
పోకిరీల భరతం పడుతూ..
నిర్భయంగా
ఫిర్యాదు చేయాలి
బాలికలు, యువతులు, మహిళలు ధైర్యంగా ఉండాలి. ఎవరైనా వేధింపులకు పాల్పడటం, ఉద్దేశ్యపూర్వకంగా వెంటపడటం, అవహేళనగా మాట్లాడితే నిర్భయంగా పోలీసులకు సమాచారమివ్వాలి. ఆపదలో ఉన్నా, వేధింపులకు గురైనా డయల్ 100 సేవలను వినియోగించుకోవచ్చు. – విక్రాంత్ పాటిల్, ఎస్పీ
కర్నూలు: బాలికలు, యువతులు, మహిళల భద్రతకు జిల్లా పోలీసులు పెద్దపీట వేస్తున్నారు. వేధింపులకు పాల్పడుతున్న పోకిరీల భరతం పడుతున్నారు. మఫ్టీలో ఉంటూ రద్దీ ప్రాంతాల్లో నిఘా సారించే రక్షకులు ఆకతాయిల్లో మార్పు తెచ్చేందుకు వివిధ దశల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాలో యాంటీ ఈవ్ టీజింగ్ బృందాలు కీలకంగా మారాయి. అధికారులు, సిబ్బంది ప్రత్యేక తనిఖీలతో విద్యార్థులు, మహిళలకు తామున్నామనే భరోసా కల్పిస్తున్నారు.
పోకిరీల కట్టడికి
డ్రోన్ కెమెరాలతో నిఘా...
పాశ్చాత్య పోకడలు, సామాజిక మాధ్యమాల ప్రభావంతో కొందరు బాలురు, యువకులు తప్పుడు మార్గాలను అనుసరిస్తున్నారు. తమ కుటుంబ నేపథ్యాన్ని మరచి కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు. వారిని కట్టడి చేసేందుకు జిల్లాలోని కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో యాంటీ ఈవ్ టీజింగ్ బృందాలు పనిచేస్తున్నాయి. విద్యాసంస్థల ఆవరణాలు, ప్రయాణ ప్రాంగణాలు, రద్దీ కూడళ్లు ఇతర ప్రాంతాల్లో గస్తీ తిరుగుతున్నారు. తరచూ వేధింపులు జరిగే ప్రాంతాలను హాట్ స్పాట్లుగా గుర్తిస్తున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా ఆయా ప్రాంతాల్లో పర్యవేక్షణ కొనసాగుతోంది.
విద్యాసంస్థల్లో
అవగాహన కార్యక్రమాలు...
విద్యా సంస్థల్లో పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వినియోగం, సైబర్ నేరాల కట్టడి, పోలీసు సేవలు, మహిళా చట్టాల వినియోగం తీరును వివరిస్తున్నారు. జిల్లాలో 39 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వాటి పరిధిలోని విద్యాసంస్థల వద్ద ప్రత్యేకంగా ప్రతిరోజూ 36 ఈవ్ టీజింగ్ బీట్స్ విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆకతాయిలను పట్టుకుని కౌన్సెలింగ్ చేస్తున్నారు.
డ్రోన్లతో నిఘా..
డ్రోన్లు జిల్లా పోలీసుల అమ్ముల పొదిలో సరికొత్త ఆయుధాలుగా మారాయి. ఇప్పటి వరకు పోలీస్ పెట్రోలింగ్ అంటే వాహనాల సైరన్లు, బూట్ల చప్పుళ్లు వినిపించేవి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. తమ ప్రతినిధులుగా డ్రోన్లను పంపుతున్నారు. ఆకాశంలో చక్కర్లు కొట్టిస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ల రాకతో నిర్మాణుష్య ప్రదేశాల్లో మద్యపానంతో పాటు విద్యాసంస్థల వద్ద నిఘా పెరిగింది. ఈవ్ టీజింగ్ నిరోధానికి పోలీసులు డ్రోన్ కెమెరాల సేవలను వాడుతున్నారు. పాఠశాలలు, కళాశాలలు మొదలయ్యే, ముగిసే సమయాల్లో కీలక ప్రాంతాల్లో డ్రోన్లను వినియోగించి ఆకతాయిల ఆగడాలకు ముకుతాడు వేసే లా ప్రణాళిక రచించి అమలు చేస్తున్నారు. భవిష్యత్తులో కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని ముఖ్య పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కూడా డ్రోన్ సేవలను వినియోగించనున్నట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు.
రెండు నెలల వ్యవధిలో
700 మంది పోకిరీలకు కౌన్సెలింగ్...
జిల్లా ఎస్పీగా విక్రాంత్ ఫిబ్రవరి 1వ తేదీన బాధ్యతలు చేపట్టారు. యాంటీ ఈవ్ టీజింగ్ను అరికట్టాలనే ఉద్దేశ్యంతో జిల్లా వ్యాప్తంగా ఈవ్ టీజింగ్ బీట్స్ను ఆయన కొత్తగా అమలులోకి తెచ్చారు. కళాశాలలు, పాఠశాలల వద్ద ఈవ్ టీజింగ్ను అరికట్టడం కోసం జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ 36 ఈవ్ టీజింగ్ బీట్స్ విధులు నిర్వహిస్తున్నారు. ఈవ్ టీజింగ్కు పాల్పడేవారిపై నిఘా ఉంచి రెండు నెలల వ్యవధిలో సుమారు 7 వేల మంది పోకిరీలకు ఈవ్ టీజింగ్ బీట్స్ పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. పద్ధతి మార్చుకోకుండా పదేపదే మహిళలను వేధించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందడంతో క్షేత్రస్థాయిలో పోలీసులు పోకిరీల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు.
జిల్లాలో కీలకంగా యాంటీ ఈవ్ టీజింగ్ బృందాలు
ఈవ్ టీజింగ్ నిరోధానికి డ్రోన్ సేవలు
జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ 36 ఈవ్ టీజింగ్ బీట్స్ విధులు
రెండు మాసాల్లో 700 మంది పోకిరీలకు స్టేషన్లో కౌన్సెలింగ్

పోకిరీల భరతం పడుతూ..

పోకిరీల భరతం పడుతూ..