ఖమ్మంమయూరిసెంటర్‌/వైరా: తెలంగాణ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు మే 10న పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్‌ బి.రమ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం(ఇంగ్లిష్‌ మీడియం) ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూప్‌ల్లో ప్రవేశాలు ఉంటాయని వెల్లడించారు. మే 10న ఉదయం 10నుండి మధ్యాహ్నం 12–30గంటల జరిగే పరీక్ష కోసం విద్యార్థులు www.tgrjdc. cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకుని ఇదే సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 040– 24734899, 94909 67222, 80081 18813 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

వృత్తి శిక్షణా సంస్థల నుండి దరఖాస్తులు ఆహ్వానం

ఖమ్మంమయూరిసెంటర్‌: క్రిస్టియన్‌ మైనార్టీలకు వివిధ రంగాల్లో వృత్తి శిక్షణ ఇచ్చేందుకు జిల్లాలోని సంస్థల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి డాక్టర్‌ బి.పురంధర్‌ తెలిపారు. జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ గుర్తింపు లేదా కేంద్రప్రభుత్వ మైనార్టీ శాఖ ద్వారా ట్రైనింగ్‌ పార్టనర్‌గా ఉన్న సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. అర్హత కలిగిన సంస్థల బాధ్యులు పూర్తి వివరాలు, రెండు సెట్ల దరఖాస్తులను ‘తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, గృహకల్ప రెండో అంతస్తు, ఎం.జే.రోడ్డు, నాంపల్లి, హైదరాబాద్‌’లో ఈనెల 12 లోగా అందించాలని సూచించారు.

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ

ఖమ్మంవైద్యవిభాగం: జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై జిల్లాలోని పీహెచ్‌సీలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల వైద్యులు, ఉద్యోగులు శ్రద్ధ కనబర్చాలని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి సూచించారు. ఎంఎల్‌హెచ్‌పీ(మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్ల)లకు మంగళవారం ఏర్పాటుచేసిన శిక్షణలో ఆమె మాట్లాడారు. మాతాశిశు సంక్షేమం, వ్యాధి నిరోధక టీకాలు, ఎయిడ్స్‌, లెప్రసీ, సంక్రమణ, అసంక్రమణ వ్యాధుల నిర్వహణ, క్షయ నివారణకు కృషి చేస్తూనే జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. అంతేకాక వడదెబ్బ బారిన పడకుండా ప్రచారం చేయాలని, ఆస్పత్రుల్లో ఓపీ నిర్వహణపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ సమావేవంలో వివిధ విభాగాల అధికారులు డాక్టర్‌ రామారావు, డాక్టర్‌ చందునాయక్‌, డాక్టర్‌ సైదులు, డాక్టర్‌ వెంకటరమణ, వి.సుబ్రహ్మణ్యం, దుర్గ పాల్గొన్నారు.

నేడు వెటర్నరీ అసిస్టెంట్లకు పదోన్నతుల కౌన్సెలింగ్‌

ఖమ్మంవ్యవసాయం: పశు సంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించేందుకు బుధవారం కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. జోన్‌–1 నుంచి జోన్‌–7 వరకు 373 మంది వెటర్నరీ అసిస్టెంట్ల(పశువైద్య సహాయకులు)లో అర్హులకు లైవ్‌ స్టాక్‌ అసిస్టెంట్లు(పశుసంపద సహాయకులు)గా పదోన్నతి కల్పి స్తారు. జోన్‌–4లోకి వచ్చే హన్మకొండ, వరంగల్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల నుంచి 46 మంది అర్హత సాధించగా, బుధవారం కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి కౌన్సెలింగ్‌లో జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.వెంకటనారాయణతో పాటు మరో అసిస్టెంట్‌ డైరెక్టర్‌, కార్యాలయ మేనేజర్‌ పాల్గొననున్నారు. ఈమేరకు రోస్టర్‌ ఆధారంగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement