
తెలుగు పరిశ్రమలో హారర్ ట్రెండ్ నడుస్తోందా? అనేలా ప్రస్తుతం ఆ జానర్ సినిమాలు ఎక్కువగా రూపొందుతున్నాయి. జనరల్గా స్టార్ హీరోలు ఈ జానర్ చిత్రాల్లో కనిపించడం తక్కువ. అయితే ప్రభాస్లాంటిపాన్ ఇండియా స్టార్ కూడా ఈ తరహా సినిమాలో నటించడం ఓ విశేషం. ఇక... హారర్ జానర్లో రానున్న సినిమాల గురించి తెలుసుకుందాం.
భయపెట్టే రాజాసాబ్
వరుస పాన్ ఇండియన్ చిత్రాలతో యమా జోరుగా దూసుకెళుతున్నారు హీరో ప్రభాస్. తన కెరీర్లో ఇప్పటివరకూ లవర్ బాయ్గా, యాక్షన్ హీరోగా నటించారాయన. అంతేకాదు... పలు సినిమాల్లో తనదైన శైలిలో భావోద్వేగాలు, వినోదం పంచిన ఆయన తొలిసారి ‘రాజా సాబ్’ చిత్రంతో ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రాజా సాబ్’. ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
రొమాంటిక్ హారర్ జానర్లో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని హారర్ జానర్ కావడంతో ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ‘రాజా సాబ్‘ సినిమాతో ప్రేక్షకులకు ఎవర్ గ్రీన్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు మారుతి.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. ఈ నెల 16న ‘రాజా సాబ్’ టీజర్ విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే విడుదల పలుమార్లు వాయిదా పడింది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు మేకర్స్.
హారర్ కనకరాజు
హీరో వరుణ్ తేజ్ తొలిసారి ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘వీటీ 15’ (వర్కింగ్ టైటిల్). మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ , ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్స్ మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇండో–కొరియన్ హారర్ కామెడీగా ఈ సినిమా రూపొందుతోంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ హారర్ కామెడీ చిత్రంలో మొదటి సారి ఆడియన్స్ని భయపెట్టనున్నారు వరుణ్ తేజ్.
ఈ చిత్రం తొలి షెడ్యూల్ను హైదరాబాద్, ద్వితీయ షెడ్యూల్ను అనంతపురంలో జరిపారు మేకర్స్. అనంతపురం పరిసరాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో వరుణ్ తేజ్, రితికా నాయక్పై పల్లెటూరి నేపథ్యంలో చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాలో హైలైట్గా నిలుస్తాయట. హారర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో తనదైన శైలిలో వినోదాన్ని జోడించారట మేర్లపాక గాంధీ. హైదరాబాద్లో వేసిన ఓ ప్రత్యేకమైన సెట్లో వరుణ్ తేజ్ పాల్గొనగా ఓ స్పెషల్ సాంగ్ను చిత్రీకరించారట. ఈ సాంగ్లో ఆయన సరసన దక్షా నగార్కర్ స్టెప్స్ వేశారని టాక్. తర్వాతి షెడ్యూల్ కొరియాలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ‘కొరియన్స్ కనకరాజు’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట మేకర్స్.
రైల్వే కాలనీలో దెయ్యం
ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ‘అల్లరి’ నరేశ్ ఈ మధ్య సీరియస్ కథలు ఎంచుకుంటున్నారు. తాజాగా ఆడియన్స్ని భయపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘12 ఏ రైల్వే కాలనీ’. ‘మా ఊరి ΄పొలిమేర, మా ఊరి ΄పొలిమేర 2’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన అనిల్ విశ్వనాథ్ ‘12 ఏ రైల్వే కాలనీ’ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించడంతో పాటు షో రన్నర్గా వ్యవహరిస్తున్నారు. నాని కాసరగడ్డ దర్శకత్వం వహిస్తున్నారు. కామాక్షి భాస్కర్ల, సాయికుమార్ కీలక పాత్రలుపోషిస్తున్నారు.
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. హారర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. ‘ఈ ఆత్మలు కొంతమందికే ఎందుకు కనిపిస్తాయి రా.. అందరికీ ఎందుకు కనిపించవు’ అనే డైలాగ్స్తో మొదలైన ఈ టీజర్ ఉత్కంఠగా సాగింది. ప్రాణాలతో బయటకుపోవుడు అవసరం లేదన్న...!’ అంటూ టీజర్ చివర్లో నరేశ్ చెప్పే డైలాగులు ఆక ట్టుకునేలా ఉన్నాయి. టీజర్ని బట్టి చూస్తే దెయ్యాలు, ఆత్మలు కనిపించే వ్యక్తి పాత్రలో నరేశ్ కనిపించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
కిష్కింధపురిలో...
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కిష్కింధపురి’. ‘రాక్షసుడు’ వంటి చిత్రం తర్వాత హీరో శ్రీనివాస్, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్స్ జోడీగా నటిస్తున్న రెండో చిత్రం ఇది. ‘చావు కబురు చల్లగా’ ఫేమ్ డైరెక్టర్ కౌషిక్ పెగల్లపాటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.
ఈ సినిమా పూర్తి స్థాయి హారర్ నేపథ్యంలో ఉంటుందట. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్పోస్టర్కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి దశకు చేరుకుందని టాక్. ‘భైరవం’ ప్రమోషన్స్లో ఉన్న సాయి శ్రీనివాస్ ఆ తర్వాత ‘కిష్కింధ పురి’ చిత్రీకరణలో జాయిన్ కానున్నారట. వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి జూలై లేదా ఆగస్టు నెలలో ఈ సినిమాని విడుదల చేయనున్నారట మేకర్స్.
ఏ మిస్టిక్ వరల్డ్
ఆది సాయికుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘శంబాల’. ‘ఏ మిస్టిక్ వరల్డ్’ అనేది ఉపశీర్షిక. యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. తమిళ, మలయాళ భాషల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి స్వాసిక ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో భౌగోళిక శాస్త్రవేత్త పాత్రలో ఆది కనిపించనున్నారు.
ండియన్ సిల్వర్ స్క్రీన్పై ఇదివరకెన్నడూ టచ్ చేయని పాయింట్తో, కాల్పనిక ప్రపంచంలో జరిగే అద్భుతమైన ఘట్టాలతో ప్రేక్షకులన్ని సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ సినిమా ఉంటుందని చిత్రయూనిట్ ప్రకటించింది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయట. అదే విధంగా ఈ చిత్రంలోని భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయని చిత్రబృందం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
΄పొలిమేరలో ట్విస్టులు
‘సత్యం’ రాజేశ్ ప్రధాన పాత్రలో హారర్, చేతబడి నేపథ్యంలో రూపొందిన ‘మా ఊరి ΄పొలిమేర’ (2021), ‘మా ఊరి ΄పొలిమేర 2’ (2023) సినిమాలు హిట్గా నిలిచాయి. దీంతో ‘΄పొలిమేర 3’కి శ్రీకారం చుట్టారు మేకర్స్. తొలి, ద్వితీయ భాగాలకి దర్శకత్వం వహించిన అనిల్ విశ్వనాథ్ మూడో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. ‘సత్యం’ రాజేశ్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, ‘చిత్రం’ శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
వంశీ నందిపాటి ఎంటర్టైన్స్ మెంట్ బ్యానర్పై భోగేంద్ర గుప్తాతో కలిసి వంశీ నందిపాటి ఈ సినిమా రూపొందిస్తున్నారు. తొలి, మలి భాగాల్లానే హారర్, చేతబడి అంశాలతో పాటు ప్రస్తుతం సమాజంలోని ఓ బర్నింగ్ ఇష్యూని టచ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పైగా తొలి రెండు భాగాలతోపోలిస్తే ‘΄పొలిమేర 3’లో ప్రేక్షకులకు ఊహకందని ట్విస్టులు ఉంటాయని ‘సత్యం’ రాజేశ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ మధ్య విడుదలైన ‘΄పొలిమేర 3’ వీడియో గ్లింప్స్కి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ
వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటి వరలక్ష్మీ శరత్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పోలీస్ కంప్లెయింట్’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నవీన్ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి వంటి వారు కీలక పాత్రలుపోషిస్తున్నారు. ఎమ్ ఎస్కే ప్రమిదశ్రీ ఫిలిమ్స్, శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్లపై సింగపూర్ బాలకృష్ణ, మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్నారు. హారర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
‘‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. మనం చేసే ప్రతి చర్యకి ఫలితంగా అదే తిరిగి మనకు వస్తుందనే కాన్సెప్ట్తో హారర్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమాని సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. హారర్ చిత్రాల్లో మా సినిమా విభిన్నంగా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణగారి మీద స్పెషల్ సాంగ్ చిత్రీకరించారు మేకర్స్. ‘‘ఆ పాట సినిమాకే మెయిన్ హైలెట్గా నిలవడంతో పాటు అందరికీ గుర్తుండిపోయేలా ఉంటుంది’’ అని మేకర్స్ ప్రకటించారు.
మదర్ సెంటిమెంట్... హారర్
సుమన్ బాబు ముఖ్య పాత్రపోషించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఎర్రచీర– ది బిగినింగ్’. కారుణ్య చౌదరి హీరోయిన్గా నటించగా, రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని, అయ్యప్ప పి.శర్మ కీలక పాత్రలుపోషించారు. బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్–శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రోడక్షన్స్ పై నిర్మించిన ఈ సినిమా హారర్, మదర్ సెంటిమెంట్, యాక్షన్ అంశాలతో రూపొం దింది.
‘‘ఈ కథలో మదర్ సెంటిమెంట్ ఆకట్టుకునేలా ఉంటుంది. క్లైమాక్స్ ఎపిసోడ్, ఎక్కువ మంది అఘోరాలతో శివుడిని చూపిస్తూ షూట్ చేసిన సీక్వెన్స్ బాగా వచ్చాయి. 45 నిముషాల పాటు ఉండే గ్రాఫిక్స్ చాలా హైలైట్గా నిలుస్తాయి. ప్రేక్షకులకు ఈ చిత్రం అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. హారర్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. మా ‘ఎర్రచీర’ కూడా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అంటూ చిత్రయూనిట్ పేర్కొంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
పీరియాడిక్ డ్రామా
కన్నడ నటుడు గణేశ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పినాక’. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ బి. ధనంజయ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. హారర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం టీజర్ని విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో క్షుద్ర, రుద్ర పాత్రల్లో కనిపించనున్నారు గణేశ్. ఈ చిత్రం ప్రేక్షకులకు మరిచిపోలేని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తుందని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది.