
తమిళ హీరో విష్ణు విశాల్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈయన పలు చిత్రాల్లో కథానాయకుడిగా నటించి విజయాలు అందుకున్నారు. అలాగే ఎఫ్ఐఆర్ వంటి భారీ చిత్రాలను నిర్మించిన విష్ణు విశాల్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నారు. కాగా తాజాగా విష్ణు విశాల్ నిర్మాత రాహుల్కు చెందిన రోమియో పిక్చర్స్, కేవీ దురైలతో కాలి తన విష్ణు విశాల్ స్టూడియో పతాకంపై ఓహో ఎందన బేబీ అరే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా తన పెదనాన్న కొడుకు రుద్రను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈయన ఇంతకుముందు దర్శకుడు ఏఆర్ మురుగదాస్ వద్ద దర్బార్ తదితర చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారన్నది గమనార్హం.
అలాగే నటుడు విష్ణు విశాల్ నిర్మించిన చిత్రాల నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు. కాగా ఓహో ఎందన బేబీ చిత్రంలో నటుడు విష్ణు విశాల్ కూడా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో నటి మిథులా భాస్కర్ నాయకిగా నటిస్తున్నారు. దీనికి నటుడు కష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలైలో తెరపైకి రావడానికి ముస్తాబు అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు, దర్శక నిర్మాతలు శుక్రవారం చైన్నెలో మీడియాతో ముచ్చటించారు.
విష్ణు విశాల్ మాట్లాడుతూ..‘ ఇది పూర్తిగా రొమాంటిక్ ఎంటర్టైనర్. మా పెదనాన్న కొడుకు రుద్ర ఇందులో హీరోగా నటిస్తున్నాడు. తనకు చిన్నప్పటి నుంచి సినిమా రంగంపై ఆసక్తి ఉంది. పెదనాన్న ప్రోత్సాహంతోనే నేను కూడా నటుడిని అయ్యాను. రుద్ర కూడా అలానే ఇండస్ట్రీలోకి వచ్చాడు. నేను ఇప్పటి వరకు 21 సినిమాల్లో హీరోగా నటించాను కానీ ఒక్క ముద్దు సీన్ కూడా లేదు. కానీ రుద్ర మాత్రం తొలి చిత్రంలోనే హీరోయిన్తో మూడు ముద్దు సన్నివేశాల్లో నటించాడు(నవ్వూతూ..). ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది. జులైలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం’అన్నారు.