రాజ్‌ తరుణ్‌ 'పురుషోత్తముడు' సినిమా రివ్యూ | Raj Tarun Starrer Purushothamudu Movie Review In Telugu | Sakshi
Sakshi News home page

Purushothamudu Movie: పురుషోత్తముడిగా రాజ్‌తరుణ్‌.. సినిమా ఎలా ఉందంటే?

Jul 26 2024 1:38 PM | Updated on Jul 26 2024 1:54 PM

Raj Tarun Starrer Purushothamudu Movie Review In Telugu

టైటిల్‌: పురుషోత్తముడు
నటీనటులు: రాజ్‌ తరుణ్‌, హాసిని సుధీర్‌, ప్రకాశ్‌ రాజ్‌, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ముకేశ్‌ ఖన్నా తదితరులు
దర్శకుడు: రామ్‌ భీమన
నిర్మాతలు: రమేశ్‌ తేజావత్‌, ప్రకాశ్‌‌ తేజావత్‌
విడుదల తేదీ: 26 జూలై, 2024

ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావా, కుమారి 21 ఎఫ్‌ వంటి సూపర్‌ హిట్స్‌ అందుకున్న రాజ్‌ తరుణ్‌ గత కొంతకాలంగా ఫ్లాప్స్‌తో కొట్టుమిట్టాడుతున్నాడు. చాలాకాలంగా ఇతడికి మంచి హిట్‌ లేదు. మంచి బ్రేక్‌ కోసం ఎదురుచూస్తున్న ఈ హీరో కొంచెం గ్యాప్ తీసుకొని పురుషోత్తముడు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టీజర్‌, ట్రైలర్‌ పర్వాలేదనిపించాయి. ప్రమోషన్స్‌ కూడా గట్టిగానే చేయడంతో ఓ మోస్తరు హైప్‌ క్రియేట్‌ అయింది. మరి ఈ రోజు (జూలై 26న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..

కథ
రచిత రామ్‌ (రాజ్‌ తరుణ్‌) లండన్‌లో చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వస్తాడు. అతడిని తన కంపెనీకి సీఈవో చేయాలని తండ్రి (మురళీ శర్మ) భావిస్తాడు. అయితే కంపెనీ నిబంధన ప్రకారం.. సీఈవో కావాలంటే ముందు ఆ వ్యక్తి వంద రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లాలి. ఆ విషయాన్ని రామ్‌ పెద్దమ్మ (రమ్య కృష్ణ) అందరికీ గుర్తు చేస్తుంది. ఆ కంపెనీలో తనకు 50 శాతం వాటా ఉండటంతో రామ్‌ అజ్ఞాతంలోకి వెళ్లక తప్పదు. రాజమండ్రి దగ్గర్లోని కడియపులంక అనే గ్రామానికి ఒంటరిగా వెళ్లిపోతాడు.

ఆ గ్రామంలో నర్సరీ నడుపుతున్న అమ్ములు (హాసిని సుధీర్‌) దగ్గర పనిలో చేరతాడు. ఆ గ్రామంలోని రైతుల్ని స్థానిక ఎమ్మెల్యే, అతని కుమారుడు ఇబ్బందులకు గురి చేస్తారు. దీంతో వారు రామ్‌ సాయం కోరతారు. మరోవైపు రామ్‌ వివరాలను బయటకు తెలియజేసి తను సీఈవో కాకుండా అడ్డుకోవాలని పెద్దమ్మ, ఆమె కుమారుడు (విరాన్‌ ముత్తం శెట్టి) కుట్ర పన్నుతారు. తమ మనుషులతో అతడి ఆచూకీ కోసం గాలిస్తుంటారు. మరి రామ్‌ సీఈవో అయ్యాడా? ఆ రైతుల కోసం ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే?
హీరోకు వందల కోట్ల ఆస్తి ఉన్నా అవన్నీ వదిలేసి సాధారణ జీవితం గడుపుతుంటాడు.. ఈ క్రమమంలో పేద ప్రజల జీవన విధానం, కష్టాలు తెలుసుకుని చలించిపోతాడు. వారికి సాయం చేస్తాడు.. ఈ పాయింట్‌తో శ్రీమంతుడు, బిచ్చగాడు, పిల్ల జమీందార్‌.. ఇలా పలు తెలుగు చిత్రాలు వచ్చాయి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ కూడా ఇదే! కథ రొటీన్‌ అయినా తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు.

కానీ పాత కథే కావడంతో సినిమా చూస్తున్నంతసేపు అవే గుర్తుకు వస్తుంటాయి. కథనం కూడా ఊహకు తగ్గట్లే సాగిపోతుంది. ఫస్టాఫ్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. సెకండాఫ్‌ సాగదీతగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు సహజంగా ఉండకుండా సినిమాటిక్‌గా అనిపిస్తాయి. సినిమా అంతా కూడా పెద్దగా ట్విస్టుల్లేకుండా సాఫీగా సాగిపోతుంది. సినిమాటోగ్రఫీ, సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదనిపించాయి. చివర్లో ప్రకాశ్‌ రాజ్‌ చెప్పిన డైలాగులు బాగా పేలాయి. రన్‌ టైం రెండు గంటలే ఉండటం ప్లస్‌ పాయింట్‌.

ఎవరెలా చేశారంటే?
రామ్‌ పాత్రకు రాజ్‌ తరుణ్‌ న్యాయం చేశాడు. హీరోయిన్‌ హాసిని సుధీర్‌ అందంతో మెప్పించింది. నటనలోనే ఇంకాస్త ఇంప్రూవ్‌ అవ్వాలి. రమ్యకృష్ణ ఎప్పటిలాగే హుందాగా నటించింది. ప్రకాశ్‌ రాజ్‌, విరాన్‌ ముత్తం శెట్టి, మురళీ శర్మ.. తమ పాత్రల్లో లీనమైపోయారు. మిగతావారు పర్వాలేదనిపించారు.

 

చదవండి: ఆ షోలో అన్నీ నిజమే.. నన్ను తేళ్లు కుట్టాయి: నటి

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement