
ఉపాధి పనులకు వెళ్తూ.. మహిళా కూలీ మృతి
మహమ్మదాబాద్: ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తూ ఓ మహిళా కూలీ మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహమ్మదాబాద్కు చెందిన మాల జయమ్మ(55) ఉపాధి కూలీకి వెళ్లి కుటుంబాన్ని పోషించుకునేది. ఈ క్రమంలో శుక్రవారం సైతం పాంపాండ్ పనుల కోసం ట్రాక్టర్పై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే అకస్మాత్తుగా జయమ్మ సొమ్మ సిల్లిపడిపోగా.. వెంటనే ప్రాథమిక ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈమె వడదెబ్బ కారణంగా మృతిచెందిందా.. లేక అనారోగ్యంతో మృతిచెందిందా అన్నది తేలాల్సి ఉంది. జయమ్మకు భర్త జయప్రకాశ్, ఒక కుమారుడు ఉన్నారు. అధికారులు వివరాలు సేకరించి తగిన సహాయం చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.
కాంక్రీట్ మిషన్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
గద్వాల క్రైం: కాంక్రీట్ మిషన్ ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గద్వాల మండలం కొండపల్లికి చెందిన రైతు తెలుగు వెంకటన్న (53) మహిళా రైతు లక్ష్మితో కలిసి శుక్రవారం ఉదయం బ్యాంకు పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై పూడూరుకు బయలుదేరారు. 99వ ప్యాకేజీ కాల్వ వద్ద సీసీ పనులకు వినియోగిస్తున్న కాంక్రీట్ వాహనం వెనుక నుంచి వచ్చి ఢీకొట్టడంతో వెంకటన్నకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు కర్నూలు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మహిళకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
యువకుడి
బలవన్మరణం
మల్దకల్: ఉరేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన కుర్వ రామకృష్ణ (24)కు ఆరేళ్ల కిందట కృష్ణవేణితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో గద్వాలకు చెందిన ట్రాన్స్జెండర్ శ్రీవాణితో పరిచయం ఏర్పడింది. ఇటీవల వారి మధ్య మనస్పర్థలు రావడంతో శుక్రవారం తెల్లవారుజామున శ్రీవాణితో పాటు మరో ముగ్గురు ట్రాన్స్జెండర్లు ఇంటికి వెళ్లారు. అప్పటికే రామకృష్ణ ఉరేసుకొని వేలాడుతూ కనిపించడంతో వెంటనే ప్రత్యేక వాహనంలో చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ట్రాన్స్జెండర్ వేధింపులతోనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని.. మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గద్వాల ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. గతంలో జిల్లాకేంద్రంలో ట్రాన్స్జెండర్ వేధింపులతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మరువక ముందే మల్దకల్లో మరో సంఘటన చోటు చేసుకోవడం చర్యనీయాంశమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ నందికర్ వివరించారు.
ఇల్లు దగ్ధం..
త్రుటిలో తప్పిన ప్రమాదం
మక్తల్: వంట గ్యాస్ లీకేజీతో మంటలు చెలరేగి ఇల్లు దగ్ధమైన ఘటన మండలంలోని కర్నిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామంలో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల సందర్భంగా గ్రామానికి చెందిన రాంపూర్ నర్సింహులు తన ఇంట్లో కొంత భాగాన్ని బీరప్ప భక్తులకు అద్దెకిచ్చాడు. శుక్రవారం ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకేజీ ఏర్పడి మంటలు చెలరేగగా చుట్టుపక్కల వారు గమనించి ఆర్పివేశారు. అప్పటికే ఫ్యాన్, బీరువా, నిత్యావసర సరుకులతో పాటు ఇంటి పైకప్పు రేకులు కాలిపోయాయి.
విద్యుదాఘాతంతో
వ్యక్తి మృతి
మాగనూర్: విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మాగనూరు మండలంలోని అడవిసత్యారంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం సింధనూర్కు లక్ష్మణ్ (40) కొంతకాలంగా కృష్ణ మండలం చెక్పోస్టు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర వరికోత మిషన్కు డ్రైవర్గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం యాసంగి వరి కోతల నేపథ్యంలో అడవిసత్యారం గ్రామ శివారులో వరికోత పనులు సాగిస్తుండగా.. పొలంలోని విద్యుత్ వైర్లు మిషన్కు తాకడంతో దానిపై ఉన్న లక్ష్మణ్ విద్యుదాఘాతానికి గురై.. అక్కడికక్కడే మృతి చెందాడు. ముందుగా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసినా.. గ్రామంలో ఆనోటా ఈ నోటా పడి.. అందరికి తెలిసింది. దీంతో మృతదేహాన్ని మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

ఉపాధి పనులకు వెళ్తూ.. మహిళా కూలీ మృతి