
పవన్ కల్యాణ్ హీరోగా పరిచయం అవుతున్న సరికొత్త సినిమా 'ఏ స్టార్ ఈజ్ బార్న్'. ఈ సినిమా ద్వారా ప్రియా పాల్, నేహా శర్మ, ఊహ రెడ్డి హీరోయిన్లుగా టాలీవుడ్కు పరిచయమవుతున్నారు. ఈ సినిమాకు వీజే సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. సీఆర్ ప్రొడక్షన్స్, వీజే ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్పై రవి సాగర్, వీజే సాగర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని "నా గతమే' అనే పాటను తండేల్ మూవీ డైరెక్టర్ చందు మొండేటి విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ... "నా గతమే సాంగ్ బాగుంది. పోస్టర్స్, ప్రోమోస్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ కావడంతో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరికి మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. కాగా.. ఈ సినిమాను తెలంగాణలోని వనపర్తి, కొల్లాపూర్, సోమశిల, జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ సినిమాలో దాదాపు 93 మంది కొత్త నటీనటులు ఉండడం విశేషం. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతమందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర టీజర్, ట్రైలర్ విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు.