రుణమాఫీ.. కాదాయే!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తన పంట రుణం రూ.3 లక్షలకు ఉందని.. ప్రభుత్వం తన రుణాన్ని మాఫీ చేయలేదని, రుణమాఫీ చేయించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని శాలిగౌరారం మండలం అంబర్పేట్ గ్రామానికి చెందిన రైతు తోట యాదగిరి శుక్రవారం హైదరాబాద్లోని గాంధీభవన్ మెట్ల వద్ద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ స్పందించి సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి, జిల్లాకలెక్టర్ ద్వారా తన రుణాన్ని మాఫీ చేయించేందుకు చర్యలు చేపట్టాలని వేడుకున్నారు. పైగా తమకు ఎలాంటి ఫించన్ రాలేదని, ధాన్యం బోనస్ కూడా రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆవేదన రైతు తోట యాదగిరి ఒక్కరిదే కాదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.2 లక్షల రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న దాదాపు లక్ష మంది రైతులదీ అదే పరిస్థితి.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్న హామీని ఇంతవరకు పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. వివిధ కారణాలతో రూ.లక్షలోపు రుణమాఫీ కాని రైతులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దాదాపు 35 వేల మంది వరకు ఉండగా, రూ.2 లక్షలు, ఆపై రుణాలు కలిగిన రైతులు దాదాపు లక్ష మంది వరకు ఉన్నారు. వారందరికి సంబంధించిన రుణాలేవీ ఇంతవరకు మాఫీ కాలేదు.
నల్లగొండలోనే అత్యధికం
● ఉమ్మడి జిల్లాలో చూస్తే రుణమాఫీ కాని రైతులు నల్లగొండలోనే అత్యధికంగా ఉన్నారు. నల్లగొండ జిల్లాలో 2024 జూలై 18వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు నాలుగు విడతల్లో 2,33,981 మంది రైతులకు సంబంధించిన రూ.2,004 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. అయితే అందులోనూ డాటా నాట్ ఫౌండ్, బ్యాంకుల నుంచి వివరాలు వ్యవసాయ శాఖకు అందక, బ్యాంకుల పేరు మార్పు వంటి కారణాలతో జిల్లాలో రుణమాఫీ కానీ వారు 15 వేల వరకు ఉండొచ్చని ఒక అంచనా. ఇక రూ.2 లక్షలకు పైగా రుణాలు కలిగిన రైతులు మరో 50 వేల మంది వరకు ఉన్నట్లు తెలిసింది.
● సూర్యాపేట జిల్లాలో నాలుగు విడతల్లో 1,10,359 మంది రైతులకు సంబంధించిన రూ.906.07 కోట్లు మాఫీ అయ్యాయి. వివిధ కారణాలతో మరో 14,599 మంది రైతులకు సంబంధించిన రూ.2 లక్షలలోపు రుణాల మాఫీ ఇంకా పెండింగ్లోనే ఉంది. మరోవైపు 2 లక్షలకు పైబడి రుణాలు ఉన్న రైతులు 30 వేల మంది ఉన్నట్లు అంచనా.
● యాదాద్రి జిల్లాలో రూ.2 లక్షలలోపు రుణాల మాఫీ కోసం దాదాపు 20 వేల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. డాటా నాట్ ఫౌండ్ పేరుతో రుణమాఫీ కాని వారు కూడా ఐదారు వేల మంది ఉండొచ్చని అంచనా.
డాటా నాట్ ఫౌండ్, తదితర కారణాలతో..
డీసీసీబీలో రుణాలు తీసుకున్న కొందరు రైతుల వివరాలు వ్యవసాయ శాఖకు అందలేదు. దీంతో వారికి రుణాలు మాఫీ కాలేదు. దానికి తోడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు చెందిన కొన్ని బ్రాంచీల్లో రుణాలు తీసుకున్న వారి డాటా ఇప్పటికీ నాట్ ఫౌండ్ కిందే ఉంది. దీంతో ఆ రైతులకు సంబంధించిన రూ.లక్షలోపు రుణమాఫీ కూడా కాలేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఇటీవల తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మారడంతోనూ కొంతమంది రుణమాఫీ పెండింగ్లో పడిపోయింది. ఇలా పలు రకాల కారణాలతో రుణాలు మాఫీ కాని రైతులు ఉమ్మడి జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నారు. డాటా నాట్ ఫౌండ్, బ్యాంకు పేరు మార్పుతో పెండింగ్లో పడిన వారే కాకుండా రూ.2 లక్షలకు పైగా రుణాలకు సంబంధించిన తదుపరి కార్యాచరణను ప్రభుత్వం ప్రకటించలేదు.
ఫ రూ.2 లక్షల వ్యవసాయ రుణ మాఫీ కోసం రైతుల ఎదురుచూపు
ఫ వివిధ కారణాలతో ఉమ్మడి జిల్లాలో సుమారు లక్షమంది రైతులకు అందని మాఫీ
ఫ ప్రభుత్వం నుంచి వెలువడని ప్రకటన.. ఆందోళనలో రైతులు
ఫ హైదరాబాద్లోని గాంధీభవన్ మెట్లపై కూర్చొని శాలిగౌరారం రైతు నిరసన
టీజీబీ రుణాలు మాఫీ కావాల్సి ఉంది
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ).. తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మారింది. దీంతో సాంకేతిక సమస్య వచ్చింది. ఆ బ్యాంకులో రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ కావాల్సి ఉంది. అది ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
– శ్రావణ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి
రుణమాఫీ.. కాదాయే!
Comments
Please login to add a commentAdd a comment