పీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ తనిఖీలు

Published Sun, Mar 2 2025 1:19 AM | Last Updated on Sun, Mar 2 2025 1:19 AM

పీహెచ

పీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ తనిఖీలు

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్‌ జిల్లాలోని నందిగామ మండలం గోళ్లమూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ మాచర్ల సుహాసిని ఆకస్మిక తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. గర్భిణులు, పిల్లలకు ఇస్తున్న టీకాలు, వ్యాక్సిన్‌ నిల్వలు, ఉష్ణోగ్రతల నిర్వహణ, రిజిస్ట్రేషన్‌ వంటి అంశాలను పరిశీలించారు. లేబొరేటరీలో పరీక్షలు చేస్తున్న వివరాలను తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ఎన్‌సీడీ–సీడీ సర్వేను పరిశీలించారు. అక్కడి నుంచి అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి చిన్నారులకు పెడుతున్న ఆహారాన్ని పరిశీలించి రుచి చూశారు. పిల్లల ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అక్కడి అంగన్‌వాడీలను ఆదేశించారు. కార్యక్రమంలో గోళ్లమూడి వైద్యాధికారి డాక్టర్‌ విజయ్‌కృష్ణ, ఏఎన్‌ఎంలు, సీహెచ్‌ఓలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

శరీరం కాలినవారికి

ఉచిత ప్లాస్టిక్‌ సర్జరీలు

లబ్బీపేట(విజయవాడతూర్పు): శరీరం కాలిన వారికి ఉచిత ప్లాస్టిక్‌ సర్జరీలు నిర్వహించనున్నట్లు బర్న్‌ సర్వైవర్‌ మిషన్‌ సేవియర్‌ ట్రస్ట్‌ (బీఎస్‌ఎంఎస్‌) వ్యవస్థాపకురాలు నీహారి మండలి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ నెల 7వ తేదీ లోపు పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో జరిగే ఘటనల కారణంగా జరిగే ప్రమాదాల్లో శరీరంలోని కొన్ని భాగాలు కాలిపోతుంటాయని, అలాంటివారు ఆత్మన్యూనత భావానికి గురవుతుంటారని పేర్కొన్నారు. ఇలాంటివారు చికిత్స చేయించుకునేందుకు అవసరమైన ప్లాస్టిక్‌ సర్జరీ విధానం చాలా ఖరీదుగా ఉంటుందని తెలిపారు. వారి కోసం పూర్తిగా ఉచితంగా సేవలు అందించేందుకు బీఎస్‌ఎంఎస్‌ను స్థాపించినట్లు పేర్కొన్నారు. సేవలు పొందాలనుకునే వారు 78160 79234 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

గురుకుల పాఠశాల, కళాశాలలో ఆకస్మిక తనిఖీ

మోపిదేవి: మోపిదేవి మహాత్మా జ్యోతిబాపూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల(బాలురు), జూనియర్‌ కళాశాలను బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్‌.సత్యనారాయణ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థులు, ఇంటర్మీడియెట్‌ విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడి వసతి గృహంలో భోజనం, టాయ్‌లెట్స్‌ పరిశీలించారు. ఇంటర్మీడియెట్‌ పరీక్షలు బాగా రాసి మంచి ర్యాంకులు సాధించాలని, పదో తరగతి విద్యార్థులు నూటికి నూరుశాతం ఉత్తీర్ణత పొందడానికి స్ఫూర్తిని నింపారు. జిల్లా బీసీ సంక్షేమ అధికారి రమేష్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ వీర రవి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

జాతీయ యోగా పోటీలకు ఎస్‌ఆర్‌ఆర్‌ వ్యాయామ అధ్యాపకుడు

మధురానగర్‌(విజయవాసెంట్రల్‌): మాచవరం ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వ్యాయామ అధ్యాపకుడు డాక్టర్‌ డి. యుగంధర్‌ జాతీయ యోగా పోటీలకు ఎంపికయ్యారు. ఏపీ స్పోర్ట్స్‌ అథారిటీ ఇటీవల నిర్వహించిన జిల్లా, రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో విజయం సాధించిన డాక్టర్‌ యుగంధర్‌ ఆలిండియా సివిల్‌ సర్వీసెస్‌ యోగాసన కాంపిటీషన్‌లో పాల్గొనడానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శనివారం కళాశాలలో యుగంధర్‌ను ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె. భాగ్యలక్ష్మి, అధ్యాపకులు అభినందించారు. పోటీల్లో విజయం సాధించి కళాశాల పేరు ప్రఖ్యాతులు ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. ఆదివారం పోటీల్లో పాల్గొనేందుకు యుగంధర్‌ బయలుదేరనున్నట్లు తెలిపారు

No comments yet. Be the first to comment!
Add a comment
పీహెచ్‌సీలో   డీఎంహెచ్‌ఓ తనిఖీలు 
1
1/1

పీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ తనిఖీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement