తండ్రి వచ్చేలోపే.. తనువు చాలించింది | - | Sakshi
Sakshi News home page

తండ్రి వచ్చేలోపే.. తనువు చాలించింది

Published Mon, Apr 14 2025 12:24 AM | Last Updated on Mon, Apr 14 2025 12:24 AM

తండ్రి వచ్చేలోపే.. తనువు చాలించింది

తండ్రి వచ్చేలోపే.. తనువు చాలించింది

● అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య ● అదనపు కట్నం కోసం టార్చర్‌.. ● పలుమార్లు పెద్దల పంచాయితీ ● అయినా తీరు మారకపోవడంతో బలవన్మరణం ● దండేపల్లిలో ఘటన.. కేసు నమోదు

దండేపల్లి: అత్తింటి వారి అదనపు కట్నం వేధింపులు ఓ వివాహితను బలి తీసుకున్నాయి. పెళ్లి జరిగి ఎనిమిదేళ్లయినా.. అత్తింటి వారి అదనపు కట్నం దాహం తీరలేదు. నాలుగేళ్లుగా భర్తతోపాటు అత్త, మామ, బావ, మరిది వేధింపులను తట్టుకుంది. ఆరు నెలల క్రితం ఆడపిల్ల పుట్టడంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. అయినా అత్తింటివారి తీరు మారలేదు. చివరకు సున్నిత మనస్కు రాలైన ఆ వివాహిత చావే శరణ్యనుకుంది. ఉరేసుకుని తనువు చాలించింది. దీంతో ఆరేళ్ల బాబు, ఆరు నెలల పాప తల్లిలేనివారయ్యారు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఆదివారం జరిగింది. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నా... ఎస్సై తహాసీనొద్దీన్‌ కథనం ప్రకారం.. దండేపల్లికి చెందిన గంగధరి మల్లేశ్‌కు, జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం యశ్వంత్‌రావుపేటకు చెందిన వరలక్ష్మి అలియాస్‌ మేఘన(38)తో 2017లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.4 లక్షల కట్నం, 4 తులాల బంగారం, ఇతర సామగ్రి ఇచ్చారు. పెళ్లయిన నాలుగేళ్ల వరకు వీరి కాపురం బాగానేసాగింది. కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న భక్త మల్లేశ్‌కు అదనపు కట్నం కావాలన్న ఆశ పుట్టింది. అప్పటి నుంచి భార్యను వేధిస్తున్నాడు. అతనికి తల్లి, తండ్రి లక్ష్మి, నర్సయ్యతోపాటు అన్న, తమ్ముడు తోడయ్యారు. కుటుంబమంతా వేధించడంతో వరలక్ష్మి భరించలేకపోయింది. ఈ విషయం పుట్టింటివారికి చెప్పడంతో ఏడాది క్రితం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. నచ్చజెప్పి మళ్లీ కాపురానికి పంపించారు.

ఆరు నెలల క్రితం పాపకు జననం..

ఈ క్రమంలో వరలక్ష్మి రెండోసారి గర్భందాల్చింది. ఆరు నెలల క్రితం పాపకు జన్మనిచ్చింది. దీంతో అదనపు కట్నం వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. రోజు రోజుకూ వేధింపులు పెరుగుతుండడంతో భరించలేకపోయింది. పది రోజుల క్రితం భీవండిలో ఉండే తన తండ్రి రాజమల్లుకు ఫోన్‌ చేసి చెప్పింది. తాను యశ్వంత్‌రావ్‌పేటకు వచ్చిన తర్వాత.. దండేపల్లికి వస్తానని, పుట్టింటికి తీసుకువస్తానని నచ్చజెప్పాడు. శనివారం స్వగ్రామానికి వచ్చిన రాజమల్లు ఆదివారం భార్య అమ్మాయితో కలిసి దండేపల్లిలోని కూతురు ఇంటికి వెళ్లాడు. కూతురు కనిపించకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా చీరతో ఉరేసుకుని కనిపించింది. కన్నబిడ్డను విగతజీవిగా చూసిన తల్లిదండ్రులో బోరున విలపించారు. పుట్టింటికి తీసుకుపోతానంటిని కద బిడ్డా.. అంటూ తండ్రి విలపించిన తీరు అందరినీ కన్నీరు పెట్టించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన కూతురు చావుకు కారకులైన అల్లుడు, అతని తల్లిదండ్రులు, అన్న, తమ్ముడిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తండ్రి రాజమల్లు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

తల్లి ప్రేమకు దూరమైన చిన్నారులు..

వరలక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె కుమారుడు శ్రీనాథ్‌, కూతురు శరణ్య తల్లిప్రేమకు దూరమయ్యారు. తల్లి ఏమైందో కూడా ఆ చిన్నారులకు తెలియడం లేదు. కనీసం ఆ తల్లికి ఆత్మహత్య చేసుకునే ముందు తన పిల్లలైన గుర్తుకు రాలేదా అని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement