
భూభారతి.. రెడీ
● నేటి నుంచి మండల కేంద్రాల్లో అవగాహన ● సదస్సుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారు
ఖమ్మంసహకారనగర్: భూసమస్యల పరిష్కారం, యజమానులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించేలా రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా గురువారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు మండల కేంద్రాల్లో సదస్సులు నిర్వహిస్తారు. ఈమేరకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ సదస్సుల్లో చట్టంపై రైతులు, ఇతర వర్గాలకు అవగాహన కల్పించడమే కాక వారి సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇదే సమయాన రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నేలకొండపల్లి మండలంలోని రెవెన్యూ గ్రామాల్లోనూ సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఈ సదస్సులకు ప్రజలు, రైతులు, భూయజమానులు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు హాజరై విజయవంతం చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఓ ప్రకటనలో కోరారు.
నేలకొండపల్లిలో తొలి సదస్సు
నేలకొండపల్లి: భూభారతి చట్టం అమలుకు రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నేలకొండపల్లి మండలంలోని గ్రామాల్లో గురువారం నుంచి సదస్సులు మొదలుకానున్నాయి. తొలి సదస్సు గురువారం నేలకొండపల్లిలో నిర్వహించనుండగా వాసవీ భవన్లో ఏర్పాట్లుచేశారు. ఈమేరకు ఏర్పాట్లను తహసీల్థార్ వి.వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ ఎం.యర్రయ్య, ఎంపీఓ శివ తదితరులు పరిశీలించారు. కాగా, సదస్సు విషయమై రైతులు, ప్రజల్లో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జ్ తంబూరు దయాకర్రెడ్డి ఓ ప్రకటనలో సూచించారు.
షెడ్యూల్ ఇలా...
మండల కేంద్రాల్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. నిర్ణీత తేదీల్లో రోజుకు రెండేసి మండలాల్లో ఉదయం, మధ్యాహ్నం సదస్సుల నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు. తొలిరోజైన 17వ తేదీ(గురువారం)న నేలకొండపల్లిలో ఉదయం 9గంటలకు సదస్సు మొదలవుతుంది. అలాగే, 19న తిరుమలాయపాలెం, కూసుమంచి, 21న ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్, 22న రఘునాథపాలెం, ముదిగొండ, 23న మధిర, ఎర్రుపాలెం, 24న చింతకాని, బోనకల్, 25న వైరా, ఏన్కూరు, 26న కొణిజర్ల, కారేపల్లి, 28న సత్తుపల్లి, వేంసూరు, 29న కల్లూరు, పెనుబల్లి, 30న తల్లాడ, కామేపల్లిల్లో సదస్సులు నిర్వహిస్తారు.