ముగ్గురు రోహింగ్యాల అరెస్టు, రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

ముగ్గురు రోహింగ్యాల అరెస్టు, రిమాండ్‌

Published Wed, Feb 19 2025 1:19 AM | Last Updated on Wed, Feb 19 2025 1:17 AM

ముగ్గురు రోహింగ్యాల అరెస్టు, రిమాండ్‌

ముగ్గురు రోహింగ్యాల అరెస్టు, రిమాండ్‌

జడ్చర్ల టౌన్‌: దేశంలోకి అక్రమంగా చొరబడి మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్‌ మండలం నర్సింగ్‌తండాలో అయూబ్‌ ఫాంహౌజ్‌లో పనిచేస్తున్న ముగ్గురు రోహింగ్యాలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు మహబూబ్‌నగర్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం సాయంత్రం జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వెల్లడించారు. మయన్మార్‌ దేశానికి చెందిన నూర్‌ మహమ్మద్‌ 2012లో మయన్మార్‌ నుంచి భారత్‌లోకి అక్రమంగా చొరబడి బాలాపూర్‌లో నివసించేవారన్నారు. అక్కడి నుంచి బావమరిది ద్వారా నకిలీ పాస్‌పోర్టు, వీసా సృష్టించుకుని 2016లో సౌదీ అరేబియాకు వెళ్లి టైలరింగ్‌ పనులు చేస్తూ 2022లో తిరిగి భారత్‌కు వచ్చాడన్నారు. ఈ ఏడాది మళ్లీ దుబాయికి వీసా తీసుకుని నెలరోజుల పాటు వెళ్లి అక్టోబర్‌లో వచ్చి తిరిగి బాలాపూర్‌లో నివాసం ఉంటున్నారన్నారు. బాలాపూర్‌లోనే నివాసం ఉంటున్న రిజ్వానా అనే రోహింగ్యాను పెళ్లి చేసుకున్నాడని, తర్వాత ఏజెంట్‌ సహాయంతో త్రిపుర బార్డర్‌ ద్వారా బంగ్లాదేశ్‌లోని కాక్స్‌ బజారుకు వెళ్లి ఏడాదిపాటు నివాసం ఉన్నారన్నారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్‌లోనే ఉన్న మహమ్మద్‌ అరోబ్‌ అహ్మద్‌, సుమయ దంపతులను భారత్‌లో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని ఆశచూపి వారి నుంచి డబ్బులు వసూలు చేశారన్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత నూర్‌ మహమ్మద్‌ భార్య రిజ్వానాతో కలిసి అరోబ్‌ అహ్మద్‌, సుమయలను తీసుకుని ధర్మానగర్‌, త్రిపుర బార్డర్‌ ద్వారా రాత్రివేళ భారత్‌లోకి చొరబడి తెల్లవారే సరికి అగర్తలా చేరుకుని సికింద్రాబాద్‌కు రైలు ద్వారా వచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు చెందిన అయూబ్‌ ఫాంహౌజ్‌ నర్సింగ్‌తండాలో ఉండటంతో అక్కడ పనికి చేరారని తెలిపారు. నలుగురు ఫాంహౌజ్‌లోనే ఉంటూ పదిరోజుల క్రితం ఏజెంట్‌ ద్వారా నూర్‌ తన భార్య రిజ్వానాను బంగ్లాదేశ్‌కి పంపించినట్లు డీఎస్పీ వెల్లడించారు. నలుగురు రోహింగ్యాలు ఉన్నారని అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ నాగార్జునగౌడ్‌, రాజాపూర్‌ ఎస్‌ఐ శివానందగౌడ్‌ ఫాంహౌజ్‌కు వెళ్లి పరిశీలించగా ముగ్గురిని గుర్తించి మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు ముగ్గురిని అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి రిమాండ్‌కు పంపిస్తామని స్పష్టం చేశారు. పరారీలో ఉన్న రిజ్వానాను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. కాగా రిజ్వానా ఫేక్‌ ఆధార్‌ కార్డు, బర్త్‌ సర్టిఫికెట్‌ను చార్మినార్‌ వద్ద తీసుకున్నట్లు తెలుస్తుందని, అందుకు సహకరించిన వారిపై సైతం కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. భారత్‌లోకి చొరబడేందుకు, నకిలీ పాస్‌పోర్టు, వీసాలు సంపాదించేందుకు సహకరించిన వారిని సైతం విచారిస్తామన్నారు. స్థానికంగా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. జిల్లాలో ఉన్న ఫాంహౌజ్‌లు, హోటళ్లు, అన్నింటిపైనా నిఘా ఉంచి అనుమానాస్పదంగా ఉండే వారిని అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.

వివరాలు వెల్లడించిన

మహబూబ్‌నగర్‌ డీఎస్పీ

వెంకటేశ్వర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement