
నటి నయనతార సరోగసి పద్ధతి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. నయనతార ఈ వ్యవహారంలో నిబంధనలను పాటించారా? లేదా? అన్న విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది. కారణం సరోగసి విధానంతో అద్దె తల్లి ద్వారా పిల్లలను కనడం అన్న అంశంపై ఈ ఏడాది జనవరిలోనే నిషేధం విధించారు. అలాంటిది గత జూన్ నెలలో నయనతార దర్శ కుడు విఘ్నేష్ శివన్ను పెళ్లి చేసుకున్నారు. నాలుగు నెలల్లోనే నయనతార ఈ జంట సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు కావడం వివాదంగా మారింది. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సైతం నయన్ దంపతులను వివరణ కోరింది.
(చదవండి: నయనతార-విగ్నేశ్ సరోగసి వివాదంలో కీలక మలుపు)
నివేదికలో బిగ్ ట్విస్ట్..: అయితే తాజాగా నయన్ దంపతులు తమిళనాడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. అందులో ప్రభుత్వానికి బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ జంట 6 ఏళ్ల క్రితమే చట్టబద్ధంగా రిజిష్టర్ వివాహం చేసుకున్నట్లు అఫిడవిట్లో వెల్లడించినట్లు సమాచారం. తమిళనాడు ఆరోగ్య శాఖకు సమర్పించిన అఫిడవిట్లో ఈ విషయాన్ని తెలిపింది. వివాహానికి సంబంధించిన పత్రాలన్నింటినీ అఫిడవిట్తో పాటు అధికారులకు సమర్పించినట్లు తెలుస్తోంది.
నిబంధనలు ఉల్లంఘించలేదు: సరోగసీ (నియంత్రణ) చట్టం 2021 ప్రకారం పెళ్లైన జంట ఐదు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలు దాటాక మాత్రమే సరోగసీని ఎంచుకోవడానికి అర్హులు. అద్దె తల్లి దంపతులకు దగ్గరి బంధువు అయి ఉండాలని కూడా చట్టం చెబుతోంది. అలాగే సరోగేట్ మదర్ యూఏఈకి చెందిన నయనతార బంధువే అని అఫిడవిట్లో పేర్కొన్నారు. కవలలు జన్మించిన చెన్నై ఆసుపత్రికి కూడా అధికారులు ఇండెంట్ పెట్టారు. తాము ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదని.. అన్ని నియమాలను పాటించామని నయన్ దంపతులు అఫిడవిట్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment