Serial Actor Manoj React On Shameerpet Gunfire Incident, Video Viral - Sakshi
Sakshi News home page

శామీర్‌పేట్‌ ఘటనలో ఊహించని ట్విస్ట్‌.. ఈ కేసుతో సంబంధం లేదన్న నటుడు

Published Sat, Jul 15 2023 5:56 PM

Serial Actor Manoj React On Shameerpet Gunfire Incident - Sakshi

శామీర్‌పేట్‌ కాల్పుల ఘటనలో ఊహించని ట్విస్ట్‌ చోటు చేసుకుంది. సిద్దార్థ్‌పై నటుడు మనోజ్‌ కాల్పులు జరిపాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటనతో తనకెలాంటి సంబంధం లేదంటూ వీడియో రిలీజ్‌ చేశాడు నటుడు మనోజ్‌. గన్‌ ఫైర్‌ కేసుతో తనకు సంబంధం లేదని, ప్రస్తుతం తాను బెంగళూరులో ఉన్నానని వెల్లడించాడు.

శామీర్‌పేట్‌ సెలబ్రిటీ రిసార్ట్‌లో కాల్పులు జరిపిన మనోజ్‌ నాయుడు తాను కాదని స్పష్టం చేశాడు. కొంతమంది తన ఫోటోలు, వీడియోలు వాడుతూ అసత్య ప్రచారం చేస్తున్నారని, ఈ తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరాడు. నిజానిజాలు తెలుసుకోకుండా తనపై అసత్య ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని తెలిపాడు.

అనవసరంగా తనపై చేయని నేరాన్ని మోపుతున్నారంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఆవేదన వ్యక్తం చేశాడు మనోజ్‌. 'ఈరోజు ఉదయం నుంచి నాపై అసత్య వార్తను ప్రచారం చేస్తున్నారు. మనోజ్‌ అనే ఓ వ్యక్తి గన్‌ ఫైర్‌ చేసినందుకు అతడి స్థానంలో నా పేరు, ఫోటోలు వాడుతున్నారు. ఆఖరికి నా సీరియల్‌ క్లిప్పింగ్స్‌ కూడా వాడుతున్నారు. ముందూవెనకా తెలుసుకోకుండా ఇలా ఎలా చేస్తారు? రెండు రోజులుగా నేను బెంగళూరులో ఉన్నాను. హైదరాబాద్‌లో ఏం జరుగుతుందనేది కూడా నాకు తెలియదు. నా గురించి అసత్య ప్రచారం చేసి నా పరువుకు భంగం కలిగించారు. ఇది నా జీవితం, కెరీర్‌పై ఎంతగానో దుష్ప్రభావం చూపుతుంది. దీనిపై త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేస్తాను' అని చెప్పుకొచ్చాడు.

అసలేం జరిగిందంటే..
శామీర్‌పేట్ సెలబ్రిటీ రిసార్ట్‌లోని విల్లాలో సిద్ధార్థ దాస్‌పై కాల్పులు జరిగాయి. మూడేళ్లుగా సిద్ధార్ధ్‌దాస్‌ భార్యతో మనోజ్ సహజీవనం చేస్తున్నాడు. 2019లో భర్త సిద్ధార్ధ్‌ దాస్‌తో విడిపోయిన స్మిత విడాకుల కోసం కూకట్‌పల్లి కోర్టులో దరఖాస్తు చేసింది. దాంతో పాటు తాను నివాసం ఉంటున్న వైపు భర్త రాకుండా ఇంజక్షన్ ఆర్డర్‌ కూడా స్మిత తెచ్చుకుంది. మనోజ్‌తో కలిసి ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీని ఏర్పాటు చేసిన స్మిత.. సెలబ్రిటీ రిసార్ట్స్‌లోని తాముంటున్న ఇంట్లోనే ఆఫీస్ ఏర్పాటు చేశారు. పిల్లలతో పాటు స్మిత, మనోజ్ కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు.

ఇటీవల మనోజ్‌.. స్మిత కుమారుడు 17 ఏళ్ల బాలుడిని కొట్టాడు. ఈ విషయాన్ని బాలుడు తన తండ్రి సిద్దార్థ్‌కు చెప్పాడు. తన చెల్లెలిని కూడా వేధిస్తున్నారని పేర్కొన్నాడు. దీంతో పాపను తీసుకెళ్లడానికి ఈ రోజు(శనివారం) ఉదయం సిద్ధార్థ్‌ దాస్ విల్లాకు చేరుకున్నాడు. సిద్ధార్థ్‌ వెంట పాపని పంపడం ఇష్టం లేక స్మిత అతడితో గొడవకు దిగింది. దీంతో ముగ్గురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మనోజ్ ఎయిర్ గన్ తీసుకొని కాల్పులు జరిపాడు. సిద్ధార్థ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చదవండి: శామీర్‌పేట్‌ ఘటన.. అందమైన అమ్మాయిలకు ట్రాప్‌
ఛీ.. అంత నల్లగానా.. హీరోయిన్‌ను అందరిముందే అవమానించిన స్టార్‌ హీరో

 
Advertisement
 
Advertisement