విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్‌టాప్‌లు | - | Sakshi
Sakshi News home page

విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్‌టాప్‌లు

Published Tue, Mar 4 2025 12:56 AM | Last Updated on Tue, Mar 4 2025 12:54 AM

విభిన

విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్‌టాప్‌లు

కర్నూలు(సెంట్రల్‌): పాలిటెక్నిక్‌, డిగ్రీ చదువుతున్న 6గురు విభిన్న ప్రతిభావంతులకు కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేసిన ఆయన చదువులో రాణిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కర్నూలులోని ప్రకాష్‌ నగర్‌కు చెందిన హకీమ్‌, రేష్మా దంపతులు తమ కుమారుడు ఉమర్‌కు ట్రై సైకిల్‌ ఇప్పించాలని కోరగా వెంటనే మంజూరు చేయించారు. ● విభిన్న ప్రతిభావంతుల సౌకార్యార్థం అన్ని శాఖల కార్యాలయాల్లో ర్యాంపులు ఏర్పాటు చేశారని.. ఒక్క డీపీఓ, డీఈఓ కార్యాలయాల్లో మాత్రమే ఎందుకు ఏర్పాటు చేయలేదని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఈ సందర్భంగా ప్రశ్నించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ చల్లా కల్యాణి, విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు రయిస్‌ ఫాతిమా పాల్గొన్నారు.

ఇంటర్‌ పరీక్షల్లో పది మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు

కర్నూలు సిటీ: ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర పరీక్షల్లో పది మంది విద్యార్థులపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు అయినట్లు ఆర్‌ఐఓ గురువయ్య శెట్టి తెలిపారు. జిల్లాలో 69 కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 20,506 మందికిగాను 20,160 మంది విద్యార్థులు హాజరుకాగా, 336 మంది గైర్హాజరయ్యారన్నారు. పత్తికొండ ప్రభు త్వ జూనియర్‌ కాలేజీలో ఆరుగురు, ఏపీ మోడల్‌ స్కూల్‌ పత్తికొండలో ఒకరు, గోనెగండ్ల ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఒకరు, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ(బాలురు)ఎమ్మిగనూరులో ఒకరు, నారాయణ జూనియర్‌ కాలేజీలో ఒకరు మాల్‌ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్నట్లు తనిఖీ బృందాలకు తెలిసిందన్నారు.

గోఆధారిత వ్యవసాయ ఉత్పత్తులకు ఆదరణ

కర్నూలు(అగ్రికల్చర్‌): గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌లో ఆదరణ లభిస్తోందని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్‌ వరలక్ష్మి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన గోఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి పరిశీలించారు. జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, గ్రీవెన్స్‌కు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రైతులు ఎలాంటి కెమికల్స్‌ లేకుండా గోఆధారిత ఎరువుల ద్వారా పండించిన కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ఈ కౌంటర్‌ రైతుసాధికార సంస్థ ఆధ్వర్యంలో పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో డీపీఎం చంద్రశేఖర్‌, డీఎల్‌ఎంపీ లక్ష్మయ్య, మార్కెటింగ్‌ ఎన్‌ఎఫ్‌ఏ మల్లికార్జున పాల్గొన్నారు.

నవోదయలో

‘యువ పార్లమెంట్‌’

ఎమ్మిగనూరురూరల్‌: బనవాసి జవహర్‌ నవోదయ విద్యాలయంలో పార్లమెంట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ 2019 నవంబర్‌ 26న జాతీయ యవ పార్లమెంట్‌ పథకం వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. సోమవారం విద్యాలయంలో పార్లమెంట్‌ సమావేశాలు ఏ విధంగా జరుగుతాయి, అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీ, స్పీకర్‌ వంటి సన్నివేశాలు నిర్వహించారు. యువ పార్లమెంట్‌ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన విద్యార్థులను విద్యాలయ ప్రిన్సిపాల్‌ ఇ.పద్మావతి అభినందించారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ చందిరన్‌, బసవరాజ్‌, కె. వెంకటేశ్వర్లు, శశికిరణ్‌, రాజు, వెంకటేష్‌, రవిశంకర్‌, మీనాచంద్రన్‌ పాల్గొన్నారు.

రైతు ఆత్మహత్య

పాణ్యం: బలపనూరు గ్రామానికి చెందిన వై.రామ్మోహన్‌రెడ్డి(63) అనే రైతు విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు, గ్రామస్తులు సోమవారం తెలిపారు. వారు తెలిపిన మేరకు వివరాలు.. రామ్మోహన్‌రెడ్డికి 10 ఎకరాల సొంత భూమి ఉంది. కొడుకు గంగధారర్‌రెడ్డితో కలిసి ఆ పొలంలో వరి పంటను సాగు చేశాడు. అంతేకాక కౌలుకు మరో 10 ఎకరాల భూమి తీసుకొని మిరప, మినుము పంటలను సాగు చేశాడు. పంటలకు సుమారు రూ.12 లక్ష ల నుంచి రూ.14లక్షల వరకు అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టాడు. మిరప పంట సరిగ్గా లేకపోవడం, వచ్చిన పంటకు మద్దతు ధర లేనందున నిత్యం ఇంట్లో, బంధువుల వద్ద ఆవేదన వ్యక్తం చేసేవాడు. సోమవారం ఇంట్లో వారు బంధువుల వివాహానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో విషపు గుళికలు మింగాడు. వచ్చిన తర్వాత గమనించిన బంధువులు, కుటుంబ సభ్యులు చికిత్స కోసం నంద్యాలలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కోలుకోలేక మృతి చెందాడు. మృతుడికి భార్య వరలక్ష్మి, కుమారుడు గంగాధర్‌రెడ్డి ఉన్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్‌టాప్‌లు 1
1/1

విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్‌టాప్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement