గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్ట్
మహబూబాబాద్ రూరల్ : అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఒకరిని అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి 10 కిలోల 102 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నామని రూరల్ సీఐ పి.సర్వయ్య తెలిపారు. పోలీసు స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సర్వయ్య కేసు వివరాలు వెల్లడించారు. ఒడిశాలోని గంజాం జిల్లా బడఖరిడకు చెందిన బరున బరడ్ సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒడిశాలోని ఒకరివద్ద నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేశాడు. సూరత్లో అధిక ధరకు విక్రయించేందుకు విజయవాడ మీదుగా వెళ్తుండగా పోలీసులు తనిఖీ చేస్తున్నారని తెలుసుకుని మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో దిగాడు. తొర్రూరు మీదుగా వరంగల్ వెళ్లేందుకు ఆటో ఎక్కి వెళ్తుండగా శనిగపురం వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా ఆటోదిగి పారిపోయే ప్రయత్నం చేశాడు. అతడిని పట్టుకుని, 10 కిలోల 102 గ్రాముల (రూ.5.05 లక్షల విలువగల) ఎండు గంజాయి, మొబైల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని రూరల్ సీఐ సర్వయ్య తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ ఎస్సై దీపిక, ట్రెయినీ ఎస్సై నరేష్, ఏఎస్సై జాకీర్, సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్న సీఐ, ఎస్సై, సిబ్బందిని ఎస్పీ సుధీర్ ఆర్ కేకన్ అభినందించారు.
రూ.1,42లక్షల విలువైన గంజాయి..
నడికూడ : మండలంలోని చర్లపల్లి వద్ద నిషేధిత గంజాయిని గురువారం స్వాధీనం చేసుకున్నారు. పరకాల ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. చర్లపల్లి గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా బస్టాండ్ వద్ద స్కూటీపై ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని ఆపి తనిఖీ చేయగా 2.840 కేజీల గంజాయి రవాణా చేస్తు పట్టుబడ్డారు. అదుపులో తీసుకొని విచారించగా ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లా, చిత్రకొండ నాగులూర్కు చెందిన పప్పల్ బాలయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచకు చెందిన ముదిగొండ ప్రశాంత్ పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.1,42 లక్షల వరకు ఉంటుందని, నిందితులను అదుపులోకి తీసుకొని, పరకాల పోలీస్ స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment