
నిరుద్యోగుల కోసమే ‘రాజీవ్ యువ వికాసం’
మంచిర్యాలటౌన్/జైపూర్: నిరుద్యోగ యువత ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించిందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నగర పాలక సంస్థ కార్యాలయంలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లను, జైపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ల ప్రత్యేక కౌంటర్ను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర వెనుకబడిన తరగతుల నిరుద్యోగ యువత ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఈ పథకం ద్వారా చేయూత అందించడం జరుగుతుందన్నారు. అర్హులైన వారు ఈనెల 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రూ.50 వేల లోపు రుణం 100 శాతం మాఫీ, రూ.లక్షలోపు రుణం తీసుకుంటే 90 శాతం రాయితీ, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు తీసుకుంటే 80 శాతం రాయితీ, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు తీసుకుంటే 70 శాతం రాయితీ లభిస్తుందని వివరించారు. రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణాల ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులకు ఏమైనా సలహాలు, సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. లేఅవుట్ క్రమబద్ధీకరణలో భాగంగా ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లింపుదారులకు అవగాహన కల్పించి, సకాలంలో చెల్లించేలా చర్యలను తీసుకోవాలని ఆదేశించారు.
● కలెక్టర్ కుమార్ దీపక్
ప్రతీ లబ్ధిదారుడికి సన్న బియ్యం
నస్పూర్: జిల్లాలో తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతీ లబ్ధిదారుడికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. నస్పూర్ పట్టణంలోని పలు రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీని పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావుతో కలిసి ప్రారంభించారు. పేదల కడుపు నింపడానికే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ కార్యాక్రమం చేపట్టిందని తెలిపారు. అధికారులు సమన్వయంతో లబ్ధిదారులకు బియ్యం అందేలా చూడాలన్నారు. రేషన్ దుకాణాల వద్ద కళాజాత బృందాలు ప్రభుత్వ పథకాలను పాటల రూపంలో వివరించారు.
రేషన్ షాపు తనిఖీ..
జైపూర్ మండల కేంద్రంలోని రేషన్ షాపును జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మరావుతో కలిసి తనిఖీ చేశారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోందని తెలిపారు. లబ్ధిదారులందరికీ సన్న బియ్యం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో సత్యనారాయణ, మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు, ఏపీవో బాలయ్య, సంబంధిత అధికారులు ఉన్నారు.

నిరుద్యోగుల కోసమే ‘రాజీవ్ యువ వికాసం’