మధ్యాహ్న భోజనంలో మెనూ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనంలో మెనూ తప్పనిసరి

Published Fri, Feb 21 2025 8:26 AM | Last Updated on Fri, Feb 21 2025 8:21 AM

మధ్యాహ్న భోజనంలో మెనూ తప్పనిసరి

మధ్యాహ్న భోజనంలో మెనూ తప్పనిసరి

● అంతకు ముందు జడ్చర్ల మండలం మాచారంలో రేషన్‌ దుకాణాన్ని ఆహార కమిషన్‌ సభ్యులతో కలిసి చైర్మన్‌ తనిఖీ చేశారు. ప్రతినెలా 18వ తేదీ వరకే రేషన్‌ సరకులు ఇవ్వకపోవడం, ఫిర్యాదుల బాక్స్‌ ఏర్పాటు చేయకపోవడాన్ని తప్పుపట్టారు. అంత్యోదయ లబ్ధిదారులకు పంచదార ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. జిల్లాలో 18వ తేదీ వరకు 80 శాతం లబ్ధిదారులు మాత్రమే రేషన్‌ సరకులు పొందారని.. మిగతా 20 శాతం లబ్ధిదారులకు అన్యాయం చేయడం సరికాదన్నారు. ఇకపై ప్రతి రేషన్‌ దుకాణంలో అవసరమైన నిల్వల కన్నా అదనంగా తీసుకుని 25వ తేదీ వరకు సరకులు ఇచ్చేలా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం గ్రామంలోని అంగన్‌వాడీ కేందాన్ని తనిఖీ చేశారు. చిన్నారులకు కూరగాయలతో కూడిన సాంబర్‌ వడ్డించాల్సి ఉండగా.. కేవలం సొరకాయ మాత్రమే తయారు చేయడాన్ని తప్పుపట్టారు. ఇళ్లల్లో ఇలాగే తింటారా అంటూ అంగన్‌వాడీ టీచర్‌ను ప్రశ్నించారు. కోడిగుడ్లు కొన్ని సాధారణ పరిమాణం కన్నా చిన్నవిగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. కోడిగుడ్ల కాంట్రాక్టర్‌నతో ఫోన్‌లో మాట్లాడి ఇకపై చిన్న గడ్లను సరఫరా చేయవద్దన్నారు. కోడిగుడ్లు చిన్నవిగా ఇచ్చినా ఎందుకు తీసుకుంటున్నారని అంగన్‌వాడీ టీచర్‌ను నిలదీశారు. విషయాన్ని సూపర్‌వైజర్‌కు వివరించామని బదులివ్వడంతో సీడీపీఓ, డీడబ్యుఓలపై అసహనం వ్యక్తంచేశారు. కాగా, గొల్లపల్లి వద్ద ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు ఆహార కమిషన్‌ చైర్మన్‌, సభ్యులకు స్వాగతం పలికారు.

పాలమూరు/జడ్చర్ల టౌన్‌/భూత్పూర్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్నం భోజనంలో ప్రభుత్వం ఇచ్చిన మెనూను వందశాతం తప్పనిసరిగా అమలుచేయాలని రాష్ట్ర ఆహార కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌లో గురువారం జిల్లాస్థాయి అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు అందించే భోజనంలో తాజా కూరగాయలు, సరకులను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. వంట గదులను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పాఠశాలలు, రెసిడెన్షియల్‌ వసతిగృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, రేషన్‌ దుకాణాల్లో అధికారుల వివరాలతో కూడిన బోర్డులతో పాటు ఫిర్యాదుల బాక్స్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్లు నాణ్యతగా ఉండాలన్నారు. గుడ్ల సైజ్‌ చిన్నగా ఉంటే వెనక్కి పంపించాలని తెలిపారు. రేషన్‌ దుకాణాల్లో అంత్యోదయ కార్డు కల్గిన వారికి చక్కెర, గోధుమలు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. 15 నుంచి 20వ తేదీ వరకు రేషన్‌ తీసుకునే వారికి బియ్యం కొరత లేకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో ఆహార కమిషన్‌ సభ్యులు ఆనంద్‌, గోవర్ధన్‌, కలెక్టర్‌ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్‌, మోహన్‌రావు, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, ఆర్డీఓ అనిల్‌, డీఎంహెచ్‌ఓ డా.కృష్ణ ఉన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లు నాణ్యతగా ఉండాలి

రాష్ట్ర ఆహార కమిషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి

భూత్పూర్‌ మండలంలోని తాటికొండ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం తయారుచేసిన మధ్యాహ్న భోజనాన్ని ఆహార కమిషన్‌ చైర్మన్‌ పరిశీలించారు. రోజు భోజనంలో అందిస్తున్న మెనూ గురించి విద్యార్ధులతో ఆరా తీశారు. కార్యక్రమాల్లో డీఎస్‌ఓ వెంకటేశ్‌, డీఈఓ ప్రవీణ్‌కుమార్‌, డీడబ్ల్యూఓ జరీనాబేగం, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శశికాంత్‌, సీడీపీఓలు ప్రభాకర్‌, శోభారాణి, ఎంపీడీఓ విజయ్‌కుమార్‌, డీటీ కిశోర్‌, ఎంఈఓ ఉషారాణి ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement