అంకితభావంతో సేవలు చేస్తే గుర్తింపు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉద్యోగులు అంకితభావంతో అందించే సేవలే గుర్తింపు తెస్తాయని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. నగరంలో డీఎంహెచ్ఓ కార్యాలయంలోని గణాంక విభాగంలో పనిచేస్తూ శుక్రవారం పదవీ విరమణ చేసిన కొక్కిర నాగమణిని కార్యాలయ ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఉద్యోగికి జరిగే సాధారణ ప్రక్రియ అని, వారి అంకిత భావం, ప్రవర్తన ముఖ్యమైనవన్నారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ వై.శరత్ బాబు, డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఇందుమతి, ఎన్హెచ్ఎం, డీపీఎం డాక్టర్ నవీన్, బూచవరం, వెలగలేరు, కొండపల్లి, లింగాలుపాడులో పని చేసే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక అక్షరాస్యత
అందరికీ అవసరం
కంకిపాడు: ఆర్థిక అక్షరాస్యత అందరికీ అవసరమని కృష్ణా జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సి.రవీంద్రరెడ్డి అన్నారు. ఆర్బీఐ సారథ్యంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు –2025 పురస్కరించుకుని గొడవర్రు జెడ్పీ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులకు బ్యాంకింగ్ వ్యవస్థ–పొదుపు అంశంపై క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన టి.శారద, డి.ఉపాదేవి, కె.శ్రీదేవికి బహుమతులు అందించారు. రవీంద్రరెడ్డి మాట్లాడుతూ మహిళలు పొదుపుపై అవగాహన పెంచుకోవాలన్నారు. దీంతో ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. బ్యాంకింగ్ సేవలు వినియోగించుకుని ఆర్థిక వృద్ధి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం సుబ్రహ్మణ్యం, ఆర్థిక అక్షరాస్యత కేంద్ర కౌన్సిలర్ సునీల్ పాల్గొన్నారు.
పశువులకు సకాలంలో టీకాలు వేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పశువులకు అవసరమైన టీకాలను సకాలంలో అందించి, పూర్తిస్థాయిలో వ్యాధులను అరికట్టేందుకు కృషిచేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ.. పశుసంవర్థక శాఖ అధికారులతో కలిసి గాలికుంటు వ్యాధి, బ్రూసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ మార్చి 1 శనివారం నుంచి 30వ తేదీ వరకు పశువులకు గాలి కుంటువ్యాధి, బ్రుసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాలుగు నెలల వయసు దాటిన పశువులకు గాలికుంటువ్యాధి నిరోధక టీకాలు, 4–8 నెలల వయసున్న పెయ్యదూడలకు బ్రుసెల్లోసిస్ నిరోధక టీకాలు పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఉచితంగా రైతు వద్దే వేయాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ ఎం.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
కేయూలో సైన్స్ దినోత్సవం
కోనేరుసెంటర్: సైన్స్లో రోజురోజుకు విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని కృష్ణా విశ్వవిద్యాలయం రెక్టర్ ఆచార్య ఎంవీ బసవేశ్వరావు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యాన నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. తొలుత సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్ఎస్ఎస్ విభాగం సమన్వయకర్త డాక్టర్ శ్రావణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు, రసాయన శాస్త్ర విభాగ అధిపతి డాక్టర్ సుజాత, పలువురు ఆచార్యులు, సహాయ ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అంకితభావంతో సేవలు చేస్తే గుర్తింపు
అంకితభావంతో సేవలు చేస్తే గుర్తింపు
అంకితభావంతో సేవలు చేస్తే గుర్తింపు
Comments
Please login to add a commentAdd a comment