రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Published Sun, Feb 23 2025 1:01 AM | Last Updated on Sun, Feb 23 2025 12:59 AM

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ఆయిల్‌పాం సాగుపై రైతులు

దృష్టిసారించాలి

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి

తుమ్మల నాగేశ్వరరావు

వనపర్తి/కొత్తకోట రూరల్‌: దేశంలో ఉన్న మంచినూనె కొరతను అధిగమించి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగేందుకు రైతులు అత్యధికంగా ఆయిల్‌పాం సాగు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. దేవరకద్ర నియోజకవర్గంలోని సంకిరెడ్డిపల్లిలో ప్రీ యూనిక్‌ సంస్థ నిర్మించనున్న ఆయిల్‌పాం ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయిల్‌పాం రైతులతో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. దేశంలో వంటనూనెల లోటు భర్తీ చేయాలంటే 70 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేపట్టాల్సిన అవసరం ఉందని.. తక్కువ పెట్టుబడితో అధిక లాభం పొందే పంట ఆయిల్‌పాం మాత్రమే అన్నారు. ప్రస్తుతం ఆయిల్‌పాం గెలలు టన్నుకు రూ.20,487 ధర పలుకుతుందని త్వరలో రూ.25 వేలకు చేరుతుందని వివరించారు. ఆగష్టు 15 నాటికి కంపెనీ నిర్మాణం పూర్తిచేసి ప్రారంభిస్తామని.. అదేవిధంగా బీచుపల్లి వద్ద ఉన్న కంపెనీ మరమ్మతులు పూర్తిచేసి ఇదే సంవత్సరంలో వినియోగంలోకి తీసుకొస్తామని భరోసానిచ్చారు. జిల్లాలో 11 వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేసేలా చూడాలని కోరారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆయిల్‌పాం కంపెనీ నిర్మాణం ఎట్టకేలకు కార్యరూపం దాల్చిందని.. త్వరగా నిర్మాణం పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ ప్రతినిధులను కోరారు. ఆయిల్‌పాం సాగుతో ఏడాదికి ఎకరాకు రూ.1.50 లక్షల ఆదాయం వస్తుందని వివరించారు. అంతకుముందు పెద్దమందడి మండలం వెల్టూరులో ఆరోగ్య ఉప కేంద్ర భవనం, మోజర్లలో గోదాముల సముదాయానికి రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పెబ్బేరులో మరో వ్యవసాయ గోదాం, వ్యవసాయ కార్యాలయ అదనపు భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. అదేవిధంగా కాలిన మార్కెట్‌యార్డు గోదాం పునర్నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. రెవెన్యూ అదనపు కలెక్టర్‌ రెవెన్యూ జి.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం, వనపర్తి మార్కెట్‌యార్డు చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, దేవరకద్ర మార్కెట్‌యార్డు చైర్మన్‌ ప్రశాంత్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు, కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement