![Arvind Kejriwal asks for Gita home cooked food and belt in CBI custody delhi](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/27/ak-2.jpg.webp?itok=qMhs5st8)
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ మూడు రోజుల కస్టడీలోకి తీసుకుంది. ఈ కేసులో అవినీతి వ్యవహారం జరిగిందని, ఆయన్ని విచారించాల్సిన అవసరం ఉందని దర్యాప్తు సంస్థ అంటోంది. అయితే.. సీబీఐ కస్టడీలో తనకు కొన్ని ప్రత్యేక వసతులు కావాలని ఆయన విజ్ఞప్తి చేయగా.. అందుకు కోర్టు అనుమతి లభించింది.
ఇంటి భోజనానికి అనుమతించాలని, అలాగే.. కళ్లద్దాలు, డాక్టర్లు సూచించిన మందులు, చదువుకోవడానికి భగవద్గీత కావాలని కోరారు. అలాగే.. ప్యాంట్ బెల్ట్ లేకపోవడంతో తాను ఇబ్బంది పడుతున్నానని, జైలు నుంచి కోర్టుకు తిరిగే టైంలో ప్యాంట్ను చేత్తో పట్టుకుని ఉండాల్సి వస్తోందని, కాబట్టి దానిని కూడా అనుమతించాలని కోరారాయన. వీటన్నింటికి కోర్టు అనుమతించింది.
ఈ విజ్ఞప్తులతో పాటు సీబీఐ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ను.. ఆయన భార్య సునీత, బంధువులను ప్రతిరోజు ఒక గంటపాటు కలవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.
మూడు రోజుల సీబీఐ కస్టడి ముగిసన అనంతరం కేజ్రీవాల్ను జూన్ 29 సాయంత్రం 7 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపచనున్నారు. ఇప్పటికే మనీలాండరింగ్లో కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ను.. విచారణ జరిపి మరీ బుధవారం సీబీఐ అరెస్ట్ చేసింది. సీబీఐ అరెస్ట్ నేపథ్యంలో సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు.. కొత్త పిటిషన్ వేసే యోచనలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment