ప్రభల తరలింపులో ఉద్రిక్తత.. | - | Sakshi
Sakshi News home page

ప్రభల తరలింపులో ఉద్రిక్తత..

Published Sun, Mar 16 2025 12:53 AM | Last Updated on Sun, Mar 16 2025 12:53 AM

ప్రభల

ప్రభల తరలింపులో ఉద్రిక్తత..

భారీగా తరలిరావడంతో

గిర్నిబావిలో ట్రాఫిక్‌ జామ్‌

నిలువరించే ప్రయత్నంలో పోలీసుల లాఠీచార్జ్‌

పరుగులు తీసిన బీఆర్‌ఎస్‌,

కాంగ్రెస్‌ కార్యకర్తలు

ఐదుగురికి గాయాలు,

బీఆర్‌ఎస్‌ ఆందోళన

● డీసీపీ అంకిత్‌ రాకతో పరిస్థితి అదుపులోకి..

సాక్షి, వరంగల్‌/దుగ్గొండి: వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల జాతరకు రాజకీయ ప్రభలు (బండ్లు) తరలుతుండగా దుగ్గొండి మండలం గిర్ని బావిలో ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యాయి. ఒక్కసారిగా తరలిరావడంతో నిలువరించే ప్రయత్నంలో పోలీసులు లాఠీకి పని చెప్పారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ప్రభల ఎదుట పేలుస్తున్న షార్ట్‌ బాణాసంచా బోర్లా పడడంతో రోడ్డు పక్కల వారికి తగిలి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో బాంబుల పేలుడు శబ్ధం వినిపించడంతో ఫైరింగ్‌ జరుగుతుందని భ్రమపడిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ, వామపక్షాల కార్యకర్తలు పరుగులు తీశారు. దీంతో పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ చేయగా పలువురు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు గాయపడ్డారు. ఒకానొక దశలో ఈ ఉద్రిక్త పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు వాటర్‌ కేనన్‌ ప్రయోగించబో యారు. చివరకు డీసీపీ అంకిత్‌ కుమార్‌ రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. జాతరకు స్వయంగా వాహనాలు, ప్రభలను పంపించారు.

ఉద్రిక్తతకు ఎందుకు దారి తీసిందంటే..

జిల్లాలో ప్రసిద్ధి గాంచిన కొమ్మాల శ్రీలక్ష్మీనర్సింహాస్వామి జాతర సందర్భంగా నర్సంపేట నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ, వామపక్ష పార్టీల ప్రభలు శనివారం ఉదయమే గిర్నిబావికి భారీగా చేరుకున్నాయి. కాంగ్రెస్‌ ప్రభలను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించగా, బీఆర్‌ఎస్‌ ప్రభలను మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్‌ ప్రారంభించారు. అయితే ఈ జాతరకు ప్రభలను ఈసారి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పోటాపోటీగా తరలించాయి. ఏటా గిర్నిబావిలో బల ప్రదర్శన చేయడం పరిపాటిగా మారడంతో పోలీసులు మొదట కాంగ్రెస్‌ ప్రభలకు ఉదయం 4 నుంచి 11 గంటల వరకు సమయం ఇచ్చారు. అయితే కాంగ్రెస్‌ ప్రభలు భారీగా తరలిరావడంతో కొమ్మాల ఆర్చ్‌ నుంచి గిర్నిబావి వరకు బారులుదీరాయి. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ ప్రభలను దుగ్గొండి, చాపలబండ , నర్సంపేట రోడ్లలో పోలీసులు నిలిపారు. ఇక తమకు కేటాయించిన సమయం దాటి పోయిందని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రోడ్డుకు చొచ్చుకొచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాలు ఒకరిపై ఒకరు కుంకుమ చల్లుకోవడం, వాటర్‌ బాటిళ్లు విసురుకోవడం, పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో పోలీసులు బారికేడ్లు పెట్టారు. అయితే వేలాది మంది ఒక్కసారిగా బారికేడ్లు, చెక్‌పోస్టులు విరగగొట్టి రోడ్డుపైకి రావడంతో ఇరువర్గాలను నిలువరించే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. ఈ క్రమంలోనే తొగర్రాయికి చెందిన యార శ్రీనివాస్‌పై పోలీసులు విచక్షణారహితంగా లాఠీలు ఝుళిపించడంతో గాయాలపాలయ్యాడు. కంచరకుంట్ల శ్రీనివాసరెడ్డి, సద్ది నర్సిరెడ్డి, మోడెం విద్యాసాగర్‌, తుమ్మలపెల్లి మహేందర్‌కు అధికంగా లాఠీ దెబ్బలు తగిలాయి. అయితే తమవారిపై ఎందుకు లాఠీచార్జ్‌ చేశారంటూ మహిళలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. పరిస్థితి ఇంకా చేజారుపోతుండడంతో వాటర్‌ కేనన్‌ ప్రయోగించే ప్రయత్నం చేశారు. ఏసీపీ కిరణ్‌కుమార్‌ తన ఏకే 47 గన్‌ లోడ్‌ చేసి ఫైర్‌ చేస్తానని బెదిరించే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అండగా నిలిచి ధర్నాలో పాల్గొన్నారు. సీఐ సాయిరమణ సర్ది చెప్పే ప్రయత్నం చేయగా పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం డీసీపీ అంకిత్‌కుమార్‌ ఘటనా స్థలికి చేరుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

నాలుగు గంటలుట్రాఫిక్‌కు అంతరాయం..

ప్రధాన రహదారిపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్ర భలు నిలిచిపోవడంతోపాటు జాతరకు వెళ్లి తిరుగుప్రయాణంలో వచ్చే ప్రభలు రెండు వైపులా ఉండడంతో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఆర్టీసీ బస్సులను మచ్చాపురం నుంచి దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులకు కొంత ఇబ్బంది తప్పింది.

గిర్నిబావి వద్ద కాల్పులు జరగలేదు

వరంగల్‌ పోలీసు కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌

సాక్షి, వరంగల్‌: కొమ్మాల జాతర సందర్భంగా గిర్నిబావి ప్రాంతంలో ప్రభ బండ్లు వరుస క్రమంలో తరలివెళ్లే సమయంలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించడంతోపాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆదేశాలను పాటించకుండా ముందుకెళ్లే క్రమంలో పోలీసులకు ప్రభబండ్లను తరలించే వారి మధ్య తోపులాట మాత్రమే జరిగిందని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. అంతేకాని ఈ ఘటనలో ఎలాంటి పోలీస్‌ కాల్పులు జరగలేదన్నారు. కొన్ని ప్రచార మాధ్యమాల్లో ఈ ఘటనలో కాల్పులు జరిగినట్లు ప్రజలను ఆందోళన కలిగించేలా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలకు ఆందోళన కలిగించే రీతిలో ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు అప్‌లోడ్‌ చేసినా, వార్తలు రాసిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

ప్రమాదశాత్తు బావిలో పడి యువకుడి మృతి

కొమ్మాల జాతరలో ఘటన

గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహాస్వామి జాతరలో శుక్రవారం రాత్రి ఓ యువకుడు ప్రమాదశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. పోలీసులు, మృతుడి భార్య కథనం ప్రకారం.. సంగెం మండలం పల్లార్లగూడ శివారు వీఆర్‌ఎన్‌ తండాకు చెందిన వాసరి అరుణ్‌కుమార్‌(31) తన స్నేహితుడు గుగులోత్‌ రాజుతో కలిసి కొమ్మాల జాతరకు వెళ్లాడు. జాతరలో భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో ఇద్దరూ కలుసుకోలేక పోగా చీకట్లో దారి తెలియక అరుణ్‌కుమార్‌ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడగా ఈత రాకపోవడంతో మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య శ్రావణి ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు గీసుకొండ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌ శనివారం తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రభల తరలింపులో ఉద్రిక్తత..1
1/3

ప్రభల తరలింపులో ఉద్రిక్తత..

ప్రభల తరలింపులో ఉద్రిక్తత..2
2/3

ప్రభల తరలింపులో ఉద్రిక్తత..

ప్రభల తరలింపులో ఉద్రిక్తత..3
3/3

ప్రభల తరలింపులో ఉద్రిక్తత..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement