పక్షి ఢీకొట్టిందా?  | Air India plane crash may have occurred due to bird hits or major technical fault | Sakshi
Sakshi News home page

పక్షి ఢీకొట్టిందా? 

Jun 13 2025 6:06 AM | Updated on Jun 13 2025 12:59 PM

Air India plane crash may have occurred due to bird hits or major technical fault

బోయింగ్‌ 787 ప్రమాదానికి అదే కారణమా? 

పక్షులు ఢీకొట్టి అనేక ప్రమాదాలు 

టేకాఫ్, ల్యాండింగ్‌లలోనే ఎక్కువ

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరిన బోయింగ్‌ 787–7 డ్రీమ్‌ లైనర్‌ విమాన ప్రమాద దుర్ఘటనలో.. ఇంకా కారణాలు నిర్ధారణ కానప్పటికీ పక్షి ఢీకొట్టడం వల్లే ఇది జరిగిందా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. భారత్‌లో 2015లో ఇలాంటి పెద్ద ప్రమాదం జరిగింది. కత్రా నుండి వైష్ణోదేవి ఆలయానికి వెళుతున్న హెలికాప్టర్‌.. రాబందు ఢీకొనటంతో పల్టీలు కొట్టి, మంటలు చెలరేగి పైలట్‌తో సహా ఏడుగురు చనిపోయారు. రన్‌వేపై లేదా గాల్లో పక్షులు ఢీకొనడం వల్ల గతంలో మనదేశంలో అనేక విమాన ప్రమాద దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుత ప్రమాదం జరిగిన అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో.. 2022తో పోలిస్తే 2023లో దాదాపు రెట్టింపునకు పైగా ఇలాంటి ప్రమాదాలు జరగడం గమనార్హం. 2022లో కేవలం 39 ప్రమాద ఘటనలే జరిగితే ఆ తరవాతి ఏడాది ఈ సంఖ్య 81కి పెరిగింది. 

ఢిల్లీ రన్‌వేపై 700సార్లు! 
పక్షులు ఢీకొన్న సంఘటనలు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యధికంగా జరిగాయి. 2018–2023 మధ్య ఆ రన్‌వేలపై 700 కేసులు నమోదయ్యాయి. 2023 డిసెంబరు 18న రాజ్యసభలో పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఇచ్చిన సమాధానం ప్రకారం.. భారతదేశంలో అ త్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలు వన్యప్రాణు లు, ప్రధానంగా పక్షుల బెడదతో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయని తెలుస్తోంది. గత ఏడాది ఎమిరేట్స్‌ విమానం ముంబైలో ఫ్లెమింగోల గుంపును ఢీకొట్టడంతో 39 పక్షులు చనిపోయాయి. 

పక్షులు తగిలితే ఎందుకు కూలిపోతాయి? 
నిజానికి పక్షుల తగిలినంత మాత్రానే విమానాలు కూలిపోవు. కొన్ని సందర్భాలలో ఇంజిన్‌ లేదా ఇతర భాగాలకు నష్టం వాటిల్లుతుంది. విమానాలు చాలా వేగంగా టేకాఫ్‌ అవుతాయి. పక్షులు, ముఖ్యంగా పెద్ద పక్షులు; ఇంజిన్‌ లేదా విండ్‌షిల్డ్‌లోకి ప్రవేశించే పక్షి సమూహాలు ఢీకొనడం వల్ల మాత్రం పెద్ద ముప్పే వాటిల్లవచ్చు. టేకాఫ్‌ దశలో ఇంజిన్‌ చాలా వేగంతో తిరుగుతున్నప్పుడు, విమానం తక్కువ ఎత్తులో ఉండగానే పక్షి ఢీకొన్నప్పుడు ఇంజిన్‌ ఫ్యాన్‌ బ్లేడ్‌లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీంతో ఇంజిన్‌ విఫలమై ప్రమాదం సంభవించవచ్చు. పక్షి ఢీకొట్టగానే పైలట్‌ దృష్టి చెదిరి ప్రమాదాలు జరుగుతుంటాయి.  

అన్ని పక్షులూ ముప్పుకాదు 
1966–1989 మధ్య కాలంలో తీవ్రమైన విమాన నష్టానికి కారణమైన పక్షుల జాబితాలో రాబందులు ఒకప్పుడు అగ్రస్థానంలో ఉండేవి. వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోవటంతో వాటి వల్ల ముప్పు తగ్గింది. నేడు ప్రధానంగా బ్లాక్‌ కైట్స్‌ (డేగ జాతి), గబ్బిలాలు, ల్యాప్‌విగ్‌ పక్షులు ప్రమాదం కలిగించే జాబితాలోకి చేరాయి. 2020 జూన్‌లో ‘డిఫెన్స్‌ లైఫ్‌’సైన్స్‌ జర్నల్‌ లో ‘భారతదేశంలో విమానాలకు వన్యప్రాణుల తాకిడి’అనే శీర్షికతో ప్రచురితమైన అధ్యయన పత్రం ప్రకారం.. ఈ మూడు జాతుల పక్షులే ఇప్పుడు ప్రధానంగా రన్‌వేపై విమాన ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. 2012–2018 మధ్య భారతదేశంలో 3,665 వన్యప్రాణుల తాకిళ్లు సంభవించినట్లు ఈ పత్రం పేర్కొంది. వీటిల్లో 385 ఘటనలు విమాన నష్టానికి కారణం అయ్యాయి. 2005–2018 మధ్య మూడు సైనిక విమానాలు కూలిపోవటానికి బ్లాక్‌ కైట్స్‌ పక్షులే కారణం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement