
దుర్గమ్మ సేవలో ఎన్టీఆర్ జిల్లా
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ మంగళవారం కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన కలెక్టర్ లక్ష్మీశకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈఈ కోటేశ్వరరావు, ఏఈవో చంద్రశేఖర్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టు వస్త్రాలను అందజేశారు.
హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యాన హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. నగరంలోని షాజహర్ ముసాఫిర్ఖానా ప్రాంగణంలో జరిగిన కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.సుహాసిని ప్రారంభించారు. ఏటా హజ్ యాత్రికులకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వ్యాక్సినేషన్ చేయడం పరిపాటి. అందులో భాగంగా జిల్లాకు చెందిన 63 మంది యాత్రికులకు వ్యాక్సినేషన్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ ఇన్చార్జి అధికారి డాక్టర్ పద్మావతి, డాక్టర్ ఉస్మాన్, డాక్టర్ రాజా, డాక్టర్ కార్తీక్ పాల్గొన్నారు.
ఆ కళాశాలలపై చర్యలు తీసుకోండి: ఏబీవీపీ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వివిధ పోటీ పరీక్షలు, బెటర్మెంట్, సప్లిమెంటరీ పరీక్షల పేరుతో వేసవి సెలవుల్లో రెగ్యులర్ తరగతులు నిర్వహిస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సభ్యులు ఇంటర్మీడియెట్ బోర్డ్ కమిషనర్ కృతికా శుక్లాకు వినతిపత్రం అందజేశారు. తాడేపల్లిలోని బోర్డు కార్యాలయంలో మంగళవారం ఆమెను కలిసి వినతిపత్రం ఇచ్చామని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట గోపి తెలిపారు. ఏటా వేసవి సెలవులు ప్రకటించిన తర్వాత ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు పోటీ పరీక్షల ప్రిపరేషన్ పేరుతో రెగ్యులర్ తరగతులను నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ముందుగానే అధికారులకు తెలియజేస్తున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న ప్రయివేటు కళాశాలలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. వీటితో పాటుగా కార్పొరేట్ కళా శాలలు ఒకచోట గుర్తింపు పొంది అనేక చోట్ల కాలేజీలు నిర్వహిస్తున్నాయని వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిషత్ రాష్ట్ర కార్య సమితి సభ్యులు దుర్గారావు, శ్యామ్, మోజేస్, చరణ్ వినతిపత్రం అందజేసిన వారిలో ఉన్నారు.
కిశోర బాలికల
సమగ్రాభివృద్ధికి చర్యలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు నగరంలోని ఓ హోటల్లో కిశోర బాలల ప్రత్యేక క్యాలెండర్ను ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్లు ఎం.శిరీష, బి.మనోరంజని పాల్గొన్నారు. మే 2వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు కిశోర బాలికలకు వేసవి సెలవుల్లో నిర్వహించాల్సిన అవగాహన కార్యక్రమాలపై కుమారి మేరీ జోన్స్, యునిసెఫ్ టీం సభ్యులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలిపారు. బాల్య వివాహాలు, రుతుక్రమ పరిశుభ్రత, బాలల హక్కులు, పోషణ, ఆరోగ్యం, లింగ సమానత్వం, విద్య ఆవశ్యకత, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై వివరించారు. కిశోర వికాసంపై గ్రామస్థాయిలో నిర్వహించాల్సిన ప్రణాళికపై జిల్లాల వారీగా కార్యాచరణ నివేదికను రూపొందించారు. కార్యక్రమంలో మహిళాభివృద్ధి ,శిశు సంక్షేమ శాఖ అడిషనల్ అధికారి ఎస్.నాగ శైలజ, ఎన్టీఆర్, కృష్ణా జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ, సాధికారత అధికార్లు డి.శ్రీలక్ష్మి, ఎం.ఎస్ రాణి తదితరులు పాల్గొన్నారు.

దుర్గమ్మ సేవలో ఎన్టీఆర్ జిల్లా

దుర్గమ్మ సేవలో ఎన్టీఆర్ జిల్లా