
38 ఏళ్ల క్రితం ‘నాయకుడు’తో బాక్సాఫీస్ని షేక్ చేశారు దర్శకుడు మణిరత్నం, హీరో కమల్ హాసస్. ఆ తర్వాత ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రమే ‘థగ్ లైఫ్’(Thug Life Review). ఈ హై ఓల్టేజ్ గ్యాంగ్స్టర్ డ్రామాలో శింబు కీలక పాత్ర పోషించారు. త్రిష, అభిరామి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 5) ఈ చిత్రం రిలీజైంది. దాదాపు 38 ఏళ్ల తర్వాత మణిరత్నం-కమల్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.
‘థగ్ లైఫ్’ కథేంటంటే..?
ఢిల్లీకి చెందిన రంగరాయ శక్తిరాజు(కమల్ హాసన్) ఒక గ్యాంగ్స్టర్. తన అన్న మాణిక్యం(నాజర్)తో కలిసి మరో గ్యాంగ్స్టర్ సదానందం(మహేశ్ మంజ్రేకర్)తో ఒక సెటిల్మెంట్కి వెళ్తాడు. అక్కడికి పోలీసులు రావడంతో కాల్పులు జరుగుతాయి. దీంతో రంగరాయ శక్తిరాజు అమర్(శింబు) అనే చిన్నారిని అడ్డుపెట్టుకొని అక్కడి నుంచి తప్పించుకుంటాడు. తన ప్రాణాలను కాపాడినందుకు అమర్ని పెంచి పెద్ద చేస్తాడు. తన నేర సామ్రాజ్యానికి అమర్ని కీలక శక్తిగా మారుస్తాడు. కొన్నాళ్ల తర్వాత అమర్నే అనుమానిస్తాడు రంగరాయ శక్తిరాజు(Thug Life Review).
అదే సమయంలో రంగరాయ శక్తిరాజే తన తండ్రిని చంపాడని అమర్కి తెలుస్తుంది. దీంతో రంగరాయ శక్తిరాజును చంపేందుకు ప్రయత్నిస్తాడు. మరి అమర్ ప్రయత్నం ఫలించిందా? సొంత అన్న మాణిక్యం కూడా రంగరాయ శక్తిరాజుని చంపేందుకు ఎందుకు ప్రయత్నించారు? అసలు అమర్ తండ్రిని చంపిందెవరు? చిన్నప్పుడే తప్పిపోయిన చెల్లెలు చంద్ర(ఐశ్వర్య లక్ష్మీ) మళ్లీ అమర్ని కలిసిందా? సొంత తమ్ముడిలా పెంచిన అమరే తన ప్రాణాలను తీసేందుకు కుట్ర చేశాడనే విషయం తెలిసిన తర్వాత రంగరాయ శక్తిరాజు ఏం చేశాడు? భార్య లక్ష్మీ(అభిరామి), కూతురు మంగ(సంజన) కోసం శక్తిరాజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఈ కథలో త్రిష పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
మణిరత్నం-కమల్ కాంబినేషన్లో ఓ సినిమా అంటే అంచనాలు పెరగడం సర్వ సాధారణం. అందుకే ‘థగ్ లైఫ్’పై కమల్ ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులు కూడా మొదటి నుంచి భారీ ఆశలు పెట్టుకున్నారు. దానికి తోడు ప్రమోషన్స్లో కమల్ ‘ఈ చిత్రం ‘నాయకుడు’ కంటే పెద్ద హిట్ అవుతుంది’ అని చెప్పడంతో సాధారణ ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతోనే సినిమాకు వెళ్లారు. వారి అంచనాలను అందుకోవడంలో మణిరత్నం సఫలం కాలేదనే చెప్పాలి. ఓ రొటీన్ గ్యాంగ్స్టర్ కథనే కమల్తో చెప్పించాడు. కథనంలో కూడా కొత్తదనం లేదు.
సినిమా చూస్తున్నంతసేపు మణిరత్నం తెరకెక్కించిన ‘నవాబ్’ చిత్రమే గుర్తుకొస్తుంది. అందులో వచ్చే ట్విస్టులు కొంతమేర ఆకట్టుకుంటాయి. ఇందులో అదీ కూడా ఉండదు. ఓ సాధారణమైన గ్యాంగ్స్టర్ కథకి ఫ్యామిలీ ఎమోషన్స్ని యాడ్ చేసి ‘థగ్ లైఫ్’ ని తీర్చిదిద్దాడు మణి.
సాధారణ కథనైనా తెరపై ఎంతో అద్భుతంగా చూపించే సత్తా ఉన్న మణిరత్నం.. ఈ కథ, అందులో రాసుకున్న పాత్రలు, వాటిని తీర్చిదిద్దిన విధానం చూస్తే నిజంగానే ఇది మణి సినిమానేనా అనే అనుమానం కలుగుతుంది. కమల్తో పాటు ఏ ఒక్కరి పాత్రను కూడా బలంగా రాసుకోలేకపోయాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎక్కడా ట్విస్టులూ ఉండవు. ఊహకందేలా కథనం సాగుతుంది. అయితే ఎప్పటి మాదిరే నిజాయితీగా కథను చెప్పే ప్రయత్నం చేశాడు.
‘ఇది యముడికి నాకు జరిగే కథ’ అని కమల్ పాత్రలో చెప్పిస్తూ సినిమాను ప్రారంభించారు దర్శకుడు. కీలక పాత్రల పరిచయం వరకు కథనం ఆసక్తికరంగానే సాగుతుంది. తన అన్న మాణిక్యం కూతురు ఆత్మహత్య చేసుకోవడం.. దానికి కారణమైన వ్యక్తిని కాల్చి చంపి శక్తిరాజు జైలుకు వెళ్లిన తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది.
అమర్ మారిపోవడం.. ఆధిపత్య పోరుతో శక్తిరాజుని చంపేందుకు చేసే కుట్ర ఇవ్వన్నీ రొటీన్గా ఉన్నా.. మధ్యలో వచ్చే ఫ్యామిలీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కమల్-అభిరామి మధ్య వచ్చే సన్నివేశాలను రొటీన్ కథనంతో విగిసిపోతున్న ప్రేక్షకులకు ఉపశమనం కలిగిస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై కాస్త ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం మరింత రొటీన్గా సాగుతుంది. రివేంజ్ డ్రామా అంత ఆస్తికరంగా అనిపించదు. క్లైమాక్స్ కూడా రొటీన్గానే ఉంటుంది.
ఎవరెలా చేశారంటే..
కమల్ నటన గురించి ఎం చెప్పగలం. ఎలాంటి పాత్రల్లోనైనా జీవించగలడు. రంగరాయ శక్తిరాజు పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. అయితే కమల్ గతంలో అలాంటి పాత్రలు చాలా చేడయంతో తెరపై చూసినప్పుడు కొత్తగా అనిపించదు. అలాగే యాక్షన్ సన్నివేశాలు కూడా కమల్ పాత చిత్రాలను గుర్తుకు చేస్తాయి. అమర్ పాత్రకు శింబు న్యాయం చేశాడు. అయితే ఆ పాత్రని మరింత బలంగా తీర్చిదిద్దితే బాగుండేదేమో. మాణిక్యంగా నాజర్ రొటీన్ పాత్రే చేశాడు.
ఇక శక్తిరాజు భార్య లక్ష్మీగా అభిరామి ఉన్నంతలో బాగానే నటించింది. త్రిష పాత్రకు అంతగా ప్రాధాన్యత ఉండదు. మణిరత్నం- కమల్ సినిమా కాబట్టే ఆ పాత్ర చేయడానికి త్రిష ఒప్పుకుందేమో. పోలీస్ ఆఫీసర్గా అశోక్ సెల్వరాజ్, శక్తిరాజు టీంలో కీలక వ్యక్తి పత్రాస్గా జోజు జార్జ్ తో పాటు తనికెళ్ల భరణి, ఐశ్వర్య లక్ష్మీ, మహేశ్ మంజ్రేకర్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతికంగా సినిమా బాగుంది. ఈ సినిమాకు ప్రధాన బలం ఏఆర్ రెహమాన్. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. యాక్షన్ సన్నివేశాలకు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం అదిరిపోయింది. పాటలు పర్వాలేదు. రవి.కె.చంద్రన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో కట్ చేయాల్సిన సీన్లు చాలా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్