
కాజీపేట మీదుగా ‘భారత్ గౌరవ్’ స్పెషల్ ట్రైన్
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా ‘భారత్ గౌరవ్’ సప్త జ్యోతిర్లింగ దర్శన స్పెషల్ ట్రైన్ యాత్ర ప్రారంభం కానున్నట్లు ఐఆర్సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ కిశోర్ గురువారం తెలిపారు. ఏప్రిల్ 8వ తేదీన ఐఆర్సీటీసీ సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర విజయవాడలో రాత్రి 9 గంటలకు ప్రారంభమై ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్, నిజామాబాద్, నాందేడ్ మీదుగా ఉజ్జయినికి చేరుతుందన్నారు. ఉజ్జయిని మహాకాళేశ్వర్, ద్వారకా, నాగేశ్వర్, సోమనాథ్, భీమశంకర్, త్రయంబకేశ్వర్, గృశ్నేశ్వర్ జ్యోతిర్లింగాలను సందర్శన చేస్తారని తెలిపారు. ఏప్రిల్ 18వ తేదీన తిరుగు ప్రయాణం ఉంటుందన్నారు. ఈ యాత్రలో భోజనం, హోటల్ గదులు, సెక్యూరిటీతో కూడిన ప్రయాణం ఉంటుందన్నారు. టికెట్ల ధర నాన్ ఏసీ రూ.20,980, థర్డ్ ఏసీ రూ.33,735, సెకండ్ ఏసి రూ.44,375 ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని తెలుగు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు ఐఆర్సీటీసీటీఓయూఆర్ఐఎస్ఎం.కం లేదా 928030712, 9281030749 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
పేద విద్యార్థి కష్టానికి
దక్కిన ఫలితం
కురవి: నాన్న చిన్న తనంలోనే చనిపోయాడు.. అమ్మ కూలీ పనులు చేసి కొడుకును చదివించింది. అమ్మ పడిన కష్టాన్ని చిన్న తనం నుంచే చూసిన కొడుకు క్రమశిక్షణతో చదువుకున్నాడు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రెండు ఉద్యోగాలను ఒకే సారి దక్కించుకుని తల్లి కలను నెరవేర్చడంతోపాటు తాను పడిన కష్టానికి తగిన ఫలితం పొందాడు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లి శివారు బీబీనాయక్తండా జీపీ పరిధి భూక్య తండాకు చెందిన భూక్య పవన్. భూక్య పార్వతి, (వెంకన్న, లేట్) కుమారుడు పవన్ గురువారం విడుదలైన ఎస్సెస్సీ, సీజీఎల్ ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించాడు. ఎస్సెస్సీలో ఎంటీఎస్(మల్టీ టాస్కింగ్ స్టాప్), సీజీఎల్లో టాక్స్ అసిస్టెంట్(సీబీఐసీ సెంట్రల్బోర్డ్ ఆఫ్ టాక్స్స్ అండ్ కస్టమ్స్) ఉద్యోగాలు వచ్చాయి. పవన్ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బీబీనాయక్ తండా ప్రాథమిక పాఠశాలలో, 6 నుంచి 10 తరగతి వరకు చింతపల్లి జెడ్పీ హైస్కూల్, ఇంటర్మీడియట్ మహబూబాబాద్ ప్రభుత్వ కాలేజీ, డిగ్రీ మానుకోట నలంద కాలేజీలో చదువుకున్నాడు.
18 కిలోల ఎండు గంజాయి స్వాధీనం
● ఇద్దరు మహారాష్ట్ర వ్యక్తుల అరెస్ట్
వరంగల్: వరంగల్ రైల్వేస్టేషన్ వద్ద గురువారం మహారాష్ట్రకు చెందిన షేక్ సాధిక్, షేక్ మక్సుద్ వద్ద నుంచి రూ.9లక్షల విలువైన 18కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ షుకుర్ తెలిపారు. రైల్వే స్టేషన్ వద్ద రెండు బ్యాగులతో ఇద్దరు వ్యక్తులు పోలీస్ వాహనాన్ని చూసి పారిపోయే ప్రయత్నం చేయగా పటుకుని తనిఖీ చేయగా గంజాయి లభించిందన్నారు. విచారించగా వరంగల్ రైల్వే స్టేషన్లో అమ్మడానికి వచ్చినట్లు తెలిపారని, దీంతో వీరిద్దరిని అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.

కాజీపేట మీదుగా ‘భారత్ గౌరవ్’ స్పెషల్ ట్రైన్

కాజీపేట మీదుగా ‘భారత్ గౌరవ్’ స్పెషల్ ట్రైన్
Comments
Please login to add a commentAdd a comment