బైక్‌ల చోరీకి పాల్పడుతున్న యువకుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

బైక్‌ల చోరీకి పాల్పడుతున్న యువకుల అరెస్ట్‌

Published Tue, May 2 2023 9:12 AM | Last Updated on Tue, May 2 2023 9:48 AM

బీబీనగర్‌: పోలీసులకు పట్టుబడిన యువకులు, బైకులు - Sakshi

బీబీనగర్‌: పోలీసులకు పట్టుబడిన యువకులు, బైకులు

బీబీనగర్‌: బైక్‌ల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు యువకులను సోమవారం తెల్లవారుజామున బీబీనగర్‌ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను భువనగిరి డీసీపీ రాజేష్‌చంద్ర విలేకరులకు ప్రెస్‌నోట్‌ ద్వారా వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన కర్రె వెంకటేష్‌, పొలగాని వంశీ సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆశతో బైక్‌ల చోరీకి పాల్పడుతున్నారు.

సోమవారం ఉదయం వారిద్దరూ తాము దొంగిలించిన రెండు బైక్‌లతో గూడూరు టోల్‌ప్లాజా గుండా హైదరాబాద్‌ వైపు వెళ్తున్నారు. అదే సమయంలో టోల్‌ ప్లాజా వద్ద బీబీనగర్‌ ఎస్‌ఐ సైదులు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు వారిద్దరిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకొని విచారించగా, బైక్‌లను దొంగిలించినట్లు వారు ఒప్పుకున్నారు. దీంతో నిందితులతో పాటు వారు దొంగిలించిన బైక్‌లను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా ఇటీవల నిందితులు దొంగిలించిన మరో ఐదు బైకులను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ పేర్కొన్నారు.

సూర్యాపేటలో మరొకరు..
సూర్యాపేట క్రైం:
జల్సాలకు అలవాటుపడి బైక్‌ల దొంగతనానికి పాల్పడుతున్న బైక్‌ మెకానిక్‌ను సోమవారం సూర్యాపేట పట్టణంలో పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం సూర్యాపేట పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ నాగభూషణం విలేకరులకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల మండల కేంద్రానికి చెందిన పందిరి ప్రదీప్‌రెడ్డి అలియాస్‌ చింటు బైక్‌ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడిన అతడు ఇటీవల హుజూర్‌నగర్‌లో బైక్‌ చోరీ చేసి జైలుకు వెళ్లి వచ్చాడు.

అయినప్పటికీ తన తీరు మార్చుకోకుమండా మళ్లీ బైక్‌ల దొంగతనాలకు పాల్పడుతున్నాడు. కాగా సూర్యాపేట పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో బైక్‌ను అపహరించిన అతడు కొత్త బస్టాండ్‌ వద్ద దానిని విక్రయించేందుకు సోమవారం బేరసారాలు ఆడుతుండగా పక్కా సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సూర్యాపేట, నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ పట్టణాల్లో మొత్తం 11 బైక్‌లను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడని డీఎస్పీ తెలిపారు. 11 బైకులను స్వాధీనం చేసుకుని.. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో సీఐ రాజశేఖర్‌, ఎస్‌ఐ శ్రీనివాస్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ గొర్ల కృష్ణ, గోదేషి కరుణాకర్‌, సైదులు, ఆనంద్‌, మధు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సూర్యాపేట క్రైం: నిందితుడిని, బైక్‌లను చూపుతున్న డీఎస్పీ నాగభూషణం, సిబ్బంది 1
1/1

సూర్యాపేట క్రైం: నిందితుడిని, బైక్‌లను చూపుతున్న డీఎస్పీ నాగభూషణం, సిబ్బంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement