సొరంగంలో ర్యాట్‌ మైనర్స్‌ | - | Sakshi
Sakshi News home page

సొరంగంలో ర్యాట్‌ మైనర్స్‌

Published Mon, Mar 10 2025 10:20 AM | Last Updated on Mon, Mar 10 2025 10:18 AM

సొరంగ

సొరంగంలో ర్యాట్‌ మైనర్స్‌

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో 13.85 కి.మీ. వద్ద జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు మొత్తం 18 బృందాలు పని చేస్తున్నాయి. 16 రోజులుగా నిరంతరం సహాయక చర్యలు చేపడుతున్నా వారి ఆచూకీ లభ్యం కావడం లేదు. సొరంగంలో 13 కి.మీ. అవతల సొరంగ పైకప్పు కుప్పకూలడంతో సుమా రు 18 ఫీట్ల ఎత్తులో 200 మీటర్ల విస్తీర్ణం వరకూ మట్టి, బురద, శిథిలాలు మేట వేశాయి. మట్టిని తొలగిస్తే పైనుంచి మరింత కుంగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఇన్‌లెట్‌ టన్నెల్‌లో ఎలాంటి ఆడిట్‌, ఎస్కేప్‌ టన్నెల్స్‌ లేకపోవడం, నిత్యం నీటి ఊట, బురద ఉంటుండటంతో ఇంతటి క్లిష్ట పరిస్థితి ఎక్కడా చూడలేదని రెస్క్యూ నిపుణులు అంటున్నారు. ఆయా రెస్క్యూ బృందాలతో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ బృందం వినూత్న పద్ధతిలో సేవలు అందిస్తోంది.

రైల్వేలైన్లు, రహదారుల పనుల్లో సేవలు..

మేఘాలయా, ఈశాన్య రాష్ట్రాల్లోని బొగ్గు గనుల్లో ఎలుక బొరియలుగా సొరంగాలు తవ్వుతూ ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ బొగ్గును బయటకు వెలికితీస్తారు. ప్రమాదకరమైన ఈ మైనింగ్‌ను సుప్రీంకోర్టు నిషేధించింది. అయితే రైల్వే లైన్ల నిర్మాణం, జాతీయ రహదారులు, రోడ్ల నిర్మాణంలో వీరు సేవలందిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. సాధారణంగా రోడ్డు, రైల్వేలైన్‌ కిందుగా పైప్‌లైన్‌ వేయాలంటే జేసీబీల సాయంతో తవ్వుతూ రోడ్డును కట్‌ చేయాల్సి ఉంటుంది. ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ రవాణాకు ఆటంకం కలిగించకుండా, రోడ్డును తవ్వాల్సిన పని లేకుండానే కింద నుంచి సొరంగం తవ్వి పైప్‌లైన్‌ వేస్తారు. నిత్యం రద్దీగా ఉండే ఢిల్లీ రోడ్లపై వాహనాల రాకపోకలు కొనసాగుతుండగానే, రోడ్డు కింద నుంచి సొరంగం తవ్వి పైప్‌లైన్‌ వేయడంలో వీరి సేవలు విశేషంగా ఉపయోగపడుతున్నాయి.

దారి ఏర్పాటు చేస్తూ

తవ్వకాలు..

ప్రమాద స్థలంలో సుమారు 8 మీటర్ల మేర మట్టి, బురద, మిషిన్‌ శిథిలాలు మేట వేసి ఉన్నాయి. బురద, కాంక్రీట్‌ కలసి గట్టిగా ఉంది. ఒక్క పక్కగా దారి ఏర్పాటు చేస్తూ తవ్వకాలు కొనసాగిస్తున్నాం. రోజంతా అక్కడే ఉండి పనులు నిర్వహిస్తున్నాం.

– మహమ్మద్‌ రషి,

ర్యాట్‌హోల్‌ మైనర్‌ సభ్యుడు

వినూత్న సేవలందిస్తున్న 24 మంది సభ్యులు

కార్మికుల జాడ కోసం నిరంతరం అన్వేషిస్తున్న బృందం

రాత్రింబవళ్లు ప్రమాదస్థలంలోనే

తవ్వకాలు జరుపుతున్న వైనం

తవ్విన కొద్దీ ఊటనీరు వస్తోంది..

మేం మొత్తం 24 మంది ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ బృందం రెస్క్యూ పనుల్లో పాల్గొంటున్నాం. ఒక్కో షిప్టులో ఆరుగురు చొప్పున 24 గంటల పాటు ప్రమాద స్థలం వద్ద తవ్వకాలు జరుపుతున్నాం. ఇనుప కడ్డీలు, పారలతో మట్టిని తొలగించిన కొద్దీ ఊటనీరు పెరుగుతోంది.

– ఖలీల్‌ ఖరేషి,

ర్యాట్‌హోల్‌ మైనర్‌ సభ్యుడు

24 గంటల పాటు సొరంగంలోని ప్రమాద స్థలం వద్దే..

సొరంగంలో మట్టి కింద చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ బృందం గతనెల 25న రంగంలో దిగింది. మొత్తం 24 మంది సభ్యులు ఉండగా, వీరిలో ఎల్లప్పుడూ ఐదు, ఆరుగురు సొరంగంలోని ప్రమాదస్థలం వద్ద మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. కేవలం ఇనుప కడ్డీలు, తట్టా, పారల సాయంతో తవ్వకాలు చేపడుతూ, మట్టిని పక్కకు వేస్తున్నారు. టన్నెల్‌ నిండా మట్టి పేరుకుపోయిన నేపథ్యంలో రాడార్‌ గుర్తించిన చోటుతో పాటు అనుమానాస్పద ప్రాంతాల్లో తవ్వకాల చేపట్టి కార్మికుల జాడను అన్వేషిస్తున్నారు. వంతుల వారీగా సొరంగంలోకి వెళుతూ రాత్రింబవళ్లు ప్రమాద స్థలంలోనే తవ్వకాలు చేపడుతున్నారు. భోజనం సైతం అక్కడే చేస్తూ మళ్లీ తవ్వకాలకు ఉపక్రమిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సొరంగంలో ర్యాట్‌ మైనర్స్‌ 1
1/4

సొరంగంలో ర్యాట్‌ మైనర్స్‌

సొరంగంలో ర్యాట్‌ మైనర్స్‌ 2
2/4

సొరంగంలో ర్యాట్‌ మైనర్స్‌

సొరంగంలో ర్యాట్‌ మైనర్స్‌ 3
3/4

సొరంగంలో ర్యాట్‌ మైనర్స్‌

సొరంగంలో ర్యాట్‌ మైనర్స్‌ 4
4/4

సొరంగంలో ర్యాట్‌ మైనర్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement