పెళ్లి వద్దని ఆత్మహత్యాయత్నం
● మానుకోట ఎస్సై సమాచారంతో
కాపాడిన కాజీపేట జీఆర్పీ అధికారులు
● తండ్రికి విద్యార్థిని అప్పగింత
కాజీపేట రూరల్ : పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఓ విద్యార్థిని కాజీపేట జంక్షన్ రైల్వే యార్డులో గురువారం తెల్లవారు జామున ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు అదుపులోకి తీసుకోని ఆమె తండ్రికి అప్పగించిన సంఘటన కాజీపేటలో జరిగింది. జీఆర్పీ కానిస్టేబుల్ ఆర్.కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం. మహబూబాబాద్ జిల్లాకు చెందిన నందిని హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతోంది. ఇంటికి వచ్చిన నందినికి పెళ్లి చేస్తానని చెప్పడంతో తల్లి కూతుళ్ల మధ్య గొడవ జరిగింది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని నందిని బుధవారం ఇంటి నుంచి వచ్చి కాజీపేట రైల్వే స్టేషన్కు చేరుకుంది. అదే రోజు రాత్రి నందిని కాజీపేటలో ప్రయాణికుడి సెల్ఫోన్ నుంచి తండ్రికి ఫోన్ చేసి కాజీపేట రైల్వే స్టేషన్లో ఉన్నానని, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. అప్రమత్తమై తండ్రి మహబూబాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సమాచారంతో కాజీపేట జీఆర్పీ పోలీసులు రైల్వే యార్డు ఆర్ఆర్ఐ సమీపంలో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న నందినిని గుర్తించి అదుపులోకి తీసుకోని జీఆర్పీ స్టేషన్కు తరలించారు. తండ్రిని పిలిపించి జీఆర్పీ అధికారుల ఆదేశాలనుసారం నందినిని తండ్రి అప్పగించినట్లు ఆయన తెలిపారు.
మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు, జరిమానా
మడికొండ : మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి కోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. మడికొండ ఇన్స్పెక్టర్ కిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట మండలం రాంపేట గ్రామానికి చెందిన మీరాల రాజు 2017, జూలై 22న సాయంత్రం అదే గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంట్లోకి ప్రవేశించి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పటి ఎస్సై మధుప్రసాద్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా, విచారణలో భాగంగా గురువారం కానిస్టేబుల్ వి.రాజేష్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టాడు. ప్రాసిక్యూషన్ తరఫున ఎస్.దుర్గబాయ్ వాదించగా నిందితుడిపై నేరం రుజువైంది. దీంతో హనుమకొండ మొదటి అదనపు న్యాయమూర్తి చింతాడ శ్రావణ స్వాతి నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.6,000ల జరిమానా విధించినట్లు ఇన్స్పెక్టర్ కిషన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment