
రేపు కర్నూలులో జాతీయ రైతు సదస్సు
కర్నూలు(సెంట్రల్): ఈనెల 4న కర్నూలులో నిర్వహించే జాతీయ రైతు సదస్సును జయప్రదం చేయాలని ఏపీ రైతుసంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.రామచంద్రయ్య కోరారు. నగరంలోని లక్ష్మీనరసింహ కల్యాణ మండపంలో జరిగే సదస్సుకు కేరళ, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రులు పి.ప్రసాదు, తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఉమ్మడి ఏపీ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, రఘువీరారెడ్డి, కిసాన్ సభ జాతీయ కార్యదర్శి రావుల వెంకయ్య హాజరవుతున్నట్లు తెలిపారు. బుధవారం సీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 15, 16, 17 తేదీల్లో తమిళనాడులోని నాగపట్నంలో ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ మహాసభలు జరగనున్న నేపథ్యంలో కర్నూలులో 4న జాతీయ రైతు సదస్సును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పాతబస్టాండులోని శ్రీలక్ష్మీనరసింహ కల్యాణ మండపంలో జరిగే సదస్సులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి జాతీయ మహాసభల్లో తీర్మానం చేయనున్నట్లు చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా పంట రుణాలను మాఫీ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పంపన్న గౌడ్, ఎస్.మునెప్ప, పి.రామకృష్ణారెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.