ముమ్మరంగా సహాయక చర్యలు
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. దోమలపెంట జేపీ బేస్ క్యాంప్ కార్యాలయంలో సహాయక బృందాల అధికారులతో కలెక్టర్, ఎస్పీ వైభవ్, ఇరిగేషన్ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎన్డీఆర్ఎఫ్ అధికారి సుఖేండు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, ఆర్మీ అధికారులు కల్నల్ పరీక్షిత్ మెహ్రా, కల్నల్ అమిత్ కుమార్ గుప్తా, సింగరేణి మైన్స్ రెస్క్యూ అధికారి బలరాం, హైడ్రా అధికారులు, జేపీ కంపెనీ ప్రతినిధులతో టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది ఆక్సిజన్ అందుబాటులో ఉంచారని, సహాయ చర్యలను మరింత వేగవంతం చేయాలని కోరారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద యుద్ధ ప్రాదిపదికన సహాయక చర్యలు చేపడుతున్నా బీఆర్ఎస్ నాయకులు రాజకీయ లబ్ధి కోసం బురద జల్లుతున్నారని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. సంఘటన జరిగిన కొన్ని గంటల నుంచే ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నా శవ రాజకీయాలు చేయడం దారుణమన్నారు. గత ప్రభుత్వ హయాంలో చాలా చోట్ల సంఘటనలు జరిగినా.. అప్పటి సీఎం కేసీఆర్, మంత్రులు ఎవరూ కూడా పరామర్శించలేదన్నారు. ప్రతిపక్ష నాయకులు పరామర్శించడానికి వెళ్తే అడ్డుకుని అరెస్టులు చేయించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ నాయకులకు ప్రాజెక్టులపై అవగాహన లేదని మాట్లాడటం సరైంది కాదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏడేళ్లలో 25 కి.మీ., సొరంగం పనులు పూర్తి చేస్తే బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కేవలం 5 కి.మీ., మాత్రమే సొరంగం పనులు చేపట్టారని గుర్తుచేశారు.
రాజకీయ లబ్ధి కోసమే..
Comments
Please login to add a commentAdd a comment