
కేఎంసీ మానవతా విలువలు నేర్పింది
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కళాశాల ఎంతో మందికి మానవతా విలువలు నేర్పిందని రిటైర్డ్ డీజీపీ డాక్టర్ డీటీ నాయక్ అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం(అలుమ్ని) ఆధ్వర్యంలో రెండురోజుల పాటు నిర్వహించే నిరంతర వైద్యవిజ్ఞాన సదస్సు, అలుమ్ని మీట్ శనివారం కళాశాలలో ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన కేఎంసీ పూర్వ విద్యార్థి డాక్టర్ డీటీ నాయక్ మాట్లాడుతూ తాను ఈ జిల్లాకు చెందినవాడినేనని, అందుకే ఈ ప్రాంతమంటే తనకు ప్రత్యేక అభిమానముందన్నారు. త్యాగమంటే ఈ ప్రాంతం వారిదేనన్నారు. ఏకంగా రాజధానినే ఈ ప్రాంతం త్యాగం చేసిందని, అందుకే ప్రతిఫలంగా కేఎంసీ దక్కిందన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారని, ఎక్కడికి వెళ్లినా కేఎంసీ పేరు వినిపిస్తుందని తెలిపారు. మాజీ ఎంపీ డాక్టర్ ఎంవీ మైసూ రా రెడ్డి మాట్లాడుతూ తాను నాలుగు దశాబ్దాల క్రితం 1966 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థిగా ఈ కాలేజీలో చదివాననన్నారు. అప్పట్లో వైద్యవిద్యార్థి సంఘం నాయకునిగా తాను ఎన్నికై నట్లు గుర్తు చేసుకున్నారు.
● అమెరికాలో స్థిరపడిన పూర్వ విద్యార్థి, గైనకాలజిస్టు డాక్టర్ గురురాజ మాట్లాడుతూ ఈ కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహకరించాలని, ఒక్కరు ఇవ్వడం మొదలు పెడితే అందరూ ముందుకు వస్తారని సూచించారు. అనంతరం దేశ, విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులచే నిరంతర వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు డీఎంహెచ్వో డాక్టర్ పి. శాంతికళ, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ బి.కుమారస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రిటైర్డ్ డీజీపీ డాక్టర్ డీటీ నాయక్
అట్టహాసంగా అలుమ్ని మీట్ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment