
న్యూఢిల్లీ: 2 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలపై కోవాక్సిన్ కోవిడ్ -19 వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి భారత్ బయోటెక్కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ గురువారం అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ 525 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లపై ట్రయల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. 2 నుంచి 18ఏళ్ల వారిపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు అనుమతి కోరుతూ భారత్ బయోటెక్ ఈ ఏడాది ప్రారంభంలో దరఖాస్తు చేసుకుంది. అనుమతుల విషయంలో కేంద్ర ఔషధ ప్రమాణ స్థాయి సంస్థ(సీడీఎస్సీవో) నిపుణుల కమిటీ సమావేశమై చర్చలు జరిపింది.
జాగ్రత్తగా అన్నీ ప్రోటోకాల్స్ పరిశీలించిన తర్వాత 2-18 ఏళ్ల వయసు చిన్నారులపై టీకా క్లినికల్ ప్రయోగాలు జరిపేందుకు ఈ కమిటీ సిఫార్సు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రయల్స్ సమయంలో టీకా 28 రోజుల వ్యవధిలో కండరాల ద్వారా రెండు డోసులు ఇవ్వనున్నట్లు అని ప్రభుత్వం తెలిపింది. ఈ ట్రయల్స్ ఢిల్లీ, పాట్నా, ఎయిమ్స్, నాగ్పూర్ మెడిట్రినా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో జరగనున్నాయి. ఇక మూడో దశ ప్రయోగాలు జరపడానికి ముందే రెండో దశ క్లినికల్ పరీక్షల భద్రతా డేటా, డీఎస్ఎంబీ సిఫార్సులను సీడీఎస్సీవోకు సమర్పించాలని భారత్ బయోటెక్కు కమిటీ షరతు విధించింది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో కోవాక్సిన్ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో 18ఏళ్ల పైబడిన వారందరికీ ఇస్తోన్న విషయం మనకు తెలిసిందే. దేశంలో రెండు టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ చిన్నారులకు ఇప్పటికీ కరోనా వ్యాక్సిన్ లేదు. ఇదిలా ఉంటే అగ్రరాజ్యం అమెరికాలో చిన్నారులకు టీకాలు వేసేందుకు ఫైజర్కు అనుమతులు లభించాయి.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment