
మొక్క.. ఏది లెక్క?
రామాయంపేట(మెదక్): రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో హరితహారం నిధులు రూ. లక్షలు దుర్వినియోగం అయ్యాయి. పట్టణంలో అధికారులు రెండు నర్సరీలను ఏర్పాటు చేశారు. మార్కెట్ కమిటీ కార్యాలయం వెనుక భాగంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో గతంలో ఒకటి ఏర్పాటు చేశారు. ఈ నర్సరీలో మొక్కల సంరక్షణ పేరిట రూ. లక్షలు ఖర్చు చేశారు. నర్సరీ చుట్టూ ఫెన్సింగ్ వేసి గేటు, ఆర్చ్ నిర్మించారు. ెమొక్కలకు నీరు పారించడానికి ప్రత్యేకంగా వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి బోరు తవ్వించారు. ఇందులో వేల సంఖ్యలో మొక్కలు నాటినట్లు ప్రకటించారు. నాటిన మొక్కలను పట్టణ వాసులకు పంపిణీ చేసినట్లు చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే నామమాత్రంగా వార్డుకు ఒకరిద్దరికి పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఈనర్సరీలో నాటిన మొక్కలు కొన్ని ఎండిపోయాయి. ఏమైందో తెలియదు కాని కేవలం నీటి వసతి లేదనే కారణంతో ఈ నర్సరీని వదిలేసి దీని స్థానంలో వెంకటేశ్వర కాలనీలో మరో నర్సరీ ఏర్పాటు చేశారు. దీనిలో కూడా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటినట్లు అధికారులు చెప్పారు. అక్కడ ప్రస్తుతం పదుల సంఖ్యలో మాత్రమే మొక్కలున్నాయి. ఈ నర్సరీ చుట్టూ ఫెన్సింగ్, బోరు తవ్వకం, ఆర్చ్ నిర్మాణం కోసం బడ్జెట్లో మళ్లీ రూ. ఐదు లక్షల వరకు కేటాయించారు. కాగా మొదటి నర్సరీ కోసం ఖర్చు చేసిన నిధులు రూ. లక్షలు బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. రహదారి పక్కనే ఉన్న నర్సీరీని వదిలివేయడంతో సామగ్రి దొంగలపాలవుతోంది. వెంకటేశ్వర కాలనీలో ఏర్పాటు చేసిన నర్సరీలో కేవలం పదుల సంఖ్యలో మొక్కలు ఉండగా, గతంలో బోరు తవ్వించారు. ఈ నర్సరీ చుట్టూ ఫెన్సింగ్, ఆర్చ్, వాటర్ ట్యాంక్ నిర్మాణానికి రూ. ఐదు లక్షలు ఇటీవల జరిగిన మున్సిపల్ సమావేశంలో మంజూరు చేశారు. ముందుగా ఏర్పాటు చేసిన నర్సరీ నిరుపయోగంగా వదిలేయడంతో పాటు రెండో నర్సరీలో తక్కువ సంఖ్యలో మొక్కలు ఉండగా, వీటి నిర్వహణ పేరిట ఖర్చు చేసిన రూ. లక్షలు దుర్వినియోగం అయ్యాయి. ఈవిషయమై పట్టణ వాసులు మాట్లాడుతూ.. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నర్సరీల పేరిట
రూ. లక్షలు దుర్వినియోగం
పాత నర్సరీని పునరుద్ధరిస్తాం
మున్సిపాలిటీ పరిధిలో జాతీయ రహదారి పక్కనే గతంలో ఏర్పాటు చేసిన నర్సరీలో నీటి వసతి లేకపోవడంతో తాత్కాలికంగా పక్కన పెట్టాం. గతేడాది వెంకటేశ్వర కాలనీలో ఏర్పాటు చేసిన నర్సరీలో ఇంకా అవసరమైన మొక్కలు నాటి వాటిని పూర్తి స్థాయిలో సంరక్షిస్తాం. నిధుల దుర్వినియోగం విషయమై తన దృష్టికి రాలేదు. తన హయాంలో నిధుల దుర్వినియోగం జరగలేదు. దీనిపై విచారణ జరిపిస్తాం.
– దేవేందర్, మున్సిపల్ కమిషనర్

మొక్క.. ఏది లెక్క?

మొక్క.. ఏది లెక్క?
Comments
Please login to add a commentAdd a comment