ఎత్తిపోతలు జరిగేనా..? | - | Sakshi
Sakshi News home page

ఎత్తిపోతలు జరిగేనా..?

Mar 31 2025 11:21 AM | Updated on Apr 1 2025 10:51 AM

ఎత్తి

ఎత్తిపోతలు జరిగేనా..?

‘పాలమూరు’ ద్వారా 4 టీఎంసీల నీటి పంపింగ్‌కు అనుమతులు

ఒక్కో మోటారు సామర్థ్యం

145

మెగావాట్లు

పాలమూరు ప్రాజెక్టు పంప్‌హౌజ్‌లో ఏర్పాటుచేసే మోటార్లు 9

మోటార్ల బిగింపు పూర్తి..

పాలమూరు ప్రాజెక్టులోని మొదటి లిఫ్టు అయిన ఎల్లూరు పంపుహౌజ్‌లో ఇప్పటి వరకు నాలుగు మోటార్ల బిగింపు పనులు పూర్తయ్యాయి. మరో నాలుగు మోటార్ల బిగింపునకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. రెండు మోటార్లకు విద్యుత్‌ సరఫరా, చార్జింగ్‌ వంటి పనులన్నీ పూర్తిచేశారు. డెలివరీ మెయిన్స్‌ కూడా దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన సమస్యలే ఎత్తిపోతలు పెండింగ్‌లో పడటానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రాజెక్టు వద్ద 400/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేస్తుండగా.. నిర్మాణం, విద్యుత్‌ సరఫరా పనులు నత్తనడకన సాగుతున్నాయి.

పంప్‌హౌజ్‌లో కొనసాగుతున్న పనులు

పూర్తికాని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణం

గతేడాది అక్టోబర్‌ నుంచి వాయిదా పడుతున్న వైనం

వచ్చే నెలలో తప్పనిసరిగాచేపడతామంటున్న అధికారులు

కొల్లాపూర్‌: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీటి పంపింగ్‌ నెలల తరబడి వాయిదా పడుతూ వస్తోంది. ప్రాజెక్టు పంప్‌హౌజ్‌ పనులు ముమ్మరంగా జరుగుతున్నా నీటి ఎత్తిపోతలు మాత్రం నోచుకోవడం లేదు. అయితే ఏప్రిల్‌ నెలలో తప్పనిసరిగా నీటి ఎత్తిపోతలు చేపడుతామని సంబంధిత అధికారులు చెబుతుండగా ఆచరణలో అమలుకు నోచుకుంటుందా.. లేదా.. అనేది సందేహంగా మారింది.

4 టీఎంసీలకు అవకాశం..

పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఐదేళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. 2023 సెప్టెంబర్‌ 16న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎల్లూరు సమీపంలోని మొదటి లిఫ్ట్‌ను ప్రారంభించగా.. ఒక మోటారు ద్వారా రెండు టీఎంసీల నీటిని నార్లాపూర్‌ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోశారు. తాగునీటి అవసరాల కోసం ఈ సీజన్‌లో నాలుగు టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. గతేడాది అక్టోబర్‌లోనే కృష్ణానది పరవళ్లు తొక్కగా.. నాటి నుంచి ఎత్తిపోతలు చేపడతామని అధికారులు చెబుతూ వస్తుండగా.. ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు.

ప్రభుత్వం దృష్టిసారిస్తేనే..

పాలమూరు ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ నీటి ఎత్తిపోతలు మాత్రం జరగడం లేదు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొదటి లిఫ్టు ద్వారా నీటి ఎత్తిపోతలు జరిగితే.. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలతోపాటు హైదరాబాద్‌కు తాగునీటి అవసరాలు తీరుతాయి. కేఎల్‌ఐ ప్రాజెక్టుపై ప్రస్తుతం ఉన్న భారం కూడా తగ్గుతుంది.

తగ్గుతున్న నీటి నిల్వలు..

శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌పై ఆధారపడి పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ ఫుల్‌గేజ్‌ లెవెల్‌ 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 837 అడుగుల దిగువకు నీటిమట్టం చేరింది. డ్యాంలో నీటి నిల్వ 58 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. బ్యాక్‌వాటర్‌ డెడ్‌ స్టోరేజీ 30 టీఎంసీలు. అప్పటి వరకు ప్రాజెక్టుల ద్వారా బ్యాక్‌వాటర్‌ను వినియోగించుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం తమ వాటాకు సంబంధించిన నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో.. శ్రీశైలం డ్యాంలో ఉన్న 28 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకునేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం కేఎల్‌ఐ ద్వారా రోజూ ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ డెడ్‌ స్టోరేజీకి చేరేలోగా పాలమూరు ప్రాజెక్టుకు కేటాయించిన నీటిని ఎత్తిపోసుకోవాలని నీటి పారుదలశాఖ అధికారులు భావిస్తున్నారు.

ఒక మోటారుతో రోజు ఎత్తిపోసే నీరు 3,000 క్యూసెక్కులు

ఈ సీజన్‌లో తాగునీటి అవసరాలకు అనుమతి ఉన్న నీటి వాటా

4 టీఎంసీలు

నార్లాపూర్‌

రిజర్వాయర్‌

నీటినిల్వ సామర్థ్యం 6.04 టీఎంసీలు

తుది దశకు పనులు..

ఎల్లూరు లిఫ్టు వద్ద నాలుగు మోటార్ల బిగింపు పూర్తయింది. సివిల్‌ వర్క్స్‌, డెలివరీ మెయిన్స్‌ పనులు తుది దశకు చేరాయి. అక్టోబర్‌ తర్వాత ఎత్తిపోతలు చేపట్టాలని భావించినా.. మోటార్ల బిగింపు, విద్యుత్‌ సరఫరా పనులు కొనసాగుతున్నందున సాధ్యం కాలేదు. తాగునీటి అవసరాలకు ఈ సీజన్‌లో 4 టీఎంసీలు ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్‌లో తప్పనిసరిగా ఎత్తిపోతలు చేపడుతాం.

– శ్రీనివాసరెడ్డి, ఈఈ, నీటి పారుదలశాఖ

ఎత్తిపోతలు జరిగేనా..? 1
1/3

ఎత్తిపోతలు జరిగేనా..?

ఎత్తిపోతలు జరిగేనా..? 2
2/3

ఎత్తిపోతలు జరిగేనా..?

ఎత్తిపోతలు జరిగేనా..? 3
3/3

ఎత్తిపోతలు జరిగేనా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement