Bharat Biotech
-
కణ,జన్యు చికిత్సలు మరింత సులభం!
సాక్షి, హైదరాబాద్: టీకా తయారీలో పేరొందిన హైదరాబాదీ సంస్థ భారత్ బయోటెక్ మరో కీలకమైన ముందడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటిసారి జన్యు, కణాధారిత చికిత్సలకు ఉపయోగపడే వ్యవస్థలను ప్రారంభించింది. హైదరాబాద్ శివార్లలోని జినోమ్ వ్యాలీలో సుమారు యాభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కొత్త వ్యవస్థ ద్వారా కేన్సర్సహా అరుదైన వ్యాధులు కొన్నింటికి చికిత్సను అభివృద్ధి చేయడం వేగవంతం కానుంది. కేన్సర్ వంటి వ్యాధులకు ఇటీవలి కాలంలో ఎన్నో కొత్త రకం చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. మన శరీరంలోని రోగ నిరోధక కణాలను చైతన్యపరచడం ద్వారా అవి కేన్సర్ కణాలను మట్టుబెట్టేలా చేసే కార్-టీ చికిత్స వీటిల్లో ఒకటి. అలాగే కొన్ని వ్యాధులకు జన్యు ఆధారిత చికిత్సలు అందుబాటులో ఉన్నాయి కానీ.. అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే లభించే ఈ చికిత్సలు చాలా ఖరీదైనవి. ఈ నేపథ్యంలోనే తాము కణ, జన్యు ఆధారిత చికిత్సలను అందరికీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఈ సరికొత్త వ్యవస్థను సిద్ధం చేసినట్లు భారత్ బయోటెక్ ఎగ్జిక్యుటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. రోగ నిరోధక వ్యవస్థను నియంత్రించడం, శరీర కణాలు ఎక్కువ కాలం పాటు మనగలిగే చేయడం, మన లక్ష్యాలకు అనుగుణంగా జన్యువులు తగిన ప్రొటీన్లు ఉత్పత్తి చేసేలా చేయడం ఈ కొత్త వ్యవస్థ నిర్వహించే పనులు. క్లుప్తంగా చెప్పాలంటే కొన్ని వ్యాధుల చికిత్సకు అవసరమైన ప్రత్యేకమైన వైరస్లను అభివృద్ధి చేసేందుకు ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయి. ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే విదేశాల్లో ఎంతో ఖర్చుపెట్టి చేయించుకోవాల్సిన కేన్సర్ చికిత్సలకు మనకు చవకయ్యే అవకాశం ఉంటుంది. అలాగే హీమోఫీలియా వంటి జన్యుపరమైన వ్యాధులకూ చికిత్స లభించడం మొదలవుతుంది. ‘‘జన్యు, కణ చికిత్సలు చాలా సంక్లిష్టమైనవి. అత్యాధునిక పద్ధతులు, టెక్నాలజీల వాడకం ఉంటుంది. ఎంతో నైపుణ్యం ఉంటే కానీ.. మన అవసరాలకు తగ్గట్టుగా జన్యువుల్లోమార్పులు చేయడం కుదరదు. అయితే వైరస్లతో టీకాలు తయారు చేయడంలో భారత్ బయోటెక్ ఇప్పటికే ఎంతో అనుభవం సాధించింది. నైపుణ్యాలను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలోనే అత్యంత అరుదైన, కేన్సర్ వంటి సంక్లిష్టమైన వ్యాధులపై పోరును ముందుకు తీసుకెళ్లగలిగేలా, క్లినికల్ ట్రయల్స్కు ఉపయోగపడే హ్యూమన్ గ్రేడ్ వెక్టార్లను తయారు చేసేందుకు ఈ కొత్త వ్యవస్థ ఉపయోగపడుతుంది’’ అని డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. భారత్ బయోటెక్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ డాక్టర్ రేచెస్ ఎల్లా మాట్లాడుతూ.. ‘‘ఏఏవీ, లెంటివైరస్, అడినోవైరస్ వంటి వైరల్ వెక్టార్లు కణ, జన్యు చికిత్సల్లో చాలా కీలకపాత్ర పోషిస్తాయి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న వ్యవస్థలో వీటిని అత్యధిక నాణ్యతతో అభివృద్ధి చేయగలం. తద్వారా రక్త కేన్సర్లు, అవయవాల్లోని కేన్సర్ల చికిత్సకు అవసరమైన వెక్టార్లను తయారు చేయగలం’’ అని తెలిపారు. -
లంపీ స్కిన్ డిసీజ్ నివారణకు వ్యాక్సిన్
కొవాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ సంస్థ ఆధ్వర్యంలోని బయోవెట్ ఇటీవల లంపీ స్కిన్ డిసీజ్ (ఎల్ఎస్డీ) కోసం వ్యాక్సిన్ తయారు చేసినట్లు ప్రకటించింది. పాడి పశువుల చర్మంపై వచ్చే లంపీ స్కీన్ వ్యాధికి ఈ వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. దేశంలో మొదటిసారిగా ఈ వ్యాధి నివారణకు ‘బయోలంపీవాక్సిన్’కు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) ఆమోదం లభించినట్లు సంస్థ పేర్కొంది.బయోలంపీవాక్సిన్బయోలంపీవాక్సిన్ అనేది పాడి పశువులను ఎల్ఎస్డీ నుంచి రక్షించడానికి తయారు చేసిన సింగిల్ డోస్ వ్యాక్సిన్. మూడు నెలల కంటే ఎక్కువ వయసు ఉన్న జంతువులకు ఏటా ఒకసారి దీన్ని ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది. బయోవెట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) పరస్పర సహకారంతో ఈ వ్యాక్సిన్ను తయారు చేశారు. ఈ వ్యాక్సిన్ను క్లినికల్ ట్రయల్స్లో భాగంగా ఐసీఏఆర్-నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్ (ఐసీఏఆర్-ఎన్ఆర్సీఈ), ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐవీఆర్ఐ)ల్లో విస్తృతంగా పరీక్షించినట్లు తెలిపారు.ఇదీ చదవండి: Aero India 2025 బీఈఎల్ కొత్త ఉత్పత్తులుఈ వ్యాక్సిన్ తయారు ప్రాజెక్ట్కు ఎన్ఆర్సీఈ శాస్ట్రవేత్తలు నవీన్ కుమార్, బీఎన్ త్రిపాఠి నేతృత్వం వహించారు. ఎల్ఎస్డీ వల్ల దేశంలో పాడి ఉత్పాదకత గణనీయంగా ప్రభావం చెందుతోంది. గడిచిన రెండేళ్లలో దాదాపు రెండు లక్షలకుపైగా పాడి పశువులు ఈ వ్యాధి బారినపడి మరణించాయని కంపెనీ తెలిపింది. ఈ వ్యాధివల్ల 2022 సంవత్సరంలో రూ.18,337.76 కోట్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. ఈ వ్యాధి వల్ల పాల ఉత్పత్తి 26% క్షీణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
సాపిజెన్ బయోలాజిక్స్లో సింగపూర్ అధ్యక్షుడు
సింగపూర్ అధ్యక్షుడు 'థర్మన్ షణ్ముగరత్నం' భారతదేశ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగానే భువనేశ్వర్లోని అంధరువాలోని ఒడిశా బయోటెక్ పార్క్లో భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ.. ప్రపంచంలోనే అతిపెద్దదిదైన వ్యాక్సిన్ తయారీ ప్లాంట్ సాపిజెన్ బయోలాజిక్స్ను సందర్శించారు. ఆయనతో పాటు మంత్రివర్గ నాయకులు, వ్యాపార వేత్తలు, ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది.భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ ఎల్లా.. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుచిత్ర ఎల్లా, సాపిజెన్ బయోలాజిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాచెస్ ఎల్లా, డైరెక్టర్ డాక్టర్ జలచారి ఎల్లా, సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు అందరూ థర్మన్ షణ్ముగరత్నంను స్వాగతించారు.సింగపూర్ అధ్యక్షులు వ్యాక్సిన్ తయారీ ప్లాంట్ను సందర్శించడం మాకు చాలా గౌరవంగా ఉంది. వ్యాక్సిన్ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి.. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సుకు దోహదపడటానికి ఈ విశాలమైన మల్టీ వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రంలో జరుగుతున్న వినూత్న పనిని ప్రదర్శించడానికి మేము గర్విస్తున్నామని డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు. ఈ సందర్భంగా ఒడిశా ప్రభుత్వం, భారత ప్రభుత్వం, నియంత్రణ సంస్థలతో పాటు వారి బృందాలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.రూ. 1500 కోట్ల పెట్టుబడితో స్థాపించిన ఈ ప్లాంట్ సంవత్సరానికి 8 బిలియన్ డోసుల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇక్కడ 10 వేర్వేరు వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సదుపాయం ద్వారా 2,000 కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలు & 1,500 పరోక్ష ఉపాధి అవకాశాలను పొందుతున్నారు. -
భారత్ బయోటెక్ అధినేత డా.కృష్ణ ఎల్లాకు ప్రతిష్టాత్మక గుర్తింపు
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ (Bharat Biotech) సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా (Dr Krishna Ella) ప్రతిష్టాత్మక గుర్తింపు పొందారు. 2025 సంవత్సరానికి గాను ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (INSA) ప్రతిష్టాత్మకమైన ఇండియా ఫెలోషిప్ ప్రకటించింది.కొత్త విజ్ఞానం, ఆవిష్కరణలు, కొత్త వ్యాక్సిన్ టెక్నాలజీల అభివృద్ధి, ఇప్పటికే ఉన్న సాంకేతికతల్లో చెప్పుకోదగ్గ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఐఎన్ఎస్ఏ ఆయనకు ఈ ఫెలోషిప్ ప్రదానం చేసింది. దీంతో ఈ గౌరవం అందుకున్న విశిష్ట శాస్త్రవేత్తలు, పరిశ్రమల ప్రముఖుల జాబితాలో డాక్టర్ ఎల్లా కూడా చేరారు.ఇందులో భారత అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ అనిల్ కకోద్కర్, డీఆర్డీఓ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వీకే సరస్వత్, ఇస్రో ఛైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్, డీడీఆర్&డీ కార్యదర్శి సమీర్ వి కామత్, డీఆర్డీఓ చైర్మన్ డా. కేఎన్ శివరాజన్ వంటివారు ఉన్నారు.ఈ సంవత్సరం మొత్తం 61 ఫెలోషిప్లు అందించగా మొట్టమొదటిసారిగా పరిశ్రమ నాయకులకు ఫెలోషిప్లు అందించారు. ఎంపికైన సభ్యులు ఐఎన్ఎస్ఏ సాధారణ సమావేశాలకు హాజరై ఓటు వేయవచ్చు. ఫెలోషిప్లు లేదా ఐఎన్ఎస్ఏ అవార్డుల కోసం ఇతర వ్యక్తులను ప్రతిపాదించవచ్చు.“వ్యాక్సిన్లు, బయోటెక్నాలజీ రంగంలో నా సహకారాన్ని గుర్తించినందుకు ఐఎన్ఎస్ఏకు కృతజ్ఞతలు. ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, కొత్త వ్యాక్సిన్లను కనుగొనడంలో భారత్ ఆధిపత్య శక్తిగా ఎదగడానికి నా మద్దతును మరింత కొనసాగిస్తాను” అని డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు. -
మెట్లబావుల పునరుద్ధరణకు భారత్ బయోటెక్ సాయం!
తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలైన మెట్లబావులను పునరద్ధరించేందుకు ప్రముఖ వ్యాక్సీన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ ముందుకొచ్చింది. నీటి వనరుల సంరక్షణతోపాటు జీవనోపాధులను పెంచేందుకు, ఎకో టూరిజానికి ఊతమిచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ భావిస్తోంది. ఇందులో భాగంగా ‘ద సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండవర్’ క్లుప్తంగా సాహె అమ్మపల్లి, సాలార్ జంగ్ సంగ్రహాలయాల్లో చేపట్టిన పునరుద్ధరణ కార్యక్రమాలకు తమవంతు సాయం అందించనుంది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి ఎ.వాణీ ప్రసాద్ల సమక్షంలో భారత్ బయోటెక్, సాహేల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల్లో భాగంగా తాము మెట్లబావుల పునరుద్ధరణకు సాయం అందించనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా తెలిపారు. మెట్లబావుల పునరుద్ధరణతోపాటు వీటి ప్రాశస్త్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తామని అమ్మపల్లి, సాలార్ జంగ్ సంగ్రహాలయాల్లోని మెట్లబావులు అటు పల్లెల్లో ఇటు నగరాల్లోనూ కీలకమైన నీటి వనరులగా సేవలందించాయని చెప్పారు. అమ్మపల్లిలోని మెట్లబావి 13వ శతాబ్దానికి చెందినదైతే.. సాలార్ జంగ్ సంగ్రహాలయంలోనిది కుతుబ్ షాహీల కాలం నాటిదని గుర్తు చేశారు. ఢిల్లీలోని అగ్రసేన్ కి బౌలీ, అహ్మదాబాద్లోని రాణీ కి వావ్లు యునెస్కో గుర్తింపు పొందాయని, చిన్న బావుల విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని చెప్పారు. ఆధునిక కాలంలో వీటి అవసరం లేక పోవడంతో కొన్ని చోట్ల చెత్తకుప్పలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్లో భూగర్భ జల వనరుల వాడకం అత్యధికంగా ఉందని యునెస్కో సైతం హెచ్చరించిన నేపథ్యంలో.. మెట్లబావుల వంటి నీటి వనరులను పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. -
కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి.. అలోపెక్స్తో భారత్ బయోటెక్ జట్టు
భారత్పాటు ఇతర అల్పాదాయ దేశాలలో విస్తృత-స్పెక్ట్రమ్ యాంటీ-మైక్రోబయల్ వ్యాక్సిన్ అభివృద్ధి, వాణిజ్యీకరణ కోసం అలోపెక్స్ ఇంక్తో భారత్ బయోటెక్ జట్టు కట్టింది. ఇందులో భాగంగా ఇరు కంపెనీలు భారత్తోపాటు ఇతర లైసెన్స్ భూభాగాల్లో వ్యాక్సిన్ AV0328 అభివృద్ధి, వాణిజ్యీకరణ చేపడతాయని భారత్ బయోటెక్ ఒక ప్రకటనలో తెలిపింది.ఒప్పందం ప్రకారం.. వన్టైమ్ ముందస్తు చెల్లింపు, మైలురాయి చెల్లింపులకు అలోపెక్స్కు అర్హత ఉంటుంది. అలాగే లైసెన్స్ పొందిన భూభాగాల్లో AV0328 వ్యాక్సిన్ భవిష్యత్తు అమ్మకాలపై రాయల్టీలను పొందుతుంది."వ్యాక్సినేషన్ ద్వారా యాంటీ-మైక్రోబయల్ రెసిస్టెన్స్ను తగ్గించే పరిష్కారాలను అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. ఈ సహకారం ప్రపంచవ్యాప్తంగా అంటు వ్యాధులను ఎదుర్కోవడానికి సురక్షితమైన, చవకైన, అధిక-నాణ్యత గల వ్యాక్సిన్లను అందించాలనే మా మిషన్కు అనుగుణంగా ఉంటుంది" అని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా చెప్పారు.ఫేజ్-I ఫస్ట్-ఇన్-హ్యూమన్ ట్రయల్ పూర్తయిందని, AV0328 వ్యాక్సిన్ ఎటువంటి తీవ్రమైన ప్రతికూల సంఘటనలనైనా బాగా తట్టుకోగలదని కంపెనీ పేర్కొంది. -
వరద బాధితులకు రూ.2 కోట్ల విరాళం
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం వ్యాక్సిన్ల తయారీ సంస్థ భారత్ బయోటెక్ రూ. 2 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల సంభవించిన వరదలతో అతలాకుతలమైన బాధితులను ఆదుకునేందకు ఇరు రాష్ట్రాల సీఎం వరద సహాయ నిధులకు చెరో రూ.1 కోటి చొప్పున అందిస్తున్నట్లు వెల్లడించింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం వాటిల్లంది. భారీ వర్షపాతం విస్తృతంగా వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. వరద బాధితుల సహాయార్థం పలు సంస్థలు విరాళాలు అందిస్తున్నాయి. -
ఓరల్ కలరా వ్యాక్సిన్ విడుదల చేసిన భారత్ బయోటెక్
ప్రముఖ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 'ఓరల్ కలరా వ్యాక్సిన్' (OCV) ప్రారంభించింది. 'హిల్చోల్' (HILLCHOL) పేరుతో కంపెనీ ఈ వ్యాక్సిన్ను విడుదల చేసింది. దీనిని సింగపూర్కు చెందిన హిల్మాన్ లేబొరేటరీస్ లైసెన్స్తో అభివృద్ధి చేసినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది.కలరా అనేది నివారించదగినది. అయినప్పటికీ 2021 నుంచి ఈ వ్యాధి వల్ల మరణిస్తున్న వారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. 2023 ప్రారంభం నుంచి 2024 మార్చి వరకు 31 దేశాల్లో 8,24,479 కేసులు నమోదయ్యాయి. ఇందులో సుమారు 5,900 మంది మరణించారు. ఈ మరణాల సంఖ్యను తగ్గించడానికి భారత్ బయోటెక్ ఓరల్ కలరా వ్యాక్సిన్ తీసుకొచ్చింది.భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్ను 200 మిలియన్ డోస్ల వరకు ఉత్పత్తి చేయడానికి హైదరాబాద్, భువనేశ్వర్లలో పెద్ద ఎత్తున తయారీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే సంస్థ ఈ వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగంగా అభివృద్ధి చేయడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా కలరా నివారించడానికి 'హిల్చోల్' ఓ అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసినందుకు భారత్ బయోటెక్ బృందాన్ని నేను అభినందిస్తున్నాను. 2030 నాటికి కలరా సంబంధిత మరణాల సంఖ్య 90 శాతం తగ్గించాలనేది ప్రధాన లక్ష్యం అని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు.కలరా ఎలా వ్యాపిస్తుంది?పరిశుభ్రత లేని ప్రాంతాల్లో కలరా ఎక్కువగా వ్యాపిస్తుంది. కలరా వ్యాప్తికి ప్రధాన కారణం కలుషిత నీరు, ఆహార పదార్థాలు. ఈ సమస్య ప్రకృతి వైపరీత్యాల వల్ల, పరిశుభ్రమైన నీరు లభించని ప్రాంతాల్లో నివసించే ప్రజలలో ఎక్కువగా కనిపిస్తుంది. కలరా సోకినా తరువాత ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన మనిషి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. -
కొవాగ్జిన్ పేటెంట్కు సహ యజమానిగా ఐసీఎంఆర్
హైదరాబాద్కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) తమ కోవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ పేటెంట్కు సహ యజమానిగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)ను చేర్చినట్లు తెలిపింది.భారత్ బయోటెక్ తమ కొవాగ్జిన్ ఒరిజినల్ పేటెంట్ ఫైలింగ్లో ఐసీఎంఆర్ను చేర్చకపోవడం వివాదానికి దారితీసింది. అయితే ఈ తప్పిదం అనుకోకుండా జరిగిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. బీబీఐఎల్-ఐసీఎంఆర్ అగ్రిమెంట్ కాపీ గోప్యమైన డాక్యుమెంట్ కావడంతో అందుబాటులో లేదని, దీంతో ఐసీఎంఆర్ను ఒరిజినల్ అప్లికేషన్ లో చేర్చలేదని వివరణ ఇచ్చింది.ఈ తప్పిదం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, ఐసీఎంఆర్ పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని, వివిధ ప్రాజెక్టులపై నిరంతరం సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని భారత్ బయోటెక్ తెలిపింది. ఈ పొరపాటును గుర్తించిన వెంటనే, కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం పేటెంట్ దరఖాస్తులకు సహ యజమానిగా ఐసీఎంఆర్ను చేర్చడం ద్వారా దానిని సరిదిద్దే ప్రక్రియను బీబీఐఎల్ ఇప్పటికే ప్రారంభించింది. అవసరమైన లీగల్ డాక్యుమెంట్లను సిద్ధం చేస్తున్నామని, అవి సిద్ధమై సంతకం చేసిన వెంటనే పేటెంట్ కార్యాలయంలో దాఖలు చేస్తామని కంపెనీ పేర్కొంది.ఐసీఎంఆర్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రముఖ వైద్య పరిశోధనా సంస్థ. పుణెలోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, భారత్ బయోటెక్ సంయుక్తంగా 2020 ఏప్రిల్లో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) తర్వాత కొవాగ్జిన్ను అభివృద్ధి చేశాయి. -
డాక్టర్ కృష్ణ ఎల్లాకు ప్రతిష్టాత్మక అవార్డు
ప్రజారోగ్య రంగంలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఇచ్చే జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ పతకాన్ని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డా.కృష్ణ ఎల్లా అందుకున్నారు. మే 22, 2024న యూఎస్లోని మేరీల్యాండ్ బాల్టిమోర్లో జరిగిన బ్లూమ్బెర్గ్ స్కూల్ కాన్వొకేషన్ వేడుకలో డీన్ ఎల్లెన్ జే.మెకెంజీ చేతుల మీదుగా ఈ అవార్డును తీసుకున్నారు.కృష్ణఎల్లా ప్రజారోగ్యానికి చేసిన కృషిని గుర్తించి ఈ పథకానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ను అభివృద్ధి చేసి కొవిడ్ తీవ్రతను తగ్గించారని తెలిపారు. ఈ పతకం అందుకున్న సందర్భంగా కృష్ణ ఎల్లా మాట్లాడుతూ..‘ప్రపంచవ్యాప్తంగా సైన్స్ అండ్ రిసెర్చ్లో ఎన్నో విజయాలు సాధించిన భారత్కు ఈ పతకాన్ని అంకితం ఇస్తున్నాను. ఈ పతకం మా శాస్త్రవేత్తల బృందానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. మోనోక్లోనల్ యాంటీబాడీల అభివృద్ధి కోసం భారత్బయోటెక్ ఎన్నో పరిశోధనలు చేసి వ్యాక్సిన్ను కనుగొంది’ అన్నారు.ఇదీ చదవండి: 6.8లక్షల మొబైల్ నంబర్లను ధ్రువీకరించాలన్నటెలికాంశాఖడాక్టర్ ఎల్లా నేతృత్వంలో భారత్ బయోటెక్ 220 పేటెంట్లు, 20 వ్యాక్సిన్లు, బయో థెరప్యూటిక్స్ కలిగి ఉందని కంపెనీ చెప్పింది. 125 దేశాల్లో 9 బిలియన్ వ్యాక్సిన్ డోస్లను పంపిణీ చేసినట్లు తెలిపింది. -
ఐవీఎంఏ అధ్యక్షుడిగా డా.కృష్ణ ఎల్లా ఎంపిక
కోవాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ) అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆయన ఈ పదవిలో రెండేళ్లు కొనసాగనున్నారు.ఈ పదవిలో ఇప్పటి వరకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదార్ పూనావాలా ఉన్నారు. ఐవీఎంఏ ఉపాధ్యక్షురాలిగా బయోలాజికల్ ఇ.లిమిటెడ్ ఎండీ మహిమా దాట్ల, కోశాధికారిగా భారత్ బయోటెక్ సీఎఫ్ఓ టి.శ్రీనివాస్లను ఎన్నుకున్నారు. ఐవీఎంఏ డైరెక్టర్ జనరల్గా డాక్టర్ హర్షవర్థన్ కొనసాగుతారు.ఇదీ చదవండి: ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థఅందరికీ అవసరమయ్యే టీకాలు అందించడమే ఐవీఎంఏ ప్రధాన లక్ష్యమని డాక్టర్ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ ప్రమాణాలకు అనుగుణంగా దేశంలో టీకాల తయారీ సంస్థలు సిద్ధం కావాలన్నారు. ఆఫ్రికా వంటి దేశాలకు టీకా అవసరాలు అధిమన్నారు. టీకా తయారీలో వస్తున్న అంకుర సంస్థలకు సరైన ప్రోత్సాహకాలు అందించాలన్నారు. -
భారత్ బయోటెక్.. యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ మధ్య ఒప్పందం - అందుకేనా?
హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇన్స్టిట్యూట్ ఈ రోజు ఒక ఆవాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ఎందుకు జరిగింది? దీని వల్ల ఉపయోగం ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వ్యాక్సిన్ పరిశోధన కార్యక్రమాలు, విద్యా పరిశ్రమ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం మాత్రమే కాకుండా.. అంటు వ్యాధులను ఎదుర్కోవడానికి ప్రపంచ ప్రయత్నాలను పెంపొందించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ భాగస్వామ్యం బయో థెరప్యూటిక్స్ శాస్త్రాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను సరైన సమయంలో రక్షించుకోవడానికి తక్కువ ఖర్చుతో సాధ్యమవుతాయి. ప్రాణాంతక వ్యాధుల భారీ నుంచి కాపాడానికి వ్యాక్సిన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. కరోనా మహమ్మారి సమయంలో చాలా దేశాలకు వ్యాక్సిన్స్ అందించిన ఘనత భారత్ సొంతం. ఈ సమయంలోనే మన దేశం సామర్థ్యం వెలుగులోకి వచ్చింది. ఈ ఒప్పందం సందర్భంగా.. భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ 'కృష్ణ ఎల్లా' మాట్లాడుతూ.. యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇన్స్టిట్యూట్తో ఏర్పడిన ఈ బంధం పరిశోధనలను సులభతరం చేస్తుంది, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది, సైన్స్ వ్యాక్సిన్ టెక్నాలజీని మరింత ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. సురక్షితమైన వ్యాక్సిన్ ప్లాట్ఫామ్లను అభివృద్ధి చేయడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం, ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఒప్పందం ఉపయోగపడుతుందని వెల్లడించారు. కొత్త వ్యాక్సిన్లు, బయోథెరఫిటిక్స్ అభివృద్ధిలో మా నైపుణ్యాన్ని హైలైట్ చేయడానికి, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్తో కలిసి, ప్రపంచ ఆరోగ్యంపై శాశ్వత ప్రభావాన్ని చూపడమే లక్ష్యమని.. యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఇన్స్టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ 'జామీ ట్రిక్కాస్' అన్నారు. కరోనా సమయంలో భారత్ బయోటెక్ వంటి కంపెనీలు ప్రపంచ డిమాండ్లో దాదాపు 60 శాతం కంటే ఎక్కువ వ్యాక్సిన్లను అందించగలిగాయి. ఏకంగా 2.4 బిలియన్ డోస్ల కోవిడ్-19 వ్యాక్సిన్లను సరఫరా చేసిన రికార్డ్ భారత్ సొంతమైంది. దీంతో దేశ ఖ్యాతిని గుర్తించిన చాలా సంస్థలు, ఇండియన్ కంపెనీలతో చేతులు కలపడానికి ఆసక్తి చూపాయి. భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారి వైరస్ భారీ నుంచి ప్రజలను రక్షించుకోవడానికి వ్యాక్సిన్ అభివృద్ధి రూపకల్పన కోసం భారతదేశం ఆర్&డీ పెట్టుబడులను కొనసాగిస్తోంది. -
మానవ వనరుల అభివృద్ధిలో భారత్ నం.1
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లలకు ఇస్తున్న వ్యాక్సిన్లలో 65 శాతం ఇండియాలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లే ఉన్నాయని పద్మభూషణ్ అవార్డు గ్రహీత, భారత్ బయోటెక్ వ్యవస్థాపక చైర్మన్ కృష్ణ ఎల్ల వెల్లడించారు. శుక్రవారం జరిగిన హైదరాబాద్ ఐఐటీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. మానవ వనరుల అభివృద్ధిలో భారతదేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఇండియాలో డిజిటల్ ఎకానమీ 34 శాతం ఉంటే అభివృద్ధి చెందిన అమెరికా, ప్రాన్స్ వంటి దేశాల్లో 8 శాతం లోపే ఉందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్, ఫార్మా తదితర రంగాలను ప్రపంచ రాజకీయాలు ఎంతో ప్రభావితం చేస్తున్నాయని కృష్ణ అభిప్రాయపడ్డారు. కొన్ని దేశాలు వ్యాక్సిన్ ఎగుమతి చేసి, బదులుగా ఆయా దేశాల నుంచి విలువైన ఖనిజాలను దిగుమతి చేసుకుంటున్నాయని వివరించారు. వ్యవసాయరంగం అభివృద్ధితో పాటు నూతన ఆవిష్కరణలు దేశాన్ని ఆర్థికాభివృద్ధి వైపు నడిపిస్తాయన్నారు. ఇంగ్లిష్ పెద్దగా తెలియని చైనా నూతన ఆవిష్కరణల్లో ముందంజలో ఉందన్నారు. వైరస్ల పట్ల అలసత్వం వద్దు వైరస్ల కారణంగా పుట్టుకొస్తున్న వ్యాధుల పట్ల అలసత్వం వద్దని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాధుల మూలాలను ఎప్పటికప్పుడు గుర్తించి ఎక్కడికక్కడ సరైన వైద్యం చేసి కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మడగాస్కర్లో పుట్టిన చికున్గున్యా ఇండియాకు విస్తరించిందనీ ఆఫ్రికా దేశాల్లో పుట్టిన జికా వైరస్ బ్రెజిల్ వంటి దేశాలకు విస్తరించిందని తెలిపారు. ఐఐటీహెచ్లోని వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ పాలకవర్గం చైర్మన్ బీవీజీ మోహన్రెడ్డి, డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీ.ఎస్.మూర్తి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
బూస్టర్ డోస్గా ‘నాసల్’ వ్యాక్సిన్.. ధర ఎంతంటే?
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తోందన్న భయాల వేళ మరో టీకా అందుబాటులోకి వచ్చింది. దేశీయ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సిన్ను 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసుగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలో నాసల్ వ్యాక్సిన్ ధరను మంగళవారం ప్రకటించింది భారత్ బయోటెక్. ప్రైవేటు కంపెనీలకు సింగిల్ డోసు టీకా ధర రూ.800(పన్నులు అదనం)గా నిర్ణయించినట్లు తెలిపింది. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.325కే ఇవ్వనున్నట్లు వెల్లడించింది. జనవరి నాలుగో వారం నుంచి అందుబాటులోకి రానుంది ఈ నాసల్ వ్యాక్సిన్. ‘ఇంకోవాక్’(iNCOVACC)గా పిలిచే ఈ నాసల్ వ్యాక్సిన్ను తీసుకునేందుకు కోవిన్ పోర్టల్ ద్వారా ఇప్పటి నుంచే స్లాట్స్ బుక్సింగ్ చేసుకోవచ్చని భారత్ బయోటెక్ తెలిపింది. ఇప్పటికే కోవాగ్జిన్ లేదా కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు ఇంకోవాక్ నాసల్ టీకాను బూస్టర్గా పొందవచ్చు. జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా దీని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. బీబీవీ154గా పిలిచే ఈ నాసల్ టీకా ఇంకోవాక్ బ్రాండ్ పేరుతో మార్కెట్లో లభ్యమవుతుంది. ప్రాథమిక, బూస్టర్ డోసు కోసం అనుమతులు పొందిన ప్రపంచంలోనే తొలి నాసల్ వ్యాక్సిన్గా ఇంకోవాక్ నిలిచినట్లు పేర్కొంది భారత్ బయోటెక్. ఇదీ చదవండి: Corona New Variant BF.7: కరోనా బీఎఫ్.7 బాధితులకు పైసా ఖర్చు లేకుండా చికిత్స.. ఎక్కడంటే? -
సూది లేకుండా కరోనా టీకా
న్యూఢిల్లీ: సూదితో అవసరం లేని కోవిడ్–19 టీకా అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన ఇంట్రానాజల్ (బీబీవీ154) కరోనా వ్యాక్సిన్కు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. ముక్కుద్వారా తీసుకొనే ఈ టీకాను 18 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోసుగా పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే కోవిషీల్డ్ లేదా కోవాగ్జాన్ టీకా రెండు డోసుల తీసుకున్నవారు బూస్టర్ డోసుగా ఇంట్రానాజల్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. నేషనల్ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్లో దీన్ని చేర్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కో–విన్ పోర్టల్ ద్వారా టీకా పొందవచ్చని వెల్లడించారు. చైనాతోపాటు పలు దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ అనూహ్యంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ముక్కుద్వారా తీసుకొనే టీకాకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. క్లినికల్ ట్రయల్స్లో సత్ఫలితాలు ఇన్కోవాక్ అనే బ్రాండ్ పేరుతో పిలిచే బీబీవీ154 వ్యాక్సిన్కు ఈ ఏడాది నవంబర్లో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆమోదం తెలియజేశారు. షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. 18 ఏళ్లు దాటినవారికి బూస్టర్ డోసుగా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాలని స్పష్టం చేశారు. టీకాల పరిశోధన, అభివృద్ధి విషయంలో భారతదేశ శక్తిసామర్థ్యాలకు ఇంట్రానాజల్ వ్యాక్సిన్ మరో ఉదాహరణ అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ టీకాను ఇవ్వడం చాలా సులభమని తెలిపాయి. ఇన్కోవాక్ను భారత్ బయోటెక్ సంస్థ అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది. ప్రొడక్ట్ డెవలప్మెంట్, క్లినికల్ ట్రయల్స్కు భారత ప్రభుత్వం డిపార్టుమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆధ్వర్యంలోని కోవిడ్ సురక్షా కార్యక్రమం కింద ఆర్థిక సహకారం అందించింది. బీబీవీ154 టీకా విషయంలో మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని, సత్ఫలితాలు లభించాయని భారత్ బయోటెక్ సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. -
భారత్ బయోటెక్ కీలక నిర్ణయం.. బూస్టర్ డోస్ నాజల్ వ్యాక్సిన్ రెడీ!
పలు దేశాల్లో కరోనా వైరస్ వేరియంట్ల వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి కట్టడి కోసం పలు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై మరోసారి ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా బూస్టర్ డోస్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్ విషయంలో మరో అప్డేట్ ఇచ్చింది. ముక్కు ద్వారా అందించే(నాజల్ స్ప్రే) కోవిడ్ వ్యాక్సిన్ను త్వరలో దేశంలో బూస్టర్ డోస్గా తీసుకువస్తున్నట్టు పేర్కొంది. గోవాగ్జిన్ టీకా నుంచి నాజల్ వ్యాక్సిన్ రూపంలో దీన్ని అందించనున్నారు. డీజీసీఏ నుంచి తుది ఆమోదం పొందిన వెంటనే బూస్టర్ డోస్ రిలీజ్చేయనున్నట్టు సమాచారం. జాతీయ మీడియా సమాచారం మేరకు నాజల్ వ్యాక్సిన్కు అనుమతులు చివరి దశకు చేరుకున్నాయని, వచ్చే వారంలో టీకా అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. 18 ఏళ్లుపైన వయసు ఉన్న వారికి బూస్టర్ డోస్గా నాజల్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. నాజల్ వ్యాక్సిన్ వల్ల ప్రయోజనం? నాజల్ వ్యాక్సిన్లు ఇంజెక్షన్ ద్వారా తీసుకునే వ్యాక్సిన్తో పోలిస్తే అదనపు ప్రయోజనాలను కలిగి వున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, నాజల్ వ్యాక్సిన్లను నిల్వ సౌలభ్యం, పంపిణీలో సులభంగా ఉంటుంది. నాజల్ వ్యాక్సిన్లు వైరస్.. మానవ శరీరంలోకి ప్రవేశించే ముక్కు , ఎగువ శ్వాస కోశం వద్ద రక్షణను అందిస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. #Breaking | Bharat Biotech’s nasal Covid vaccine to be rolled out as booster dose #6PMPrime #Covid #India | @Akshita_N @milan_reports pic.twitter.com/HutHQ7tLMj — IndiaToday (@IndiaToday) December 22, 2022 -
Covid-19: ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్కు డీసీజీఐ అనుమతి
న్యూఢిల్లీ/హైదరాబాద్: ముక్కు ద్వారా చుక్కల రూపంలో తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి లభించింది. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తయారీ ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్.. ఐఎన్కోవ్యాక్ (బీబీవీ164)ను 18 ఏళ్లుపైబడిన వారికి ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు మంజూరుచేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవీయ మంగళవారం ట్వీట్ చేశారు. ముక్కు ద్వారా చుక్కల రూపంలో తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్లలో భారత్ బయోటెక్ తయారీ వ్యాక్సిన్.. ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్ కావడం విశేషం. క్లినికల్ ట్రయల్స్లో భాగంగా 4,000 మంది వలంటీర్లపై జరిపిన పరీక్షల్లో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని భారత్ బయోటెక్ చైర్మన్, ఎండీ కృష్ణ ఎల్లా చెప్పారు. క్లినికల్ ట్రయల్స్లో వ్యాధి నిరోధకతను వ్యాక్సిన్ సమర్థవంతంగా ప్రేరేపించిందని వెల్లడించారు. ప్రపంచ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ టెక్నాలజీలో నూతన ఒరవడి మొదలవనుందని ఆయన అన్నారు. -
గుడ్ న్యూస్.. భారత్ బయోటెక్ నాసల్ కోవిడ్ టీకాకు డీసీజీఐ అనుమతి
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన నాసల్ కోవిడ్ వ్యాక్సిన్కు డీసీజీఐ మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముక్కు ద్వారా ఇచ్చే ఈ వ్యాక్సిన్ను 18 ఏళ్లు దాటిన వారికి ఇచ్చేందుకు అనుమతిచ్చింది. అయితే అత్యవసర పరిస్థితిల్లో పెద్దవారికి ఉపయోగించేందుకు డీసీజీఐ అనుమితిచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ తెలిపారు. కోవిడ్-19కి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటానికి ఇది పెద్ద ప్రోత్సాహమని డాక్టర్ మాండవ్య అన్నారు. 18 ఏళ్లు దాటిని వారికి నాజల్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు డీసీజీఐ అనుమతించిందని తెలిపారు. కోవిడ్కు వ్యతిరేకంగా పోరాడుతున్న భారత్కు ఇది పెద్ద ప్రోత్సాహం అని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు కాగా భారత్లో అనుమతి పొందిన తొలి ఇంట్రానాసల్ కోవిడ్ టీకాగా భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్ నిలిచింది. ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. చదవండి: వరద నీటిలో స్కూటీ స్కిడ్.. కరెంట్ స్తంభం పట్టుకోవడంతో -
6 నుంచి 12 ఏళ్ల పిల్లలకు కోవాగ్జిన్
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ టీకాను 6 నుంచి 12 ఏళ్ల పిల్లలకు ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) మంగళవారం అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. అయితే ఈ అత్యవసర వినియోగానికి కొన్ని పరిమితులు విధించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంతవరకు డీసీజీఐ12 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కోవాగ్జిన్ టీకాలు వేసేందేకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గతేడాది డిసెంబర్ 21న ఆమోదం లభించింది. అంతేకాదు టీనేజ్ టీకా కార్యక్రమం ఈ ఏడాది జనవరి మూడు నుంచి ప్రారంభించింది. తదనంతరం మార్చి 16న 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్లు వేసే కార్యక్రమం ప్రారంభించింది. అయితే గతంలో డీసీజీఐ నిపుణుల కమిటీ 2 నుంచి 12 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్లు ఇచ్చేందుకు మరిన్ని వివరాలను సమర్పించాలని కోరిన సంగతి తెలిసిందే. (చదవండి: 2 వేలకు పైగా కొత్త కేసులు...మళ్లీ మాస్క్ ధరించాల్సిందే) -
సీపీఐ నారాయణకు ‘ఎల్లా’ దంపతుల పరామర్శ
నగరి: సతీ వియోగంతో బాధపడుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను భారత్ బయోటెక్ అధినేత డాక్టర్.కృష్ణ ఎల్లా, ఆయన సతీమణి డాక్టర్ సుచిత్ర ఎల్లా ఆదివారం పరామర్శించారు. వీరు చిత్తూరు జిల్లా నగరి మండలంలోని అయనంబాకం గ్రామంలో నారాయణ స్వగృహానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. డాక్టర్ సుచిత్ర మాట్లాడుతూ.. నారాయణ సతీమణి వసుమతిదేవి మనమధ్య లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, ఇలాంటి విషాదం నుంచి నారాయణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు చక్రవర్తి నాయుడు కూడా నారాయణను పరామర్శించారు. -
మెక్సికో మార్కెట్లోకి కోవాగ్జిన్
న్యూఢిల్లీ: కోవిడ్–19 టీకా కోవాగ్జిన్ను మెక్సికో మార్కెట్లో కూడా సరఫరా చేసే దిశగా బయోటెక్నాలజీ సంస్థలు భారత్ బయోటెక్, ఆక్యుజెన్ తమ ఒప్పందంలో మార్పులు చేశాయి. దీనితో మొత్తం ఉత్తర అమెరికాలో కోవాగ్జిన్ విక్రయానికి సంబంధించి ఆక్యుజెన్కు హక్కు లభిస్తుంది. అమెరికా మార్కెట్ తరహాలోనే లాభాల్లో వాటాల పంపకం రూపంలో ఈ ఒప్పందం ఉంటుందని ఆక్యుజెన్ తెలిపింది. అమెరికా, కెనడా మార్కెట్లలో కోవాక్సిన్ను సంయుక్తంగా అభివృద్ధి చేయడం, సరఫరా, విక్రయాల కోసం ఆక్యుజెన్, భారత్ బయోటెక్ మధ్య ఒప్పందం ఉంది. ప్రస్తుతం 2–18 ఏళ్ల బాలలకు అత్యవసర వినియోగం కింద కోవాగ్జిన్ను ఉపయోగించే అంశాన్ని మెక్సికో నియంత్రణ సంస్థ పరిశీలిస్తోందని ఆక్యుజెన్ చైర్మన్ శంకర్ ముసునూరి తెలిపారు. ఉత్తర అమెరికా మార్కెట్లో కోవాగ్జిన్ను వాణిజ్యావసరాలకు ఉత్పత్తి చేసేందుకు ఆక్యుజెన్కు పూర్తి తోడ్పాటు అందిస్తామని భారత్ బయో చైర్మన్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. -
రూ. 225కే కోవిడ్ ప్రికాషన్ డోస్
న్యూఢిల్లీ: నేటి నుంచి దేశవ్యాప్తంగా మొదలయ్యే కరోనా టీకా ప్రికాషన్ డోస్ను రూ.225కే ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లకు సరఫరా చేయనున్నట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ), భారత్ బయోటెక్ సంస్థలు ప్రకటించాయి. ‘కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత కోవిషీల్డ్ టీకా ఒక్కో డోస్ ధరను రూ.600 నుంచి రూ.225కు తగ్గించాలని నిర్ణయించాం’అని ఎస్ఐఐ సీఈవో అథర్ పూనావాలా శనివారం ట్విట్టర్లో తెలిపారు. అదేవిధంగా, ‘మా సంస్థ తయారు చేసే కోవాగ్జిన్ టీకా ఒక్కో డోస్ను ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.1,200కు బదులుగా రూ.225కే అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపేందుకు సంతోషిస్తున్నాం’అని భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా వెల్లడించారు. 18 ఏళ్లు నిండి, రెండో డోస్ తీసుకుని 9 నెలలు పూర్తయిన వారంతా 10వ తేదీ నుంచి ప్రైవేట్ టీకా కేంద్రాల్లో కోవిడ్ ప్రికాషన్ డోస్కు అర్హులని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. -
పద్మభూషణ్ అందుకున్న కృష్ణ ఎల్ల దంపతులు
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో సేవలు చేసినవారికి అందజేసే పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం సోమవారం రాష్ట్రపతిభవన్లో జరిగింది. మార్చి 21న తొలి విడతలో 54 మందికి అవార్డులు ఇవ్వగా.. సోమవారం 74 మందికి పురస్కారాలు అందజేశారు. అందులో నలుగురు తెలుగువారు ఉన్నారు. భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్ల, ఆయన సతీమణి సుచిత్ర ఎల్ల ఇద్దరికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేశారు. కూచిపూడి నాట్య కళాకారిణి గడ్డం పద్మజారెడ్డి, కోయ కళాకారుడు సకిని రామచంద్రయ్య కూడా పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. అవార్డు అందుకున్న అనంతరం పద్మజారెడ్డి, రామచంద్రయ్య ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పద్మశ్రీ అవార్డు తనకు మహాశివుడు ఇచ్చిన వరమని, దీనిని తన నాట్య గురువు దివంగత శోభానాయుడుకు అంకితం చేస్తున్నానని పద్మాజారెడ్డి చెప్పారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆదివాసీ కథలే తనను ఈ స్థాయికి తెచ్చాయని సకిని రామచంద్రయ్య అన్నారు. (చదవండి: గూర్ఖాల్యాండ్ డిమాండ్ను వదిలిన మోర్చా) -
ఫోర్త్వేవ్కి భయపడాల్సిన అవసరం లేదు: కృష్ణ ఎల్ల
న్యూఢిల్లీ: భారత్లో మూడు వేవ్లుగా విజృంభించిన కరోనా వైరస్.. ఐదు లక్షల మందికి పైగా బలి తీసుకుంది. అంతకు మించి లాక్డౌన్, ఇతర పరిస్థితుల్లో లెక్కలేనన్ని కుటుంబాలను ఆర్థికంగా ఛిన్నాభిన్నం చేసేసింది. ప్రస్తుతం కరోనా పుట్టిల్లుగా భావిస్తున్న చైనాలో కొత్తగా కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో భారత్ జాగ్రత్తపడుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కూడా. అయితే ఫోర్త్ వేవ్కి భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల. ఢిల్లీలో పోలియోపై ప్రముఖ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ జాకబ్ జాన్ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోర్త్ వేవ్ గురించి భయపడాల్సిందేమీ లేదన్న ఆయన.. కరోనా విజృంభించినా బెదిరిపోవాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాదు భవిష్యత్తులో లాక్డౌన్ల అవసరం ఉండకపోవచ్చని అభిప్రాయపడిన కృష్ణ ఎల్ల.. కరోనా విజృంభించిన తట్టుకునే సామర్థ్యం ఉందని చెప్తున్నారు. అంతేకాదు వ్యాక్సినేషన్లో భాగంగా.. మూడు డోసులు వేయించుకుంటేనే ఉపయోగం ఉండొచ్చని చెప్తున్నారాయన. ఫోర్త్ వేవ్ ప్రభావం అంతగా ఏమీ ఉండనిచెప్పిన ఆయన.. ఇప్పటికే దేశమంతా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మూడో డోసు(బూస్టర్ డోసు) వ్యాక్సిన్ వేసుకోవడమే కాకుండా మాస్కులు కొనసాగించడం, శానిటైజర్ వాడడం కొనసాగించాలని ప్రజలకు సూచించారు ఆయన. -
టెక్ దిగ్గజాలకు పద్మభూషణ్
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. సీడీఎస్ బిపిన్ రావత్కు పద్మ విభూషణ్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టాటా గ్రూప్ చైర్ పర్సన్ నటరాజన్ చంద్రశేఖర్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండి సైరస్ పూనావాలాలకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. అలాగే, కొవాగ్జిన్ టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా, సహ వ్యవస్థాపకులు సుచిత్ర ఎల్లాకు పద్మభూషణ్ పురస్కారం అనౌన్స్ చేసింది. ట్రేడ్ & ఇండస్ట్రీ రంగానికి చెందిన ఐదుగురికి పద్మభూషణ్ అవార్డ్స్ లభించడంతో పాటు ఇద్దరికీ పద్మశ్రీ పురస్కారం లభించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో ప్రదానం చేస్తున్నారు. కళలు, సామాజిక సేవ, ప్రజావ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవని కనబరిచిన వారికి పద్మ అవార్డులు ప్రదానం చేస్తారు. The President of India has approved conferment of 128 Padma Awards this year.#PadmaAwards#RepublicDay2022 The list is as below - pic.twitter.com/4xf9UHOZ2H — DD News (@DDNewslive) January 25, 2022 (చదవండి: Padma Awards 2022: బిపిన్ రావత్కు పద్మ విభూషణ్!) -
టీనేజర్లకు టీకా తర్వాత పారాసిటమాల్ అక్కర్లేదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టీనేజీ వయసు వారికి ఇస్తున్న కోవాగ్జిన్ కోవిడ్ టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ బుధవారం ఒక స్పష్టతనిచ్చింది. ‘కోవాగ్జిన్ టీకా తీసుకున్న టీనేజర్లకు కొన్ని టీకా కేంద్రాలు.. పారాసిటమాల్ 500 ఎంజీ ట్యాబ్లెట్లు మూడు, పెయిన్ కిల్లర్లు తీసుకోవాలని సూచిస్తున్నట్లు మాకు సమాచారం అందింది. నిజానికి పిల్లలు కోవాగ్జిన్ తీసుకున్నాక వారికి పారాసిటమాల్, పెయిన్ కిల్లర్లు ఇవ్వాల్సిన పని లేదు. అవి అనవసరం’ అని సంస్థ పేర్కొంది. టీనేజర్లు మందులు తీసుకోవాలనుకుంటే వైద్యుణ్ణి సంప్రదించి, వారి సలహా మేరకే తీసుకోవాలని సంస్థ సూచించింది. -
12 ఏళ్లు పైబడిన పిల్లలకు కోవాగ్జిన్!
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ టీకాను 12ఏళ్లు పైబడిన పిల్లలకు ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ) అత్యవసర వాడుకకు అనుమతినిచ్చింది. అయితే ఈ అనుమతికి పరిమితులు విధించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2–18 ఏళ్లలోపు వారికి కోవాగ్జిన్ వాడకంపై భారత్ బయోటెక్ ఫేజ్–2 ట్రయల్స్ నిర్వహించి సీడీఎస్సీఓకు గతంలో సమర్పించింది. పిల్లలకు కొన్ని నిబంధనలతో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతించవచ్చని అక్టోబర్లో సీడీఎస్సీఓకు చెందిన నిపుణుల కమిటీ సూచించింది. ఈ సిఫార్సును డీజీసీఐకు చెందిన మరో కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిందని, మరిన్ని వివరాలు సమర్పించాలని కంపెనీని కోరిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వివరాలు పరిశీలించిన అనంతరం డీజీసీఐ కోవాగ్జిన్కు శుక్రవారం అనుమతినిచ్చినట్లు వెల్లడించాయి. కమిటీ సూచన మేరకు కోవాగ్జిన్ను 12– 18ఏళ్ల వారికి 0– 28 రోజుల వ్యవధిలో అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు అనుమతినిస్తున్నట్లు డీజీసీఐ ప్రకటన వెల్లడించింది. డీజీసీఐ నిర్ణయంపై భారత్ బయోటెక్ హర్షం ప్రకటించింది. ఇప్పటికే దేశంలో జైడస్ క్యాడిలా వారి జైకోవ్– డీ టీకాను 18 ఏళ్లలోపు వారికి ఇచ్చేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. పిల్లలపై సీరమ్, బయోలాజికల్–ఇ లిమిటెడ్ కంపెనీల టీకాల ఫేజ్2 ట్రయల్స్కు డీజీసీఐ గతంలో అనుమతినిచ్చింది. డీజీసీఐ తాజా నిర్ణయాన్ని మజుందార్ షా సహా పలువురు ప్రముఖులు స్వాగతించారు. -
ఈ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనది: లాన్సెట్ జర్నల్ తాజా నివేదిక
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన కోవాగ్జిన్ కోవిడ్ టీకా అత్యంత సమర్థంగా పని చేస్తోందని, పూర్తిగా సురక్షితమైనదని లాన్సెట్ జర్నల్ తాజా నివేదిక వెల్లడించింది. రెండు డోసులు తీసుకున్న వారిలో ఈ వ్యాక్సిన్ 77.8 శాతం సామర్థ్యంతో పని చేస్తోందని తెలిపింది. ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలను లాన్సెట్ వైద్య నిపుణులు విశ్లేషించి నివేదిక రూపొందించారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న 2 వారాల్లో యాంటీబాడీలు సమృద్ధిగా వచ్చాయని, దుష్ప్రభావాలు కనబడలేదంది. కోవాగ్జిన్ తీసుకుంటే కరోనా తీవ్రంగా సోకకుండా 93.4%, సాధారణంగా సోకకుండా 77.8%తో పని చేస్తోందని తెలిపింది. డెల్టా వేరియెంట్ నుంచి 65.2% సామర్థ్యంతో రక్షణ కల్పిస్తోందని పేర్కొంది. టీకా ఇచ్చిన వారంలో తలనొప్పి, అలసట, జ్వరం, ఇంజెక్షన్ ఇచ్చిన చోట నొప్పి తప్ప ఎలాంటి రియాక్షన్లు లేవని స్పష్టం చేసింది. గత ఏడాది నవంబర్ 16 నుంచి ఈ ఏడాది మే 17 వరకు మూడోదశ ప్రయోగాలు జరిగాయి. భారత్లోని 25 ఆస్పత్రుల్లో 18–97 ఏళ్ల 16,973 మందికి టీకాను ప్రయోగాత్మకంగా ఇచ్చారు. టీకా తీసుకున్న తర్వాత కరోనా సోకిన వారు ఆస్పత్రి పాలవడం, మరణించడం జరగలేదని లాన్సెట్ జర్నల్ తెలిపింది. ఈ నివేదికపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ బలరాం భార్గవ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మెడికల్ జర్నల్లో కోవాగ్జిన్ ఫలితాలు వచ్చాయంటే అదెంత సమర్థంగా పని చేస్తోందో అర్థమవుతుందన్నారు. కోవాగ్జిన్పై లాన్సెట్ నిపుణుల పరిశోధనల్లో తేలిన అంశాలు టీకా అభివృద్ధిలో తమ చిత్తశుద్ధిని, డేటా ఇవ్వడంలో పారదర్శకతను వెల్లడిస్తోందని భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా అన్నారు. కాగా లాన్సెట్ జర్నల్ ఈ నివేదిక ప్రాథమికమైనదని, మరింత డేటా వచ్చాక పూర్తి నివేదిక ప్రచురిస్తామని వివరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఇటీవల అనుమతులిచ్చింది. -
కోవాగ్జిన్కు యూకే గుర్తింపు
లండన్: భారత్ తయారీ కోవాగ్జిన్ను అనుమతి పొందిన కోవిడ్ టీకాల జాబితాలో చేర్చినట్లు యూకే ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయం ఈ నెల 22వ తేదీ ఉదయం 4 గంటల నుంచి అంతర్జాతీయ ప్రయాణాలకు వర్తించనుందని పేర్కొంది. భారత్ బయోటెక్ తయారీ కోవాగ్జిన్ టీకా రెండు డోసులు తీసుకుని యూకే వెళ్లిన ప్రయాణికులు ఇకపై ఐసొలేషన్లో ఉండాల్సిన అవసరం లేదని భారత్లో బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తెలిపారు. యూకేలో ప్రవేశించే 18 ఏళ్లలోపు వారి విషయంలోనూ ప్రయాణ నిబంధనలను ప్రభుత్వం సరళీకరించింది. వీరికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు గుర్తిస్తూ, ఐసొలేషన్లో ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది. యూకేకు వచ్చాక వీరికి కోవిడ్ పరీక్ష చేస్తారు. పాజిటివ్గా తేలితే మాత్రం, పీసీఆర్ పరీక్ష ఉచితంగా చేస్తారు. కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను పరస్పరం గుర్తిస్తూభారత్ 96 దేశాలతో ఒప్పందం కుదుర్చుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. -
భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ దంపతులకు విశిష్ట పురస్కారం
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి 1999 నుంచి పురస్కారాలు అందిస్తున్నట్టు డాక్టర్ రామినేని ఫౌండేషన్ చైర్మన్ రామినేని ధర్మప్రచారక్ చెప్పారు. విజయవాడలోని ఓ హోటల్లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వ్యవస్థాపక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎం.ఎల్ల, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎం.ఎల్లకు విశిష్ట పురస్కారాన్ని అందిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే తెలుగు సినీ హాస్య నటుడు బ్రహ్మానందం, నిమ్స్ ఆస్పత్రి ఎనస్థీషియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ దుర్గాపద్మజ, తెలుగు సినిమా జర్నలిస్ట్ ఎస్వీ రామారావుకు విశేష పురస్కారాలు అందిస్తున్నట్టు వివరించారు. ఫౌండేషన్ కన్వీనర్ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ గతేడాది ఫౌండేషన్ తరఫున పురస్కారాలను ప్రకటించినా.. కరోనా కారణంగా వాటిని అందజేయలేదన్నారు. ఈ ఏడాది నిర్వహించే పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో వాటినీ అందిస్తామని చెప్పారు. నాబార్డ్ చైర్మన్ డాక్టర్ జీఆర్ చింతలకు విశిష్ట పురస్కారం, సినీ నటుడు సోనూసూద్కు ప్రత్యేక పురస్కారం, టీవీ యాంకర్ సుమకనకాల, హీలింగ్ హాస్థ హెర్బల్స్ప్రైవేట్ æలిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.మస్తాన్యాదవ్, షిర్డీలోని ద్వారకామయి సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ బి.శ్రీనివాస్కు విశేష పురస్కారాలను గతేడాది ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. పురస్కారాలను అందించే తేదీ, వేదిక తదితర వివరాలను త్వరలో తెలియజేస్తామని నాగభూషణం చెప్పారు. -
కోవాగ్జిన్ను గుర్తించిన ఆస్ట్రేలియా
మెల్బోర్న్: భారత్కు చెందిన భారత్ బయోటెక్ తయారీ కోవిడ్ టీకా కోవాగ్జిన్ను గుర్తిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కోవిడ్ మహమ్మారితో సరిహద్దులను మూసివేసిన ఆస్ట్రేలియా దాదాపు 20 నెలల తర్వాత మొదటిసారిగా దేశంలోకి ప్రయాణికులను అనుమతించింది. కోవాగ్జిన్తోపాటు చైనాకు చెందిన బీబీఐబీపీ–కోర్వీ టీకాను దేశంలోకి వచ్చే యాత్రికుల టీకా స్టేటస్ను నిర్థారించేందుకు పరిగణనలోకి తీసుకుంటామని ఆస్ట్రేలియా ప్రకటించింది. కోవాగ్జిన్ తీసుకున్న 12 ఏళ్లకు పైబడిన వారిని, బీబీఐబీపీ–కోర్వీ తీసుకున్న 18–60 ఏళ్ల గ్రూపు వారిని కోవిడ్ టీకా తీసుకున్నట్లు గుర్తించనున్నట్లు ఆస్ట్రేలియా సోమవారం తెలిపింది. -
ప్రపంచం చూపు మనవైపు: మోదీ
న్యూఢిల్లీ: మన దేశంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతమైన నేపథ్యంలో ప్రపంచమంతా మనవైపు చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ విజయగాథలో టీకా ఉత్పత్తిదారులు పెద్ద పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన శనివారం కోవిడ్–19 వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో సమావేశమయ్యారు. టీకాపై తదుపరి పరిశోధనలతోపాటు పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ), భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, జైడస్ క్యాడిలా, బయోలాజికల్ ఈ, జెనోవా బయోఫార్మా, పనాసియా బయోటెక్ సంస్థల ప్రతినిధులు ప్రధానితో జరిగి సమావేశానికి హాజరయ్యారు. దేశంలో కేవలం 9 నెలల్లో 100 కోట్ల కరోనా టీకా డోసులు ప్రజలకు పంపిణీ చేయడం గొప్ప ముందడుగు అని, మోదీ నాయకత్వ పటిమతోనే ఈ ఘనత సాధ్యమైందని వారు ప్రశంసించారు. ప్రధానితో భేటీ అనంతరం ఎస్ఐఐ చైర్మన్ అదార్ పూనావాలా మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి దార్శనికతతో తక్కువ సమయంలోనే 100 కోట్ల డోసులు ఇవ్వడం సాధ్యమయ్యిందని తెలిపారు. దేశంలో ఫార్మా రంగం అభివృద్ధి, భవిష్యత్తులో తలెత్తబోయే మహమ్మారులు, వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నద్ధతపై మోదీతో చర్చించినట్లు తెలిపారు. ప్రతికూలతను అవకాశంగా మార్చుకోవడం ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకత అని భారత్ బయోటెక్ సంస్థ అధినేత కృష్ణా ఎల్లా పేర్కొన్నారు. స్వల్ప వ్యవధిలో 100 కోట్ల టీకా డోసులు ఇవ్వడం అనేది సాధారణ విషయం కాదని, మోదీ పట్టుదల, అంకితభావంతో ఇది అచరణ సాధ్యమయ్యిందని చెప్పారు. ఒక నాయకుడు తన దేశానికి చేయగలిగిన గొప్ప పని ఇది అని కొనియాడారు. డీఎన్ఏ ఆధారిత కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి వెనుక మోదీ కృషి ఎంతగానో ఉందని జైడస్ క్యాడిలా సంస్థ ప్రతినిధి పంకజ్ పటేల్ చెప్పారు. -
కోవాగ్జిన్పై అదనపుసమాచారం కావాలి: డబ్ల్యూహెచ్ఓ
ఐక్యరాజ్యసవిుతి/జెనీవా: కోవిడ్–19 నియంత్రణ కోసం హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ పేరిట టీకాను అభివృద్ధి చేసింది. ఈ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు ఏప్రిల్ 19న దరఖాస్తు చేసుకుంది. అయితే, అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చే విషయంలో తొందరపడలేమని, కోవాగ్జిన్పై భారత్ బయోటెక్ నుంచి అదనపు సమాచారం ఆశిస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ సోమవారం స్పష్టం చేసింది. కోవాగ్జిన్ టీకా భద్రత, ప్రభావశీలతను క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉందని ట్విట్టర్లో తెలిపింది. -
పిల్లలకి వ్యాక్సిన్ ఇది సమయమేనా ?
రెండేళ్ల నుంచి 18 ఏళ్ల వయసు వారికి భారత్ బయోటెక్కు చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ వెయ్యొచ్చని నిపుణుల కమిటీ సిఫారసు చేయడంతో తల్లిదండ్రుల్లో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దలకు ఇచి్చన వ్యాక్సినే పిల్లలకీ ఇస్తారా ? సైడ్ ఎఫెక్ట్లు ఎలా ఉంటాయి? ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో మరోసారి పిల్లలకి కోవిడ్ వ్యాక్సిన్పై చర్చ తెరపైకి వచ్చింది. పిల్లలకి ప్రత్యేకంగా వ్యాక్సిన్ తయారు చేస్తారా? పిల్లలకి ప్రత్యేకంగా వ్యాక్సిన్ ఏమీ ఉండదు. అయితే డోసుని తగ్గించి ఇస్తారు. పెద్దలకు ఇచ్చే వ్యాక్సిన్ డోసులో సగం మాత్రమే పిల్లలకి ఇస్తారు. కోవాగ్జిన్ వ్యాక్సిన్ పెద్దలకి ఒక్క మిల్లీ లీటర్ డోసు రెండు విడతలుగా 28 రోజుల వ్యవధిలో ఇస్తున్నారు. పిల్లలకి అందులో సగం అంటే 0.5 ఎంల్ డోసుని రెండు విడతలుగా ఇస్తారు. ఒక్కో డోసు 0.25 ఎంఎల్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయా? చిన్నపిల్లలకి ఏ వ్యాక్సిన్ ఇచ్చినా కొద్దిగా జ్వరం, ఒళ్లు నొప్పులు, వ్యాక్సిన్ ఇచ్చిన చోట నొప్పి మాత్రమే ఉంటాయి. ఏయే వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి? మన దేశంలో 12 ఏళ్ల వయసు పైబడిన వారికి జైడస్ క్యాడిల్లా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చారు. డీఎన్ఏ ఆధారిత ఈ వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. పిల్లలకు అనుమతులు మంజూరైన తొలి వ్యాక్సిన్ ఇదే. అమెరికాకు చెందిన నొవావాక్స్ (భారత్లో దీనిని కొవావాక్స్ అని పిలుస్తున్నారు) వ్యాక్సిన్ను 2–17 ఏళ్ల వయసు వారికి ఇవ్వడానికి క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. పుణెకి చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ రెండు, మూడో దశ ప్రయోగాల్లో ఉంది. ఇక హైదరాబాద్కు చెందిన బయోలాజిక్ ఈ లిమిటెడ్ కార్బోవ్యాక్స్ వ్యాక్సిన్ 5 నుంచి 18 ఏళ్ల వయసు వారి కోసం ప్రయోగాలు నిర్వహించడానికి డీసీజీఐ అనుమతులిచ్చింది. ఇది సరైన సమయమేనా? కరోనా పిల్లలపై పెద్దగా ప్రభావం చూపించకపోవడం, దేశవ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పట్టిన ఈ సమయంలో వారికి వ్యాక్సిన్ వెయ్యడానికి ఇది సరైన సమయమేనా అన్న సందేహం చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది. అయితే వైద్య నిపుణులు మాత్రం పిల్లలకి కూడా వ్యాక్సిన్ వెయ్యాల్సిన అవసరం ఉందని అంటున్నారు. దేశ జనాభాలో పిల్లలు 25–30% వరకు ఉంటారు. వీరికి వ్యాక్సిన్ వెయ్యకపోతే, వ్యక్తిగతంగా వారికి నష్టం జరగకపోయినా వారు సూపర్ స్ప్రెడర్లుగా మారే ప్రమాదం ఉంది. అంతే కాదు ఇప్పుడిప్పుడే పలు రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రారంభించారు. దసరా తర్వాత కొన్ని రాష్ట్రాలు స్కూళ్లని తెరవడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పుడు స్కూలుకు వెళ్లే పిల్లలకి వ్యాక్సిన్ వెయ్యకపోతే రెండో వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్ మూడో వేవ్ బారిన పడే ప్రమాదం ఉంది. ఇతర దేశాల్లో పిల్లలకి వ్యాక్సిన్ ఎలా? అమెరికా, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ వంటి దేశాల్లో 12 ఏళ్ల వయసు పైబడిన వారికి ఫైజర్–బయోఎన్టెక్ వ్యాక్సిన్ను ఇప్పటికే ఇస్తున్నారు. ఇక రెండేళ్ల పిల్లలకి వ్యాక్సిన్ ఇస్తున్న మొట్టమొదటి దేశం క్యూబా. సెపె్టంబర్ 13 నుంచి ఆ దేశం చిన్నపిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వడం మొదలు పెట్టింది. చైనా, యూఏఈ, వెనెజులా దేశాలు రెండేళ్ల వయసు వారికి వ్యాక్సిన్ ఇవ్వడానికి సన్నాహాలు ప్రారంభించాయి. నిపుణుల అభిప్రాయాలు మొదటి వేవ్లో మొత్తం కేసుల్లో 4% పిల్లలకే సోకింది. రెండో వేవ్ వచ్చేసరికి 10–15% పిల్లల్లో కేసులు పెరిగాయి. పాఠశాలలు కూడా పునఃప్రారంభం కావస్తూ ఉండడంతో పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వడానికి ఇదే సమయం. చిన్నారులకి వ్యాక్సిన్ దేశంలో ఒక గేమ్ ఛేంజర్గా మారనుంది – డాక్టర్ సుజీర్ రంజన్, అసోసియేట్ డైరెక్టర్, టాటా ట్రస్ట్స్ కోవాగ్జిన్ వ్యాక్సిన్కి డబ్ల్యూహెచ్ఓ అనుమతి లభించలేదు. చాలా దేశాలు కోవాగ్జిన్ను గుర్తించడం లేదు. దీనికి కారణం పూర్తి స్థాయి డేటా లేకపోవడమే. అందుకే మరింత డేటా వచ్చేవరకు వేచి చూసి పిల్లలకు వేస్తే మంచిది. – డాక్టర్ శ్రీకాంత్, పీడియాట్రిషన్, బెంగళూరు – నేషనల్ డెస్క్, సాక్షి -
చిన్నారులకు కోవాగ్జిన్.. అనుమతించిన నిపుణుల కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్కు కేంద్ర ప్రభుత్వం కీలక అనుమతులు ఇచ్చింది. 2-18 ఏళ్ల వారికి కోవాగ్జిన్ టీకా వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యాక్సిన్లపై ఏర్పాటైన నిపుణుల కమిటీ ఈమేరకు అనుమతులు జారీ చేసింది. 18 ఏళ్ల లోపు వారిపై కోవాగ్జిన్ 2,3వ దశ ట్రయల్స్ని సెప్టెంబర్ నెలలోనే పూర్తి చేసింది భారత్ బయోటెక్. ఇటీవలే రెండు, మూడో దశ ట్రయల్స్ ఫలితాలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. 2, 3 దశల్లో 20 రోజుల గ్యాప్తో రెండు డోసుల వ్యాక్సిన్ను దాదాపు 525 మంది చిన్నారులపై ప్రయోగించారు. (చదవండి: కరోనా పూర్తి నిర్మూలన అసాధ్యం!) ఈ నేపథ్యంలో ‘‘పూర్తి చర్చల అనంతరం ఈ కమిటీ 2-18 ఏళ్ల చిన్నారులకు అత్యవసర పరిస్థితుల్లో పరిమిత వినియోగం కింద కోవాగ్జిన్ ఇచ్చేందుకుభారత్ బయోటెక్ కంపెనీకి అనుమతులిచ్చాం” అని సబ్జెక్ట్ నిపుణుల ప్యానెల్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: కోవాగ్జిన్ టీకా తీసుకున్న హంపి.. మేటి పోటీకి దూరం -
భారత్ బయోటెక్ కు మళ్ళీ షాక్
-
18 ఏళ్లలోపు వారికి కరోనా టీకా..
హైదరాబాద్: హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థ 18 ఏళ్లలోపు వారికి ఇచ్చే కోవాగ్జిన్ టీకా ఫేజ్ 2/3 ట్రయల్స్ పూర్తి చేసింది. 18 ఏళ్లు పైబడిన వారి కోసం ఇదే సంస్థ ఇప్పటికే కోవాగ్జిన్ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. పిల్లల కోసం అభివృద్ధి చేస్తున్న టీకాకు సంబంధించిన ఫేజ్ 2/3 ట్రయల్స్ వివరాలను వచ్చేవారం డీసీజీఐ(డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా)కి సమర్పించనున్నట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ కృష్ణ ఎల్లా మంగళవారం తెలిపారు. 18 ఏళ్లు దాటిన వారి కోసం కోవాగ్జిన్ టీకాల ఉత్పత్తి అక్టోబర్లో 55 మిలియన్ డోసులకు చేరుతుందని అన్నారు. ఒక్క సెప్టెంబర్లోనే 35 మిలియన్ డోసులు ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. ముక్కు ద్వారా ఇచ్చే కరోనా టీకా అభివృద్ధి ప్రక్రియ కొనసాగుతోందని, ఫేజ్ –2 ట్రయల్స్ వచ్చే నెలలో ముగియనుందని వివరించారు. వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించేందుకు ముఖద్వారం ముక్కేనని చెప్పారు. ముక్కు ద్వారా ఇచ్చే టీకాతో ముక్కులో ఇమ్యూన్ రెస్సాన్స్ పెరుగుతుందని వెల్లడించారు. తద్వారా వైరస్ నుంచి రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. ముక్కు ద్వారా ఇచ్చే టీకా ట్రయల్స్ను 650 మంది వలంటీర్లపై నిర్వహించామని చెప్పారు. కేంద్రం అనుమతిస్తే కోవాగ్జిన్ వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతి చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కృష్ణ ఎల్లా తెలిపారు. ఇప్పటికిప్పుడు విదేశీ మార్కెట్లలో పాగా వేయాలన్న ఆరాటం తమకు లేదన్నారు. -
కోవాగ్జిన్ ముడి పదార్థాలను అందజేసిన ఐఐఎల్..!
హైదరాబాద్: కోవిడ్ -19 వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి, కోవాగ్జిన్ ఉత్పత్తికి అవసరమయ్యే పదార్థాలను తయారుచేసే ఒప్పందంలో భాగంగా మొదటి బ్యాచ్ కోవాగ్జిన్ డ్రగ్ పదార్థాలను భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లాకు ఐఐఎల్ ఎమ్డీ డాక్టర్ కే. ఆనంద్కుమార్ శుక్రవారం రోజున అందజేశారు. కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్(బీబీఐఎల్), ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్(ఐఐఎల్)తో చేతులు కలిపాయి. 2021 ఏప్రిల్లో వీరి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్బంగా ఐఐఎల్ ఎమ్డీ డాక్టర్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ..రికార్డు సమయంలో కోవాగ్జిన్ ముడిపదార్థాలను తయారుచేయడం ఇతర స్టేక్ హోల్డర్స్ సహాయంతో లక్ష్యాన్ని ఛేదించామని పేర్కొన్నారు. నిర్వీరామంగా కంపెనీలోని ఉద్యోగులు పనిచేయడంతోనే ముడిపదార్థాల ఉత్పత్తి సాధ్యమైందని వెల్లడించారు. నీతి-ఆయోగ్, బీఐఆర్ఏసీ, డీబీటీ, మిషన్ కోవిడ్ సురక్ష బృందం, కేంద్ర రాష్ట్ర ఔషధ నియంత్రణ అధికారులు అందించే నిరంతర మద్దతుతో ఐఐఎల్ తమ లక్ష్యాన్ని సాధించిందని తెలిపారు. ఐఐఎల్ అతి తక్కువ సమయంలో బీబీఐఎల్ కంపెనీతో నాలుగు ఒప్పందాలను కుదుర్చుకుంది. -
భారత్లో కోవిడ్ టీకా: ఒక అడుగు ముందుకు.. రెండు వెనక్కు!
ఒక అడుగు ముందుకు పడితే... రెండు అడుగులు వెనక్కు!! ఇదీ దేశంలో కోవిడ్ టీకా కార్యక్రమం పరిస్థితి. 2021లోపు అర్హులైన ప్రజలందరికీ టీకాలేస్తామని... కేంద్రం ప్రకటనైతే చేసింది కానీ... అందుకు తగ్గట్టుగా టీకా ఉత్పత్తి, సరఫరా, పంపిణీలలో సమస్యలు ఎదురు కాకుండా చూడటంలో మాత్రం విఫలమైంది. మరి దేశం ఏడాది చివరిలోగా తన లక్ష్యాన్ని అందుకోగలదా? ఎన్ని టీకాలు వేశాం? ఎన్ని వేయాలి? ఏ ఏ కంపెనీలు ఉన్నాయి? అన్నది పరిశీలిస్తే.... వూహాన్లో పుట్టి ప్రపంచమంతా వ్యాపించి మానవాళికి పెనువిపత్తుగా పరిణమించిన కోవిడ్ను నిలువరించేందుకు ఉద్దేశించిన టీకా కార్యక్రమం దేశంలో నత్తనడకన సాగుతోందంటే తప్పేమీ కాదు. ఈ ఏడాది జనవరి పదహారవ తేదీన సీరమ్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్లు తయారు చేసిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలతో కార్యక్రమం మొదలైనా.. ఆ తరువాత ముడిసరుకుల కొరత, పంపిణీ లోపాలు, ప్రభుత్వ విధానాల్లో తరచూ మార్పుల వంటి అనేక సమస్యల కారణంగా ఆశించిన స్థాయిలో టీకాలు ఇవ్వలేకపోయామన్నది నిష్టూర సత్యం. తాజాగా ఆగస్టు 11వ తేదీ నాటికి దేశం మొత్తమ్మీద 51.90 కోట్ల మందికి టీకాలు ఇవ్వడం పూర్తయింది. అయితే ఇందులో రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 12 కోట్లు మాత్రమే ఉండటం గమనార్హం. ఒక డోసు తీసుకున్న వారు 40 కోట్లు ఉన్నారు. ఇంకోలా చెప్పాలంటే దేశ జనాభాలో వైరస్ నుంచి పూర్తిగా రక్షణ పొందిన వారు కొంచెం అటు ఇటుగా పది శాతం మంది మాత్రమే! సరఫరా సమస్యలకు అవగాహన రాహిత్యం, అపోహలు తోడు కావడంతో చాలామంది టీకాలు వేయించుకునేందుకు ఇప్పటికీ తటపటాయిస్తున్నారు. అవసరాలేమిటి? ఉత్పత్తి ఎంత? 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశంలో టీకాకు అర్హులైన వారు దాదాపు 95 కోట్ల మంది ఉన్నారని ప్రభుత్వం లెక్క కట్టింది. ఇప్పటివరకూ వీరిలో 11 శాతం మందికి రెండు డోసుల టీకాలు పడ్డాయి. అంటే.. ఇప్పటివరకూ ఒక డోసు వేసుకున్న 40 కోట్ల మందితోపాటు ఒక టీకా కూడా తీసుకోని 44 కోట్ల మందికి కలిపి దాదాపు 130 కోట్ల టీకాలు అవసరమవుతాయి. డిసెంబర్ నాటికల్లా మిగిలిన వారందరికీ టీకాలు ఇవ్వాలంటే కొంచెం అటు ఇటుగా నెలకు 29 కోట్ల టీకాలు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం దేశంలో టీకా ఉత్పత్తి 12 నుంచి 13 కోట్లకు మించి లేదు. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాగ్జిన్ ఉత్పత్తిలో నాణ్యత పరమైన సమస్యలు ఎదురయ్యాయని, ఫలితంగా ముందుగా అనుకున్న స్థాయిలో ఉత్పత్తి జరగలేదని టీకా కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి చెందిన ఎన్కే ఆరోరా ఇటీవలే తెలపడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఆగస్టు – డిసెంబర్ మధ్యకాలంలో 40 కోట్ల కోవాగ్జిన్ టీకాలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం మే నెలలోనే ప్రకటించింది. అయితే జనవరి –జూలై మధ్యకాలంలో సరఫరా చేసేందుకు అంగీకరించిన ఎనిమిది కోట్ల టీకాల్లోనూ భారత్ బయోటెక్ ఇందులో సగం కూడా అందించలేదని సమాచారం. కోవీషీల్డ్ తయారు చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ప్రస్తుతం నెలకు 11 నుంచి 12 కోట్ల టీకాలు ఉత్పత్తి చేస్తోంది. కొత్త టీకాలు కొన్నింటికి అనుమతులిచ్చినా వాటి ఉత్పత్తి లేదా సరఫరా ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితుల్లో అనుకున్న సమయానికి టీకా కార్యక్రమం పూర్తవడం కష్టసాధ్యం! అందుబాటులో ఐదు టీకాలు.. దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్లతో టీకా కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే. అయితే కొంత కాలం తరువాత రష్యా తయారు చేసిన స్పుత్నిక్–వీ వినియోగానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. అయితే స్థానికంగా తయారీలో కొన్ని సమస్యలు ఎదురు కావడంతో వీటిని రష్యా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇది జాప్యానికి దారితీసింది. తాజా సమాచారం ప్రకారం స్పుత్నిక్–వీ స్థానిక ఉత్పత్తి వచ్చే నెలకు గానీ ప్రారంభమయ్యే అవకాశం లేదు. రెండు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం మోడెర్నా వ్యాక్సిన్ అత్యవసర వాడకానికి అనుమతులు జారీ చేసినా... న్యాయపరమైన రక్షణ కల్పించాలన్న కంపెనీ డిమాండ్కు ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ఇప్పటివరకూ ఒక్క టీకా కూడా పడలేదు. తాజాగా అమెరికన్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకూ (సింగిల్ డోస్) ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ.. ఈ టీకాల వాడకం ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ఇదిలా ఉండగా.. జైడస్ క్యాడిల్లా జైకోవ్–డీ టీకాతోపాటు భారత్లో తయారైన మొట్టమొదటి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సీన్ ‘హెచ్జీసీఓ19’, భారత్ బయోటెక్ తయారు చేస్తున్న నాసల్ వ్యాక్సిన్లు మానవ ప్రయోగాల దశలో ఉన్నాయి. ఇవే కాకుండా... అమెరికన్ కంపెనీ తయారు చేస్తున్న నోవావ్యాక్స్ టీకాను భారత్లో కోవావ్యాక్స్ పేరుతో తయారు చేసేందుకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆగస్టు – డిసెంబర్ మధ్యకాలంలో దేశంలో పంపిణీ అయ్యే టీకాల జాబితాలో కోవావ్యాక్స్ను కూడా చేర్చడాన్ని బట్టి చూస్తే దీనికి త్వరలోనే అత్యవసర అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అగ్రరాజ్యం అమోరికా, ఇతర జీ7 సభ్యదేశాలు ఇస్తామన్న టీకాలు న్యాయపరమైన చిక్కుల కారణంగా ఇప్పటికీ అందలేదు. –నేషనల్ డెస్క్, సాక్షి -
డెల్టా ప్లస్ వేరియంట్పై కోవాగ్జిన్ సామర్థ్యం 62.5 శాతం
హైదరాబాద్: భారత్ బయోటెక్ కోవిడ్ -19 వ్యాక్సిన్ కోవాగ్జిన్ కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్పై ప్రభావవంతంగా పనిచేస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్(ఐసీఎంఆర్) బయో ఆర్క్సివ్లో ప్రచురించిన అధ్యయనం తెలిపింది. కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన వ్యక్తులకు కోవాగ్జిన్ రెండు డోసుల టీకాలను అందిచడం ద్వారా శరీరంలో ఐజీఎం యాంటీబాడీస్ పెరిగి బాధితులు కోలుకున్నట్లు ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. మూడో దశ 3 క్లినికల్ ట్రయల్లో డెల్టా వేరియంట్పై 65.2 శాతం ప్రభావం చూపించినట్లు తెలిపారు. కాగా కోవిడ్–19 టీకా కోవాగ్జిన్ సామర్థ్యం 77.8 శాతంగా తేలింది. ఇక బి.1.617.2 డెల్టా వేరియంట్పై సామర్థ్యం 65.2 శాతంగా తేలింది. ఇక దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య 46 కోట్ల మైలురాయి దాటింది. 54,94,423 శిబిరాల ద్వారా మొత్తం 46,15,18,479 వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయినట్టు శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి ఇప్పటి దాకా 3,07,81,263 మంది కోలుకున్నారు. -
బ్రెజిల్లో కోవాగ్జిన్ క్లినికల్ పరీక్షలు రద్దు
హైదరాబాద్: భారత్ బయోటెక్కు చెందిన కోవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలను బ్రెజిల్లో రద్దు చేస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య వ్యవహారాల నియంత్రణ విభాగం శనివారం ప్రకటించింది. బ్రెజిల్ మార్కెట్లోకి కోవాగ్జిన్ను తీసుకొచ్చేందుకు అక్కడి ప్రెసికా మెడికమెంటోస్, ఎన్విక్సా పార్మాస్యూటికల్స్ ఎల్.ఎల్.సీతో చేసుకున్న అవగాహన ఒప్పందం(ఎంవోయూ)ను రద్దుచేసుకున్నట్లు భారత్ బయోటెక్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెల్సిందే. బ్రెజిల్కు ఈ ఏడాది రెండో, మూడో త్రైమాసికాల్లో 2 కోట్ల డోస్ల కోవాగ్జిన్ టీకాలను సరఫరా చేసే ఒప్పందంలో భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకుందనే వార్తల నేపథ్యంలో ఈ ఎంవోయూ రద్దయింది. టీకా సరఫరాలో ముడుపులు, అవకతవకల ఆరోప ణలపై బ్రెజిల్ సెనెట్ దర్యాప్తునకు ఆదేశించడం తెల్సిందే. ఒప్పందం రద్దుపై బ్రెజిల్ జాతీయ ఆరోగ్య నియంత్రణ సంస్థ (ఏఎన్వీఐఎస్ఏ)కు భారత్ బయోటెక్ ఓ లేఖ రాయడంతో క్లినికల్ పరీక్షలు రద్దుచేశారు. బ్రెజిల్లో భారత్ బయోటెక్కు ప్రెసికా మెడికమెంటోస్ సంస్థ భాగస్వామిగా వ్యవహరించింది. అనుమతి పత్రాల సమర్పణ, స్థానికంగా తోడ్పాటు, లైసెన్స్, పంపిణీ, ఇన్సూరెన్స్, మూడో దశ క్లినికల్ పరీక్ష తదితర బాధ్యతలను ప్రెసికా మెడికమెంటోస్ చూసుకునేది. ఇంత వరకూ బ్రెజిల్లో కోవాగ్జిన్ పరీక్షలు చేపట్టనేలేదు. -
Covaxin: రాజకీయ దుమారం.. బ్రెజిల్ డీల్ క్యాన్సిల్!
అవినీతి ఆరోపణలు, రాజకీయ విమర్శల కారణంగా.. భారత్ బయోటెక్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రెజిల్తో కుదుర్చుకున్న కోవిడ్ వ్యాక్సిన్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బ్రెజిల్లో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కరోనా కారణంగా 2లక్షల మందికి పైగా మరణించడంతో అధ్యక్షుడిపై విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ త్వరగతిన సరఫరా కోసం బ్రెజిల్ అధ్యక్షుడు జైరో బొల్సొనారో మనదేశానికి చెందిన భారత్ బయోటెక్తో ఒప్పందం కుదర్చుకున్నారు. భారత్ బయోటెక్కు చెందిన కోవాగ్జిన్ను బ్రెజిల్ మార్కెట్లో విడుదల చేసేందుకు బొల్సొనారో మధ్యవర్తిగా ప్రముఖ ఫార్మసంస్థ ప్రెసిస మెడికామెంటోస్,ఎన్విక్సియా ఫార్మాసూటికల్స్ అనుమతించారు. ఈ క్రమంలో... ఒక్కోడోసు 15 డాలర్ల చొప్పున 300 మిలియన్ డాలర్లు విలువ చేసే 20 మిలియన్ డోసులను తెప్పించుకునేందుకు బొల్సొనారో సర్కార్ ఒప్పందం చేసుకుంది.. అయితే ఈ వ్యాక్సిన్ ఒప్పందంలో బొల్సొనారోపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. కోవాగ్జిన్ను తన సన్నిహితులకు చెందిన ఫార్మా సంస్థ ప్రెసిసా మెడికామెంటోస్కు అప్పగించడం ద్వారా ఏకంగా 10 కోట్ల డాలర్లు (రూ. 734 కోట్లు) ముడుపులు అందుకున్నారని ఆయనపై విమర్శలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు కూడా విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో టీకా అనుమతుల్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. ఆ వెంటనే.. బ్రెజిల్ సైతం తమ దేశంలో కోవాగ్జిన్ క్లినికల్ ట్రయిల్స్ మూడోదశ నిర్వహించడాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. అయితే ఒప్పందం రద్దైనప్పటికీ .. కోవాగ్జిన్ను సరఫరా చేయడానికి అవసరమైన అనుమతులు పొందడానికి బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ సంస్థ అనివిసాతో భారత్ బయోటెక్ కలిసి పని చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. -
కోవిషీల్డ్ రూ.205.. కోవాగ్జిన్ రూ.215..
న్యూఢిల్లీ: 66 కోట్ల డోసుల కోవిషీల్డ్,కోవాగ్జిన్ వ్యాక్సిన్ల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ పెట్టిందని అధికారులు వెల్లడించారు. వీటిలో 37.5 కోట్ల కోవిషీల్డ్ డోసులను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి, 28.5 కోట్ల కోవాగ్జిన్ డోసులను భారత్ బయోటెక్ నుంచి కేంద్ర ఆరోగ్య శాఖ కొనుగోలు చేసింది. ఇవి ఆగస్టు నుంచి డిసెంబర్లోగా కేంద్రానికి చేరేలా ఉత్పత్తి ఏర్పాట్లను ఆయా కంపెనీలు చేపట్టనున్నాయి. కేంద్రం కొనుగోలు చేసిన రేట్ల ప్రకారం ఒక్కో డోసు కోవిషీల్డ్ టీకా ధర రూ. 205, కోవాగ్జిన్ రూ. 215గా ఉండనుంది. పన్నులు కలుపుకుంటే కోవిషీల్డ్ ధర రూ. 215.25, కొవాగ్జిన్ ధర రూ. 225.75గా ఉండనుంది. జూన్ నుంచి అమల్లోకి వచ్చిన నూతన వ్యాక్సిన్ విధానం కారణంగా టీకాల రేట్లు పెరిగాయని అధికారులు తెలిపారు. -
కోవాగ్జిన్పై ఆరు వారాల్లో నిర్ణయం
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాగ్జిన్ కోవిడ్ టీకాకు వచ్చే ఆరు వారాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర వినియోగ అనుమతిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్ఓ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. సెంటర్ ఫర్ సైన్స్అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) ఏర్పాటు చేసిన ఒక వెబినార్లో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడారు. డబ్ల్యూహెచ్ఓ అత్యవసర వినియోగ జాబితా(ఈయూఎల్)లో ఏదైనా కొత్త టీకాను చేర్చాలంటే అది నిర్దేశిత పనితీరు స్థాయిని చేరుకోవాల్సి ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. కనీసం మూడు నుంచి నాలుగు ట్రయల్స్కు చెందిన వివరాలను డబ్ల్యూహెచ్ఓకు అందించాలని తెలిపారు. డబ్ల్యూహెచ్ఓలోని నిపుణుల సలహా బృందం ఆయా సమాచారాన్ని విశ్లేషించి అనుమతుల జారీపై తమ సూచనలు ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. కోవాగ్జిన్కు చెందిన సమాచారం ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓకు చేరిందని అని తెలిపారు. నెలన్నరలోగా కోవాగ్జిన్ అత్యవసర వినియోగ జాబితాలో చేరే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఫైజర్/బయోఎన్టెక్, ఆస్ట్రాజెనెకా–ఎస్కే బయో/ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆస్ట్రాజెనెకా ఈయూ, జాన్సెన్, మోడెర్నా, సినోఫార్మ్ టీకాలను డబ్ల్యూహెచ్వో తమ ఈయూఎల్ జాబితాలో ఇప్పటికే చేర్చింది. మరో 105 వ్యాక్సిన్లు కూడా వివిధ దశల ట్రయల్స్లో ఉన్నాయని వెల్లడించారు. అందులో 27 వ్యాక్సిన్లు మూడు/నాలుగు ట్రయల్స్ను దాటాయని పేర్కొన్నారు. మరో 184 వ్యాక్సిన్లు ప్రీ క్లినికల్ దశలో ఉన్నాయని చెప్పారు. ఇటీవల డెల్టా వేరియంట్ తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ, జాగ్రత్తలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. -
డెల్టాపై కోవాగ్జిన్ ప్రభావం 65%
హైదరాబాద్: కోవిడ్ 19 వైరస్ వేరియంట్లపై భారత్ బయోటెక్కు చెందిన కోవాగ్జిన్ చూపే ప్రభావం మదింపు గణాంకాలను కంపెనీ వెల్లడించింది. ఫేజ్ 3 ప్రయోగాల విశ్లేషణ అనంతరం కోవాగ్జిన్ టీకా సింప్టమాటిక్ కోవిడ్– 19కు వ్యతిరేకంగా 77.8 శాతం, డెల్టా వేరియంట్కు వ్యతిరేకంగా 65.2 శాతం రక్షణ కల్పిస్తుందని తెలిపింది. ఈ టీకా తీసుకున్న 12 శాతం మందిలో సాధారణ సైడ్ ఎఫెక్టులు, 0.5 శాతం మందిలో సీరియస్ సైడ్ ఎఫెక్టులు సేఫ్టీ అనాలసిస్ తెలియజేసిందని కంపెనీ వెల్లడించింది. లక్షణాల్లేని కోవిడ్కు వ్యతిరేకంగా టీకా 63.6 శాతం రక్షణనిస్తుందని తెలిపింది. సెకండ్ డోస్ ఇచ్చిన రెండువారాల పాటు దాదాపు 25 నగరాల్లో ఫేజ్ 3 ట్రయల్స్ను నిర్వహించారు. టీకా ట్రయల్స్తో నూతన ఆవిష్కరణలో ఇండియా సత్తా వెల్లడయిందని కంపెనీ సీఎండీ కృష్ణ ఎల్లా చెప్పారు. ఐసీఎంఆర్ సహకారంతో కంపెనీ ఈ టీకా తయారు చేసింది. టీకా ట్రయల్స్ ఫలితాలపై ఐసీఎంఆర్ సంతృప్తిని వ్యక్తం చేసింది. అన్ని రకాల వేరియంట్లపై కోవాగ్జిన్ ప్రభావం చూపుతుందని ఐసీఎంఆర్ డైరెక్టర్ భార్గవ చెప్పారు. ప్రపంచ టీకా ఉత్పత్తి రంగంలో భారత స్థానాన్ని కోవాగ్జిన్ మరింత బలోపేతం చేసిందన్నారు. వ్యాక్సిన్ డోసులు @ 34.46 కోట్లు సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్లో పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోస్ల సంఖ్య 34.46 కోట్లు దాటింది. శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 45,60,088 శిబిరాల ద్వారా 34,46,11,291 డోసుల పంపిణీ జరిగింది. గత 24 గంటల్లో 43,99,298 వ్యాక్సిన్ డోస్లను అందించారు. దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 44,111 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 6 రోజులుగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 50వేలలోపు నిర్ధారణయ్యాయి. కోవిడ్ బారినపడి ఒక్క రోజులోనే మరో 738 మంది చనిపోవడంతో మొత్తం మరణాలు 4,01,050కు పెరిగాయి. అదే సమయంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యలోనూ తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కరోనా రోగుల సంఖ్య 4,95,533కు చేరింది. 97 రోజుల తరువాత ఈ సంఖ్య 5 లక్షల లోపుకు పడిపోయింది. గత 24 గంటల్లోనే కరోనా చికిత్సలో ఉన్న వారి సంఖ్య 14,104కు తగ్గింది. మరోవైపు కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. 51 రోజులుగా కొత్త కేసుల కంటే కోలుకుంటున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పటివరకూ కోవిడ్ బారిన పడి కోలుకున్న వారు 2,96,05,779 మంది కాగా, గత 24 గంటల్లో 57,477 మంది కోలుకున్నారు. అంతకు ముందురోజు కంటే 13,366 మంది అదనంగా కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి శాతం 97.06కు పెరిగింది. -
Covaxin:మూడో దశ ట్రయల్స్ ఫలితాల రిపోర్ట్ విడుదల
నూఢిల్లీ: కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ఫలితాల రిపోర్టును భారత్ బయోటెక్ కంపెనీ శనివారం రిలీజ్ చేసింది. దీని ప్రకారం ఈ వ్యాక్సిన్ ఓవరాల్గా 78 శాతం సమర్థవంతంగా పని చేస్తుందని కంపెనీ ప్రకటించింది. అలాగే... ప్రపంచాన్ని ప్రస్తుతం భయపెడుతున్న డెల్టా వేరియంట్ విషయంలో ఇది 65.2 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు తేలింది. కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయోటెక్ కంపెనీ... మెడ్జివ్లో ప్రచురించింది. ఇండియాలో జరిగిన అతిపెద్ద ఎఫికసీ ట్రయల్లో కోవాగ్జిన్ సేఫ్ వ్యాక్సిన్ రుజువైంది అని కంపెనీ తెలిపింది. నవంబర్ 16, 2020లో జరిగిన మూడో దశ ట్రయల్స్లో 25,798 మంది పాల్గొన్నారు. మొదటి డోస్ తీసుకున్నారు. అలాగే... జనవరి 7, 2021న 24,419 మంది రెండో డోసు తీసుకున్నారు. "వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎవరూ చనిపోలేదు. కోవిడ్ వ్యాధిని నిర్మూలించడంలో... ఈ వ్యాక్సిన్ బాగా పనిచేసింది. ముఖ్యంగా పెద్దవాళ్లలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఇది బాగా పనిచేసింది" అని కంపెనీ తెలిపింది. మొత్తం 146 రోజులపాటూ... వ్యాక్సిన్ వేసుకున్న వారిని పరిశీలించారు. ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ పూర్తి చేయడం ద్వారా... అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా కరోనా వ్యాక్సిన్ తయారు చెయ్యగలవు అని నిరూపించినట్లు అయ్యింది అని భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. దేశంలోని మొత్తం 25 ఆస్పత్రుల్లో మూడో ట్రయల్స్ జరిగాయి. ఇందులో వ్యాక్సిన్ సామర్ధ్యం, సురక్షితమా కాదా... వ్యాధి నిరోధక శక్తి ఎలా పెరుగుతోంది అనే అంశాల్ని పరిశీలించారు. తీవ్రమైన కేసుల్లో ఇది 93.4 శాతం సమర్థతతో పనిచేస్తోందని కంపెనీ తెలిపింది. COVAXIN® Proven SAFE in India's Largest Efficacy Trial. Final Phase-3 Pre-Print Data Published on https://t.co/JJh9n3aB6V pic.twitter.com/AhnEg56vFN — BharatBiotech (@BharatBiotech) July 2, 2021 -
‘కోవాగ్జిన్’ ఒప్పందానికి బ్రేక్
హైదరాబాద్: దేశీయ కోవిడ్–19 టీకా కోవాగ్జిన్ ఉత్పత్తిదారులైన భారత్ బయోటెక్తో 2 కోట్ల టీకా డోసుల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాన్ని బుధవారం బ్రెజిల్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసింది. ఒప్పందంలో అవినీతి సహా పలు అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో బ్రెజిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో ఇప్పటివరకు అడ్వాన్స్ పేమెంట్ ఏదీ తీసుకోలేదని భారత్ బయోటెక్ తెలిపింది. ఒప్పందం కుదుర్చుకునే విషయంలో.. తాము విజయవంతంగా టీకా డోసులను సరఫరా చేసిన పలు ఇతర దేశాలతో అనుసరించిన విధానాన్నే బ్రెజిల్తోనూ అనుసరించామని పేర్కొంది. దేశ కంప్ట్రోలర్ జనరల్ సిఫారసు మేరకు భారత్ బయోటెక్తో కోవాగ్జిన్ టీకా కొనుగోలు ఒప్పందాన్ని జూన్ 29 నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు బ్రెజిల్ వైద్య శాఖ ప్రకటించింది. ఈ ఒప్పందాన్ని వైద్య శాఖకు చెందిన ఇంటిగ్రిటీ డైరెక్టరేట్ కూడా సమీక్షించిందని, ఒప్పందానికి సంబంధించిన పరిపాలనపరమైన అంశాలపై విచారణ కొనసాగుతోందని తెలిపింది. ఈ నిర్ణయంపై భారత్ బయోటెక్ స్పందిస్తూ.. బ్రెజిల్ నుంచి ముందస్తుగా ఎలాంటి చెల్లింపులను తాము స్వీకరించలేదని, అలాగే, బ్రెజిల్కు ఇప్పటివరకు టీకాలను కూడా సరఫరా చేయలేదని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ‘ప్రెసికా మెడికామెంటోస్’సంస్థ ‘భారత్ బయోటెక్’కు బ్రెజిల్లో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. బ్రెజిల్లో నియంత్రణ అనుమతులు, బీమా, లైసెన్స్, ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ తదితర విషయాల్లో ఈ సంస్థ భారత్ బయోటెక్కు సహకరిస్తోంది. ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై బ్రెజిల్ అటార్నీ జనరల్ దర్యాప్తు ప్రారంభించారు. ముందు జాగ్రత్తగానే ఒప్పందంపై తాత్కాలిక నిషేధం విధించామని కంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ వాగ్నర్ రోస్రియొ తెలిపారు. ‘ఒప్పందానికి సంబంధించిన ఆడిట్పై వారం క్రితం ప్రాథమిక విచారణ ప్రారంభించాం. సాధ్యమైనంత త్వరగా విచారణ ముగిస్తాం’అన్నారు. ఒప్పందానికి సంబంధించి ప్రాథమికంగా ఎలాంటి అవకతవకలను గుర్తించలేదని, అయితే, విచారణ కొనసాగించాలన్న నిర్ణయం నేపథ్యంలో నిబంధనల మేరకు తాత్కాలిక నిషేధం విధించామని బ్రెజిల్ వైద్య మంత్రి మార్సెల్ క్వీరొగా వెల్లడించారు. బ్రెజిల్కు 15 డాలర్లకు ఒక డోసు చొప్పున అమ్మేందుకు భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో డోసుకు 15 నుంచి 20 డాలర్ల మధ్య పలు ఇతర దేశాలతో కూడా ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్స్ పేమెంట్ కూడా తీసుకున్నామని భారత్ బయోటెక్ వెల్లడించింది. ‘డెల్టా’పై కొవాగ్జిన్ పనితీరు భేష్: ఎన్ఐహెచ్ డెల్టా వేరియంట్పై కోవాగ్జిన్ టీకా సమర్థవంతంగా పనిచేస్తోందని అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. కరోనా ఆల్ఫా వేరియంట్పైనా ఈ టీకా చక్కగా పనిచేస్తోందని పేర్కొంది. ఎన్ఐహెచ్, భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) మధ్య పలు శాస్త్రీయ పరిశోధనల్లో భాగస్వామ్యం ఉంది. కోవాగ్జిన్ రూపకల్పనలోనూ ఎన్ఐహెచ్ సహకరించింది. -
Covaxin: భారత్ బయోటెక్కు మరోసారి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ డీల్ను బ్రెజిల్ ప్రభుత్వం రద్దు చేసుకుంది. 2 కోట్ల కోవాగ్జిన్ సరఫరాకు బ్రెజిల్తో భారత్ బయోటెక్ ఒప్పందం కురుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ విలువ రూ.2,234 కోట్లు, కాగా, వ్యాక్సిన్ సరఫరాలో ముడుపులు ముట్టాయని సెనేటర్స్ ఆరోపణ. దాదాపు రూ.734 కోట్ల మేర ముడుపులు మధ్యవర్తి కంపెనీతో పాటు.. బ్రెజిల్ ప్రెసిడెంట్కి ముట్టినట్టు సెనేటర్లు ఆరోపిస్తున్నారు. ఇదో కుంభకోణంగా సెనేటర్లు అనుమానిస్తున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో ప్రత్యేక ఆసక్తిని కనబర్చారని, ఆయన సన్నిహితులకు లబ్ధి చేకూరేలా లావాదేవీలు జరిగాయని అంటున్నారు. చదవండి: కోవాగ్జిన్ ఒప్పందం.. బ్రెజిల్లో ప్రకంపనలు -
కోవాగ్జిన్కు మరోసారి చుక్కెదురు!
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ కోవాగ్జిన్కు మరోసారి చుక్కెదురైంది. కోవాగ్జిన్కు పూర్తి స్థాయి లైసెన్స్ ఇచ్చేందుకు డీసీజీఐ అంగీకరించలేదు. మరింత క్లినికల్ ట్రయల్స్ డేటా కావాలని భారత్ భారత్ బయోటెక్కు డీసీజీఐ తెలిపినట్లు సమాచారం. దీంతో ఫుల్లైసెన్స్ పర్మిషన్ ఇచ్చేందుకు మరో ఏడాది సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా కోవాగ్జిన్ను గర్బిణీలకు వాడొద్దని డీసీజీఐ తెలిపింది. ఇక ప్రస్తుతం అత్యవసర వినియోగం కింద కోవాగ్జిన్ వినియోగిస్తున్నారు. కాగా, తాజాగా 77.8శాతం సమర్ధత ఉందంటూ డీసీజీఐకి కొవాగ్జిన్ డేటా ఇచ్చింది. మూడో దశ ప్రయోగాలను 25,800 మందిపై చేసిన భారత్ బయోటెక్ సంస్థ తన డేటాను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి కోసం పంపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై ఇప్పటి వరకు భారత్ బయోటెక్ స్పందించలేదు. ఇప్పటికే అమెరికాలో కోవాగ్జిన్ సరఫరాకు యూఎప్ఎఫ్డీఏ అంగీకరించని సంగతి తెలిసిందే. చదవండి: వైరల్: చెంప దెబ్బ కొట్టిన ఎస్పీ.. కాలితో తన్నిన సీఎం పీఎస్ఓ -
కోవాగ్జిన్ సామర్థ్యం 77.8 శాతం
న్యూఢిల్లీ: హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవిడ్–19 టీకా కోవాగ్జిన్ సామర్థ్యం 77.8 శాతంగా తేలింది. మూడో దశ ప్రయోగాలను 25,800 మందిపై చేసిన సంస్థ తన డేటాను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి కోసం పంపింది. ఈ డేటాను సమీక్షించిన కోవిడ్–19 సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) దానికి ఆమోదం తెలిపినట్టు మంగళవారం డీసీజీఐ వర్గాలు వెల్లడించాయి. కొవాగ్జిన్ సామర్థ్యాన్ని ఆమోదించిన ఎస్ఈసీ తన సిఫారసులను డీసీజీఐకి పంపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ అనుమతి జాబితా (ఈయూఎల్)లో కొవాగ్జిన్ వ్యాక్సిన్ను చేర్చడానికి ఎప్పట్నుంచో భారత్ బయోటెక్ సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ టీకా సామర్థ్యాన్ని పరిశీలించి అనుమతులు ఇవ్వడానికి ఈ నెలæ 23న డబ్ల్యూహెచ్ఓ సమావేశం కానుంది. ఈ సమావేశానికి సంస్థ ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇదే సమయంలో మూడో దశ ప్రయోగాల డేటాకు నిపుణుల కమిటీ అనుమతి లభించడం భారత్ బయోటెక్కు ఊరట కలిగించే అంశం. చదవండి: సహకారంతోనే సంస్కరణలు -
కోవాగ్జిన్ ఒప్పందం.. బ్రెజిల్లో ప్రకంపనలు
సావో పాలో: భారత్ బయోటెక్కు చెందిన కోవాగ్జిన్ సరఫరా కోసం కుదిరిన ఒప్పందం బ్రెజిల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంట్లో అవినీతి జరిగిందనే కోణంలో పార్లమెంటరీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ (సీపీఐ) ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇదో కుంభకోణంగా సెనేటర్లు అనుమానిస్తున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో ప్రత్యేక ఆసక్తిని కనబర్చారని, ఆయన సన్నిహితులకు లబ్ధి చేకూరేలా లావాదేవీలు జరిగాయని ఆరోపణ. అమెరికాకు చెందిన ఫైజర్, చైనాకు చెందిన సినోవాక్ను కాదని... ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో), బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ సంస్థ (అన్విసా)ల అనుమతి పొందని కోవాగ్జిన్ కోసం బ్రెజిల్ ప్రభుత్వం అత్యుత్సాహంతో ఎందుకు ఒప్పందం చేసుకుందని, ఏ ప్రయోజనాలు ఆశించిందని ఆరోగ్యరంగ నిపుణులు, సెనేటర్లు ప్రశ్నిస్తున్నారు. వ్యాక్సిన్లను నమ్మరు.. కోవాగ్జిన్పై అమితాసక్తి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాగే బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో కోవిడ్–19ను తేలికగా తీసుకొని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. మాస్కును ధరించకపోవడం... సామాజిక దూరా న్ని పాటించపోవడంతో అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ప్రభుత్వం కరోనా నియంత్రణలో సరిగా వ్యవహరించకపోవడం వల్లే బ్రెజిల్ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందనే ఆగ్రహావేశాలు దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్నాయి. మూడు నాలుగు రోజుల కిందటే బ్రెజిల్లో కోవిడ్ మరణాలు ఐదు లక్షల మార్కును దాటేశాయి. వ్యాక్సిన్లను పెద్దగా విశ్వసించని బొల్సొనారో కోవాగ్జిన్తో ఒప్పందానికి మాత్రం అమితాసక్తి చూపించారు. ఈ ఏడాది జనవరిలో భారత్లో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. ‘వెంటనే జనవరి 8వ తేదీన భారత ప్రధాని మోదీతో బొల్సొనారో ఫోన్లో మాట్లాడారు. తమకు కోవాగ్జిన్ కావాలని అభ్యర్థించారు. కొనుగోలుకు ఆసక్తిని వ్యక్తం చేశారు. ప్రెపిసా మెడికామెంటోస్ ప్రతినిధులు జనవరి 6, 8వ తేదీల్లో ఢిల్లీలోనే ఉన్నట్లు తేలింది. బొల్సొనారోకు ప్రవర్తన కోవాగ్జిన్ కొనుగోలు ఒప్పందంలో తెరవెనుక ఏదో జరిగిం దనే అనుమానాలకు తావిస్తోంది’ అని సెనేట్ కమిషన్కు ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సెనేటర్ రాండోల్ఫ్ రోడ్రిగ్స్ శనివారం వ్యాఖ్యానించారు. ఒత్తిడి తెచ్చారు కోవాగ్జిన్ దిగుమతికి పూచీ ఇవ్వాల్సిందిగా తనపై అసాధారణ ఒత్తిడి వచ్చిందని బ్రెజిల్ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు పార్లమెంటరీ ప్యానెల్కు తెలిపారు. మాజీ ఆరోగ్యమంత్రి ఎడ్వర్డో పాజుయెలోకు సన్నిహితుడైన లెఫ్టినెంట్ కల్నల్ అలెక్స్ లియాల్ మారిన్హో ఈ మేరకు తనను తీవ్ర ఒత్తిడికి గురిచేశారని సదరు ఉన్నతాధికారి వెల్లడించారు. కోవాగ్జిన్ కొనుగోలులో ప్రెసిసా మెడికామెంటోస్ పాత్రపై సెనేట్ కమిషన్ దర్యాప్తు చేస్తోంది. కుంభకోణాల నిగ్గుతేలుస్తాం. ఏరకంగా చూసినా ఇది అసాధారణ సేకరణ ఒప్పందమే’ అని ప్యానెల్ ప్రతినిధి, సెనేటర్ రెనాన్ కాల్హీరోస్ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రెసిసా మెడికామెంటోస్ మేనేజింగ్ పార్ట్నర్ ఫ్రాన్సిస్కో మాక్సిమియానోను బుధవా రం పార్లమెంటరీ ప్యానెల్ ప్రశ్నించనుంది. మాక్సిమియానో టెలికమ్యూనికేషన్ డేటా మొత్తం సమీకరించి ప్యానెల్కు అందుబాటులో ఉంచారు. సెనెటర్ల నుంచి ఆయన లోతైన ప్రశ్నలను ఎదుర్కొనబోతున్నారు. మాక్సిమియానో విచారణ మొత్తం టీవీల్లో ప్రత్యక్షప్రసారం కానుంది. గతకొద్ది రోజులుగా కోవాగ్జిన్ ఒప్పందంపై పార్లమెంటరీ ప్యానెల్ విచారణకు సంబంధించిన అంశాలు బ్రెజిల్ టీవీ ఛానళ్లలో ప్రముఖంగా ప్రసారమవుతున్నాయి. ఏం జరిగింది? భారత్ బయోటెక్ ఉత్పత్తి అయిన కోవాగ్జిన్ 2 కోట్ల డోసులను (టెక్నాలజీని బదిలీ చేసే అంశం కూడా ఉంది) సరఫరా చేయడానికి 300 మిలియన్ డాలర్లు (రూ.2.230 కోట్లు) చెల్లించేలా బ్రెజిల్ ఆరోగ్యశాఖ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో బ్రెజిల్కు చెందిన ప్రెసిసా మెడికామెంటోస్ మధ్యవర్తిగా వ్యవహరించింది. దీనికిగాను ప్రెసిసా మెడికామెంటోస్కు ఏకంగా 10 కోట్ల డాలర్లు (రూ. 734 కోట్లు) ముట్టాయనే పత్రాలు పార్లమెంటరీ ప్యానెల్ దగ్గర ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో సన్నిహిత గ్రూపులకు ఇందులో వాటా దక్కిందనే అనుమానాలున్నాయి. వీటిపైనే పార్లమెంటరీ ప్యానెల్ దర్యాప్తు జరుపుతోంది. 2 కోట్ల వ్యాక్సిన్ కొనుగోలుకు 2,230 కోట్లతో ఒప్పందం చేసుకోగా... ఇందులో మూడోవంతు అంటే 734 కోట్ల రూపాయలు మధ్యవర్తి సంస్థకు దక్కడం పలు సందేహాలకు తావిస్తోంది. అయితే బ్రెజిల్ ఆరోగ్యశాఖ మాత్రం తామింకా ఎలాంటి చెల్లింపులు చేయలేదని చెబుతోంది. 2020 నవంబరులో బ్రెజిల్తో భారత్ బయోటెక్కు ఒప్పందం కుదిరింది. భారత సాంకేతిక ప్రగతిని ఇదొక నిదర్శనంగా పేర్కొన్నారు. కానీ ఎనిమిది నెలలు దాటిపోయింది. ఇప్పటిదాకా బ్రెజిల్లో ఒక్కరికీ కోవాగ్జిన్ ఇవ్వలేదు. ఎందుకంటే మూడోదశ క్లినికల్ ట్రయల్స్కు సంబంధించిన డేటాను సమర్పించలేదని, సరైన ఉ్పత్పత్తి ప్రమాణాలు లేవని అన్విసా మార్చి 31న కోవాగ్జిన్ వాడకానికి అనుమతి నిరాకరించింది. చివరకు ఈనెల 4వ తేదీన పలు కఠిన షరతులతో 40 లక్షల డోసుల కోవాగ్జిన్ దిగుమతికి అనుమతించింది. ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అనుమతి రాకముందే... పచ్చజెండా ఊపడం వెనుక బొల్సొనారో ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రశ్నిస్తున్నారు. -
Covaxin అనుమతులకై జూన్ 23న డబ్ల్యూహెచ్ఓతో భేటీ
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) గుర్తింపు కోసం భారత్ బయోటెక్ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అవసరమైన పత్రాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందజేసినట్లు భారత్ బయోటెక్ తెలిపింది. అనుమతుల విషయమై డబ్ల్యూహెచ్ఓతో ఈ నెల 23న సమావేశం కానున్నట్లు తెలిపింది. అత్యవసర వినియోగ జాబితా (ఈయూఎల్) కోసం అవసరమైన 90శాతం డాక్యుమెంట్లను గతంలోనే సమర్పించినట్లు కంపెనీ తెలిపింది. మిగతా పత్రాలను ఈ నెలలో అందజేయాల్సి ఉంది. కోవాగ్జిన్ వ్యాక్సిన్కు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు కోసం విదేశాంగ శాఖ భారత్ బయోటెక్తో సమన్వయం చేస్తోంది. ఇండియన్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. ఇక భారత్లో అత్యవసర వినియోగం పొందిన మూడు కోవిడ్ టీకాల్లో కోవాగ్జిన్ ఒకటి. ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ని ప్రారంభించింది. ఈ క్రమంలో జనవరి 16న తొలిదశ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఫ్రంట్లైన్ వర్కర్స్కి టీకా వేసింది. ఇక మార్చిలో ప్రారంభించిన రెండో దశ టీకా క్యాక్రమంలో భాగాంగా 60 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వగా.. ఏప్రిల్ 1న మూడో దశ వ్యాక్సినేషన్లో భాగంగా 18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. చదవండి: Covaxin ఇంతకంటే ధర తగ్గించలేం: భారత్ బయోటెక్ -
Covaxin ఇంతకంటే ధర తగ్గించలేం: భారత్ బయోటెక్
సాక్షి, న్యూఢిల్లీ: కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధరలపై దేశీయ ఫార్మా సంస్థ భారత్ బయెటెక్ ఉసూరు మనిపించింది. ప్రైవేట్లోఎట్టిపరిస్థితుల్లోనూ కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధరలను తగ్గించలేమని భారత్ బయోటెక్ ప్రకటించింది. ఈ మేరకు సంస్థ మంగళవారం ఒక విఢుదల చేసింది. తమకు నష్టాలొస్తున్నప్పటికీ, ఇప్పటికే తక్కువ ధరకే కేంద్రానికి వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నామని చెప్పింది. కేంద్రానికి ఒక వ్యాక్సిన్ డోసును కేవలం రూ.150లకే అందిస్తున్నామని కోవాగ్జిన్ తయారీదారు భారత్ బయోటక్ వెల్లడించింది. ఎక్కువ కాలం ఇంత తక్కువ ధరకు వ్యాక్సిన్ ను సరఫరా చేయలేమని పేర్కొంది. అలాగే తమ ఉత్పత్తిలో 10శాతం కంటే తక్కువవే ప్రైవేట్ ఆస్పత్రులకు, మిగిలిన వాటిని రాష్ట్రానికి, కేంద్రానికి సరఫరా చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగానికి సరఫరా చేసే వ్యాక్సిన్ల ధరను తగ్గించలేమని భారత్ బయోటెక్ తేల్చి చెప్పింది. నష్టాలను పూడ్చుకునేందుకే ప్రైవేటులో ఈ ధరలను అమలు చేస్తున్నామని కంపెనీ వెల్లడించింది. -
Covaxin: అమెరికాలో భారీ ఎదురుదెబ్బ!
వాషింగ్టన్: దేశీయ పార్మా దిగ్గజం భారత్ బయోటెక్కు అమెరికాలో భారీ షాక్ తగిలింది. సంస్థ అభివృద్ది చేసిన కరోనా మహమ్మారి వ్యాక్సిన్ కోవాగ్జిన్ అత్యవసర వినియోగాన్ని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) తిరస్కరించింది. ఈ టీకా వినియోగానికి సంబంధించిన భారత్ బయోటెక్, యూఎస్ భాగస్వామ్య కంపెనీ ఆక్యుజెన్తో ప్రతిపాదనలను బైడెన్ సర్కార్ నిరాకరించింది. మరోవైపు ఇండియా వ్యాక్సినేషన్ కోవాగ్జిన్ను చేర్చిన దాదాపు ఆరు నెలల తర్వాత కూడా భారత్ బయోటెక్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డేటాను వెల్లడించలేదన్న విమర్శలు సమయంలో అమెరికాలో ఎదురుదెబ్బ తగలడం గమనార్హం. అయితే ఇకపై అత్యవసర అనుమతి కోరబోమని, కోవిడ్ టీకా ఆమోదం కోసం దాఖలు చేస్తామని కంపెనీ గురువారం తెలిపింది. అదనపు క్లినికల్ ట్రయల్ ప్రారంభించమని ఎఫ్డీఏ సిఫారసు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, అత్యవసర వినియోగానికి అవసరమైన బయోలాజిక్స్ లైసెన్స్ అప్లికేషన్ (బీఎల్ఎ) కోసం దరఖాస్తు చేస్తామని తెలిపింది. కోవాగ్జిన్కు సంబంధించిన మాస్టర్ ఫైల్ను అందజేయాలని ఎఫ్డీఏ సూచించినట్లు కూడా ఆక్యుజెన్ సీఈవో శంకర్ ముసునూరి తెలిపారు. తమ టీకా కోవాగ్జిన్ను యూఎస్కు అందించేందు తాము కట్టుబడి ఉన్నామన్నారు. అలాగే కోవాక్సిన్ కోసం మార్కెటింగ్ అప్లికేషన్ కోసం అదనపు క్లినికల్ ట్రయల్స్ డేటా అవసరమని కంపెనీ భావిస్తోంది. కాగా అమెరికాలో ప్రస్తుతం ఫైజర్, మోడెర్నా రెండు టీకాలను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ వ్యాక్సిన్ కోవాగ్జిన్కు కూడా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ భారత్ బయోటెక్ తరపున అక్కడి ప్రముఖ ఫార్మా కంపెన ఆక్యుజెన్ రెగ్యులేటరీకి దరఖాస్తు చేసుకుంది. అయితే మరింత అదనపు సమాచారాన్ని కోరుతూ యూఎస్ఎఫ్డీఏ దీన్ని తిరస్కరించింది. ఆలస్యంగా దరఖాస్తులు చేసుకోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇండియాలో మూడో దశ క్లినికల్ ప్రయోగాల జూలైలో ఈ డేటాను కంపెనీ అందించనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కోవాగ్జిన్ వ్యాక్సిన్ను తాము గుర్తించట్లేదని ప్రకటించిన అతి కొద్దిరోజుల్లోనే ఈ పరిణామం సంభవించింది. మూడో దశ పరీక్షల డేటాను పరిశీలించిన మీదటే డబ్ల్యూహెచ్వో గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతం అనేక దేశాలు భారత్ బయోటెక్ వ్యాక్సిన్ను గుర్తించలేదు. అంతేకాదు డబ్ల్యూహెచ్వో గుర్తింపు లేని వ్యాక్సిన్ రెండు మోతాదులు తీసున్నా కూడా కొన్ని దేశాలలో “అన్వాక్సినేటెడ్” గానే పరిగణిస్తారు. భారత్ బయోటెక్స్పందన: అమెరికాలో తమ కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ తిరస్కరణపై భారత్ బయోటెక్ స్పందించింది. అమెరికా ఎఫ్డీఏకు పూర్తిస్థాయి క్లినికల్ డేటా ఆక్యూజెన్ అందించిందని వివరించింది. అయితే మరింత సమాచారం అందించాలని ఎఫ్డీఏ కోరిందని తెలిపింది. అమెరికాలో కొవాగ్జిన్ పూర్తిస్థాయిలో ఆమోదం పొందేందుకు బయోలాజిక్ లైసెన్స్ అప్లికేషన్ అనుమతి కూడా అవసరమని భారత్ బయోటెక్ తాజా ప్రకటనలో వెల్లడించింది. చదవండి : కావాలనుకుంటే శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చు! oxygen concentrator: పుణే సంస్థ కొత్త డిజైన్ -
‘భారత్ బయోటెక్’కు సీఐఎస్ఎఫ్ భద్రత
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 టీకా ప్రధాన ఉత్పత్తిదారుల్లో ఒకటైన భారత్ బయోటెక్ హైదరాబాద్ ప్లాంట్, కార్యాలయాలకు సీఐఎస్ఎఫ్(కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం) భద్రతను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. హైదరాబాద్లోని జెనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ రిజిస్టర్డ్ ఆఫీసుతోపాటు ప్లాంట్కు 64 మంది సీఐఎస్ఎఫ్ సాయుధ సభ్యుల బృందం భద్రత కల్పించనుందని అధికారులు తెలిపారు. -
వ్యాక్సిన్ల కోసం కంపెనీలకు భారీ ఆర్డర్ ఇచ్చిన కేంద్రం..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ టీకా విధానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రోజు కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అర్హులైన దేశ ప్రజలందరికీ కేంద్రమే ఉచితంగా కోవిడ్ టీకా అందిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికి జూన్ 21 నుంచి ఉచితంగా టీకా అందించనున్నట్లు ప్రకటించారు. కాగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కంపెనీలకు భారీ ఆర్డరును ఇచ్చింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా పుణెకు చెందిన సీరం సంస్థకు 25 కోట్ల కోవిషీల్డ్ డోసులను ఆర్డర్ ఇచ్చింది. దాంతో పాటుగా భారత్ బయోటెక్ కంపెనీకి 19 కోట్ల కోవాగ్జిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ చేసింది. ఈ వ్యాక్సిన్ కంపెనీలకు అడ్వాన్స్ కింద 30 శాతం మొత్తాన్ని కేంద్రం చెల్లించింది. కాగా బయోలాజికల్-ఈ కంపెనీకి చెందిన కార్బివాక్స్ డోసులను 30 కోట్ల మేర ఆర్డర్ చేసింది. బయోలాజికల్-ఈ టీకాలు సెప్టెంబర్ కల్లా అందుబాటులోకి రానున్నాయి. చదవండి: వ్యాక్సిన్పై సందిగ్ధత తొలగించారని ప్రశంసలు -
వ్యాక్సిన్-వ్యాక్సినేషన్.. లెక్కల్లో తేడా!
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగడం లేదా? కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న లెక్కలకు, వాస్తవిక పరిస్థితులకు పొంతన లేకుండా పోతోందా? సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్లు కలిపి నెలకు ఎనిమిది కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించాయి. కానీ, మే చివరి నాటికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం అందే డోసుల లెక్క 5 కోట్లకే తేలుతోంది. మరి మిగతా మూడు కోట్ల డోసుల సంగతేంటి? ఓవైపు ప్రభుత్వం, మరోవైపు వ్యాక్సిన్ తయారీ కంపెనీలు రోజూ సగటున 27 లక్షల డోసుల్ని ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రకటించాయి. అదీ రష్యన్ స్పుత్నిక్ను పరిగణనలోకి తీసుకోకుండానే. అయితే మే మొదటి మూడు వారాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం రోజు సగటున 16.2 లక్షల డోసులు మాత్రమే డెలివరీ చేశాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం సుమారు 3.4 కోట్ల డోసులు మాత్రమే ఉపయోగించారు. లెక్కల్లో.. నెలకు ఆరు నుంచి ఏడు కోట్ల కోవిషీల్డ్ డోసులను ఉత్పత్తి చేయగలమని సీరమ్ ఇండియా పదే పదే ప్రకటించుకుంటోంది. ఇక భారత్ బయోటెక్ ఏప్రిల్లో 2 కోట్ల కోవాగ్జిన్ డోసుల్ని ఉత్పత్తి చేశామని, మే చివరికల్లా మూడు కోట్ల డోసుల్ని అందిస్తామని చెప్పింది. అంటే ఎలా చూసుకున్నా ఎనిమిదిన్నర కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి కావాలి. కోవిన్ పోర్టల్ ప్రకారం చూసుకుంటే మే 22 రోజులకుగానూ రోజుకి 16.2 లక్షల చొప్పున వ్యాక్సిన్లను డెలివరీ చేశాయి. మే 16 నుంచి 22 మధ్య ఆ డెలివరీ ఏకంగా 13 లక్షల డోసులకు పడిపోయింది. అంటే రోజుకి 9.7 లక్షల డోసులు లెక్క తేడా వస్తోంది. అలాగే కంపెనీలు చెప్తున్న నెల వ్యాక్సిన్ డోసుల అవుట్పుట్కు, వ్యాక్సినేషన్కు తేడా వస్తోంది. ఇప్పుడున్న డెలివరీ ఇలాగే కొనసాగినా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఐదు కోట్ల డోసులతో ముగియొచ్చు. మరి మిగతా మూడుకోట్ల డోసుల మాటేంటన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. గప్పాలేనా? ఈ నెల మొదట్లో సుప్రీం కోర్టుకు కేంద్రం వ్యాక్సినేషన్ మీద ఒక అఫిడవిట్ సమర్పించింది. నెలకు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆరున్నర కోట్ల కోవిషీల్డ్ డోసులను, భారత్ బయోటెక్ రెండు కోట్ల కోవాగ్జిన్ డోసులను ఉత్పత్తి చేయగలవని అందులో పేర్కొంది. జులై నాటికి కోవాగ్జిన్ సామర్థ్యం ఐదున్నర కోట్లకు పెరుగుతుందని, అలాగే స్ఫుత్నిక్ కోటిన్నర డోసులకు(ఇప్పుడు నెలకు ముప్ఫై లక్షలు ఉంది) పెరుగుతుందని రిపోర్ట్ సమర్పించింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని బట్టి అది జరగకపోవచ్చనే మేధావులు అంచనా వేస్తున్నారు. ఎనిమిదిన్నర కోట్లు ఉత్పత్తి చేసేప్పుడు.. కేవలం ఐదు కోట్లను డెలివరీ చేయడం, ప్రైవేట్ కోటా లాంటి విషయాల్లో క్లారిటీ వస్తేనే డోసుల లెక్క తేలేది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్నాయి. కొన్నిచోట్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఇలాంటి టైంలో ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్ సరఫరా నిలిపివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రధానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. -
covaxin: డబ్ల్యూహెచ్వో లిస్ట్లో లేదు!
హైదరాబాద్: ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కోవాగ్జిన్’కు కొత్త సమస్య వచ్చిపడింది. ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్లో ఇంకా కోవాగ్జిన్కు డబ్ల్యూహెచ్వో చోటు ఇవ్వలేదు. దీంతో కోవాగ్జిన్ డోస్ తీసుకున్నవాళ్లు ఎమర్జెన్సీ అవసరాల కోసం అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లడం కుదరదు. దీంతో డబ్ల్యూహెచ్వో నుంచి ఎండోర్స్మెంట్ కోసం కేంద్రం మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. టీకాలు వేసుకున్న విదేశీ ప్రయాణికుల కోసం అనేక దేశాలు తమ సరిహద్దులను తిరిగి తెరవడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతిపాదించిన ఆ లిస్ట్లో కోవాగ్జిన్ వ్యాక్సిన్కు చోటు దక్కలేదు. ఈ తరుణంలో డబ్ల్యూహెచ్వో నిర్ణయం.. కోవాగ్జిన్ డోస్లు తీసుకుని విదేశాలకు వెళ్దామనుకుంటున్నవాళ్లకు షాక్ ఇచ్చేదే!. డబ్ల్యూహెచ్వో తో పాటు ఇంకా చాలా దేశాలు కోవాగ్జిన్ను ఆమోదించలేదు. దీంతో ఇది ఇప్పటికి స్వదేశీ వ్యాగ్జిన్గానే ఉండిపోయింది. బ్రెజిల్ రెగ్యులేటరీ ఇదివరకే కోవాగ్జిన్కు నో చెప్పేసింది. కోవాగ్జిన్ డోసులు తీసుకున్నప్రయాణికులను అనుమతించేందుకు ఇప్పటికి కొన్ని దేశాలు మాత్రమే అంగీకరించాయి. మరోవైపు ఇండియాలో, యూకేలో ఉన్న కరోనా స్ట్రెయిన్స్పై కోవాగ్జిన్ సమర్థవంతంగా పని చేస్తోందని భారత్ బయోటెక్ ప్రకటించుకుంది. సమర్థవంతంగా పనిచేస్తున్నప్పటికీ.. డబ్ల్యూహెచ్వో నుంచి అనుమతి తప్పనిసరి రావాల్సి ఉంటుంది. అయితే ఈ నిర్ణయంతో విద్యార్థులకు ఎలాంటి సమస్య తలెత్తకూడదని కేంద్రం భావిస్తోంది. సాధారణంగా వ్యాక్సిన్లను అప్రూవ్ చేసేముందు మరింత క్లినికల్ డేటా, మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ను డబ్ల్యూహెచ్వో పరిశీలిస్తుంది. విదేశాంగ కార్యదర్శి హర్ష్ శ్రింగ్లా సోమవారం భారత్ బయోటెక్ ప్రతినిధులతో సమావేశమై ఈ విషయంపై చర్చించనున్నట్లు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా 130 కి పైగా దేశాలు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసిన ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్ను అంగీకరిస్తున్నాయి. -
వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ.50 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యాక్సినేషన్ను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాల కొనుగోలుకు సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీలకు రూ.50 కోట్లకుపైగా చెల్లించాలని ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ)ను ఆదేశించినట్లు తెలిపారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ కోవిïÙల్డ్ ఒక డోస్ రూ.300, టాక్స్ 5 శాతంతో కలిపి రూ.315, కోవాగ్జిన్ ఒక డోస్ రూ.400, టాక్స్ 5 శాతంతో కలిపి రూ.415 వంతున చెల్లించనున్నట్లు వివరించారు. -
Corona Vaccine: కోవాగ్జిన్ ఫార్ములా బదిలీకి ఓకే
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ టీకా ఫార్ములాను ఇతర సంస్థలకు బదిలీ చేయడానికి తయారీ సంస్థ భారత్ బయోటెక్ అంగీకరించింది. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యాక్సిన్లకు తీవ్ర కొరత ఏర్పడి రాష్ట్రాల నుంచి విపరీతమైన ఒత్తిళ్లు, విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దేశంలో కోవిడ్ 19 టీకాల లభ్యతను గణనీయంగా పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. అందుకు వీలుగా ‘న్యూ లిబరలైజ్డ్ ప్రైసింగ్ అండ్ యాక్సిలరేటెడ్ నేషనల్ కోవిడ్ 19 వ్యాక్సినేషన్ స్ట్రాటెజీ’ని రూపొందించినట్లు స్పష్టం చేసింది. దేశీయంగా వ్యాక్సిన్ల ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో వ్యాక్సిన్ సాంకేతిక బదిలీకి సంబంధించి ద్వైపాక్షిక భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకునేలా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ఫార్మా సంస్థలను ప్రోత్సహిస్తోందని తెలిపింది. అందులో భాగంగానే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ‘ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్(ఐఐఎల్), భారత్ ఇమ్యునలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్(బీఐబీసీఒఎల్), అలాగే, ముంబైకి చెందిన హాఫ్కిన్స్ బయోఫార్మా.. ‘కోవాగ్జిన్’ టీకాను ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థతో టీకా సాంకేతికత బదిలీకి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఒప్పందాల వెనుక భారత ప్రభుత్వ కృషి ఉందని తెలిపింది. మరోవైపు, ఈ మూడు సంస్థలకు ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందిస్తోందని వెల్లడించింది. ఐఐఎల్ ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి, బీఐబీసీఓఎల్, హాఫ్కిన్స్ ఈ సంవత్సరం నవంబర్ నుంచి కోవాగ్జిన్ టీకాల ఉత్పత్తిని ప్రారంభించనున్నాయని తెలిపింది. ఈ మూడు సంస్థలే కాకుండా, మరిన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు కోవాగ్జిన్ టీకా సాంకేతికత బదిలీ జరిగి, పెద్ద ఎత్తున టీకా ఉత్పత్తి సాధ్యమయ్యేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించింది. ఈ దిశగా సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతోందని పేర్కొంది. కోవాగ్జిన్ టీకా సాంకేతికత బదిలీకి, లైసెన్సుల జారీకి సంబంధించి జాప్యం జరుగుతోందన్న వాదనను ప్రభుత్వం తోసిపుచ్చింది. సంబంధిత వార్తా కథనాలు, ట్వీట్లు అవాస్తవాలని స్పష్టం చేసింది. టీకా ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి ఇతర ఫార్మా కంపెనీలకు కోవాగ్జిన్ సాంకేతికత బదిలీకి వీలు కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. నేరుగా దిగుమతికీ వెసులుబాటు విదేశాల్లో రూపొందిన, విదేశాల్లో ఉత్పత్తి అవుతున్న కోవిడ్ 19 టీకాలను భారత్లో వినియోగించేందుకు వీలుగా కొత్త విధానాన్ని ప్రారంభించామని తెలిపింది. అమెరికా, యూరోప్, జపాన్ తదితర దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన.. అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతినిచ్చిన వ్యాక్సిన్లను భారత్లో వెంటనే వినియోగించేందుకు వీలుగా నూతన పాలసీని రూపొందించామని తెలిపింది. తక్షణమే వినియోగించుకునే వీలున్న విదేశీ టీకాలను కేంద్ర ప్రభుత్వం ద్వారానే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులు సొంతంగా సమకూర్చుకునే వీలు కూడా కల్పించామని పేర్కొంది. విదేశీ ఉత్పత్తిదారులకు భారత్లో ప్రవేశించేందుకు ఆసక్తి కలిగేలా ధరల విధానంలోనూ ఈ కొత్త పాలసీలో మార్పులు చేశామని వెల్లడించింది. మరోవైపు, మోడెర్నా, ఫైజర్ తదితర విదేశీ టీకా ఉత్పత్తిదారులతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోందని వెల్లడించింది. భారత్లో అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలని దరఖాస్తు చేసుకోవాలని వారిని కోరుతోందని తెలిపింది. మరోవైపు, కోవిడ్ టీకాలకు మేథో హక్కుల మినహాయింపు కోసం భారత్ సహా పలు దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని తెలిపింది. 3ఫార్మా కంపెనీలకూ ఆహ్వానం కోవాగ్జిన్ను ఉత్పత్తి చేయాలనుకునే ఫార్మా కంపెనీలను ఆహ్వానిస్తున్నామని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. తద్వారా టీకాల ఉత్పత్తి పెరిగి, దేశీయంగా వాటి లభ్యత మెరుగుపడుతుందన్నారు. భారత బయోటెక్తో అవి ఒప్పందం కుదుర్చుకునేలా ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. ఇతర ఫార్మా కంపెనీలతో సాంకేతికత బదిలీకి భారత్ బయోటెక్ సిద్ధంగా ఉందన్నారు. ‘ఈ విషయాన్ని భారత్ బయోటెక్ ప్రతినిధులతో చర్చించాం. వారు సంతోషంగా స్వాగతించారు’ అని పాల్ తెలిపారు. ‘‘అయితే, ఈ వ్యాక్సిన్ను లైవ్ వైరస్ను ఇనాక్టివ్ చేయడం ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియ ‘బీఎస్ఎల్3’ ల్యాబొరేటరీల్లో మాత్రమే సాధ్యమవుతుంది. అన్ని ఫార్మా కంపెనీల్లో ఇవి లేవు’’ అని వివరించారు. -
పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్కు డీసీజీఐ ఆమోదం
న్యూఢిల్లీ: 2 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలపై కోవాక్సిన్ కోవిడ్ -19 వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి భారత్ బయోటెక్కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ గురువారం అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ 525 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లపై ట్రయల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. 2 నుంచి 18ఏళ్ల వారిపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు అనుమతి కోరుతూ భారత్ బయోటెక్ ఈ ఏడాది ప్రారంభంలో దరఖాస్తు చేసుకుంది. అనుమతుల విషయంలో కేంద్ర ఔషధ ప్రమాణ స్థాయి సంస్థ(సీడీఎస్సీవో) నిపుణుల కమిటీ సమావేశమై చర్చలు జరిపింది. జాగ్రత్తగా అన్నీ ప్రోటోకాల్స్ పరిశీలించిన తర్వాత 2-18 ఏళ్ల వయసు చిన్నారులపై టీకా క్లినికల్ ప్రయోగాలు జరిపేందుకు ఈ కమిటీ సిఫార్సు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రయల్స్ సమయంలో టీకా 28 రోజుల వ్యవధిలో కండరాల ద్వారా రెండు డోసులు ఇవ్వనున్నట్లు అని ప్రభుత్వం తెలిపింది. ఈ ట్రయల్స్ ఢిల్లీ, పాట్నా, ఎయిమ్స్, నాగ్పూర్ మెడిట్రినా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో జరగనున్నాయి. ఇక మూడో దశ ప్రయోగాలు జరపడానికి ముందే రెండో దశ క్లినికల్ పరీక్షల భద్రతా డేటా, డీఎస్ఎంబీ సిఫార్సులను సీడీఎస్సీవోకు సమర్పించాలని భారత్ బయోటెక్కు కమిటీ షరతు విధించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో కోవాక్సిన్ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో 18ఏళ్ల పైబడిన వారందరికీ ఇస్తోన్న విషయం మనకు తెలిసిందే. దేశంలో రెండు టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ చిన్నారులకు ఇప్పటికీ కరోనా వ్యాక్సిన్ లేదు. ఇదిలా ఉంటే అగ్రరాజ్యం అమెరికాలో చిన్నారులకు టీకాలు వేసేందుకు ఫైజర్కు అనుమతులు లభించాయి. చదవండి: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి -
‘బాబు.. భారత్ బయోటెక్ని ఒప్పించి నీ ప్రేమను నిరూపించుకో’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిన్న ప్రధానికి రాసిన లేఖపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సీఎం జగన్ కోవాగ్జిన్ పేటెంట్ ఫార్ములాని అందరికి ఇవ్వాలన్నారు. దాని వల్ల వాక్సిన్ త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావచ్చు.. ఈ ముప్పు నుంచి కాపాడవచ్చిన సీఎం జగన్, మోదీకి లేఖ రాశారు. కానీ చంద్రబాబు మాత్రం భారత్ బయోటెక్ ఏ విధంగా పెటేంట్ వదులుకుంటుందని ప్రశ్నిస్తూ.. ఆ కంపెనీకి బ్రోకర్లా వ్యవహరిస్తున్నారు. ఆ కంపెనీ మీ బంధువుది అయినంత మాత్రాన ఇవ్వకూడదా’’ అని జోగి రమేష్ ప్రశ్నించారు. ‘‘పెన్సిలిన్ లాంటి సుబ్బామిసైన్ అనే ఔషదాన్ని తయారు చేసిన ఎల్లాప్రగడ సుబ్బారావు వ్యాపారం చేయలేదు. కేంద్రం ప్రభుత్వ ఆధీనంలోనే మెడిసిన్, ఆక్సీజన్, వాక్సిన్ అంతా ఉంది. ప్రజలు చనిపోతుంటే చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారు. బీజేపీ వాళ్లకు వాక్సిన్ కేంద్రం పరిధిలో ఉందని తెలియదా. సీఎం జగన్ మనసుపెట్టి విశాల హృదయంతో అందరికీ వాక్సిన్ ఇవ్వాలని తాపత్రయం పడుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం నా బంధువులకు సంబంధించిన భారత్ బయోటెక్కే పేటెంట్ ఉండాలని ఆలోచిస్తున్నాడు. ప్రజలు ఈ తేడాని గుర్తించాలి. ఎంతమంది మరణిస్తున్నా వాళ్లకు పేటెంటే’’ ముఖ్యం అంటూ జోగి రమేష్ విరుచుకుపడ్డారు. ‘‘చంద్రబాబు నువ్వేమన్నా శాస్త్రవేత్తవా.. ఎన్440కే వైరస్ అక్కడ పుట్టింది.. ఇక్కడ పుట్టింది అని చెప్పడానికి. కోవిడ్ ఉంది కదా అని మేము.. నువ్వు, నీ కోడుకు లోకేష్లా ఇళ్లలో పడుకోవట్లేదు. మా ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం కోవిడ్ రోగుల వద్దకు వెళుతున్నారు. మేము కేవలం జూమ్ మీటింగులకు, ట్విట్టర్కే పరిమితం కాలేదు’’ అని ఎద్దేవా చేశారు. చదవండి : కేంద్రం టీకాలను దుర్వినియోగం చేస్తోంది: సిసోడియా -
కేంద్రం టీకాలను దుర్వినియోగం చేస్తోంది: సిసోడియా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం కొనసాగుతోంది. భారీ సంఖ్యలో బాధితులు ఆసుపత్రులకు క్యూకడుతున్నారు. ఆక్సిజన్ కొరతతో చాలా మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీకి కోవాక్జిన్ టీకా సరఫరా చేయడానికి ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ నిరాకరించిందంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మీడియాకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో.. టీకా నిల్వలు తక్కువగా ఉన్నాయని సరఫరాను నిలిపివేసినట్లు ఢిల్లీ డిప్యూటీ సీఎం ట్విట్టర్లో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం టీకాలను దుర్వినియోగం చేస్తోందని, మరలా 6.6 కోట్ల వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతి చేయడం క్రూరమైన నేరమంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తీవ్ర విమర్శలు చేశారు. వ్యాక్సిన్ల సరఫరా లేకపోవడంతో 17 పాఠశాలల్లోని 100 కోవాక్జిన్ సెంటర్లను మూసివేయాల్సి వస్తుందని ట్విట్టలో పేర్కొన్నారు. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు వారికి టీకాలు వేయడానికి 1.34 డోసులు కావాలని ఢిల్లీ ప్రభుత్వం కోవాక్జిన్-భారత్ బయోటెక్, కొవిషీల్డ్- సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను కోరినట్లు ఆయన తెలిపారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 13.5 లక్షల కేసులు నమోదు కాగా..12.4 లక్షల మంది కోలుకున్నారు. కరోనా కారణంగా 20,010 మంది మరణించారు. (చదవండి: బాలుడి దయార్థ హృదయానికి తమిళ సీఎం ఫిదా!) -
కొవాక్జిన్ టీకా: భారత్ బయోటెక్ కీలక నిర్ణయం..!
ఢిల్లీ: ప్రముఖ కరోనా వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ కీలక నిర్ణయం తీసుకుంది. కొవాక్జిన్ టీకాలను నేరుగా రాష్ట్రాలకు పంపిణీకి సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం చేసిన కేటాయింపుల ప్రకారం రాష్ట్రాలకు పంపిణీ చేయనుంది. ఇప్పటికే కోవాక్జిన్ టీకాలను 14 రాష్ట్రాలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టామని భారత్ బయోటెక్ కంపెనీ కో ఫౌండర్, జాయింట్ మేనేజింగ్ డైరక్టర్ సుచిత్ర ఎల్ల ట్విటర్లో తెలిపారు. అంతేకాకుండా టీకాలను సరఫరా కోసం సంప్రదించిన ఇతర రాష్ట్రాలకు కూడా టీకాల లభ్యతను బట్టి సరఫరా చేస్తామని తెలిపారు. ప్రస్తుతం కొవాక్జిన్ టీకాను సరఫరా చేస్తోన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అసోం, ఛత్తీస్ఘడ్, ఒడిశా, ఢిల్లీ, గుజరాత్, జమ్మూ-కశ్మీర్. జార్ఖండ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు ఉన్నాయి. భారత్ బయోటెక్ కంపెనీ తొలుత కొవాక్జిన్ టీకాలను రాష్ట్రాలకు ఒక్కొ డోసు ధరను రూ. 600గా నిర్ణయించింది.తరువాత నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రాలకు ఒక్కొ డోసు ధర రూ. 400గా నిర్ణయించారు. కొవాక్జిన్ టీకాలను ప్రైవేటు ఆస్పత్రులకు ఒక్కొ డోసును రూ.1200 అందించనున్నారు. టీకాలను ఎగుమతి చేసుకునే దేశాలకు సుమారు 15-20 డాలర్లకు అందించనుంది. Glad to announce 🇮🇳Bharat Biotech confirms direct supplies of COVAXIN to the following state govt’s since 1/5/21, based on the allocations received by GoI. Requests have been received from other states, & will be processed for distribution based on availability of stocks 24x7🙏🏼 pic.twitter.com/OHrgXnw5Mj — suchitra ella (@SuchitraElla) May 8, 2021 చదవండి: కరోనా: ఐవర్మెక్టిన్తో తగ్గుతున్న మరణాల ముప్పు! -
షాకింగ్: రోడ్డు పక్కన రూ.8 కోట్ల విలువైన టీకాలు
భోపాల్: దేశంలో కరోనా విజృంభిస్తోంది. వైరస్ ధాటికి ఇప్పట్లో బ్రేక్ పడేలా కనిపించడం లేదు. మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వం టీకా కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక నేడు దేశవ్యాప్తంగా మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభం కావాల్సి ఉండగా.. టీకాల కొరత వల్ల చాలా రాష్ట్రాల్లో అది కార్యరూపం దాల్చలేదు. ఇదిలా ఉండగా తాజాగా మధ్యప్రదేశ్లో దాదాపు రెండున్నర లక్షల టీకా డోసులు ఉన్న లారీని రోడ్డు పక్కన వదిలేసి వెళ్లారు. ఈ సంఘటన నర్సింగపూర్ కరేలి బస్ స్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. 2.40 లక్షల కోవాగ్జిన్ టీకా డోసులు ఉన్న లారీని కరేలి బస్ స్టాండ్ దగ్గర రోడ్డు పక్కన వదిలేసి వెళ్లారు. డ్రైవర్, క్లీనర్ ఎక్కడ ఉన్నారో అర్థం కాలేదు. చాలా సేపటి నుంచి ఆ ట్రక్కు అక్కడే ఆగి ఉంది. ఇది గమనించిన స్థానికులు దీని గురించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి చూడగా.. ట్రక్కులో భారత్ బయోటెక్ కంపెనీకి చెందిన 2,40,000 కోవాగ్జిన్ టీకాలున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ వదిలేసి వెళ్లిన టీకాల ఖరీదు సుమారు 8 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. డ్రైవర్ ఆచూకీ కోసం గాలిస్తూ.. అతడి మొబైల్ నంబర్ని ట్రాక్ చేశాం. అది హైవేకు సమీపంలో తుప్పల్లో పడి ఉంది. టైర్లు కూడా పంచర్ కాలేదు. ట్రక్ కండీషన్ చాలా బాగుంది. ప్రస్తుతానికి టీకాలు సేఫ్. డ్రైవర్, క్లీనర్ గురించి దర్యాప్తు చేస్తున్నాం. వారీ ఆచూకీ కోసం గాలిస్తున్నాం’’ అని తెలిపారు. చదవండి: భారీగా తగ్గిన కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరలు -
భారీగా తగ్గిన కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరలు
న్యూఢిల్లీ: హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ తమ కోవిడ్ టీకా ‘కోవాగ్జిన్’ ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు డోసును రూ.600గా ఇదివరకు నిర్ణయించిన భారత్ బయోటెక్ దాన్ని రూ.400కు తగ్గిస్తున్నట్లు తెలిపింది. కేంద్రానికి రూ.150 డోసు చొప్పున అందజేస్తున్న ఉత్పత్తిదారులు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ ఆస్పత్రులకు అధిక ధరను నిర్ణయించడంపై విమర్శలు రావడం తెల్సిందే. ‘రాష్ట్ర ప్రభుత్వాలకు కోవాగ్జిన్ను రూ.400లకు డోసు చొప్పున అమ్మాలని నిర్ణయించాం’ అని భారత్ బయోటెక్ తెలిపింది. సీరమ్ తమ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను రూ.100 తగ్గించి రాష్ట్రాలకు రూ.300లకు డోసు చొప్పున అందజేస్తామని ప్రకటించింది. ధర తగ్గించిన తర్వాతా.. కోవిషీల్డ్తో పోల్చితే కోవాగ్జిన్ ధర ఇంకా రూ.100 ఎక్కువే ఉండటం గమనార్హం. 18–44 ఏళ్ల వయసు వారికి మే 1 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభించాలని నిర్ణయించిన కేంద్రం దీనికి అవసరమైన డోసులను రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులు నేరుగా ఉత్పత్తిదారుల నుంచే కొనుగోలు చేయాలది. సీరమ్, భారత్ బయోటెక్లు ప్రైవేటు ఆసుపత్రులకు అందించే టీకా ధరలను (ప్రతిడోసుకు) వరుసగా రూ.600, రూ1,200లుగా నిర్ణయించాయి. -
కోవాగ్జిన్తో డబుల్ మ్యూటెంట్కి అడ్డుకట్ట
వాషింగ్టన్: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ కంపెనీకి చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ దేశంలోని డబుల్ మ్యూటెంట్ను సమర్థంగా అడ్డుకుంటోందని అమెరికాలోని వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వయిజరీ ఆఫీసర్ డాక్టర్ ఆంటోనీ ఫౌచీ వెల్లడించారు. దేశంలో రెండుసార్లు జన్యు మార్పిడికి లోనైన కరోనా వైరస్ బి.1.617 కారణంగా దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సెకండ్ వేవ్ను కోవాగ్జిన్ టీకా అత్యంత సమర్థవంతంగా అడ్డుకుంటుందని తాము చేసిన అధ్యయనంలో వెల్లడైనట్టు మంగళవారం ఆయన వెల్లడించారు. భారత్లో కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకున్న వారి డేటాను సేకరించి తాము పరిశీలిస్తే వారిలో బి.1.617 రకం వైరస్ను తట్టుకొనే యాంటీబాడీలు బాగా అభివృద్ధి చెందినట్టుగా డాక్టర్ ఫౌచీ తెలిపారు. భారత్లో సెకండ్ వేవ్కు అడ్డుకట్ట పడాలంటే అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఆర్) సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ టీకాను జనవరి 3 నుంచి అత్యవసర వినియోగానికి అనుమతులిచ్చారు. ఈ వ్యాక్సిన్ 78శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్టుగా పరిశోధనల్లో వెల్లడైంది. కోవాగ్జిన్తో పాటుగా, సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కొవిషీల్డ్ కూడా భారత్ కొత్త రకం కరోనా సమర్థంగా ఎదుర్కొంటుందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ (ఐజీఐబీ) అధ్యయనం వెల్లడైనట్టు ఆ సంస్థ డైరెక్టర్ అనురాగ్ వెల్లడించారు. కోవిషీల్డ్తో ఇంట్లో 50% కేసులు కట్ లండన్ : అమెరికాకు చెందిన ఫైజర్, బ్రిటన్ ఆ స్ట్రాజెనికా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్క డోసు తీసుకుంటే కుటుంబ సభ్యుల్లో వైరస్ వ్యాప్తిని 50 శాతం తగ్గించవచ్చునని బ్రిటన్ అధ్యయనంలో వెల్లడైంది. వ్యాక్సిన్ సింగిల్ డోసు తీసుకున్న వారి నుంచి వైరస్ 38 నుంచి 49 శాతం వరకు ఇతర కుటుంబ సభ్యులకు వ్యాప్తి చెందడం లేదని ది పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ (పీహెచ్ఈ)లో అధ్యయనంలో తేలింది. వ్యాక్సిన్ తీసుకోని వారితో కలిసి తిరిగిన 10 లక్ష మంది వివరాలు తెలుసుకొని, ఆ గణాంకాలతో 24 వేల ఇళ్లలో వ్యాక్సిన్ తీసుకున్న వారితో కలిసి మెలిసిన ఉన్న 57 వేల మంది వివరాలను పరిశీలించి చూస్తే వ్యాక్సిన్ తీసుకున్న వారి కంటే టీకా తీసుకోని వారి నుంచి ముప్పు అధికంగా ఉంది. టీకా డోసు తీసుకున్న వారు ఒక్కో ఇంట్లో 50 శాతం కేసుల వరకు అడ్డు కట్ట వెయ్యగలిగారు. కరోనా సెకండ్ వేవ్లో ఇంట్లో ఒకరికి వైరస్ సోకితే ఇంటిల్లి పాదికి పాజిటివ్ రావడం చూస్తున్నాం. ఇలాంటి సమయంలో ఇంగ్లండ్ నిర్వహించిన పరిశోధనలు ఆత్మ విశ్వాసాన్ని నింపాయి. 17 దేశాలకు విస్తరించిన భారత్ డబుల్ మ్యూటెంట్ జెనీవా: భారత్లో రెండు సార్లు జన్యుమార్పిడికి లోనైనా కరోనా వైరస్ 17 దేశాలకు వ్యాప్తి చెందిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ వైరస్ను బి.1.617 భారత్ రకం అని పిలుస్తున్నారు. ఈ డబుల్ మ్యూటెంట్ వైరస్తోనే భారత్లో కేసులు భారీగా పెరిగిపోయాయి. ఏప్రిల్ 27 నాటికి భారత్ వైరస్ రకం కేసులు 17 దేశాల్లో బయటపడ్డాయని డబ్ల్యూహెచ్ఒ తన వారంతాపు నివేదికలో వెల్లడించింది. ఈ రకం వైరస్ కేసులో ఎక్కువగా భారత్, బ్రిటన్, అమెరికా, సింగపూర్ నుంచి వస్తున్నాయి. వైరస్లకు సంబంధించిన జన్యు మార్పులపై డేటాను సేకరించి భద్రపరిచే జిశాడ్ సంస్థ ఈ వివరాలు అందించినట్టుగా డబ్ల్యూహెచ్ఒ వెల్లడించింది. -
గుడ్న్యూస్.. కోవాగ్జిన్తోనే సెకండ్ వేవ్ కట్టడి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తోన్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ కట్టడికి భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా కోవాగ్జిన్ సమర్థవంతంగా చెక్ పెడుతున్నట్లు తాము గుర్తించామని వెల్లడించారు. మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ మీడియాతో మాట్లాడిన ఆయన సెకండ్ వేవ్ కట్టడికి కోవాగ్జిన్ బాగా పనిచేస్తుందని.. ఈ విషయాన్ని భారత్లో నమోదవుతున్న రోజూవారి డాటా ఆధారంగా తాము గుర్తించినట్లు ఆంథోనీ ఫౌసీ తెలిపారు. ‘‘ఇండియాలో రోజూ కరోనా సోకుతున్న వారి డాటాను పరిశీలిస్తున్నాం. అయితే కోవాగ్జిన్ కారణంగా ఇటీవల కేసుల సంఖ్య స్థిరంగా ఉన్నట్లు గుర్తించాం. సెకండ్ వేవ్కు చెక్ పెట్టాలంటే వ్యాక్సిన్లు తప్పని సరిగా వేయించుకోవాలి’’ అని ఆంథోనీ ఫౌసీ చెప్పినట్లు పీటీఐ తన కథనంలో పేర్కొంది. బీ.1.617 వేరియంట్లో మూడు కొత్త స్పైక్ ప్రోటీన్లు మహారాష్ట్ర, ఢిల్లీలలో నమోదైన కరోనా కేసుల్లో కనిపించే బీ.1.617 వేరియంట్లో మూడు కొత్త స్పైక్ ప్రోటీన్లు ఉన్నట్లు తేలింది. కాబట్టే దేశంలో సెకండ్ వేవ్ విరుచుకుపడుతుంది. అయితే కోవాగ్జిన్ను వినియోగించడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరిగి, కరోనా వైరస్కు వ్యతిరేకంగా ప్రతిరోధకాలను తయారు చేస్తుంది. ఆ ప్రతిరోధకాలు శరీర కణాజాలంలో ఎక్కడో ఓ చోట దాక్కున్న వైరస్ని గుర్తించి, దాన్ని నాశనం చేస్తుంది అని నిపుణులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ బీ.1.617 వేరియంట్ని 17 దేశాలలో గుర్తించినట్లు అమెరికా హెల్త్ ఏజెన్సీ తెలిపింది. కాగా భారత్, యూకే, యూఎస్, సింగపూర్లలో ఈ వేరియంట్ కేసులు ఎక్కువగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ తన అధికారిక వెబ్ సైట్లో పొందుపరిచింది. భారత్ బయోటెక్ - ఐసీఎంఆర్ భాగస్వామ్యంలో తయారీ భారత్ బయోటెక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) భాగస్వామ్యంతో కోవ్యాక్సిన్ తయారైంది. ఈ వ్యాక్సిన్ను క్లినికల్ ట్రయల్లో ఉన్నప్పుడు అత్యవసర వినియోగం కోసం కేంద్రం జనవరి 3 న ఆమోదించిన విషయం తెలిసిందే. -
Covid Vaccine: కరోనా టీకా.. ‘కాస్త టైం పడుతుంది’!
సాక్షి, హైదరాబాద్: కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఆస్పత్రులు నిండిపోతున్నాయి. యాంటీ వైరల్ మందులు, ఆక్సిజన్కు కొరత తలెత్తింది. ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ ఆపద్బాంధవుడిలా కనిపిస్తున్నది వ్యాక్సిన్లే. మరి వ్యాక్సిన్లు అందరికీ అందుతాయా? ఎంత సమయం పడుతుంది? అప్పటిదాకా పరిస్థితి ఏమిటి?.. అందరిలో సందేహాలివే. వీటికి సమాధానం ఒక్కటే.. ‘కాస్త టైం పడుతుంది’! దీనికి పరిష్కారం.. వ్యాక్సిన్ల ఉత్పత్తి పెరిగి అందరికీ అందుబాటులోకొచ్చే వరకు ఓపిక పట్టడం. అలాగని చూస్తూ కూర్చోలేం. బతుకుబండి నడవాలి. ఎవరికి వారు జాగ్రత్తలూ తీసుకుని, నిత్యం చేసుకునే పనులు కొనసాగించాలి. ఐదారు నెలలు దాటితే..: దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు, ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం, మున్ముందు పెరిగే కెపాసిటీ, కొత్తగా వచ్చే వ్యాక్సిన్లు, సరఫరా– పంపిణీల తీరును గమనిస్తే.. మరికొద్ది నెలల పాటు ఇప్పుడున్నట్టుగానే వ్యాక్సినేషన్ కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడినవారికి టీకా తీసుకునే అనుమతి ఉండగా.. మే ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన వారికీ వ్యాక్సిన్ వేసేందుకు కేంద్రం అనుమతిచ్చింది. ఈ లెక్కన మొత్తం 94 కోట్ల మంది టీకాలకు అర్హులు. ఇందులో 45 ఏళ్లుపైబడినవారు సుమారు 26 కోట్ల మంది. వీరిలో ఇప్పటివరకు సుమారు 11.97 కోట్ల మందికి టీకాలు వేయగా.. ఒక డోసు తీసుకున్నవారు సుమారు 10 కోట్లు, రెండు డోసులూ పూర్తయినవారు దాదాపు 2 కోట్ల మంది. అంటే 45 ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి కావడానికి సుమారు 38 కోట్ల డోసుల టీకాలు కావాలి. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ రెండింటి ఉత్పత్తి సామర్థ్యం కలిపి నెలకు సుమారు ఏడు కోట్ల డోసులే. జూన్, జూలై నెలల నుంచి ఈ సంఖ్య 15–16 కోట్ల డోసులకు పెరుగుతుందని అంచనా. వీటికితోడు స్పుత్నిక్–వి వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అంటే మొత్తంగా ఐదారు నెలల తర్వాత వ్యాక్సినేషన్ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దేశంలో ఈఏడాది జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్ మొదలైంది. అప్పటి నుంచి ఈ నెల 26 నాటికి.. అంటే సుమారు 102 రోజుల్లో వైద్యులు, సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లు, 45 ఏళ్లు పైబడినవారికి కలిపి 14.50 కోట్ల మందికి మాత్రమే టీకాలు అందాయి. ఇందులోనూ 12 కోట్ల మందికి ఒకే డోసు వేశారు, రెండు డోసులు పూర్తయిన వారి సంఖ్య సుమారు రెండున్నర కోట్లు మాత్రమే. సగటున లెక్కిస్తే.. దేశవ్యాప్తంగా రోజుకు 22 లక్షల మంది టీకాలు వేయగలిగారు. ఇది ఇలాగే కొనసాగితే.. దేశంలో టీకాలకు అర్హులైన 94 కోట్ల మందికి రెండు డోసులు ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది. జనాభాలో కనీసం 70– 80 శాతం మందికి టీకాలు వేస్తే.. వైరస్ దాదాపు నియంత్రణలోకి వచ్చినట్టేనని, హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ లెక్కన రెండేళ్ల వరకు కరోనా ప్రభావం ఉంటుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. కేసులు భారీగా పెరుగుతూ.. సెకండ్ వేవ్ కరోనా కేసుల విషయంలో భారత్ ప్రపంచంలోనే అత్యంత బాధిత దేశంగా మారిపోయింది. రోజుకు మూడు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఆస్పత్రులు నిండిపోయి.. బెడ్లకు, ఆక్సిజన్కు, అత్యవసర మందులకు కొరత ఏర్పడింది. ఆక్సిజన్, తగిన చికిత్స అందక రోగులు చనిపోతున్నారు. మరోవైపు కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య తగ్గిపోతూ ఉండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య 24 లక్షలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మే ఒకటో తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు దాటిన అందరికీ టీకాలిచ్చే కార్యక్రమానికి పచ్చజెండా ఊపింది. కానీ టీకాల సరఫరా, పంపిణీలో లోపాలతో వ్యాక్సినేషన్ చాలా నెమ్మదిగా సాగుతోంది. వ్యాక్సినేషన్ మొదట్లో రోజుకు మూడు, నాలుగు లక్షల డోసులతో ప్రారంభమైనా.. 45 ఏళ్లుపైబడ్డ వారికి ఇవ్వడం మొదలయ్యాక ఊపందుకుంది. కానీ ఏప్రిల్ పదో తేదీ తర్వాత మళ్లీ వేగం తగ్గింది. ఇది చూస్తుంటే జూలై 31 నాటి దేశంలో యాభై కోట్ల మందికి టీకాలివ్వాలన్న లక్ష్యం నెరవేరే అవకాశం కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెలకు 17 కోట్ల టీకాలు వేస్తేనే..! ఈ ఏడాది చివరికల్లా అర్హులైన అందరికీ టీకాలు ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అది నెరవేరాలంటే నెలకు 17 కోట్ల మందికి టీకాలు ఇవ్వాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం 94 కోట్ల మంది అర్హులకు రెండు డోసులు పూర్తిచేసేందుకు దాదాపు 188 కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరం. ఇప్పుడున్నట్టుగా రోజుకు 22 లక్షల డోసుల చొప్పున వేస్తే.. 94 కోట్ల మందికి రెండు డోసుల చొప్పున ఇచ్చేందుకు అటు ఇటుగా వెయ్యి రోజులు పడుతుంది. అదే ఉత్పత్తి పెంచితే ముందుగా పూర్తవుతుంది. కానీ డిమాండ్కు తగినంతగా టీకాల ఉత్పత్తి జరగడం లేదు. దీనితో సమస్యలు ఏర్పడుతున్నాయి. టీకాల పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సీరమ్ ఇన్స్టిట్యూట్ నెలకు దాదాపు ఆరు కోట్ల టీకాలు ఉత్పత్తి చేయగలదు. కేంద్రం ఇటీవల మంజూరు చేసిన రూ.3 వేల కోట్లతో మరింత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చుకుని, మే నెలాఖరుకల్లా ఉత్పత్తిని పది కోట్ల డోసుల వరకు పెంచుతామని సీరమ్ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు భారత్ బయోటెక్ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం నెలకు అరవై లక్షల నుంచి నుంచి కోటీ డోసుల వరకు ఉంది. మే నెలాఖరుకు మూడు కోట్ల డోసులకు, ఆగస్టుకల్లా ఆరు కోట్ల డోసులకు చేరుతుందని అంచనా. మొత్తంగా చూస్తే.. ప్రస్తుతం నెలకు ఏడు కోట్ల డోసుల వరకు అందుబాటులో ఉంటోంది. ఈ లెక్కన ఏడాది చివరికల్లా జనాభాలో 80 శాతం మందికి టీకాలు వేయాలంటే.. ఉత్పత్తి మూడింతలు కావాల్సి ఉంది. జనాభా మొత్తానికి టీకాలివ్వాలంటే నెలకు 22 కోట్ల మందికి వేయాలి. అయితే ఆయా రాష్ట్రాల్లో 18 ఏళ్లపైబడ్డ వారు ఎంత మంది ఉన్నారన్న దాన్నిబట్టి.. 80 శాతం మందికి టీకాలివ్వడం ఆధారపడి ఉంటుంది. దేశంలో 18 ఏళ్లుపైబడిన వారిలో 58 శాతం మంది తొమ్మిది రాష్ట్రాల్లోనే ఉన్నారు. రాష్ట్రాల వారీగా ఇప్పటి వేగం ప్రకారం చూస్తే.. ఆయా రాష్ట్రాల్లో కొన్నింటిలో 2023 జూన్కు గానీ 80 శాతం అర్హులకు టీకాలు ఇచ్చే పరిస్థితి లేదు. విదేశీ వ్యాక్సిన్లు వస్తే ఊరట కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దేశంలో అత్యవసర వినియోగం కోసం రష్యా తయారీ స్పుత్నిక్ –వి వ్యాక్సిన్కు అనుమతులు జారీ చేసింది. సుమారు మూడు కోట్ల డోసుల మేర త్వరలో దిగుమతి కానుంది. దేశంలో ఆ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేయడానికి ఇంకా కొద్దినెలలు సమయం పట్టనుంది. మరిన్ని విదేశీ వ్యాక్సిన్లు కూడా భారత్లో అనుమతి కోసం వేచి ఉన్నాయి. వాటిల్లో దేనికైనా అనుమతి వస్తే మరిన్ని టీకాలు అందుబాటులోకి వస్తాయి. అదే జరిగితే వ్యాక్సినేషన్ అనుకున్న మేరకు కొనసాగే అవకాశం ఉంటుంది. మరోవైపు భారత వైద్య పరిశోధన సమాఖ్య సహకారంతో భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ను ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉత్పత్తి చేసే అంశాన్ని పరిశీలించాలని కొంతమంది నిపుణులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకుంటే వ్యాక్సినేషన్ మరింత వేగంగా సాగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ.. టీకా కార్యక్రమం విషయంలో తెలుగు రాష్ట్రాలు వేగంగానే ఉన్నాయి. అయితే సరైన సమయానికి కేంద్రం నుంచి టీకాలు అందకపోవడంతో వ్యాక్సినేషన్లో కాస్త జాప్యం జరుగుతోంది. ►తెలంగాణలోని నాలుగు కోట్ల జనాభాలో ఇప్పటివరకు టీకా తీసుకున్న వారి సంఖ్య 42.89 లక్షలు.. వీరిలో తొలి డోసు వేసుకున్న వారు 37.58 లక్షల మందికాగా.. రెండు డోసులూ తీసుకున్నవారు కేవలం 5.30 లక్షల మంది. రాష్ట్రంలో అందరికీ ఉచితంగా టీకాలు వేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. అయితే అంత మందికి ఇచ్చేందుకు టీకాలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనేది తేలడం లేదు. ►ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. అక్కడ ఏప్రిల్ 24వ తేదీ నాటికి మొత్తం 56.17 లక్షల మందికి టీకాలు ఇచ్చారు. ఇందులో ఒక డోసు తీసుకున్న వారు 45 లక్షల మంది వరకు ఉండగా.. రెండు డోసులూ పూర్తిచేసుకున్న వారు 11 లక్షల మంది ఉన్నారు. ఏపీలో 18– 45 మధ్య వయస్కులు రెండు కోట్ల నాలుగు లక్షల మంది కోసం.. రాష్ట్ర ప్రభుత్వం భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ల నుంచి 4.08 కోట్ల డోసుల టీకాలను ఆర్డర్ చేసింది. అప్పటిదాకా ఏం చేయాలి? వ్యాక్సిన్లు పూర్తిగా అందుబాటులోకి వచ్చేందుకు కొద్ది నెలలు సమయం పడుతుంది. అప్పటివరకు నిబంధనల ప్రకారం అన్నిరకాల జాగ్రత్తలూ తీసుకోవాలి. కచ్చితంగా మాస్కు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు వాడటం వంటివి అలవాటుగా చేసుకోవాలి. ఇదే సమయంలో నిత్య జీవితాన్ని యథావిధిగా కొనసాగించాలి. కరోనాకు భయపడి ఇంట్లోనే ఉండిపోవడం, పనులకు వెళ్లకపోవడం వల్ల జీవనోపాధికి దెబ్బపడుతుంది. అందువల్ల పూర్తి జాగ్రత్తలతో ఉద్యోగం, సొంత పనులు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ పూర్తి అప్రమత్తంగా ఉంటే.. కరోనా సోకే అవకాశాలు అతి స్వల్పంగా ఉంటాయన్న విషయం గుర్తుంచుకోవాలి. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే.. నిర్దేశిత సమయం ప్రకారం తీసుకోవాలి. వ్యాక్సిన్ వేయించుకున్నంత మాత్రాన జాగ్రత్తలను మరవొద్దు. మరికొంతకాలం పాటు మాస్కులు, భౌతికదూరం వంటివి పాటిస్తే.. అప్పటివరకు అందరికీ వ్యాక్సినేషన్ పూర్తయితే.. కరోనా మహమ్మారిపై విజయం సాధించినట్టే. -
కోవాగ్జిన్... రాష్ట్రాలకు రూ.600
న్యూఢిల్లీ: హైదరాబాద్కు చెందిన ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ తమ కోవిడ్–19 వ్యాక్సిన్.. ‘కోవాగ్జిన్’ ధరలను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.600 డోసు చొప్పున సరఫరా చేస్తామని, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.1,200లకు డోసు చొప్పున అందజేస్తామని భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎల్లా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొద్దిరోజుల కిందట అనుమతించిన విషయం తెలిసిందే. ఉత్పత్తిదారులు 50 శాతం వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి... మిగతా 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా అమ్ముకోవడానికి వీలుకల్పించింది. అయితే మే 1లోగా వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు తమ ధరలను బహిరంగంగా ప్రకటించాలని కోరింది. ప్రస్తుతం దేశంలో రెండు సంస్థల వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అస్ట్రాజెనెకా– ఆక్స్ఫర్డ్లు అభివృద్ధి చేసిన టీకాను పుణేకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ కోవిషీల్డ్ పేరుతో తయారు చేస్తోంది. కోవిషీల్డ్ను రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400లకు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600లకు అందజేస్తామని సీరమ్ ఇదివరకే ప్రకటించింది. కేంద్రానికి రూ.150కే డోసును సరఫరా చేస్తూ... రాష్ట్రాలకు, ప్రైవేటుకు అధికధరలను నిర్ణయించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు స్వేచ్ఛనిచ్చి జనంపై భారం మోపుతోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పుడు కోవాగ్జిన్ అంతకంటే చాలా ఎక్కువగా ధరలు నిర్ణయించడం గమనార్హం. సీరమ్తో పోలిస్తే రాష్ట్రాలకు ప్రతిడోసుకు రూ.200 అధికంగా వసూలు చేయనుంది. ప్రైవేటుకైతే ఏకంగా రెండింతలు ధరను నిర్ణయించింది. ముందస్తు ఒప్పందంలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి ఇదివరకట్లాగే తాము ఉత్పత్తి చేసేవాటిలో 50 శాతం టీకాలను రూ.150కి డోసు చొప్పున సరఫరా కొనసాగిస్తామని కృష్ణా ఎల్లా చెప్పారు. అయితే బహిరంగ మార్కెట్లో ఈ నష్టాన్ని పూడ్చుకోవడం అవసరమని పేర్కొన్నారు. భవిష్యత్తు ఆవిష్కరణలకు పెట్టుబడుల సమీకరణకు ఇది తప్పదని, కోవిడ్–19కు ముక్కుద్వారా వేసే టీకా, చికున్గున్యా, జికా వైరస్లకు టీకాలను అభివృద్ధి చేయడానికి నిధుల ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. -
కొత్తరకం వైరస్పై కొవాగ్జిన్ ధీటుగా పనిచేస్తుంది: ఐసీఎంఆర్
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ సమర్థవంతంగా పనిచేస్తోందని ఇండియన్ కౌన్సిల్ ఫార్ మెడికర్ రీసెర్చి(ఐసీఎంఆర్) బుధవారం ప్రకటించింది. కరోనా కొత్తరకం వైరస్ను కూడా కొవాగ్జిన్ అడ్డుకుంటుందని పేర్కొంది. విజయవంతంగా యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా రకం వైరస్లను బంధించి కల్చర్ చేసినట్లు పేర్కొంది. దీంతోపాటు ఇటీవలే భారత్లో కనిపిస్తున్న డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్లను కూడా కొవాగ్జిన్ నిలువరిస్తోందని వెల్లడించింది. కోవిడ్ టీకా తీసుకున్నా ఇన్ఫెక్షన్లు వస్తే భయపడాల్సిన పనిలేదని భారత్ బయోటెక్ ఛైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా వెల్లడించారు. అయితే టీకా తీసుకున్నా మాస్క్ ధరించడం తప్పనిసరి అని డాక్టర్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. టీకా తీసుకున్న వారికి కూడా కోవిడ్ వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో భారత్ బయోటెక్ ఛైర్మెన్ స్పందించారు. వ్యాక్సిన్ కేవలం ఊపిరితిత్తుల కింది భాగాన్ని రక్షిస్తుందని, పై భాగాన్ని కాదని తెలిపారు. అందుకే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ కరోనా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అయితే కరోనా వచ్చినా కూడా ప్రాణాంతకంగా మారకుండా ఉంటుందని వెల్లడించారు. ఉత్పత్తిని పెంచుతున్నాం కొవాగ్జిన్ టీకా ఉత్పత్తిని రెండున్నర రెట్లు పెంచనున్నామని భారత్ బయోటెక్ వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ అవసరాలు, అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్కు అనుగుణంగా ఏటా 70 కోట్ల కొవాగ్జిన్ డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ కంపెనీ స్పష్టం చేసింది. ఇందుకోసం హైదరాబాద్, బెంగళూరులోని తమ ప్లాంట్లను దశలవారీగా విస్తరిస్తున్నట్లు మంగళవారం వివరించింది. చదవండి: కరోనా టీకా: జనాభాలో యవ్వనులే అధికం -
వ్యాక్సిన్ల కొరత: రూ.4500 కోట్లు విడుదల
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారి నమోదవుతున్న కేసులు సంఖ్య 2 లక్షలకు పైగానే ఉంటున్నాయి. ఈ క్రమంలో జనాలు వ్యాక్సిన్ కోసం క్యూ కడుతున్నారు. అయితే పలు రాష్ట్రాల్లో ఇప్పటికే టీకా డోసులు అయిపోయాయి. ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్లను పంపిణీ చేయాల్సిందిగా రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడానికి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్లకు 4,500 కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఇందులో 3 వేల కోట్ల రూపాయలను సీరమ్కు, 1,500 కోట్ల రూపాయలను భారత్ బయోటెక్కు ఇవ్వనున్నట్లు సమాచారం. నెలకు 10 కోట్ల డోసుల వ్యాక్సిన్స్ ఉత్పత్తి చేయడానికి తమకు 3 వేల కోట్ల రూపాయలు అవసరమని సీరమ్ సీఈవో అదార్ పూనావాలా కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు.. వినూత్న విధానాలను కనుగొనడానికి వ్యాక్సిన్ తయారీదారులతో కలిసి ప్రభుత్వం పని చేస్తోందని పూనావాలా చెప్పారు. జూన్ నెలలోగా వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచాలని సీరమ్ భావిస్తోంది. చదవండి: కరోనా వ్యాక్సిన్.. వేధించే సందేహాలు.. సమాధానాలు -
హాఫ్కిన్ బయో ఫార్మాకు కోవాగ్జిన్ తయారీకి కేంద్రం అనుమతి
కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కొరతను తగ్గించడం కోసం భారత్ బయోటెక్ కోవాక్సిన్ తయారీని ముంబైకి చెందిన హాఫ్కిన్ బయో ఫార్మాకు కేంద్రం అనుమతి ఇచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని బయోమెడికల్ సంస్థ హాఫ్కిన్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడానికి కేంద్రం నుంచి అనుమతి కోరింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో భారత్ బయోటెక్ కోవాక్సిన్ను అభివృద్ధి చేసింది. కోవాక్సిన్ను ఏడాది వరకు ఉత్పత్తి చేయడానికి హాఫ్కైన్కు అనుమతి మంజూరు చేసినట్లు బయోటెక్నాలజీ విభాగం మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియలో భాగం కాని మరో ఫార్మా కంపెనీకి సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వడం ఇదే మొదటిసారి. కోవిడ్ సురక్ష మిషన్ కింద భారత్ బయోటెక్కు రూ.65 కోట్లు కేంద్రంకేటాయించింది. అలాగే, ముంబైకు చెందిన హాఫ్కిన్ బయోఫార్మాకు కూడా రూ.65 కోట్లు కేటాయించింది. ఈ చర్య వల్ల వచ్చే నెల నుంచి కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యం 6 రెట్లు పెరగనుంది. చదవండి: ‘ఆక్సిజన్ సిలెండర్ లభ్యతపై భయాందోళనలు వద్దు’ -
కోవిషీల్డ్తో సైడ్ ఎఫెక్ట్స్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసి కోవిషీల్డ్, భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కోవాగ్జిన్ టీకాలను లబ్ధిదారులకు అందజేస్తున్నారు. కోవిషీల్డ్ టీకా డోసు తీసుకున్నవారిలో కొన్ని దుష్ప్రభావాలు తలెత్తుతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఫిర్యాదులు వస్తున్నాయి. యునైటెడ్ కింగ్డమ్ ఔషధ నియంత్రణ సంస్థతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. ఇండియాలోనూ కోవిషీల్డ్ టీకా తీసుకున్న కొందరిలో రక్తం గడ్డకట్టడం వంటి ప్రతికూల ప్రభావాలు కనిపించాయి. ఇలాంటి కేసులు ఇప్పటిదాకా దాదాపు 700 నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. వ్యాక్సినేషన్ అనంతరం నమోదైన ఈ కేసులపై సమీక్ష నిర్వహిస్తున్నామని వెల్లడించాయి. ఈ వారం ఆఖరికల్లా సమీక్ష పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కోవిషీల్డ్ టీకాకు మనిషిలో రక్తంలో ప్లేట్లెట్లు పడిపోయి గడ్డకట్టడానికి సంబంధం ఉన్నట్లు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ(ఈఎంఏ) వెల్లడించింది. అయితే, అత్యంత అరుదుగానే జరుగుతుందని స్పష్టం చేసింది. -
కోవాక్జిన్ ప్రమాణాలకు అనుగుణంగా లేదు : బ్రెజిల్
రియో డి జనీరో: బ్రెజిల్ పై కరోనా తీవ్ర ప్రభావం చూపుతూనే ఉంది. దేశంలో రోజుకు లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తోంది. అందుకు గాను గత నెలలో బ్రెజిల్ ప్రభుత్వం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్జిన్ ను 20 మిలియన్ డోసులను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. కాగా మంగళవారం రోజున కోవాక్జిన్ దాని తయారీ ప్రమాణాలకు అనుగుణంగా లేదని బ్రెజిల్ హెల్త్ రెగ్యులేటర్ అన్విసా ఆరోపించారు. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ బ్రెజిల్ భాగస్వామి ప్రెసిసా మెడికామెంటోస్ తో కలిసి ఒక ప్రకటనను విడుదల చేశారు. కోవాక్జిన్పై బ్రెజిల్ హెల్త్ రెగ్యులేటర్ చేసిన ప్రకటనలను సాక్షాధారాలతో నివృత్తి చేస్తామని తెలిపారు. వ్యాక్సిన్ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశామని అన్నారు. అంతేకాకుంగా కోవాక్జిన్ భారత్తో సహా ఐదు దేశాల్లో ఆమోదించారనే విషయాన్ని గుర్తుచేశారు. భారత్ బయోటెక్ మార్చి 8 న బ్రెజిల్లో టీకా అత్యవసర ఉపయోగం కోసం దరఖాస్తు చేసింది. కాగా కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా 918.08 మిలియన్ డాలర్లు కొత్త రుణాలను పంపిణీ చేయాలనే ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మంగళవారం సంతకం చేశారు. కరోనా నియంత్రణలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలను బోల్సోనారో ఖండించారు. కొత్త రుణాలతో బ్రెజిల్ ఆరోగ్య వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని బ్రెజిల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. రియో డి జనీరో రాష్ట్రంలో మంగళవారం రోజున తీవ్ర ఎండను సైతం లెక్క చేయకుండా బ్రెజిల్ పౌరులు టీకా కోసం ఆస్పత్రుల వద్ద బారులు తీరారు. చదవండి: వ్యాక్సిన్ పంపిణీలో ముందున్న భారత్ -
వ్యాక్సిన్ పంపిణీలో ముందున్న భారత్
న్యూఢిల్లీ : భారత్లో కరోనా తీవ్రత పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీలో మనదేశం ముందున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు దాదాపు 10 కోట్ల 50లక్షల వాక్సిన్లను ఉత్పత్తి చేసిన భారత్.. 76దేశాలకు 6కోట్ల వ్యాక్సిన్ డోసులను ఎగుమతి చేసినట్లు వివరించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రోజుకు 25లక్షల మందికి పైగా వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 3కోట్ల 71లక్షల మందివ్యాక్సిన్ తొలి డోసు, 74లక్షల మంది ఈపాటికే రెండో డోసు కూడా తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగానే సీరమ్ కంపెనీ ..నెలకు 7 కోట్ల కోవిషీల్డ్ డోసులను తయారు చేస్తోండగా, భారత్ బయోటెక్.. నెలకు దాదాపు 40 లక్షల కోవాగ్జిన్ డోసులను ఉత్పత్తి చేస్తోన్నట్లు పేర్కొంది. ఇక కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసు విషయంలో కేంద్రం గడువు పెంచింది. ప్రస్తుతం కోవిషీల్డ్ తొలివిడతకు, రెండోవిడతకు 4 వారాల అంతరం ఉంది. దీన్ని 8 వారాల వరకు పెంచాలని కేంద్రం సూచించింది. రెండు డోసుల మధ్య 8 వారాల అంతరం విధించాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఈ నిబంధనలు కేవలం కోవిషీల్డ్కే వర్తిస్తుందని, కోవాగ్జిన్ వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి మార్పులు లేవని కేంద్రం స్పష్టం చేసింది. చదవండి : విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 46 వేల కేసులు ఢిల్లీలో మరోసారి లాక్డౌన్! -
కరోనా వ్యాక్సిన్.. వేధించే సందేహాలు.. సమాధానాలు
కోవిడ్ నిరోధం కోసం వ్యాక్సిన్ రాకముందు ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ప్రజలు వేచిచూశారు. తీరా అందుబాటులోకి వచ్చాక వారిలో వ్యాక్సిన్పై అనేక రకాల సందేహాలూ, సంశయాలూ ముప్పిరిగొంటున్నాయి. సాధారణంగా గుండెజబ్బులు ఉన్నవారిలో ఇవి మరీ ఎక్కువగా ఉంటున్నాయి. దీనికితోడు రక్తం గడ్డకట్టే ధోరణిని పెంపొందిస్తుందా అనే సందేహం తో కొన్నిదేశాల్లో దీని వాడకాన్ని తాత్కాలికంగా ఆపడంతో ఆ సందేహాలు మరింతగా పెరిగాయి. ఇటీవల చాలామందిలో వాక్సిన్ పై సందేహాలూ ఎక్కువయ్యాయి. ప్రత్యేకించి బ్లడ్ థిన్నర్స్ వాడే వారు వ్యాక్సిన్ తీసుకోవద్దంటూ భారత్ బయోటిక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్లు మన ఫ్యాక్ట్షీట్లో చెప్పిన అంశాలతో గుండెజబ్బులున్నవారిలో ఈ సందేహాలు మరింత ఎక్కువయ్యాయి. అలాంటి సంశయాలున్నవారికి వ్యాక్సిన్పై అపోహలు తొలిగేలా మరింత విపులమైన సమాధానాలను తెలుసుకోండి...నిశ్చింతగా వ్యాక్సిన్ తీసుకోండి. ►రక్తాన్ని పలుచబార్చే మందులు (బ్లడ్ థిన్నర్స్) వాడేవాళ్లు కోవిడ్–19 వ్యాక్సిన్ వేసుకోవచ్చా? ఈ విషయంలో సందిగ్ధత రావడానికి భారత్ బయోటెక్ వాళ్లూ, సీరమ్ ఇన్సి్టట్యూట్ సంస్థ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ కారణమైంది. బ్లడ్ థిన్నర్స్ వాడేవారు ఈ వ్యాక్సిన్ను తీసుకోకూడదని అందులో ఉంది. అయితే వాస్తవానికి బ్లడ్ థిన్నర్స్ తీసుకునేవాళ్లలో ఈ వ్యాక్సిన్ వలన ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఏమీ ఉండదు గానీ ఇంజక్షన్ ఇచ్చిన దగ్గర రక్తం గడ్డకట్టే అవకాశం మాత్రం కొంతమేరకు ఉండవచ్చు. అంతకుమించి ఎలాంటి దుష్ఫలితాలూ ఈ మందుల వల్ల వచ్చే అవకాశం ఉండదు. బ్లడ్ థిన్నర్స్ రెండు రకాలుంటాయి. ఒక రకాన్ని ‘యాంటీ ప్లేట్లెట్స్’ అంటారు రెండో రకాన్ని ‘యాంటీ కోయాగ్యులెంట్స్’ అంటారు. యాంటీ ప్లేట్లెట్స్ అంటే ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్, టికాగ్రిలార్, ప్రాసూగ్రిల్ లాంటివి. ఇవి వాడేవాళ్లు నిర్ద్వంద్వం గా కోవిడ్ వ్యాక్సిన్ని తీసుకోవచ్చు. ఈ బ్లడ్ థిన్నర్స్ ఎక్కువ గా హార్ట్ఎటాక్ వచ్చినవాళ్లు వాడుతూ ఉంటారు. వీటిని వ్యాక్సిన్ తీసుకునే ముందు ఆపినట్లయితే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున వీటిని ఆపకుండానే వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మందులు వేసుకునే వాళ్లు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందర గుండె జబ్బుల నిపుణుల దగ్గర అనుమతి తీసుకునే అవసరం లేదు. మరొక రకం బ్లడ్ థిన్నర్స్ని ‘యాంటీకోయాగ్యులెంట్స్’ అని పిలుస్తారని చెప్పుకున్నాం కదా. వార్ఫేరిన్, అసిట్రోమ్ ఇలాంటి మందుల్ని పాత రకం యాంటీకోయాగ్యులెంట్స్ అంటారు. వాల్వ్ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న వాళ్లు, కొన్ని రకాల కండిషన్ల కారణంగా రక్తం గడ్డకట్టే స్వభావం ఉన్న వాళ్లు ఈ మందుల్ని వాడుతుంటారు. అలాంటి వారు ఆ మందులు సరైన మోతాదులో సరైన విధంగా పనిచేస్తున్నాయా లేదా అనేది తెలుసుకోవడం కోసం పీటీ విత్ ఐఎన్ఆర్ అనే పరీక్ష క్రమబద్ధంగా చేయించుకుంటూ ఉంటారు. ఈ పరీక్షని వ్యాక్సిన్ ముందుకూడా చేయించుకోవచ్చు. ఒకవేళ ఈ ఐఎన్ఆర్ పరీక్ష మూడు కన్నా తక్కువ ఉన్నట్లయితే ఎలాంటి సందేహం లేకుండా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ఐఎన్ఆర్ వాల్యూ మూడు కన్నా ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు గుండె జబ్బు డాక్టర్ని సంప్రదించవచ్చు. ఇకపోతే కొత్తతరం యాంటీ కొయాగ్యులెంట్స్ అనేవి ఇంకొన్ని బ్లడ్ థిన్నర్స్. రివారోక్సబాన్, ఎపిక్సబాన్, డాబిగాట్రాన్ అనే మందులు ఈ కోవకు చెందినవి. ఈ మందులు వేసుకునే వాళ్ళు కూడా కోవిడ్–19 వ్యాక్సిన్ని సేఫ్గా వేసుకోవచ్చు. బ్లడ్ థిన్నర్స్ వేసుకునే వాళ్లు కోవిడ్ –19 వ్యాక్సిన్ తీసుకునే ముందు వాళ్ల మందుల వివరాలను వ్యాక్సినేషన్ అధికారికి చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంజక్షన్ తీసుకున్న తర్వాత ఇంజక్షన్ తీసుకున్న ప్రదేశాన్ని ఒక ఐదు నిమిషాల పాటు గట్టిగా నొక్కి పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మందులు వేసుకునే వాళ్ళు వాక్సిన్ కోసం వీటిని ఆపడం అనేది కొన్నిసార్లు ప్రమాదకరం కావచ్చు. అందువల్ల ఏదైనా కారణాల వల్ల ఒకవేళ ఈ మందుల్ని ఆపదలుచుకుంటే మాత్రం వాటికి సంబంధించిన డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించాలి. ►కోవిడ్–19 వాక్సిన్ తర్వాత రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుందా? ఈ కారణంతో యూరోప్లో అనేక దేశాలు వ్యాక్సిన్ ని తాత్కాలికంగా నిలిపివేశారు అనే వార్తలు వస్తున్నాయి. అవి నిజమేనా? ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వాక్సిన్ వాడిన తర్వాత కొంతమందిలో రక్తం గడ్డ కట్టిందనే అనుమానంతో కొన్ని యూరోపియన్ దేశాలు ఈ వ్యాక్సిన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. అయితే ఆ కంపెనీ అధికారులు, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ అధికారులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు... ఈ ముగ్గురూ చెప్పే విషయం ఏమిటంటే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కొంతమందికి రక్తం గడ్డకట్టినప్పటికీ వ్యాక్సిన్ వల్లనే రక్తం గడ్డకట్టినట్లుగా ఎలాంటి ఆధారాలూ లేవు అని. లక్షమంది ప్రజల్ని తీసుకున్నట్లయితే వాళ్లలో వ్యాక్సిన్ వాడనప్పటికీ కొంతమందిలో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. వాక్సిన్ తరువాత అదే లక్షమందిలో ఎక్కువమందికి రక్తం గడ్డకడితే గనక అప్పుడు వ్యాక్సిన్ వల్లనే రక్తం గడ్డకట్టే అవకాశం పెరిగిందని అనుకోవచ్చు. కానీ రక్తం గడ్డకట్టే స్వభావం వ్యాక్సిన్ తీసుకోడానికి ముందూ... వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతా ఏ మాత్రం ఎక్కువగా లేదని ఆస్ట్రోజెనికా కంపెనీ చెబుతోంది. మన దేశంలో కూడా వాక్సిన్ తర్వాత వచ్చే దుష్ఫలితాల గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నామని డీసీజీఐ వెల్లడించింది. ఇప్పటివరకు మాత్రం ఇలాంటి రక్తం గడ్డకట్టే స్వభావం ఇండియా లో ఉన్న ఏ వ్యాక్సిన్తోనూ కనపడలేదని తెలుస్తోంది. ►కోవిడ్–19 వాక్సిన్ తర్వాత బీపీగానీ, షుగర్ గాని వచ్చే అవకాశం ఉంటుందా? కోవిడ్–19 వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కొంతమందిలో బీపీ ఎక్కువకావడం లేదా మరికొంతమందిలో బీపీ తక్కువ కావడం డాక్టర్ల దృష్టికి వచ్చింది. అయితే ఈ వాక్సిన్ తీసుకోవడం పట్ల ఉన్న అనుమానాలూ, టెన్షన్ల వల్లనే బీపీ పెరగడం గానీ, తగ్గడంగానీ జరుగుతోందని నిపుణుల అభిప్రాయం. బీపీలో ఈ రకమైన మార్పు తాత్కాలికమైనదేననీ, దీర్ఘకాలంలో కోవిడ్ వ్యాక్సిన్ వల్ల బీపీగానీ, షుగర్గానీ వచ్చే అవకాశం లేదని నిపుణులు తెలియజేస్తున్నారు. ►కోవిడ్–19 వాక్సిన్ తర్వాత వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంటుందా? ఇది పూర్తిగా నిరాధారమైన సందేహం మాత్రమే. వంధ్యత్వం రావడానికి కోవిడ్ –19కీ లేదా కోవిడ్–19 వ్యాక్సిన్కీ ఎలాంటి సంబంధమూ లేదు. ►కోవిడ్–19∙వ్యాక్సిన్ తర్వాత కొంతమంది హెల్త్ కేర్ వర్కర్స్ ప్రెగ్నెంట్ కావడం జరిగింది. వాళ్లు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చెయ్యవచ్చా లేక అబార్షన్ చేయించుకోవాలా? గర్భిణీ స్త్రీలూ, పాలిచ్చే తల్లులకు కోవిడ్–19 వ్యాక్సిన్ని ప్రస్తుతానికి ఇవ్వకూడదని ఇండియన్ డీసీజీఐ నిర్ణయించింది. ఇప్పటివరకు గర్భవతులపై ఈ వ్యాక్సిన్ ప్రయోగం జరగలేదు కాబట్టీ, వారిపై ఎలాంటి ట్రయల్స్ నిర్వహించలేదు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేగాని ఈ వ్యాక్సిన్ వల్ల గర్భిణుల్లో ఏమైనా దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్టు గా కూడా ఇప్పటివరకైతే ఎలాంటి దాఖలాలూ లేవు. కాబట్టి గర్భిణులు ప్రస్తుతానికి ఈ వ్యాక్సిన్ తీసుకోకూడదు. ఒకవేళ ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత గర్భధారణ జరిగితే గనక అలాంటివారు ఎలాంటి భయాలూ, సందేహాలూ, లేకుండా తమ గర్భధారణ (ప్రెగ్నెన్సీ)ని కొనసాగించవచ్చు. ►వాక్సిన్ వేసుకున్న తర్వాత చేతి దగ్గర నొప్పి లేకపోతే యాంటీబాడీస్ డెవలప్ కావా? వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత భుజం దగ్గర నొప్పి రావడం సహజం. నొప్పి ఉన్నప్పుడు మనకి ఆ ఇంజక్షన్ ద్వారా విడుదలైన యాంటిజెన్ పనిచేస్తోందని కూడా తెలుస్తుంది. వ్యాక్సిన్ పట్ల మన శరీరం ప్రతిక్రియ జరపడం (రియాక్షన్ చూపడం) వల్ల కొంత నొప్పి గాని కొన్నిసార్లు జ్వరం గాని రావచ్చు. అయితే బాగా భుజం నొప్పి వచ్చిన వాళ్లకో... లేదా బాగా జ్వరం వచ్చిన వాళ్లకు మాత్రమే యాంటీబాడీస్ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతాయనడానికి ఆధారాలు లేవు. అసలు ఏ నొప్పి లేకపోయినప్పటికీ వాక్సిన్ తర్వాత యాంటీ బాడీస్ పెద్దమొత్తంలో వృద్ధి కావచ్చు. కాబట్టి వాక్సిన్ వేసుకున్న తర్వాత నొప్పి గురించి భయపడాల్సిన అవసరం లేదని ఎలా చెబుతున్నామో, నొప్పి లేకపోయినా వ్యాక్సిన్ ప్రభావం గురించి భయపడాల్సిన అవసరం లేదని గట్టిగా చెప్పాల్సి వస్తోంది. అంటే... చేతి నొప్పికీ... వ్యాక్సిన్ కారణంగా వృద్ధి అయ్యే యాంటీబాడీస్ సంఖ్యకూ ఎలాంటి సంబంధమూ లేదని అర్థం చేసుకోవాలి. డా. ఎంఎస్ఎస్ ముఖర్జీ, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ -
హైదరాబాద్లో సగం మందికిపైగా కోవిడ్ నిరోధకత
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సగం మందిలో కోవిడ్ నిరోధక యాంటీబాడీలు ఉన్నట్లు ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్), భారత్ బయోటెక్లు సంయుక్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా రక్త పరీక్షలు నిర్వ హించి, విశ్లేషించగా దాదాపు 54% మందిలో కరోనా వైరస్ను అడ్డు కునే యాంటీబాడీలు ఉన్నట్లు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 30 వార్డుల్లో దాదాపు 9 వేల మంది నుంచి రక్తం సేకరించి తాము ఈ పరిశోధన నిర్వహించామని, ఒకట్రెండు వార్డులు మిన హాయించి మిగిలిన చోట్ల యాంటీబాడీల మోతాదు దాదాపు ఒకేలా ఉందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా గురువారం తెలిపారు. అత్యధికంగా కొన్ని వార్డుల్లో 70% జనాభాలో యాంటీబాడీలు కనిపించగా.. కొన్ని వార్డుల్లో 30% మందిలో మాత్రమే యాంటీబాడీలు కనిపించినట్లు తెలిపారు. ఇవీ వివరాలు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కోవిడ్ వ్యాప్తి, తీవ్రత తదితర అంశాలను అంచనా వేసేందుకు ఈ అధ్యయనం నిర్వహించారు. జనవరి మూడో వారం నుంచి మొదలుపెట్టి 3 వారాల పాటు 9 వేల మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. 10 ఏళ్ల వయసు మొదలుకొని 70 ఏళ్లపైబడిన వారి వరకు నమూనాలు తీసుకున్నారు. జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్తలు, సిబ్బంది నమూనాల సేకరణ చేపట్టగా సీసీఎంబీ అత్యాధునిక శాస్త్ర వ్యవస్థల సాయంతో ఆ నమూనాల్లో యాంటీబాడీల ఉనికి గుర్తించింది. దాదాపు 53 శాతం మంది పురుషుల్లో యాంటీబాడీలు కనిపించగా, మహిళల్లో ఈ సంఖ్య 56 శాతంగా ఉంది. 70 ఏళ్లపైబడ్డ వారిలో 49 శాతం మందిలో మాత్రమే యాంటీబాడీలు ఉన్నాయి. కరోనా కారణంగా వృద్ధులు ఇళ్లకే పరిమితం కావడం వల్ల ఇలా జరిగి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కోవిడ్ బారిన పడ్డ వ్యక్తుల కుటుంబాల్లో 78 శాతం మంది కరోనాకు నిరోధకత పెంచుకోవడం గమనార్హం. రోగులతో సంబంధాలు ఉన్న వారిలో 68 శాతం మంది యాంటీబాడీలను కలిగి ఉన్నారు. అంతేకాకుండా గదుల సంఖ్య ఎక్కువగా ఉండి.. సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్న కుటుంబాల్లో వ్యాధి బారిన పడ్డవారు తక్కువగా ఉన్నారని జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త ఎ.లక్ష్మయ్య తెలిపారు. 75 శాతం మందికి తెలియదు.. తమకు కోవిడ్ వచ్చి శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు సర్వేలో పాల్గొన్న 75 శాతం మందికి తెలియలేదని లక్ష్మయ్య తెలిపారు. వైరస్ సోకినా లక్షణాలు లేకపోవడం వల్ల ఇలా జరిగిందని పేర్కొన్నారు. లక్షణాలు ఉన్న వారితో పాటు, లేనివారిలోనూ 54 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు ఈ పరిశోధన తెలిపిందని వివరించారు. సర్వేలో పాల్గొన్న వారిలో 18 శాతం మందికి గతంలో కోవిడ్ సోకినట్లు తెలుసని, వీరిలో 90 శాతం మందిలో యాంటీబాడీలు గుర్తించామని తెలిపారు. ఇదే మంచి తరుణం.. జనాభాలో 54 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నంత మాత్రాన వైరస్ ప్రమాదం తప్పినట్లేనని అనుకోవద్దని, ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని వైరస్ను అంతమొందించేందుకు అందరూ కలసికట్టుగా ప్రయత్నించాలని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా స్పష్టం చేశారు. జనాభాలో సగం మందిలో యాంటీబాడీలు ఉండటం మంచి విషయమే అయినా.. అలసత్వం పనికిరాదని, టీకాలు వేసుకోవడం ద్వారా కనీసం 80 శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందేలా చూసుకోవాలని తద్వారా మాత్రమే వైరస్ను అంతమొందించొచ్చని స్పష్టం చేశారు. మరికొన్ని నెలల పాటు ముఖానికి మాస్కులు వేసుకోవడం, భౌతిక దూరం పాటించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భారత్ బయోటెక్కు చెందిన శాస్త్రవేత్త కృష్ణ మోహన్ పాల్గొన్నారు. -
ప్రధాని మోదీకి తొలి డోస్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(70) ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో సోమవారం ఉదయం 6.30 గంటలకు కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారు. అర్హులైన వారంతా టీకా తీసుకోవాలని కోరారు. 60 ఏళ్లు దాటిన వారికి, 45 ఏళ్లకుపైగా వయసున్న వ్యాధిగ్రస్తులకు టీకా ఇచ్చేందుకు ఉద్దేశించిన కరోనా వ్యాక్సినేషన్ రెండో దశ సోమవారం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థ దేశీయంగానే అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ను పుదుచ్చేరికి చెందిన నర్సు పి.నివేదా ప్రధాని మోదీకి ఇచ్చారని, ఆమెకు కేరళకు చెందిన నర్సు రోజమ్మ అనిల్ సహకరించారని అధికార వర్గాలు తెలిపాయి. వ్యాక్సినేషన్ అనంతరం మోదీ ట్వీట్ చేశారు. ‘‘కోవిడ్–19 వ్యాక్సిన్ ఫస్టు డోసు ఈ రోజే తీసుకున్నా. ఈ మహమ్మారిపై జరుగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయడంలో భాగంగా మన డాక్టర్లు, సైంటిస్టులు సాగిస్తున్న కృషి ప్రశంసనీయం. అర్హులైన వారంతా టీకాను తీసుకోవాలి. అంతా కలిసి భారత్ను కరోనారహిత దేశంగా మార్చేద్దాం’’ అని పిలుపునిచ్చారు. టీకా తీసుకుంటున్న ఫొటోను మోదీ ట్విట్టర్లో పోస్టు చేశారు. ఇందులో నర్సు నివేదాతోపాటు కేరళకు చెందిన నర్సు రోజమ్మ అనిల్ కూడా కనిపిస్తున్నారు. వ్యాక్సినేషన్ సందర్భంగా మోదీ అస్సామీ సంప్రదాయ కండువా ‘గమోచా’ ధరించారు. టీకా ఇస్తున్నప్పుడు ముఖంపై చిరునవ్వు చెదర నివ్వలేదు. అసలు టీకా ఇచ్చినట్లే అనిపించలేదు ఢిల్లీలో రహదారులపై ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ప్రధాని మోదీ ఉదయా న్నే వెళ్లి కరోనా టీకా తీసుకున్నారని అధికారులు చెప్పారు. మోదీకి టీకా ఇచ్చిన నర్సు నివేదా తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘అప్పుడే అయిపోయిందా! కనీసం టీకా ఇచ్చినట్లు కూడా నాకు అనిపించలేదు’’ అని మోదీ తనతో అన్నారని తెలిపారు. మూడేళ్లుగా ఎయిమ్స్లో పని చేస్తున్నానని, ప్రస్తుతం ఇక్కడి వ్యాక్సిన్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్నానని చెప్పారు. కరోనా టీకా కోసం ప్రధాని మోదీ వస్తున్నట్లు సోమవారం ఉదయమే తాను ఎయిమ్స్కు వచ్చిన తర్వాతే తెలిసిందన్నారు. ఆయనను కలవడం, స్వయంగా టీకా ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. రెండో డోసు కోసం ఆయన 28వ రోజున మళ్లీ రావాల్సి ఉంటుందని చెప్పారు. మోదీ తమతో(నర్సులు) మాట్లాడారని, తాము ఎక్కడి నుంచి వచ్చామన్నది అడిగి తెలుసుకున్నారని వివరించారు. టీకా ఇస్తున్న సమయంలో మోదీ చాలా సౌకర్యవంతంగా కనిపించారని మరో నర్సు రోజమ్మ అనిల్ చెప్పారు. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు అని, మోదీజీ చేతులు జోడించి వణక్కం అంటూ నమస్కారం చేశారని తెలిపారు. టీకా ఇచ్చిన తర్వాత ఆయన అరగంట పాటు పరిశీలనలో ఉన్నారని, ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని వెల్లడించారు. టీకా తీసుకున్నందుకు మోదీ సంతోషించారని అన్నారు. వెళ్లిపోయే ముందు తమ దగ్గరికి వచ్చి, చేతులు జోడించి థాంక్యూ, వణక్కం అని చెప్పారని రోజమ్మ వివరించారు. ప్రధాని రాక గురించి ఆదివారం రాత్రి పొద్దుపోయాక తమకు సమాచారం అందిందని ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా చెప్పారు. ఉల్లాసంగా.. సరదాగా ఎయిమ్స్లో వ్యాక్సినేషన్ సందర్భంగా నరేంద్ర మోదీ చాలా ఉల్లాసంగా కనిపించారు. అక్కడి గంభీరమైన వాతావరణాన్ని తేలికపర్చడానికి నర్సులతో సరదాగా సంభాషించారు. నాకు టీకా వేయడానికి మందంగా ఉన్న ప్రత్యేకమైన సూది, పశువులకు ఇచ్చేలాంటిది ఏదైనా వాడుతున్నారా.. ఎందుకంటే రాజకీయ నాయకులకు తోలుమందం అంటుంటారు కదా! అని అన్నారు. దీంతో అక్కడున్న వైద్య సిబ్బంది హాయిగా నవ్వేశారు. టీకా కోసం జనం బారులు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ రెండో దశ సోమవారం దేశవ్యాప్తంగా మొదలయ్యింది. 60 ఏళ్లు దాటిన వారికి, 45 నుంచి 59 ఏళ్ల వయసుండి వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా టీకా ఇస్తున్నారు. ప్రధాని మోదీ ఢిల్లీ ఎయిమ్స్లో కరోనా టీకా తీసుకొని రెండో దశ వ్యాక్సినేషన్కు శ్రీకారం చుట్టారు. టీకా కోసం అర్హులు ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్ల వద్ద బారులు తీరిన దృశ్యాలు దేశమంతటా కనిపించాయి. కొందరు చక్రాల కుర్చీలపై తరలిరావడం విశేషం. కర్ణాటక రాజధాని బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్లో 97 ఏళ్ల రామస్వామి పార్థసారథి సోమవారం కరోనా టీకా తీసుకున్నారు. ఢిల్లీలో దాదాపు 90 ఏళ్ల వయసున్న వృద్ధులు టీకా పొందారు. టీకా పంపిణీలో అక్కడక్కడ కొన్ని లోపాలు బయటపడ్డాయి. మరోవైపు కో–విన్ 2.0 పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోలేకపోయామని, అపాయింట్మెంట్ పొందలేకపోయామని కొందరు చెప్పారు. రెండో దశలో మొదటి రోజే దేశంలో పలువురు ప్రముఖులు టీకా తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు అమిత్ షా, ఎస్.జైశంకర్, రాజస్తాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా, తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, నేషలిస్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, గోపాలకృష్ణన్ టీకా వేయించుకున్నారు. ఇలా ఉండగా, కోవాగ్జిన్ టీకా తీసుకున్న ప్రధానికి హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థ సీఎంyీ కృష్ణ ఎల్లా కృతజ్ఞతలు తెలిపారు. -
భారత టీకాపై చైనా హ్యాకర్ల దృష్టి
న్యూఢిల్లీ/వాషింగ్టన్/బీజింగ్: కోవిడ్–19కి టీకా తయారు చేస్తున్న రెండు భారత ఫార్మా కంపెనీలను చైనా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారని సైబర్ నిఘా సంస్థ ‘సైఫర్మా’ వెల్లడించింది. ‘ఏపీటీ 10’, ‘స్టోన్ పాండా’ అనే పేర్లున్న ఆ హ్యాకింగ్ బృందానికి చైనా ప్రభుత్వం మద్దతుందని పేర్కొంది. ‘భారత్ బయోటెక్’, ‘సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ సంస్థలకు చెందిన ఐటీ వ్యవస్థల్లో, పంపిణీ చైన్లో లొసుగులను హ్యాకర్లు గుర్తించారని సింగపూర్, టోక్యోల్లో కార్యాలయాలున్న సైఫర్మా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన కోవిడ్–19 టీకాల్లో దాదాపు 60% భారత్లోనే ఉత్పత్తి అవుతున్నాయి. కోవిడ్ –19 వ్యాక్సిన్ విషయంలో భారతీయ ఫార్మా ఆధిపత్యాన్ని తగ్గించే లక్ష్యంతో చైనా బృందం ఈ హ్యాకింగ్కు పాల్పడుతోందని సైఫర్మా చీఫ్ ఎగ్జిక్యూటివ్ కుమార్ రితేశ్ తెలిపారు. వారి ప్రధాన లక్ష్యం ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఉత్పత్తిలో పాలు పంచుకుంటున్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియానేనన్నారు. సీరం ఇన్స్టిట్యూట్ పబ్లిక్ సర్వర్లు బలహీనమైన వెబ్ సర్వర్లపై ఆధారపడి ఉన్నాయని వారు గుర్తించారని రితేశ్ తెలిపారు. సైఫర్మా వెల్లడించిన ఈ విషయాలపై సీరమ్ ఇన్స్టిట్యూట్ కానీ, భారత్ బయోటెక్ కానీ స్పందించలేదు. చైనా విదేశాంగ శాఖ కూడా దీనిపై స్పందించేందుకు నిరాకరించింది. పవర్ గ్రిడ్ వ్యవస్థపై దాడి కూడా చైనా పనే భారత్, చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న సమయంలో భారత్లో కీలకమైన పవర్ గ్రిడ్ వ్యవస్థను మాల్వేర్తో చైనా హ్యాకర్ల బృందం లక్ష్యంగా చేసుకుందని అమెరికాకు చెందిన మరో సంస్థ తాజాగా వెల్లడించింది. దాంతో, గత సంవత్సరం ముంబైలో ఒక్కసారిగా విద్యుత్ సరఫరాలో భారీ ఆటంకానికి హ్యాకింగే కారణమనే అనుమానాలు తాజాగా తలెత్తాయి. చైనా ప్రభుత్వంతో సంబంధమున్న ‘రెడ్ఎకో’ అనే హ్యాకర్స్ గ్రూప్ భారత్ పవర్ గ్రిడ్ వ్యవస్థను పలుమార్లు లక్ష్యంగా చేసుకుందని అమెరికా సైబర్ నిఘా సంస్థ ‘రికార్డెడ్ ఫ్యూచర్’ తాజాగా వెల్లడించింది. 2020 జూన్ నుంచి పలుమార్లు 10 ముఖ్యమైన భారతీయ విద్యుత్ సంస్థలపై హ్యాకర్లు దాడి చేశారంది. రెండు నౌకాశ్రయాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారని తెలిపింది. ‘ప్లగ్ ఎక్స్ మాల్వేర్ సీ2’ ద్వారా రక్షణ రంగ సంస్థలతో పాటు ప్రభుత్వ సంస్థలను హ్యాక్ చేయడానికి ప్రయత్నించారని పేర్కొంది. కాగా, భారత ‘పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్’ పనితీరుపై ఎలాంటి మాల్వేర్ దాడి ప్రభావం చూపలేదని, సవాళ్లను ఎదుర్కొనేలా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని విద్యుత్ శాఖ ప్రకటించింది. మాల్వేర్ కారణంగా ఎలాంటి డేటాను కోల్పోలేదని స్పష్టం చేసింది. మరోవైపు, ‘రికార్డెడ్ ఫ్యూచర్’ ఆరోపణలను చైనా ఖండించింది. భారత పవర్ గ్రిడ్ను ఆటంకపరిచే హ్యాకింగ్ చర్యల్లో తమ పాత్ర ఉందన్న ఆరోపణలను చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ తోసిపుచ్చారు. అక్టోబర్ 12న ముంబైలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోవడం, గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డ విషయం తెలిసిందే. -
చైనా వక్రబుద్ది: టార్గెట్ కోవిడ్ వ్యాక్సిన్
న్యూఢిల్లీ: గతేడాది ముంబైలో సంభవించిన భారీ పవర్ కట్ వెనక చైనా హ్యాకర్ల హస్తం ఉందనే వార్తను చదివాం. తాజాగా డ్రాగన్ దేశం మరో నీచానికి పాల్పడింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీ వంటి కార్యక్రమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మన దేశంలో సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీలు అభివృద్ధి చేసిన కోవిన్, కోవాగ్జిన్ టీకాల పంపిణీ కార్యక్రమం అమలవుతోంది. అంతేకాక ఇప్పటికే పలు దేశాలకు కేంద్రం మన వ్యాక్సిన్ డోసులను సరఫరా చేసిన సంగతి తెలిసిందే. ఇక చైనా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ అంత సమర్థవంతమైంది కాదని ఆ దేశానికి చెందిన పలువురు పరిశోధకులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా హ్యాకర్లు సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ల ఐటీ సిస్టమ్ని హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారట. ఈ విషయాన్ని సింగపూర్, టోక్యో కేంద్రంగా పనిచేస్తున్న గోల్డ్మాన్ సాచ్స్ మద్దతుగల సైఫిర్మా అనే కంపెనీ వెల్లడించింది. చైనీస్ హ్యాకింగ్ కంపెనీ యాప్ట్10 అలియాస్ స్టోన్ పాండ అనే కంపెనీ భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కంపెనీల ఐటి మౌలిక సదుపాయాలు, సప్లై చైన్ సాఫ్ట్వేర్లను హ్యాక్ చేసేందుకు యత్నించినట్లు వెల్లడించింది. వ్యాక్సిన్ రేసులో భారత ఫార్మ కంపెనీలను ఢీకొట్టడం.. వాటి మేధో సంపత్తిని నిర్మూలించడం ఈ హ్యాకర్ల ముఖ్య ఉద్దేశం అని సైఫిర్మా వెల్లడించింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆస్ట్రాజెనికాతో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోన్న సంగతి తెలిసిందే. మరి కొద్ది రోజుల్లోనే భారీ ఎత్తున ప్రపంచ దేశాలకు ఈ వ్యాక్సిన్ డోసులను సరఫరా చేయనుంది సీరం. ఈ నేపథ్యంలో చైనా యాప్ట్10 సీరంని టార్గెట్ చేసి.. వ్యాక్సిన్కు సంబంధించిన డాటాను కొల్లగొట్టేందుకు యత్నించినట్లు సైఫిర్మా తెలిపింది. యాప్ట్10 అనేది చైనీస్ మినిస్ట్రి ఆఫ్ స్టేట్ సెక్యూరిటీతో కలిసి పని చేస్తుందని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ 2018లో వెల్లడించింది. "సీరం ఇన్స్టిట్యూట్ విషయానికి వస్తే, వారు బలహీనమైన వెబ్ సర్వర్లను నడుపుతున్నారు. వారి పబ్లిక్ సర్వర్లు చాలా బలహీనంగా ఉన్నాయి.. ఇవి హాని కలిగించే వెబ్ సర్వర్లు. యాకర్లు ఈ బలహీనమైన వెబ్ అప్లికేషన్, కంటెంట్-మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇది చాలా భయంకరమైనది’’ అని సైఫిర్మా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీనిపై చైనా విదేశాంగ శాఖ స్పందన కోరగా.. ఎలాంటి సమాధానం లభించలేదు. అలానే సీరం, భారత్బయోటెక్లు కూడా దీనిపై స్పందిచలేదు అన్నారు. భారతదేశం, కెనడా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా,అమెరికాలోని కోవిడ్ వ్యాక్సిన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని రష్యా, ఉత్తర కొరియా నుంచి సైబర్ దాడులు జరిగినట్లు మైక్రోసాఫ్ట్ నవంబర్లో తెలిపింది. ఉత్తర కొరియా హ్యాకర్లు బ్రిటిష్ ఔషధ తయారీదారు అస్ట్రాజెనీకా వ్యవస్థల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని రాయిటర్స్ నివేదించింది. చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రధాని మోదీ ముంబై పవర్కట్: డ్రాగన్ పనే! -
కరోనా టీకా : ఆశ్చర్యపోయిన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రెండవ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ సోమవారం షురూ అయింది. 60 ఏళ్లు పైబడిన, 45 ఏళ్లు పైబడి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ దశలో కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ క్రమంలో భారత్ బయోటెక్ కోవిడ్ -19 వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’ షాట్ తీసుకున్న మొదటి వ్యక్తిగా ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు. తాను టీకా తీసుకున్న విషయాన్ని ప్రధాని ట్విటర్ ద్వారా వెల్లడించారు. దేశాన్ని కరోనా రహితంగా చేసేందుకు అందరూ టీకా తీసుకోవాలంటూ ఈ సందర్బంగా మోదీ పిలుపు నిచ్చారు. ఎయిమ్స్ టీకా కేంద్రంలో పుదుచ్చేరికి చెందిన సిస్టర్ నివేదా ప్రధాని మోదీకి టీకా ఇచ్చారు. కేరళకు చెందిన మరో సిస్టర్ రోసమ్మ అనిల్ కూడా ప్రధానికి టీకా వేసినప్పుడు అక్కడున్నారు. అయితే ఈ సందర్భంగా సిస్టర్ నివేదా, ప్రధాని మధ్య సంభాషణ ఆసక్తికరంగా మారింది. టీకా వేసుకోడానికి ప్రధాని వస్తున్నట్టు ఈ ఉదయమే తనకు తెలిసిందని గత మూడేళ్లుగా ఎయిమ్స్లో విధులు నిర్వహిస్తున్న సిస్టర్ నివేదా తెలిపారు. ప్రధాని మోదీని కలవడం, ఆయనకు తాను టీకా వేయడం ఆనందంగా ఉందని నివేదా సంతోషం వ్యక్తం చేశారు. "లగా భీ దియా ఔర్ పతా భీ నహీ చలా ( వేసేసారా? టీకా వ్యాక్సిన్ వేసినట్టు అస్పలు తెలియనే లేదు) అని టీకా తొలి డోస్ వేసిన తర్వాత ప్రధాని ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు. 28 రోజుల తర్వాత ఆయన రెండో డోస్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎక్కడి నుండి వచ్చామని అడిగారనీ, తమతో మాట్లాడారని ఆమె వెల్లడించారు. ఇది తనకు ఆశ్చర్యం కలిగించిందని కేరళకు చెందిన నర్సు రోసమ్మ అనిల్ పేర్కొన్నారు. టీకా తీసుకున్న తర్వాత ప్రధాని చాలా సౌకర్యవంతంగా ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. He took COVAXIN, against which a lot of misinformation was spread even when it was scientifically perfect. I think PM has given a clear message to the country. All misinformation & hesitancy should be buried once and for all: Union Health Minister Dr Harsh Vardhan, to ANI https://t.co/qnGpupGGmO — ANI (@ANI) March 1, 2021 మరోవైపు కోవాక్సిన్ పై చాలా తప్పుడు సమాచారం వ్యాపించింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకొని ప్రధాని దేశానికి స్పష్టమైన సందేశం ఇచ్చారని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్బంగా ఆయన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ముందడుగు వేసి, స్పూర్తిగా ఉండాలని ఎపుడూ చెప్పేవారని, మోదీ టీకా స్వీకరించడంతో మొహమాటాలు, తప్పుడు సమాచారం ఖతమైందని ఆయన ట్వీట్ చేశారు. రేపు తానుకూడా వాక్సిన్ తీసుకునున్నానని కూడా ఆయన ప్రకటించారు. కాగా క్లినికల్ ట్రయల్స్ జరగకుండానే భారత్ బయెటెక్ టీకాను అనుమతించడంపై విమర్శల నేపథ్యంలో ప్రధాని మోదీ కోవాగ్జిన్ తీసుకోవడం విశేషంగా నిలిచింది. -
కష్టకాలంలోనూ జీవశాస్త్రంలో వృద్ధి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జీవశాస్త్ర, ఆరోగ్య రంగాల్లో అభివృద్ధిని వంద బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, ఈ స్వప్నం సాకారమయ్యే సూచనలు కన్పిస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కోవిడ్ కష్టకాలంలోనూ గతేడాది ఈ రెండు రంగాల్లో దాదాపు రూ.3,700 కోట్ల పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించిందని చెప్పారు. సోమవారం హైదరాబాద్లో బయో ఆసియా–2021 సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోవిడ్కు తొలి వ్యాక్సిన్ హైదరాబాద్లోనే తయారు కావడం చాలా గర్వకారణమని చెప్పారు. కోవిడ్ కాలంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పలు సంస్థలు, శాస్త్రవేత్తలు నిరుపమానమైన సేవలు అందించారని, ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ ప్రతిష్టను ఇనుమడింపజేశారని కొనియాడారు. కోవాగ్జిన్ తయారీలో భారత్ బయోటెక్ విజయం సాధించగా బయోలాజికల్–ఈ, ఇండియన్ ఇమ్యునలాజికల్స్ కూడా తమ వంతు పాత్ర పోషించాయని, హెటిరో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ సంస్థలు రష్యా టీకా స్పుత్నిక్–వీ తయారీ చేపట్టి కొరతను నివారించే ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు. అరబిందో ఫార్మా కూడా ఏడాదికి 45 కోట్ల టీకాలు తయారీ సామర్థ్యంతో కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తోందని చెప్పారు. అమెరికా ఎఫ్డీఏ ఆమోదించిన తొలి భారతీయ కేన్సర్ మందు ఉమ్రాలిసిబ్ కూడా హైదరాబాద్లోనే తయారైందని గుర్తుచేశారు. జీనోమ్ వ్యాలీలో ఏడాది కాలంలో పలు దేశీ, విదేశీ కంపెనీలు ఏర్పాటు కాగా, కొన్ని తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని వివరించారు. ఫార్మాసిటీ ప్రారంభం త్వరలో ఉంటుందని, మెడికల్ డివైజెస్ పార్క్లోనూ ఈ ఏడాదిలోపు పూర్తి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. భారత్ బయోటెక్కు అవార్డు బయో ఆసియా ఏటా అందించే ప్రతిష్టాత్మక జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డు ఈ ఏడాది భారత్ బయోటెక్కు దక్కింది. కోవాగ్జిన్ వ్యాక్సిన్తో పాటు పలు ఇతర టీకాలను భారత్ బయోటెక్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అవార్డును భారత్ బయోటెక్ చైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాలకు మంత్రి కేటీఆర్ అందించారు. ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న వ్యాక్సిన్లలో 65 శాతం హైదరాబాద్లోనే తయారవుతుండటం గర్వకారణమని కృష్ణ ఎల్లా అన్నారు. అరబిందోతో పాటు పలు ఇతర సంస్థలు కూడా వ్యాక్సిన్ తయారీ రంగంలోకి ప్రవేశించడం వల్ల ఇకపై పోటీ మరింత ఆసక్తికరంగా మారనుందని పేర్కొన్నారు. -
కోవాగ్జిన్ : భారత్ బయోటెక్ కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త రకం కరోఏనా వైరస్ కేసులో భారత్లో పెరుగుతున్న నేపథ్యంలో టీకా తయారీదారు భారత్ బయోటెక్ కీలక విషయాన్ని ప్రకటించింది. తాము రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ బ్రిటన్లో కలకలం రేపిన కొత్త రకం ప్రాణాంతక కరోనా వైరస్పై సమర్థవంతంగా పని చేస్తున్నట్లు బుధవారం వెల్లడించింది. ఈ మేరకు భారత్ బయోటెక్ ట్వీట్ చేసింది. చైనాలోని వూహాన్లోపుట్టిన కోవిడ్-19 కంటే 70 శాతం ఎక్కువగా వ్యాపిస్తున్నట్టు భావిస్తున్న బ్రిటన్ కొత్త వేరియంట్ వైరస్ను తమ వ్యాక్సిన్ కోవాగ్జిన్ విజయవంతంగా నిలువరిస్తోందని వెల్లడించింది. దీనికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధన లింక్ను షేర్ చేసింది. ఈ ప్రాణాంతక వైరస్ వల్ల మరణాల సంఖ్య కూడా పెరుగుతోందని ఇటీవల బ్రిటన్ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో అనేక దేశాలో విదేశీయాన ఆంక్షలను కూడా విధించాయి. అయితే ఇప్పటికే బ్రిటన్ నుంచి విమానాల ద్వారా ఇండియాకు చేరిన వారిలో 150 మంది కొత్త కోవిడ్ స్ట్రెయిన్ బారిన పడ్డారు. Neutralization of UK-variant VUI-202012/01 with COVAXIN vaccinated human serum https://t.co/v8Me4TzGgh #BharatBiotech #COVAXIN #bioRxiv #COVID19 pic.twitter.com/7R3FlsWAX3 — BharatBiotech (@BharatBiotech) January 27, 2021 -
ఈ లక్షణాలుంటే కోవాగ్జిన్ టీకా తీసుకోవచ్చా?
సాక్షి, ముంబై: ఒకవైపు కరోనా మహమ్మారి అంతానికి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు సీరం వ్యాక్సిన్ తీసుకున్న 24 గంటల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారన్న వార్తలు ఆందోళన పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలి దేశీయ కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్కు సంబంధించి భారత్ బయోటెక్ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇటీవల కోవాగ్జిన్ టీకా దుష్ప్రభావాలపై పలు విమర్శలు వచ్చిన క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా తాజా సూచనలు జారీ చేసింది. ఎవరు తమ టీకాను తీసుకోకూడదు, ఎవరు తీసుకోవచ్చు అనే వివరాలతో ఒక వివరణాత్మక ఫ్యాక్ట్ షీట్ను రిలీజ్ చేసింది. ముఖ్యంగా బలహీనమైన ఇమ్యూనిటీ ఉన్నవారు, రోగనిరోధక శక్తి వ్యవస్థపై ప్రభావం చూపే మందులు వాడేవారు, అలర్జీ ఉన్నవారు తమ కోవాగ్జిన్ టీకాను తీసుకోవద్దు అని భారత్ బయోటెక్ హెచ్చరించింది. భారత్ బయోటెక్ వెబ్సైట్లో పోస్ట్ చేసిన ఫ్యాక్ట్ షీట్ ప్రకారం రక్తస్రావ లోపాలు లేదా బ్లడ్ థిన్నర్స్ వాడేవారు టీకా తీసుకోకపోవడం మంచిది. అలాగే జ్వరం లేదా అలెర్జీ ఉన్నవారు, గర్భిణీ, పాలిచ్చే తల్లులు కూడా వ్యాక్సిన్ తీసుకోవద్దని సూచించింది. దీనితోపాటు మరో కంపెనీ టీకా తీసుకున్న వారు కోవాగ్జిన్ టీకా వాడవద్దని కూడా హెచ్చరించింది. వ్యాక్సిన్ డోస్ తీసుకున్న తర్వాత ఎవరైనా కోవిడ్-19 లక్షణాలను కనిపిస్తే, దాన్ని ఆర్టీ-పీసీఆర్ పరీక్ష ఆధారంగా "ప్రతికూల సంఘటన" గా పరిగణిస్తారని పేర్కొంది. కాగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సయుక్తంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ను భారత్ బయోటెక్ రూపొందిస్తోంది. ఇప్పటికీ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. అత్యవసర ఉపయోగం కోసం కేంద్రం అనుమతి పొందిన రెండు సంస్థల్లో భారత్ బయెటెక్ ఒకటి. జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే. -
కోవాగ్జిన్ వద్దు.. కోవిషీల్డ్ కావాలి
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ టీకా మాత్రమే తమకు ఇవ్వాలని ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా(ఆర్ఎంఎల్) ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(ఆర్డీఏ) మెడికల్ సూపరింటెండెంట్ను కోరింది. ఈ మేరకు లేఖ రాసింది. హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ పట్ల తమ వైద్యుల్లో కొన్ని సందేహాలు, స్వల్పంగా భయాందోళనలు ఉన్నాయని పేర్కొంది. ఆర్ఎంఎల్లో కోవిషీల్డ్ కాకుండా కోవాగ్జిన్ మాత్రమే ఇవ్వనున్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపింది. కోవాగ్జిన్ విషయంలో అన్ని ట్రయల్స్ పూర్తి కాలేదని వెల్లడించింది. కోవిషీల్డ్ విషయంలో అన్ని స్థాయిల్లో ట్రయల్స్ పూర్తయ్యాయని గుర్తుచేసింది. కోవాగ్జిన్తో తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తితే నష్టపరిహారం కరోనా టీకా తీసుకునేందుకు వచ్చిన వారితో అంగీకార పత్రంపై సంతకం చేయించుకుంటున్నారు. కోవాగ్జిన్ తీసుకున్న వారిలో వారం రోజుల్లోగా తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తితే నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు పత్రంలో స్పష్టం చేశారు. ఇలాంటి వారిని ఆసుపత్రుల్లో చేర్చి, చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వల్లనే దుష్భ్రభావాలు తలెత్తినట్లు తేలితే దాని తయారీదారు భారత్ బయోటెక్ నష్టపరిహారం చెల్లిస్తుందని వెల్లడించారు. -
పరిహారం చెల్లిస్తాం: భారత్ బయోటెక్
హైదరాబాద్: కొవాగ్జిన్ టీకా తీసుకున్న వారు దుష్ప్రభావాల బారిన పడితే నష్టపరిహారం చెల్లిస్తామని భారత్ బయోటెక్ ప్రకటించింది. తమ వ్యాక్సిన్ కారణంగానే ప్రతికూలతలు ఎదురైనట్లు రుజువైతే.. వైద్య సహాయం కూడా అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు.. ‘‘టీకా వేసుకున్న తర్వాత అత్యంత తీవ్రమైన పరిస్థితులు తలెత్తితే అత్యున్నత ప్రమాణాలతో, ప్రభుత్వ ఆమోదం ఉన్న అధికారిక ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తాం. వ్యాక్సిన్ కారణంగా దుష్ప్రభావాలు ఎదురయ్యాయని నిరూపితమైతే బీబీఐఎల్ నష్ట పరిహారం చెల్లిస్తుంది’’ అని శనివారం నాటి ప్రకటనలో పేర్కొంది. కాగా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా.. ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. (చదవండి: వ్యాక్సిన్: డాక్టర్ రెడ్డీస్కు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్) అంగీకార పత్రం తప్పనిసరి ఇక దేశీయంగా తయారైన కోవిషీల్డ్, కోవాగ్జిన్ల టీకా డోసులను ఫ్రంట్లైన్ వారియర్లకు అందజేస్తున్నారు. కాగా హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కొవాగ్జిన్ వ్యాక్సిన్ను రూపొందించిన విషయం తెలిసిందే. ఇక వ్యాక్సిన్ వేయించుకునే వారి అంగీకార పత్రం ఉంటేనే తెలంగాణలో భారత్ బయోటెక్ టీకా అందజేస్తామని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. అయితే ఆక్స్ఫర్డ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్కు మాత్రం ఎలాంటి అంగీకార పత్రం అవసరంలేదని స్పష్టం చేశారు. -
ఏ టీకా అనేది మన ఇష్టం కాదు
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్కు కేంద్ర ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. టీకా సరఫరా కోసం ఉద్దేశించిన కో–విన్ యాప్లో ఇప్పటికే కోటి మందికిపైగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మరో మూడు రోజుల్లోనే వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్కు ప్రభుత్వం అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలిదశలో ఈ నెల 16వ తేదీ నుంచి ఈ వ్యాక్సిన్లను దాదాపు 3 కోట్ల మంది హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్లకు ఉచితంగా అందజేయనున్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్లో నిర్దిష్టంగా ఏదైనా ఒకటి ఎంచుకునే అవకాశం లబ్ధిదారులకు లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. రెండు టీకాల్లో ఎవరికి ఏ టీకా వేయాలన్నది ప్రభుత్వమే నిర్ధారిస్తుందని వెల్లడించింది. అంటే ఇష్టమైన టీకా తీసుకునే వెసులుబాటు లేనట్లే. వచ్చే ఎనిమిది నెలల్లో దేశంలో 30 కోట్ల మందికి కరోనా టీకా ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 16.5 లక్షల కోవాగ్జిన్ డోసులు ఉచితం కోవిషీల్డ్ వ్యాక్సిన్ను భారత్లో పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ఉత్పత్తి చేస్తోంది. తొలిదశలో ఈ సంస్థ నుంచి 1.1 కోట్ల టీకా డోసులు, భారత్ బయోటెక్ నుంచి 55 లక్షల డోసుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి 10 కోట్ల డోసుల్లో ఒక్కో డోసును రూ.200 చొప్పున ధరకు ప్రభుత్వానికి విక్రయించనున్నట్లు సీరం సంస్థ సీఈవో అదార్ పూనావాలా చెప్పారు. పన్నులతో కలుపుకుంటే ఒక్కో డోసు ధర రూ.220కు చేరుతుందన్నారు. ఇక కోవాగ్జిన్ ధర పన్నులు లేకుండా ఒక్కో డోసు రూ.295. పన్నులు కూడా కలిపితే రూ.309.5 అవుతుంది. 55 లక్షల డోసుల కొనుగోలుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా, ఇందులో 16.5 లక్షల డోసులను ఉచితంగా సరఫరా చేస్తామని భారత్ బయోటెక్ హామీ ఇచ్చింది. ఈ లెక్కన చూస్తే కోవాగ్జిన్ ఒక్కో డోసు రూ.206కే ప్రభుత్వం కొన్నట్లు అవుతుందని అధికారులు చెప్పారు. వ్యాక్సినేషన్ నేపథ్యంలో కరోనా టీకాల చేరవేత ఊపందుకుంది. విమానాల్లో తొలుత ప్రధాన నగరాలకు, అక్కడి నుంచి ద్వితీయశ్రేణి నగరాలు, పట్టణాలకు జాగ్రత్తగా, వేగంగా చేరవేస్తున్నారు. కరోనా టీకా రెండో డోసు తీసుకున్న 14 రోజుల తర్వాత దాని ప్రభావం కనిపించడం మొదలవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ బుధవారం చెప్పారు. -
హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరిన కోవాగ్జిన్
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి వైరస్కు విరుగుడుగా తీసుకొచ్చిన వ్యాక్సిన్లు పంపిణీకి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ వ్యాక్సిన్ అన్ని రాష్ట్రాలకు తరలిస్తున్నారు. సీరమ్ ఇన్స్టిట్యూట్కు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ మంగళవారం పుణె నుంచి రాష్ట్రాలకు చేరగా.. తాజాగా భారత్ బయోటెక్కు చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ రాష్ట్రాలకు పంపించడం మొదలైంది. బుధవారం తెల్లవారుజామున తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి విమానంలో కోవాగ్జిన్ వ్యాక్సిన్ను పంపించారు. ఢిల్లీకి ఉదయం 9 గంటల వరకు చేరింది. భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరి 16వ తేదీ నుంచి పెద్ద మొత్తంలో జరగనుంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వినియోగానికి అత్యవసర అనుమతి జారీ చేసిన విషయం తెలిసిందే. 54.72 లక్షల డోసుల వ్యాక్సిన్ రాష్ట్రాలకు చేరగా.. ఇది మొత్తం 1.65 కోట్ల డోసులకు చేరుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సీరమ్ ఇన్స్టిట్యూట్ 1.1 కోట్ల డోసులు ఉత్పత్తి చేయగా.. భారత్ బయోటెక్ 55 లక్షల కోవాగ్జిన్ను ఉత్పత్తి చేసింది. -
6 కోట్ల డోసుల టీకా కొనుగోలుకు కేంద్రం ఉత్తర్వులు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కోవిడ్ వ్యాక్సినేషన్ దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యవసర వినియోగానికి అనుమతులిచ్చిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాల 6 కోట్ల డోసుల కొనుగోలుకు కేంద్రం సోమవారం ఆర్డర్ ఇచ్చింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) తయారు చేస్తున్న ఆక్స్ఫర్డ్ టీకా కోవిషీల్డ్ను మొదటి విడతలో 1.1 కోట్ల డోసులు, రెండో విడతలో ఏప్రిల్ కల్లా మరో 4.5 కోట్ల డోసులు కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా, భారత్ బయోటెక్ టీకా కోవాగ్జిన్ను రూ.162 కోట్ల విలువైన 55 లక్షల డోసులను కొనుగోలు చేస్తోంది. ఇందుకు గాను మొత్తం రూ.1,300 కోట్లు వెచ్చిస్తోంది. తయారీ కేంద్రాల నుంచి టీకా డోసుల సరఫరా మంగళవారం ఉదయం నుంచి ప్రారంభం కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తరఫున ప్రభుత్వ రంగ హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్ లిమిటెడ్ నుంచి అడిషనల్ డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ పేరిట ఈ కొనుగోలు ఆర్డర్ జారీ అయింది. టీకా ఒక్కో డోసు ఖరీదు రూ.200 కాగా, జీఎస్టీతో రూ.10 కలుపుకుని డోసు ఖరీదు మొత్తం రూ.210 అని ఆ అందులో పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం నుంచి దేశవ్యాప్తంగా గుర్తించిన 60 పాయింట్లకు టీకా డోసులు సరఫరా అవుతాయి. అక్కడి నుంచి వివిధ పంపిణీ కేంద్రాలకు దానిని చేరవేస్తారు. ఢిల్లీలోని తహిర్పూర్లో ఉన్న రాజీవ్గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సెంట్రల్ స్టోరేజీ పాయింట్కు 2,54,500 డోసుల కోవిషీల్డ్ టీకా చేరనుందని అధికారులు తెలిపారు. పుణేలోని మంజరి వద్దనున్న సీరం ఇన్స్టిట్యూట్ కేంద్రం నుంచి వ్యాక్సిన్ తీసుకెళ్లే ట్రక్కులకు రాష్ట్ర సరిహద్దుల వరకు, విమానాశ్రయాల వరకు మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసు భద్రత కల్పిస్తోంది. ఇమ్యునైజేషన్ ప్రక్రియలో భాగంగా ఈ టీకాను వ్యక్తులకు 28 రోజుల వ్యవధిలో రెండు డోసులుగా ఇస్తారు. స్వచ్ఛందంగా వేయించుకోండి వ్యాక్సిన్ను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వేయించు కోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తన 3.5 లక్షల మంది సభ్యులకు పిలుపునిచ్చింది. సంపూర్ణ శాస్త్రీయ విశ్లేషణ, నిపుణుల బృందం నివేదికల పరిశీలన, ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్వోలతో చర్చల అనంతరం ప్రభుత్వం చేపట్టే కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నిర్ణయించినట్లు తెలిపింది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను దేశీయ వాతావరణ పరిస్థితుల్లో నిల్వ ఉంచడం, వినియోగించడం సులువని వివరించింది. -
కోవాగ్జిన్కు ఎదురుదెబ్బ.. వలంటీర్ మృతి
భోపాల్: హైదరాబాద్లోని భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా టీకా ‘కోవాగ్జిన్’ తీసుకున్న 42 ఏళ్ల వలంటీర్ మృతి చెందాడు. భోపాల్లో ఈ ఘటన జరిగింది. కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. భోపాల్లోని పీపుల్స్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో డిసెంబర్ 12న కోవాగ్జిన్ హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా గిరిజన కూలి అయిన దీపక్ మర్వాయి అనే వ్యక్తికి(వలంటీర్) సైతం వ్యాక్సిన్ ఇచ్చారు. అతడు డిసెంబర్ 21న మరణించాడు. అయితే, దీపక్ మర్వాయి విష ప్రయోగం కారణంగా మరణించినట్లు అనుమానాలు ఉన్నాయని మధ్యప్రదేశ్ మెడికో లీగల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ శర్మ చెప్పారు. అసలైన కారణమేంటో నిర్ధారించాల్సి ఉందన్నారు. కోవాగ్జిన్ తీసుకొని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత దీపక్లో ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. ఛాతీ నొప్పితో బాధపడ్డాడని వెల్లడించారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో డిసెంబర్ 21న ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే తుదిశ్వాస విడిచాడని పేర్కొన్నారు. అసలైన వ్యాక్సిన్ ఇచ్చారా? లేదా? వలంటీర్ దీపక్ మృతిపై భారత్ బయోటెక్ సంస్థ స్పందించింది. ఫేజ్–3 ట్రయల్స్లో భాగంగా అతడి అంగీకారంతోనే వ్యాక్సిన్ ఇచ్చినట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏడు రోజుల పాటు అతడిలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు, దుష్ప్రభావాలు కనిపించలేదని, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని పేర్కొంది. 9 రోజుల తర్వాత మరణించాడంటే అందుకు తమ వ్యాక్సిన్ కారణం కాదని ప్రాథమిక సమీక్షలో తేలినట్లు స్పష్టం చేసింది. అయితే, హ్యూమన్ ట్రయల్స్లో భాగంగా దీపక్ మర్వాయికి అసలైన కోవాగ్జిన్ ఇచ్చారా? లేక సాధారణ ఔషధం(ప్లాసిబో) ఇచ్చారా? అనేది నిర్ధారణ కాలేదు. -
కోవాగ్జిన్ తీసుకున్న వలంటీర్ మృతి
భోపాల్: కరోనా వైరస్ వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో పలు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో టీకా తీసుకున్న వారు మృతి చెందారనే వార్తలు మరింత కలవరపెడుతున్నాయి. ఇప్పటి వరకు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుని ఇద్దరు నర్సులు మృతి చెందారని విన్నాం. తాజాగా ఈ జాబితాలోకి దేశీయ వ్యాక్సిన్ కోవాగ్జిన్ కూడా చేరింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా కోవాగ్జిన్ తీసుకున్న ఓ వలంటీర్ పది రోజుల తర్వాత మృతి చెందాడనే వార్త ప్రస్తుతం కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే మూడోదశ ట్రయల్స్ పూర్తి కాకుండానే వ్యాక్సిన్ వినియోగానికి అనుమతివ్వడం పట్ల విపక్షాలు విమర్శలు చేస్తుండగా.. తాజాగా వలంటీర్ మృతి చెందడం వివాదాన్ని మరింత పెంచుతోంది. వివరాలు.. భోపాల్కు చెందిన దీపక్ మరవి (42) గతేడాది డిసెంబర్ 12న పీపుల్స్ మెడికల్ కాలేజీ అండ్ హస్పిటల్లో నిర్వహించిన కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్లో పాల్గొని కోవాగ్జిన్ వ్యాక్సిన్ డోసు తీసుకున్నాడు. ఆ తర్వాత పది రోజులకు అతడు మరణించాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో కోవాగ్జిన్ ట్రయల్లో పాలు పంచుకున్న మెడికల్ కాలేజీ వైస్ చాన్సిలర్ మాట్లాడుతూ.. ‘దీపక్ మరవి వ్యాక్సిన్ ట్రయల్స్లో భాగంగా కోవాగ్జిన్ డోసు తీసుకున్నాడు. ఆ తర్వాత అతడు మరణించినట్లు తెలిసింది. విష ప్రయోగం వల్ల చనిపోయాడని అనుమానిస్తున్నాం.. కానీ మరణానికి అసలు కారణం ఇంకా తెలియలేదు. విసెరా పరీక్షతో మరవి ఎందువల్ల చనిపోయాడనే విషయం తెలుస్తుంది’ అన్నారు. (మా వ్యాక్సిన్ చాలా డేంజర్: చైనా ఎక్స్పర్ట్) ఇక మధ్యప్రదేశ్ మెడికో లీగల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ శర్మ మాట్లాడుతూ.. ‘దీపక్ మరవికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడు.. విషప్రయోగం వల్ల అతడు చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నాడు. కానీ అసలు కారణం ఇంకా తెలియలేదు. ఇక మరవి గతేడాది డిసెంబర్ 21న చనిపోయాడు. ఈ విషయాన్ని డీసీజీఐ, భారత్ బయోటెక్ దృష్టికి తీసుకెళ్లాం. ఇక వ్యాక్సిన్ ట్రయల్స్లో పాల్గొనడాకి ముందు మరవికి అన్ని పరీక్షలు చేశాం. అంతా బాగుంది అనుకున్నాకే వ్యాక్సిన్ డోసు తీసుకునేందుకు అనుమతిచ్చాం. ఇక ట్రయల్స్లో పాల్గొన్న అందరికి వ్యాక్సిన్ ఇవ్వరు. సగం మందికి వ్యాక్సిన్ ఇచ్చి.. మిగతావారికి సెలైన్ ఇస్తారు. ప్రస్తుతం దీపక్కి ఇచ్చింది వ్యాక్సిన్ డోసా లేకా.. సెలైనా అనే విషయం తెలియాలి. ఇక ట్రయల్స్లో పాల్గొన్న అందరిని వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అరగంట పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఇంటికి పంపించాం.. ఆ తర్వాత ఎనిమిది రోజులు వారిని అబ్జర్వేషన్లో ఉంచాం’ అని తెలిపారు. (చదవండి: టీకాపై ఎటూ తేల్చుకోలేక..) ఇక మరవి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ‘వ్యాక్సిన్ తీసుకుని ఇంటికి వచ్చాక.. అతడు కొంత ఇబ్బంది పడ్డాడు. అనారోగ్య సమస్యలు తలెత్తాయి. డిసెంబర్ 17న భుజం నొప్పితో బాధపడ్డాడు. రెండు రోజుల తర్వాత నోటి నుంచి నురగ వచ్చింది. డాక్టర్ దగ్గరకు వెళ్దాం అంటే వినలేదు. రెండు మూడు రోజుల్లో అంతా సర్దుకుంటుందని తెలిపాడు. ఇలా ఉండగానే అతడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఇక డిసెంబర్ 21న ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మధ్యలోనే చనిపోయాడు’ అని తెలిపారు. ఇక రజనా ధింగ్రా అనే సామాజిక కార్యకర్త దీపక్ మరవి ట్రయల్స్లో పాల్గొన్నాడనే దానికి రుజువుగా అతడికి ఎలాంటి రసీదు, లెటర్ లాంటిది ఇవ్వలేదని తెలిపారు. -
సీఎంలతో సోమవారం ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈ నెలాఖరున ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం 4 గంటలకు సమావేశం జరగనున్నట్టు ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది. రెండు కోవిడ్ వ్యాక్సిన్లను ఔషధ నియంత్రణ సంస్థ అనుమతించిన తరువాత ముఖ్యమంత్రులతో ఇదే ప్రధాని తొలిసమావేశం. ప్రధాని అప్పుడప్పుడు ముఖ్యమంత్రులతో కోవిడ్ సంక్షోభం గురించి మాట్లాడుతున్నారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తోన్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారు చేస్తోన్న కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఔషధ నియంత్రణ సంస్థ అనుమతించడంతో దేశవ్యాప్తంగా భారీ టీకా కార్యక్రమానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం కానున్నారు. నెగెటివ్ వచ్చినా క్వారంటైన్ తప్పదు యూకే నుంచి ఢిల్లీ చేరనున్న వారికి ప్రభుత్వం తప్పనిసరి క్వారంటైన్ విధించనున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. యూకేలో కొత్త స్ట్రెయిన్ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చేవారికి చేసే కోవిడ్–19 పరీక్షలో నెగెటివ్ వచ్చినా ఏడు రోజుల పాటు సంస్థాగత క్వారంటైన్ ఉండాల్సిందేనని చెప్పారు. అనంతరం మరో వారం పాటు హోం క్వారంటైన్లో ఉండాలని, ఈ కొత్త నియమాలు 14 వరకు ట్రయల్ రూపంలో జరుగుతాయని ప్రభుత్వం తెలిపింది. అందరికీ కరోనా టీకా న్యూఢిల్లీ/చెన్నై: కోవిడ్–19 వ్యాక్సినేషన్ సెకండ్ డ్రై రన్ శుక్రవారం దేశవ్యాప్తంగా 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 736 జిల్లాల్లో నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు. కరోనా టీకా అతి త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దేశ ప్రజలందరికీ టీకా అందుతుందని వెల్లడించారు. తొలుత ప్రాధాన్యతా వర్గాలకు టీకా అందజేస్తామన్నారు. ఆయన చెన్నైలోని రాజీవ్గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన కరోనా టీకా డ్రై రన్ను పరిశీలించారు. వ్యాక్సిన్ లబ్ధిదారుల వివరాలను సేకరించడానికి కోవిడ్–19 వేదికను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. వారికి ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్లు అందజేస్తున్నామని అన్నారు. తమిళనాడు చెంగల్పట్టులో ఉన్న హెచ్బీఎల్ ఇంటిగ్రేటెడ్ వ్యాక్సిన్ కాంప్లెక్స్లో కరోనా టీకాలు ఉత్పత్తి చేస్తామన్నారు. -
భారత్ బయోటెక్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ను నిరోధించేందుకు దేశీయంగా కోవాగ్జిన్ టీకా అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్ గురువారం కీలక ప్రకటన చేసింది. మూడవ దశ ట్రయల్స్కు సంబంధించిన వాలంటీర్ల ఎంపిక పూర్తయిందని తెలిపింది. కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఆమోదంపై తీవ్ర చర్చ మధ్య భారత్ బయోటెక్ తమ కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం 25,800 మంది నియామకాలను పూర్తి చేసినట్లు తెలిపింది. ట్రయల్స్ నిమిత్తం 23,000 మంది వాలంటీర్లను నియమించినట్లు జనవరి 2 న కంపెనీ సమాచారం ఇచ్చింది. ఈ పరీక్షల డేటా మార్చిలో వెలువడనున్నాయని అంచనా వేయడంతోపాటు, ఇప్పటికే 5000 మందికి పైగా టీకా రెండు షాట్లను అందించినట్టు తెలిపింది. క్లినికల్ ట్రయల్ మోడ్లో కోవాగ్జిన్ పరిమిత వినియోగానికి సబ్జెక్ట్ నిపుణుల కమిటీ (ఎస్ఇసి) జనవరి 2 న సిఫారసు చేసింది. అనంతరం డ్రగ్ రెగ్యులేటరీ కూడా ఆమోదం తెలిపింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ,నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి) సహకారంతో భారత్ బయోటెక్ ఈ టీకాను అభివృద్ది చేస్తున్న సంగతి తెలిసిందే. pic.twitter.com/QrbZ9DcZGe — suchitra ella (@SuchitraElla) January 7, 2021 -
ఎందుకు భారత వ్యాక్సిన్లపై వివాదం...?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ను కట్టడి చేయడం కోసం భారత్ బయోటెక్ కంపెనీ కనుగొన్న ‘కోవాక్సిన్’, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కనుగొన్న ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్లకు ‘డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)’ ఆదివారం అత్యవసర వినియోగార్థం అనుమతి ఇవ్వడం పట్ల వివాదం చెలరేగుతోంది. మూడు దశల ట్రయల్స్కు సంబంధించి ఎలాంటి డేటాను సమర్పించకుండానే భారత్ బయోటెక్ కనుగొన్న కోవాక్సిన్కు ఎలా అనుమతి మంజూరు చేస్తారని, ఇది ప్రజల ఆరోగ్యంతోని ఆడుకోవడమేనని కొంత మంది శాస్త్ర వేత్తలతోపాటు ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తుండగా, ‘ఆత్మనిర్భరత వ్యాక్సిన్లు’ దేశానికి గర్వకారణమని, అనవసరంగా వాటిపై ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర మంత్రులు ఎదురు దాడికి దిగారు. సీరం ఇనిస్టిట్యూట్ కనుగొన్న ‘కొవీషీల్డ్’ వ్యాక్సిన్కు అనుమతివ్వడాన్ని సీనియర్ రాజకీయ నాయకుడు సుబ్రమణియన్ కూడా విమర్శించిన విషయం తెలిసిందే. ఈ రెండు వ్యాక్సిన్లకు అనుమతివ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన పరిశోధకుల్లో తుఫ్ట్ యూనివర్శిటీలో పీహెచ్డీ చేస్తున్న అరుణ్ మోహన్ సుకుమార్ కూడా ఉన్నారు. అత్యవసర వినియోగార్థమే అయినప్పటికీ క్లినికల్ ట్రయల్స్ డేటా లేకుండానే కోవాక్సిన్కు అనుమతివ్వడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనికా కంపెనీ కొలాబరేషన్తో కనిపెట్టిన కొవీషీల్డ్ ఎలా ఆత్మనిర్భర వ్యాక్సిన్ అవుతుందన్నది కూడా ఆయన ప్రశ్న. పైగా అది బ్రిటన్లో, బ్రెజిల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. రోటావ్యాక్ ఆత్మనిర్భర వ్యాక్సిన్...! ఇంతకుముందు భారత్ బయోటెక్ రోటా వైరస్ నిర్మూలన కోసం 2013లో ‘రోటావ్యాక్’ వ్యాక్సిన్ను గనుగొంది. ఆ వ్యాక్సిన్ ప్రయోగాల్లో స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు పాల్గొనగా, ‘బిల్ అండ్ మిలిండా ఫౌండేషన్’ పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేసింది. రొటావ్యాక్ వ్యాక్సిన్ను 2015లో భారత్ బయోటెక్ మార్కెట్లోకి విడుదల చేసింది. అదే ‘ఫస్ట్ మేడిన్ ఇండియా’ వ్యాక్సిన్ అంటూ భారత్ బయోటెక్ కంపెనీతోపాటు ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారని, విదేశీ పరిశోధకులు, విదేశీ సంస్థల కొలాబరేషన్ ఉన్నప్పుడు ‘మేడిన్ ఇండియా’ ఎలా అవుతుందని మోహన్ సుకుమార్ మీడియా ముఖంగా ప్రశ్నించారు. అసలు భారత్లో వ్యాక్సిన్ల తయారీకి అవకాశం ఏర్పడిందే 1987లో అమెరికాతో అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ చేసుకున్న ‘వ్యాక్సిన్ యాక్షన్ ప్రోగ్రామ్’ ఒప్పందం వల్ల. అయితే నాటి ఒప్పందాన్ని రాజీవ్ పార్టీ వారే ఎక్కువగా విమర్శించారు. నెహ్రూ, ఇందిరా గాంధీ మొదలు పెట్టిన ‘స్వయం సమద్ధి’ విధానాన్ని రాజీవ్ మంట గలపారంటూ పాలకపక్ష సీనియర్ నేతలే విరుచుకు పడ్డారు. అప్పడు రాజీవ్ గాంధీ ఆగస్టు 17వ తేదీన భారత బయోటెక్నాలజీలో ఉన్నతాధికారి, తన సలహాదారుడైన ఎస్. రామచంద్రన్ను పిలిపించారు. తమిళనాడుకు చెందిన రామచంద్రన్ బనారస్ హిందూ యూనివర్శిటీలో విద్యాభ్యాసం పూర్తిచేసి అమెరికాలోని ఇలినాయీ యూనివర్శిటీలో బయోకెమిస్ట్రీలో డాక్టరేట్ సాధించారు. అది భారత్ నుంచి అమెరికాకు వలసలు పెరిగన సమయం. దేశం మీద భక్తితో రామచంద్రన్ అమెరికా అవకాశాలను వదులుకొని భారత్ వచ్చారు. భారత్లో వివిధ స్థాయిల్లో పనిచేసిన ఆయన్ని రాజీవ్ గాంధీ 1986లో ‘డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ’ని ఏర్పాటు చేసి దానికి సెక్రటరీని చేశారు. రాజీవ్కు సంబంధిత విభాగంతో సలహాదారుగా ఉంటూ వచ్చారు. తనపై వస్తోన్న విమర్శల గురించి రాజీవ్ గాంధీ ఆయనతో చర్చించగా....... స్వయం సమృద్ధి అంటే.... ‘స్వయం సమృద్ధి అంటే మనకు అవసరమైన ప్రతిదాన్ని మనమే సమకూర్చుకోవడం లేదా తయారు చేసుకోవడం కాదు. ఇక్కడ ప్రజల ఆరోగ్యం ముఖ్యం. పరిస్థితులకు తగినట్లుగా వ్యవహరించడం ముఖ్యం’ అని రామచంద్రన్ ఇచ్చిన సలహాతో రాజకీయాలను పట్టించుకోకుండా ముందుకే వెళ్లారు. ఆత్మనిర్భరత రాజకీయాలకు పనికి రావచ్చుగానీ, ప్రజల ఆరోగ్యానికి, మేథస్సుకు పనికి రాదని ప్రముఖ పరిశోధకులు మోహన్ సుకుమార్ సూచించారు. -
‘క్లినికల్’ తరహాలో కోవాగ్జిన్ టీకా
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసిన తొలి టీకా కోవాగ్జిన్ వినియోగానికి ఇచ్చిన అనుమతులు కేవలం క్లినికల్ ట్రయల్ మోడ్లో వినియోగానికేనని ప్రభుత్వం తెలిపింది. కోవాగ్జిన్, కోవిషీల్డ్కు ఇచ్చిన అనుమతుల్లో తేడాఉందని, కోవాగ్జిన్ను కేవలం క్లినికల్ ట్రయిల్ మోడ్లో మాత్రమే వినియోగిస్తామని కేంద్రమంత్రి హర్షవర్థన్ వివరణ ఇచ్చారు. అంటే కోవాగ్జిన్ ఇచ్చిన వారిని ట్రయిల్స్లో చేసినట్లు నిరంతరం పర్యవేక్షిస్తారు. దీంతోపాటు కోవాగ్జిన్ను ఫేజ్ 3 ట్రయిల్స్లో 12 సంవత్సరాలు నిండినవారికి ఇచ్చేందుకు డీసీజీఐ అనుమతించింది. గత ట్రయిల్స్లో ఈ టీకాను 12 ఏళ్ల పైబడినవారికి ఇచ్చిన సందర్భంలో సురక్షితమనే తేలింది. కోవాగ్జిన్తో పాటు కోవిషీల్డ్కు ఆదివారం అత్యవసర వినియోగానుమతులు లభించాయి. రెండు టీకాలను రెండు డోసుల్లో ఇస్తారని డీసీజీఐ అనుమతి పత్రంలో పేర్కొంది. ఒకపక్క ఫేజ్ 3 ట్రయిల్స్ కొనసాగిస్తూనే అత్యవసర పరిస్థితుల్లో ఈ టీకాలను వాడేందుకు డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో 3 కోట్ల మందికి టీకా అందిస్తారు. రెండు టీకాలు అత్యవసర అనుమతికి తయారుగా ఉన్నా, ఇంకా ఫేజ్ 3 ట్రయిల్స్ను పూర్తి చేసుకోలేదు. -
మా డౌట్లు తొలగించండి
లక్నో: కోవాగ్జిన్పై వస్తున్న సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ చెప్పారు. భారత్ బయోటెక్ అభివృద్ధిచేసిన∙కోవాగ్జిన్ టీకాకు కేంద్రప్రభుత్వ అనుమతి లభించడంపై కాంగ్రెస్ సహా పలువురు ప్రశ్నించడం తెల్సిందే. తానుగానీ, తన పార్టీగానీ శాస్త్రవేత్తలను ఎప్పుడూ ప్రశ్నించమని, కానీ ఏవైనా సందేహాలు తలెత్తినప్పుడు ప్రభుత్వమే వాటికి సరైన సమాధానాలివ్వాలని అఖిలేశ్ అభిప్రాయపడ్డారు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాల అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఆదివారం అనుమతినిచ్చింది. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఫేజ్ 3 ట్రయల్స్ పూర్తి కాకుండా వాడుకకు అనుమతినివ్వడం రిస్క్ అని విమర్శించాయి. వ్యాక్సినేషన్ అనేది లక్షలాది మంది జీవితాలతో కూడిన విషయమన్నారు. పేదలకు వ్యాక్సిన్ అందించే తేదీని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్నేత శశిధరూర్ సైతం వ్యాక్సిన్ అనుమతులను విమర్శించారు. -
భారత్ బయోటెక్, సీరంతో కేంద్రం డీల్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా అంతానికి వరుసగా వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి ఆమోదం లభించడం దేశవ్యాప్తంగా భారీ ఊరటనిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలందరికీ కరోనా టీకాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. కరోనా వైరస్ టీకాలను ఉత్పత్తి చేస్తున్న హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్, పుణేకు చెందిన సీరంతో కేంద్రం త్వరలోనే ఒక ఒప్పందాన్ని చేసుకోనుంది. భారత్ బయోటెక్, సీరం సంస్థలతో వేర్వేరుగా ఒప్పందాలను ఈ వారంలోనే కుదుర్చుకోనున్నామని ఐసీఎంఆర్ తాజాగా ప్రకటించింది. టీకా డోసు ధర ప్రభుత్వానికి రూ.200, ప్రైవేటుగా రూ.1000 చొప్పున డీల్ కుదుర్చుకోనుంది. మరోవైపు ఐసీఎంఆర్ భారత్ బయోటోక్ కోవాగ్జిన్ టీకా సమర్థవంతమైందని ఐసీఎంఆర్ సలహాదారు సునీల్గార్గ్ వెల్లడించారు. భారతదేశంలో ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ను తయారు చేస్తున్న సీరంతో వ్యాక్సిన్ కొనుగోలు ఒప్పందానికి కేంద్రం సిద్ధంగా ఉంది. మూడు కోట్ల ఫ్రంట్లైన్, హెల్త్కేర్ కేర్ వర్కర్లకు ఒక్కో మోతాదుకు 200 రూపాయల చొప్పున 6.6 కోట్ల మోతాదులను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. -
కోవాగ్జిన్ : భారత్ బయోటెక్ క్లారిటీ
సాక్షి హైదరాబాద్: కరోనా వైరస్ నివారణలో తమ టీకా దేశంలో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన నేపథ్యంలో భారత్ బయోటెక్ సంస్థ టీకా సమర్ధత, స్పందించింది. కొవాగ్జిన్పై వస్తున్న అపోహలు, వ్యక్తమవుతున్న అనుమానాలపై సంస్థ క్లారిటీ ఇచ్చింది. తమ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్కు సంబంధించిన డేటాను తాము దాచిపెట్టలేదని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా సోమవారం స్పష్టం చేశారు. ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయనీ మార్చి నాటికి ఈ డేటా అందుబాటులో ఉంటుందన్నారు. తమ సామర్ధ్యాన్ని తక్కువగా అంచనా వేయొద్దని, టీకాల తయారీలో అపార అనుభవం తమ సొంతమని ఆయన వివరించారు. కరోనావైరస్ వ్యాక్సిన్ పరంగా ఫైజర్ కంటే తామేమీ తక్కువ కాదన్నారు. కోవిడ్ -19 వ్యాక్సిన్ ప్రక్రియపై ఐదు వ్యాసాలను ప్రచురించిన ఏకైక సంస్థ భారత్ బయోటెక్ అని డాక్టర్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. దేశంలోతాము ప్రతిదీ క్రమపద్ధతిలో చేస్తామనీ, కానీ ప్రస్తుతవివాదం ఒక శాస్త్రవేత్తగా బాధిస్తోందన్నారు. (12 ఏళ్లు పైబడిన పిల్లలపై క్లినికల్ ట్రయల్స్) హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ..ఐసీఎంఆర్ సహకారంతో అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ కు దేశంలో అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆదివారం ఉదయం అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై విపక్షాలు ఫైర్ అయ్యాయి. ఎటువంటి డేటా ఇవ్వకుండా ఈ టీకాకు ఎలా అనుమతి ఇస్తారని విమర్శించాయి. దీంతో భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు, చైర్మన్ కృష్ణ ఎల్లా మీడియాతో మాట్లాడారు. తమ సంస్థకు అనుభవం లేదని ఆరోపణలు చేయడం సరికాదు అని ఆయన అన్నారు. తమది గ్లోబల్ కంపెనీ అని, ఇప్పటికే అనేక రకాల వ్యాక్సిన్లను తయారు చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు 16 రకాల టీకాలను తయారు చేసినట్లు చెప్పారు. చికున్ గున్యా సహా అనేక వ్యాధులకు తాము వ్యాక్సిన్లు తయారు చేశామన్నారు. అంతేకాదు ఎబోలా వ్యాక్సిన్ అసలు మానవ క్లినికల్ ట్రయల్ పూర్తి చేయలేదనీ, అయినా లైబీరియా, గినియాలో అత్యవసర అధికారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతినిచ్చిందని ఆయన గుర్తు చేశారు. (వ్యాక్సిన్ కోసం యాప్: రిజిస్ట్రేషన్ ఎలా అంటే?) అలాగే తమ కుటుంబంలో ఎవరికీ రాజకీయాలతో సంబంధం లేదనీ, ఈ నేపథ్యంలో కోవాగ్జిన్పై రాజకీయాలు చేయవద్దని కృష్ణ కోరారు. బ్రిటన్తో పాటు 12 దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామనీ, పాకిస్థాన్, నేపల్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లోనూ తమ టీకా ట్రయల్స్ జరిగినట్లు ఆయన వెల్లడించారు. తమది కేవలం ఇండియన్ కంపెనీ మాత్రమే కాదు, నిజమైన గ్లోబల్ కంపెనీ అని భారత్ బయెటెక్ సీఎండీ స్పష్టం చేశారు. -
12 ఏళ్లు పైబడిన పిల్లలపై క్లినికల్ ట్రయల్స్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ నివారణకుగాను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సహకారంతో హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్కు సంబంధించి కేంద్రం మరో కీలక విషయాన్ని ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ ప్రస్తుతం అత్యవసర వినియోగానికి అందుబాటులోకి రానున్న నేపథ్యంలో టీకా మూడో దశ ప్రయోగాలను 12 సంవత్సరాలకు పైన వయసు పిల్లలపై జరిపేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. కోవాక్సిన్ చాలా సురక్షితమైందనీ, బలమైన రోగ నిరోధక శక్తి ప్రతిస్పందనను అందిస్తోందని డీసీజీఐ విజి సోమాని చెప్పారు. (వ్యాక్సిన్ కోసం యాప్: రిజిస్ట్రేషన్ ఎలా అంటే?) అయితే ఇప్పటివరకు పిల్లల్లో తొలి, రెండో దశ ప్రయోగాలను భారత్ బయోటెక్ పూర్తిచేసింది. ఇప్పటివరకు జరిపిన ప్రయోగాల్లో వ్యాక్సిన్ సురక్షితమని తేలడంతో మూడో దశ ప్రయోగాలకు అనుమతి సాధించింది. దీంతో 12 ఏళ్ల వయసువారిపై భారత్ బయోటెక్ ప్రయోగాలను చేపట్టనుంది. అయితే, వ్యాక్సిన్ సమర్థత, సురక్షితమని నిర్ధారించే తొలి, రెండు, మూడో దశ ప్రయోగాల తాజా సమాచారాన్ని అందించాలని డీసీజీఐ కోరింది. వ్యాక్సిన్ తొలి, రెండో దశలో 800 మందిపై ప్రయోగించింది. ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో మూడో దశ ప్రయోగాలను 25,800 మందిపై ప్రారంభించినట్లు డీసీజీఐ వెల్లడించింది. ఇప్పటివరకు దాదాపు 22,500 వేల మందికి ప్రయోగించగా సురక్షితంగా తేలిందని సోమానీ తెలిపారు. కాగా భారత్బయెటక్ టీకా కుసంబంధించి తన ఫేజ్ 1, 2 ట్రయల్స్ను పూర్తి చేసింది. ఇందులో టీకా ఇప్పటికే 12 ఏళ్లు పైబడిన పిల్లలపై సురక్షితంగా ఉందని తేలింది. దీంతో మూడో దశ ప్రయోగాలకు అనుమతినిస్తున్నట్లు డీసీజీఐ తాజాగా వెల్లడించింది -
టీకాకు అటు..ఇటు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరులో నిర్ణయాత్మక ముందడుగు పడింది. కోవిడ్–19పై చేస్తున్న యుద్ధంలో భారతీయులకు సునిశిత ఆయుధం లభించింది. దేశంలో కరోనా టీకా అత్యవసర, నియంత్రిత వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) ఆదివారం ఆమోదం తెలిపింది. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ భాగస్వామ్యంతో హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన స్వదేశీ టీకా ‘కోవాగ్జిన్’, బ్రిటన్కి చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్’లకు షరతులతో డీసీజీఐ అనుమతించింది. ఈ రెండు టీకాలకు అనుమతివ్వాలని జాతీయ ఔషధ ప్రామాణికాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ)కు చెందిన నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా డీసీజీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి తొలి అడుగు పడినట్లయింది. అలాగే, జైడస్ క్యాడిలా అభివృద్ధి చేస్తున్న టీకా ఫేజ్–3 క్లినికల్ ట్రయల్స్కు కూడా డీసీజీఐ అనుమతించింది. ఈ టీకా అభివృద్ధి కోసం జైడస్ క్యాడిలాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కేంద్ర బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి రేణు స్వరూప్ వెల్లడించారు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలకు అనుమతి లభించడాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వాగతించారు. కరోనా వైరస్పై భారత్ చేస్తున్న పోరాటంలో ఇది నిర్ణయాత్మక మేలి మలుపు అని అభివర్ణించారు. ‘భారత్ ఆరోగ్యకర, కోవిడ్ రహిత దేశంగా మారే ప్రయాణం దీంతో మరింత వేగవంతం కానుంది. కంగ్రాచ్యులేషన్స్ ఇండియా. టీకా కోసం అహర్నిశలు కృషిచేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు’అని ప్రధాని ట్వీట్ చేశారు. భారత్లో కరోనా టీకాల అత్యవసర వినియోగానికి అనుమతి లభించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు, ఈ టీకాలను ఆగమేఘాలపై అభివృద్ధి చేసిన నేపథ్యంలో.. వాటి సమర్ధత, భద్రతలపై పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సంపూర్ణ అధ్యయనం తరువాతే అనుమతి.. ఆయా సంస్థలు ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా విశ్లేíషించిన అనంతరం, నిపుణుల సిఫారసుల మేరకు కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలకు అత్యవసర పరిస్థితుల్లో నియంత్రిత వినియోగానికి అనుమతినివ్వాలని నిర్ణయించామని డీసీజీఐ వీజీ సోమానీతెలిపారు. ఈ రెండు టీకాలను రెండు డోసుల్లో ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వీటిని 2 నుంచి 8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయాల్సి ఉంటుందని వివరించారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ 70.42% సామర్థ్యంతో పని చేస్తోందని తెలిపారు. 23,745 మంది వలంటీర్లపై చేసిన ‘కోవిషీల్డ్’ప్రయోగ ఫలితాల సమగ్ర వివరాలను సీరమ్ ఇన్స్టిట్యూట్ తమకు అందించిందన్నారు. కోవాగ్జిన్ను భారత్ బయోటెక్ అత్యంత సురక్షిత వీరోసెల్ ప్లాట్ఫామ్పై అభివృద్ధి చేసిందని తెలిపారు. ఫేజ్ 1, 2 క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయని, ఎలాంటి దుష్ప్రభావాలు కలగలేదని సోమానీ వెల్లడించారు. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్ను దేశవ్యాప్తంగా 22,500 మంది వలంటీర్లపై నిర్వహించారని, ఫలితాలు సానుకూలంగా వచ్చాయన్నారు. కోవాగ్జిన్ ప్రత్యామ్నాయమే! భారత్ బయోటెక్ చేసినకోవాగ్జిన్ను ప్రస్తుతానికి ప్రత్యామ్నాయమేనని ఎయిమ్స్ డైరెక్టర్, జాతీయ టాస్క్ఫోర్స్ బృందం సభ్యుడు డాక్టర్ రణ్దీప్ గులేరియా చెప్పారు. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ తొలిదశలో ఆక్స్ఫర్డ్– ఆస్ట్రాజెనెకా సాయంతో సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ టీకానే వాడుతామన్నారు. ‘వీటికి అనుమతులు లభించడం కొత్త ఏడాది ప్రారంభంలో చోటుచేసుకున్న శుభ పరిణామం. ఈ రెండు టీకాలు చౌకైనవి. భద్రపరచడం, పంపిణీ సులువు. దేశీయంగా తయారైన వీటితో త్వరలోనే వ్యాక్సినేషన్ ప్రారంభించవచ్చు. కోవిషీల్డ్ పనితీరు ఎంతమేర పనిచేస్తుందనేది ఇంకా పూర్తి స్థాయిలో రుజువు కానందున, సైడ్ ఎఫెక్ట్స్ కనిపించిన అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సినేషన్కు కోవాగ్జిన్ను ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు’అని ఆయన అన్నారు. యూకే కరోనా కొత్త వేరియంట్ కేసులు దేశంలో అదుపుతప్పినా, లేదా మూడో దశ హ్యూమన్ ట్రయల్స్ పూర్తయినా.. కోవాగ్జిన్ను పూర్తిస్థాయిలో వాడే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. సీరం సంస్థ 5 కోట్ల డోసులు సిద్ధం చేసినందున, తొలి విడత వ్యాక్సినేషన్లో 3 కోట్ల మందికి కోవిషీల్డ్ వాడుతామన్నారు. సమర్థతపై అనుమానాలు.. కరోనా విజృంభణను అడ్డుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసిన టీకాల సామర్ధ్యం, భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోవిషీల్డ్ సమర్ధత 70.42%గా డీసీజీఐ ప్రకటించింది. కానీ కోవాగ్జిన్ సమర్ధతపై స్పష్టమైన వివరణ రాలేదు. అలాగే, ఫేజ్–3 క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు పూర్తిగా వెలువడకముందే, టీకా సమర్ధతపై, సురక్షితమేనా అన్న విషయంపై పూర్తిస్థాయి సమాచారం అందకముందే కోవాగ్జిన్కు అనుమతినివ్వడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా టీకా వినియోగం ప్రారంభమైన తరువాత దుష్ప్రభావాలు వెల్లడైతే, పరిస్థితి అదుపుతప్పే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు, యూకేలో గుర్తించిన కరోనా కొత్త వైరస్ స్ట్రెయిన్పై ఈ టీకాలు ఎంతవరకు సమర్ధంగా పనిచేస్తాయనే దానికి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తు చేస్తున్నారు. కోవాగ్జిన్ ఫేజ్ –3 క్లినికల్ ట్రయల్స్లో వెల్లడైన సామర్ధ్యం, భద్రతలకు సంబంధించిన డేటా ఇంకా తమ వద్దకు రాలేదని ఆదివారం ఐసీఎంఆర్ కూడా స్పష్టం చేసింది. అయితే, కోవాగ్జిన్ అత్యున్నత సామర్థ్య, భద్రత ప్రమాణాలతో రూపొందుతున్న సంకేతాలున్నాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ వెల్లడించారు. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ నివేదిక మరి కొన్ని వారాల్లో అందనుందన్నారు. కోవాగ్జిన్ ఫేజ్ 1, 2 ట్రయల్స్ ఫలితాలు సామర్ధ్యం, భద్రత పరంగా సానుకూలంగా ఉన్నాయన్నారు. ట్రయల్స్లో కోవాగ్జిన్ సమర్థతను నిరూపించుకుందని భారత్ బయోటెక్ ప్రకటించింది. కోవాగ్జిన్కు అనుమతి ఎలా ఇచ్చారు: కాంగ్రెస్ కోవాగ్జిన్కు డీసీజీఐ అనుమతులు ఇవ్వడంపై కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ టీకా మూడో దశ ప్రయోగాలు ముగియకుండానే అనుమతులివ్వడం ప్రమాదకరమని కాంగ్రెస్ నేతలు శశిథరూర్, ఆనంద్ శర్మ, జైరామ్ రమేశ్ హెచ్చరించారు. అత్యంత కీలక అంశాన్ని రాజకీయం చేయడం అవమానకరమంటూ కేంద్ర ఆరోగ్య మంత్రి ఎదురుదాడికి దిగారు. ఇప్పటివరకు ఏ దేశం కూడా వ్యాక్సిన్ సామర్థ్యం ఎంతో తెలుసుకోకుండా అనుమతులు ఇవ్వలేదని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ అన్నారు. తొలి విడతలో ఫ్రంట్లైన్ వర్కర్లకి టీకాలు ఇస్తున్నారని, వారి ఆరోగ్యానికి ఎవరు భరోసా ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా కోవాగ్జిన్కు అనుమతులివ్వడాన్ని తప్పు పట్టారు. అంతవరకు కోవిషీల్డ్ను వాడుకోవాలని సూచించారు. కోవాగ్జిన్ టీకా అంశంలో నిబంధనలు ఎందుకు మార్చాల్సి వచ్చిందని మరో నేత జైరాం రమేష్ ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా స్వదేశీ టీకాకి అనుమతులివ్వడాన్ని స్వాగతించారు. శాస్త్రవేత్తల కృషిని ఆయన కొనియాడారు. కీలక అంశాల్లో రాజకీయాలా ? కాంగ్రెస్ నేతల ప్రశ్నలకి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ట్విట్టర్ వేదికగా బదులిచ్చారు. ఇలాంటి కీలక అంశాల్ని రాజకీయం చేయడం అత్యంత అవమానకరమని అన్నారు. ‘కళ్లు తెరిచి చూడండి ఇలా మాట్లాడి మీకు మీరే అభాసు పాలవుతున్నార’ని మంత్రి అన్నారు. బీజేపీ ఎదురు దాడి కోవాగ్జిన్ అనుమతులపై కాంగ్రెస్ నేతలు కేంద్రాన్ని నిలదీయడంతో బీజేపీ ఎదురు దాడికి దిగింది. కాంగ్రెస్ ప్రతీది రాజకీయం చేస్తోందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ విమర్శించారు. ఒకప్పుడు సైనికుల త్యాగాలను ప్రశ్నించారని, ఇప్పుడు స్వదేశీ టీకాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంటూ మండిపడ్డారు. భారత్ సాధించిన ఘనతలు ఎప్పటికీ కాంగ్రెస్కి గర్వకారణంగా అనిపించవని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కరోనా వైరస్పై భారత్ చేస్తున్న పోరాటంలో ఇది నిర్ణయాత్మక మేలి మలుపు. ‘భారత్ ఆరోగ్యకర, కోవిడ్ రహిత దేశంగా మారే ప్రయాణం దీంతో మరింత వేగవంతం కానుంది. కంగ్రాచ్యులేషన్స్ ఇండియా. అహర్నిశలు కృషిచేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు. – ప్రధాని మోదీ భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ టీకా యూకేలో గుర్తించిన వేరియంట్ సహా కొత్త కరోనా వైరస్ వేరియంట్లపై సమర్ధవంతంగా పనిచేసే అవకాశాలున్నాయి. – హర్షవర్ధన్ , ఆరోగ్య శాఖ మంత్రి మూడో దశ ప్రయోగాలు ముగియకుండానే వ్యాక్సిన్కు ఎలా అనుమతినిచ్చారు? ప్రొటోకాల్ నిబంధనలు పాటించకుండా, మూడో దశ ప్రయోగాలపై ఫలితాలు తేలకుండా అనుమతులు ఇవ్వడం ప్రమాదకరం. – కాంగ్రెస్ నేతలు శశిథరూర్, ఆనంద్ శర్మ, జైరామ్ రమేశ్ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవిడ్ టీకా కోవాగ్జిన్ ప్రస్తుతానికి ప్రత్యామ్నాయమే. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ తొలిదశలో ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా సాయంతో సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ టీకానే వాడతాం. కోవిషీల్డ్ పనితీరు ఎంతమేర పనిచేస్తుందనేది ఇంకా పూర్తి స్థాయిలో రుజువు కానందున సైడ్ ఎఫెక్ట్స్ కనిపించే అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సినేషన్కు కోవాగ్జిన్ను ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. – డాక్టర్ రణ్దీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్, జాతీయ టాస్క్ఫోర్స్ బృందం సభ్యుడు భద్రత పరంగా ఏ చిన్న సమస్య ఉన్నా అనుమతించేవాళ్లం కాదు. ఈ టీకాలు 110% సురక్షితం. స్వల్ప జ్వరం, ఒళ్లు నొప్పులు, అలర్జీ కనిపించవచ్చు. ఏ వ్యాక్సిన్కైనా అది సాధారణమే. – వి.జి. సోమానీ, డీసీజీఐ భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ టీకా యూకేలో గుర్తించిన వేరియంట్ సహా కొత్త కరోనా వైరస్ వేరియంట్లపై సమర్ధవంతంగా పనిచేసే అవకాశాలున్నాయి. – హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి -
భారత్లో కరోనా వ్యాక్సిన్కు లైన్ క్లియర్
ఢిల్లీ : కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న భారత్కు డీసీజీఐ ఆదివారం శుభవార్త చెప్పింది. కోవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల అత్యవసర అనుమతికి డిసీజీఐ ఆమోదం తెలిపింది. కోవాగ్జిన్ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేయగా.. కోవిషీల్డ్ను ఆక్స్ ఫర్డ్, అస్త్రాజెనకా, సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా కలిసి అభివృద్ధి చేశాయి. (చదవండి: 3 కోట్ల మందికి ఉచిత టీకా) ఈ సందర్భంగా డీసీజీఐ డైరెక్టర్ విజి సోమాని మాట్లాడుతూ.. కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ వ్యాక్సిన్లతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను రెండు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది. నిపుణుల కమిటీ అన్ని అంశాలు పరిశీలించాకే రెండు వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి ఇచ్చిందని తెలిపారు. డిసీజీఐ అనుమతితో మరో వారం రోజుల్లోనే భారత్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. డీజీసీఐ ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ అభివృద్దికి కృషి చేసిన శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు తెలిపారు. -
హైదరాబాద్ టీకాకు ఓకే
న్యూఢిల్లీ: హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సీడీఎస్సీఓ(కేంద్ర ఔషధాల ప్రమాణిక నియంత్రణ సంస్థ) నియమించిన నిపుణుల కమిటీ శనివారం ఆమోదం తెలిపింది. టీకాకు సంబంధించి కంపెనీ సమర్పించిన ట్రయిల్స్ డేటాను పరిశీలించిన అనంతరం కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆక్స్ఫర్డ్ రూపొందించిన కోవిషీల్డ్ టీకా భారత్లో వినియోగానికి ఆమోదముద్ర సంపాదించిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం కోవాగ్జిన్ రెండు దశల ట్రయిల్స్ పూర్తి చేసుకుంది. ఈ రెండిటిలో సత్ఫలితాలు వచ్చినందున టీకా అత్యవసర వినియోగానికి నిపుణులు అంగీకారం తెలిపారు. ఫేజ్3 ట్రయిల్స్ కొనసాగించమని సూచించారు. ఐసీఎంఆర్ సహకారంతో భారత్ బయోటెక్ ఈ టీకాను రూపొందించింది. కోవాగ్జిన్ వినియోగానుమతుల కోసం భారత్ బయోటెక్ గతనెల 7న డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. కోవాగ్జిన్తో పాటు కోవిషీల్డ్ వినియోగంపై డీసీజీఐ అంతిమ ఆమోదం తెలపాల్సిఉంది. మరోవైపు కాడిలా రూపొందిస్తున్న టీకాపై ఫేజ్ 3 ట్రయిల్స్ జరపవచ్చని కూడా నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. తర్వాతేంటి? టీకాల వినియోగానికి డీసీజీఐ పచ్చజండా చూపిన అనంతరం ఆయా కంపెనీలు తమ టీకాను మార్కెట్లో ఆథరైజ్ చేసేందుకు, భారీగా ఉత్పత్తి చేసేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆతర్వాతే మార్కెట్లోకి టీకాను తీసుకురావడానికి వీలవుతుంది. ఒక వ్యాధికి ప్రత్యామ్నాయ చికిత్సలేవీ అందుబాటులో లేవన్నప్పుడు కొన్ని ఔషధాలు లేదా టీకాల అత్యవసర వినియోగం కోసం ఔషధ నియంత్రణా సంస్థలు అనుమతి ఇస్తారు. ప్రస్తుతం కరోనాకు సరైన చికిత్స లేకపోవడం, మరోవైపు కొత్త స్ట్రెయిన్ గుర్తింపు నేపథ్యంలో ఆయా దేశాలు కోవిడ్ టీకాలకు అత్యవసర అనుమతులు ఇస్తున్నాయి. ఇలాంటి అత్యవసర అనుమతులు పొందిన వ్యాక్సిన్ ఇచ్చే ముందు ప్రతి రోగి నుంచి ముందస్తు అనుమతి పత్రం తీసుకుంటారు. అలాగే సదరు టీకా వల్ల తలెత్తే అవకాశమున్న దుష్ప్రభావాల గురించి రోగికి, వారి కుటుంబ సభ్యులకు ముందుగానే వివరిస్తారు. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తికాక ముందే మధ్యంతర ఫలితాల ఆధారంగా అనుమతులు ఇస్తున్నందున ఈ షరతులు విధిస్తారు. అతి త్వరలో ముందుగా నిర్ణయించిన ప్రాధాన్య క్రమంలో టీకాను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఆదివారం రోజు డీసీజీఐ పత్రికా సమావేశం నిర్వహించనుంది. ఇందులో టీకాల అనుమతిపై వెల్లడించే అవకాశం ఉంది. -
దేశంలో మరో వ్యాక్సిన్కు ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: సుమారు గత ఏడాది కాలంగా దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి అంతానికి మార్గం సుగమవుతోంది. కరోనా వాక్సిన్లు త్వరలోనే దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే సీరం ఉత్పత్తి చేస్తున్న ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్ వాక్సిన్కు నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం కోసం వేచి చూస్తోంది. తాజాగా తుది ఆమోదానికి ఒక అడుగు దూరంలో భారతదేశంలో రెండవ టీకాగా భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కోవాక్సిన్ అవతరించింది. (వ్యాక్సిన్: సుబ్రమణియన్ స్వామి కీలక వ్యాఖ్యలు) స్వదేశీ తొలి వ్యాక్సిన్గా భావిస్తున్న కోవాక్సిన్ ఆమోదానికి సంబంధించి శనివారం కీలక అడుగు పడింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన స్వదేశీ కోవిడ్-19 టీకా అత్యవసర ఉపయోగం కోసం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, సబ్జెక్ట్ నిపుణుల ఆమోదం తెలిపింది. ఈ మేరకు కమిటీ డీసీజీఐకి కూడా సిఫారసు చేసింది. కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి కూడా నిపుణుల కమిటీ శుక్రవారం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో భారత్లో అత్యవసర వినియోగానికి రెండు వ్యాక్సిన్లకు అనుమతి కమిటీ లభించినట్టయింది. భారత్ బయోటెక్ గత నెల(డిసెంబర్) 7న మొదట అత్యవసర వినియోగ అధికారం కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే మూడవ దశ క్లినికల్ ట్రయల్స్కు సంబంధించి మరింత డేటా సమర్పించాలని నిపుణుల కమిటీ కోరింది. (కరోనా వ్యాక్సిన్ : కోవిషీల్డ్కు గ్రీన్ సిగ్నల్) కాగా దేశవ్యాప్తంగా కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ పర్యవేక్షణలో డ్రైరన్ చేపట్టిన రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. మరోవైపు కోవిడ్-19కు నాలుగు టీకాలు దాదాపు సిద్ధంగా ఉన్నది భారతదేశం మాత్రమేనని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు. ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్కు యూకే అనుమతి ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. త్వరలోనే దేశంలో అత్యవసర ఉపయోగం కోసం ఒకటి కంటే ఎక్కువ వ్యాక్సిన్లు వచ్చే అవకాశం ఉందని మంత్రి సూచించారు.(తొలి విడతలో 3 కోట్ల మందికి టీకా ఉచితం : కేంద్ర మంత్రి) -
కీలక దశకు కోవాగ్జిన్ ప్రయోగాలు
సాక్షి, హైదరాబాద్: భారత్ బయోటెక్ సిద్ధం చేస్తున్న కోవిడ్–19 నిరోధక టీకా ప్రయోగాలు కీలక దశకు చేరుకున్నాయి. టీకా వినియోగానికి అత్యవసరమైన మూడో దశ మానవ ప్రయోగాల్లో 13 వేల మందికి టీకాలు ఇవ్వడం పూర్తయినట్లు భారత్ బయోటెక్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. గత నెలలో మొత్తం 26,000 మందికి టీకాలిచ్చి పరీక్షించే లక్ష్యంతో మూడో దశ ప్రయోగాలు మొదలైన సంగతి తెలిసిందే. తొలి, రెండో దశ మానవ ప్రయోగాలు ఒక్కొక్క దాంట్లో 1,000 మందికి టీకా అందించి భద్రత, రోగ నిరోధక వ్యవస్థ స్పందనలను నిర్ధారించుకున్నామని, ఈ రెండు దశల ప్రయోగాలపై అందిన సమాచారాన్ని అంతర్జాతీయ స్థాయి జర్నల్స్లో ప్రచురించామని కంపెనీ వెల్లడించింది. భారత్ బయోటెక్, భారతీయ వైద్య పరిశోధన సమాఖ్య, పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలు సంయుక్తంగా కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. పూర్తిగా దేశీయంగానే అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ను భారత్ బయోటెక్కు చెందిన బయోసేఫ్టీ లెవల్–3 కేంద్రాల్లో ఉత్పత్తి చేయనున్నారు. కోవాగ్జిన్ ప్రయోగాల్లో పాల్గొన్న 13 వేల మందికి భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: భారత్ బయోటెక్తో యూఎస్ కంపెనీ జత) -
భారత్ బయోటెక్తో యూఎస్ కంపెనీ జత
ముంబై, సాక్షి: కరోనా వైరస్ కట్టడికి దేశీ కంపెనీ భారత్ బయోటెక్తో తాజాగా యూఎస్ ఫార్మా కంపెనీ ఆక్యుజెన్ చేతులు కలిపింది. తద్వారా భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ తదుపరి అభివృద్ధి దశలను యూఎస్లో ఆక్యుజెన్ చేపట్టనుంది. ఇందుకు కట్టుబడేందుకు వీలుగా రెండు కంపెనీలు ఒప్పందం(ఎల్వోఐ)పై సంతకాలు చేశాయి. ఎల్వోఐలో భాగంగా ఆక్యుజెన్ యూఎస్లో కోవాగ్జిన్ వ్యాక్సిన్ హక్కులను పొందనుంది. భారత్ బయోటెక్ సహకారంతో యూఎస్లో వ్యాక్సిన్కు సంబంధించిన క్లినికల్ డెవలప్మెంట్, రిజిస్ట్రేషన్, వాణిజ్య వ్యవహారాలను ఆక్యుజెన్ చేపట్టనుంది. ప్రస్తుతం రెండు కంపెనీలూ పరస్పరం సహకరించుకునేందుకు నిర్ణయించుకున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేశాయి. పూర్తిస్థాయి ఒప్పంద వివరాలను కొద్ది వారాలలో వెల్లడించనున్నట్లు తెలియజేశాయి. ఒప్పందం ప్రకారం యూఎస్లో వ్యాక్సిన్ సైంటిఫిక్ అడ్వయిజరీ బోర్డ్ను ఆక్యుజెన్ ఏర్పాటు చేయనుంది. తద్వారా అక్కడ క్లినికల్ పరీక్షల డేటా, నియంత్రణ సంస్థల అనుమతులు తదితర వ్యవహారాలను చేపట్టనుంది. (సీరమ్ నుంచి 5 కోట్ల డోసేజీలకు రెడీ) కోవాగ్జిన్ ప్రత్యేకం చరిత్రలో నిరూపితమైన విధానాల బాటలోనే కోవిడ్-19 కట్టడికి భారత్ బయోటెక్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్నట్లు ఒప్పందం సందర్భంగా హార్వే రూబిన్ పేర్కొన్నారు. వెరసి యూఎస్లో అందుబాటులోకి వస్తున్న ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే కోవాగ్జిన్ ప్రత్యేకమైనదని తెలియజేశారు. వైరస్పై మరింత సమర్ధవంతంగా పనిచేయగలదని అభిప్రాయపడ్డారు. పెన్సిల్వేనియా యూనివర్శిటీ పీహెచ్డీ ఎండీ అయిన రూబిన్.. ఆక్యుజెన్ సైంటిఫిక్ సలహాదారుల బోర్డు సభ్యులుకావడం గమనార్హం! దేశీయంగా మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్(ఐసీఎంఆర్) సహకారంతో భారత్ బయోటెక్.. కోవాగ్జిన్ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యవసర ప్రాతిపదికన వ్యాక్సిన్ వినియోగానికి అనుమతించవలసిందిగా ఇటీవలే డీసీజీఐకు భారత్ బయోటెక్ దరఖాస్తు చేసింది. 26,000 మందిపై చేపట్టనున్న మూడో దశ క్లినికల్ పరీక్షల కోసం ఇప్పటికే 13,000 మంది వాలంటీర్లను సమకూర్చుకుంది. (అందరికీ వ్యాక్సిన్లు కష్టతరమే!) మైలురాయి.. దేశీయంగా వ్యాక్సినాలజీలో కోవాగ్జిన్ అభివృద్ధి, క్లినికల్ డేటా ఒక మైలురాయి వంటిదని భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. వైరస్ కట్టడికి రూపొందిస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్పై పలు దేశాల నుంచి సరఫరాలు తదితరాల కోసం ఆసక్తి వ్యక్తమవుతున్నట్లు చెప్పారు. ఆక్యుజెన్తో భాగస్వామ్యం ద్వారా యూఎస్ మార్కెట్లలోనూ వ్యాక్సిన్ను ప్రవేశపెట్టే వీలు చిక్కిందని తెలియజేశారు. ఇది తమకెంతో ప్రోత్సాహాన్నిస్తున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ తొలి రెండు దశల క్లినికల్ పరీక్షలలో ఫలితాలతో తాము సంతృప్తి చెందినట్లు ఆక్యుజెన్ సహవ్యవస్థాపకుడు, చైర్మన్ శంకర్ ముసునూరి చెప్పారు. దేశీయంగా మూడో దశ పరీక్షలు సైతం ప్రోత్సాహకరంగా సాగుతున్నట్లు తెలియజేశారు. సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేకంగా రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్కు భారీ అవకాశాలున్నట్లు అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ప్రయోజనకారిగా నిలిచే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. -
అందరికీ వ్యాక్సిన్లు కష్టతరమే: సుచిత్ర
హైదరాబాద్, సాక్షి: దేశ ప్రజలలో సగం మందికి వ్యాక్సిన్లను అందించాలంటే కష్టమేనంటున్నారు ఒక ఇంటర్వ్యూలో భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా. 140 కోట్ల జనాభాగల దేశంలో సగం మందికి డోసేజీలను సరఫరా చేయాలంటే అత్యంత కష్టసాధ్యమని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ కట్టడికి భారత్ బయోటెక్ దేశీయంగా కోవాగ్జిన్ పేరుతో వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. క్లినికల్ పరీక్షలలో ఉన్న కోవాగ్జిన్ వ్యాక్సిన్లను కంపెనీ ఇప్పటికే 10 మిలియన్లు తయారు చేసినట్లు తెలియజేశారు. వ్యాక్సిన్ను వచ్చే ఏడాది మధ్యలో మార్కెట్లో విడుదల చేసే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. కంపెనీ వార్షిక సామర్థ్యం 30 కోట్ల డోసేజీలుకాగా.. తొలి 10 కోట్ల డోసేజీలను ప్రభుత్వానికి అందించనుంది. వ్యాక్సిన్ అభివృద్ధికి ప్రభుత్వం పాక్షికంగా నిధులు అందించినట్లు సుచిత్ర పేర్కొన్నారు. తొలి దశలో మరో రెండు దేశాలకు సైతం వ్యాక్సిన్లను అందించవలసి ఉన్నట్లు చెప్పారు. అయితే దేశాల పేర్లను వెల్లడించలేదు. (సీరమ్ నుంచి 5 కోట్ల డోసేజీలకు రెడీ) వ్యాక్సిన్ల వినియోగంతో రెండోదశలో భాగంగా ప్రపంచ దేశాలలో విస్తరిస్తున్న కరోనా వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ రూపొందిస్తున్న రెండు డోసేజీల వ్యాక్సిన్ల వినియోగం ద్వారా ప్రయత్నించవచ్చని ఫార్మా వర్గాలు ఈ సందర్భంగా తెలియజేశాయి. బ్రిటిష్, స్వీడిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకాతో భాగస్వామ్యంతో సీరమ్ ఇన్స్టిట్యూట్ దేశీయంగా కోవీషీల్డ్ వ్యాక్సిన్ను రూపొందిస్తున్న విషయం విదితమే. ఇక మరోపక్క వ్యాక్సిన్ అభివృద్ధికి భారత్ బయోటెక్ 6-7 కోట్ల డాలర్లను(సుమారు రూ. 500 కోట్లు) వెచ్చిస్తోంది. ఈ వ్యాక్సిన్ తుది దశ క్లినికల్ పరీక్షలకు 26,000 మంది వొలంటీర్లను ఎంపిక చేసుకుంది. 2021 మే లేదా జూన్లో వ్యాక్సిన్ల వినియోగానికి అనుమతులు లభించగలవని భావిస్తున్నట్లు సుచిత్ర చెప్పారు. ఏడాది.. రెండేళ్లలోగా కనీసం మూడో వంతు ప్రజలకు వ్యాక్సినేషన్ను పూర్తిచేసే వీలున్నట్లు అంచనా వేశారు. -
వ్యాక్సిన్పై వాస్తవాలేంటి?
ఇంకొన్ని రోజుల్లో భారత్లో కోవిడ్ టీకాలు వచ్చేస్తున్నాయి. ఆరోగ్య సిబ్బందితో మొదలుపెట్టి వృద్ధులు.. ఆరోగ్య సమస్యలున్న వారు అన్న క్రమంలో... వరుసగా టీకాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి! మరి గడ్డుకాలమిక తొలగిపోయినట్లేనా? ఇక అంతా మంచేనా? ఊహూ.. కానేకాదు! టీకా తీసుకున్నా మరికొంత కాలం జాగ్రత్తలు కొనసాగాల్సిందే అంటున్నారు నిపుణులు. ఈ అంశంతోపాటు టీకాలకు సంబంధించిన ఇతర సందేహాలకు సమాధానాలివిగో.. వ్యాక్సిన్లలో రకాలేమిటి? హా ఫైజర్, మోడెర్నా సంస్థలు మెసెంజర్ ఆర్ఎన్ఏతో(ప్రొటీన్ తయారీకి పనికొచ్చే డీఎన్ఏ పోగు)టీకాను అభివృద్ధి చేస్తున్నాయి. హా భారత్లోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ టీకాలో వాడే వైరస్లు రోగ నిరోధక కణాలు గుర్తించే యాంటిజెన్లను సిద్ధం చేస్తాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకాలు తయారు చేస్తున్న కోవిషీల్డ్ను చింపాంజీకి చెందిన అడినోవైరస్ను వాహకంగా వాడుతున్నారు. హా భారత్ బయోటెక్ (హైదరాబాద్), గమలేయా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (రష్యా) నిర్వీర్యం చేసిన వైరస్ ఆధారంగా టీకాను తయారు చేస్తున్నాయి. ఈ వైరస్లు వ్యాధిని కలిగించవు కానీ.. రోగ నిరోధక వ్యవస్థ తాలూకూ కణాలు గుర్తించేందుకు ఉపయోగపడతాయి. ఏ వ్యాక్సిన్ సామర్థ్యం ఎంత? కోవిషీల్డ్ వ్యాక్సిన్ కోవిడ్–19 లక్షణాలు కనబరిచే వారిలో 70.4 శాతం సామర్థ్యంతో పనిచేస్తుంది. తీవ్రమైన లక్షణాలతో బాధపడుతున్న వారిలో 100 శాతం పనిచేస్తుందని అంచనా. ఫైజర్ టీకా సామర్థ్యం 95 శాతం కాగా, రష్యా టీకా స్పుత్నిక్–వీ 92 శాతం సామర్థ్యాన్ని కనబరిచింది. టీకాలు ఎవరెవరికి ఇవ్వవచ్చు? పైన పేర్కొన్న టీకాలను 18 లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారికి ఇవ్వవచ్చు. ఇందుకు తగ్గట్టుగా ప్రయోగాలు జరిగాయి. ప్రస్తుతం 12–18 ఏళ్ల వారిపై ఈ టీకాలు ఎలా పనిచేస్తాయన్నది పరీక్షిస్తున్నారు. అందుబాటులో ఉన్నాయా? కోవిషీల్డ్ టీకా అత్యవసర వాడకంపై అనుమతికి సీరమ్ ఇన్స్టిట్యూట్ దరఖాస్తు చేసుకుంది. భారత్ బయోటెక్, స్పుత్నిక్–వీ మూడో దశ ప్రయోగాలను పూర్తి చేయాల్సి ఉంది. ఫైజర్ వ్యాక్సిన్ ప్రైవేట్ రంగంలో అందుబాటులోకి రావచ్చు. 18 ఏళ్ల లోపువయసున్న వారికి ఏ టీకా అందుబాటులో లేదు. వ్యాధి సోకి నయమైన వారికి టీకా అవసరమా? కోవిడ్ బారిన పడి సహజసిద్ధంగా కోలుకున్న వారికి దీర్ఘకాలంలో వ్యాధి నుంచి రక్షణ ఉంటుందా? అన్నది ఇప్పటికీ అస్పష్టం. కాలక్రమంలో శరీరంలో యాంటీబాడీలు బలహీన పడే అవకాశాలు ఎక్కువైనప్పటికీ వ్యాధి నుంచి రక్షణ తగ్గిపోతుందని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. అందుకే కోవిడ్ నుంచి బయటపడిన వారికి ఆఖరులో టీకా ఇవ్వాలని యోచిస్తున్నారు. ఒక్కో డోస్ ఎంత? ఎన్ని డోసులు? కోవిషీల్డ్ టీకా ఒక డోసుకు 0.5 మిల్లీలీటర్ ఉంటుంది. 28 రోజుల వ్యవధిలో 2 డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఫైజర్, మోడెర్నా, స్పుత్నిక్–వీ టీకాలను 21 రోజుల వ్యవధిలో 2 డోసులు ఇస్తారు. రెండు వారాల సమయంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని అంచనా. ఎంఆర్ఎన్ఏ టీకా మాత్రం తొలి డోసు తీసుకున్న 10 రోజుల్లోనే యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు తెలిసింది. రెండు డోసుల స్థానంలో ఒకటే తీసుకున్నా ఓమోస్తరు ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రెండు డోసులతో రక్షణ ఎంత కాలం? ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో నాలుగు నెలల కంటే ఎక్కువ కాలం వ్యాధి నుంచి రక్షణ లభించింది. యాంటీబాడీలు బలహీన పడినా వ్యాధి నుంచి రక్షణ లభిస్తుందని అంచనా. బూస్టర్ టీకా అవసరం రాకపోవచ్చనే అనుకుంటున్నారు. టీకా తీసుకున్న వారిలో నొప్పి, జ్వరం వంటి కొన్ని దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది. టీకా వేసుకున్నాక మామూలుగా తిరిగేయవచ్చా? ఏ వ్యాక్సిన్ అయినా 100 శాతం రక్షణ కల్పించదు. టీకా తీసుకున్న వారు మళ్లీ వ్యాధి బారిన పడకపోవచ్చుగానీ.. ఇతరులకు వైరస్ను అంటించే అవకాశం ఉంటుంది. అందుకే టీకా వేసుకున్న తరువాత కూడా మాస్కు ఉపయోగించడం, భౌతిక దూరాన్ని పాటించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం మరికొంత కాలం కొనసాగించాల్సి ఉంటుంది. – సాక్షి, హైదరాబాద్ -
మా వ్యాక్సిన్ సురక్షితం: భారత్ బయోటెక్
ముంబై, సాక్షి: కోవిడ్-19 కట్టడికి దేశీయంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ తొలి దశలో అత్యుత్తమ ఫలితాలు ఇచ్చినట్లు భారత్ బయోటెక్ తాజాగా వెల్లడించింది. కోవాగ్జిన్ పేరుతో హైదరాబాద్ కంపెనీ రూపొందించిన వ్యాక్సిన్పై ప్రస్తుతం మూడో దశ క్లినికల్ పరీక్షలు జరుగుతున్నాయి. తొలి దశ క్లినికల్ పరీక్షలలో కోవాగ్జిన్ ఎలాంటి ఇతర సమస్యలకూ తావివ్వలేదని కంపెనీ స్పష్టం చేసింది. వెరసి తొలి, రెండు దశల క్లినికల్ పరీక్షల డేటా ఆధారంగా కంపెనీ మార్కెటింగ్ హక్కుల కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే ఇది మధ్యంతర నివేదిక మాత్రమేనని భారత్ బయోటెక్ పేర్కొంది. వ్యాక్సిన్ భద్రత, ప్రభావం వంటి అంశాలపై మరింత విస్తృతంగా నిర్వహించనున్న మూడో దశ పరీక్షల ద్వారా మాత్రమే తగిన డేటా లభించగలదని వివరించింది. (వారాంతానికల్లా మరో వ్యాక్సిన్ రెడీ!) 22,000 మందితో ప్రస్తుతం భారత్ బయోటెక్ 22,000 మందితో మూడో దశ క్లినికల్ పరీక్షలను నిర్వహిస్తోంది. ఇందుకు వీలుగా ఇప్పటికే 8,000 మందిని ఎంపిక చేసుకున్నట్లు కంపెనీ సీఎండీ కృష్ణ ఎల్లా తెలియజేశారు. కంపెనీ నవంబర్ 17న మూడో దశ పరీక్షలను ప్రారంభించింది. కాగా.. ఆగస్ట్లో ఒకేఒక తీవ్ర సమస్య ఎదురైనట్లు భారత్ బయోటెక్ తెలియజేసింది. అయితే ఇది వ్యాక్సిన్ వల్లకాదని తేలినట్లు వివరించింది. 11 ఆసుపత్రులలో 375 మంది వొలంటీర్లపై తొలి దశ ప్రయోగాలు చేపట్టినట్లు తెలియజేసింది. మూడు విభిన్న డోసేజీలను ఇవ్వడం ద్వారా రోగ నిరోధక శక్తి అత్యుత్తమంగా స్పందించినట్లు పేర్కొంది. -
జీనోమ్లో విదేశీ సందడి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్ పరిశీలనకు 64 దేశాలకు చెందిన రాయబారులు, హైకమిషనర్లు బుధవారం జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్తో పాటు బయోలాజికల్–ఈ సంస్థలను సందర్శించారు. కోవిడ్ నిరోధానికి భారత్ నిర్వహిస్తున్న కీలక పరిశోధనలు, అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించేందుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని రెండు ప్రధాన పారిశ్రామిక యూనిట్లను వారు సందర్శించారు. బుధవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాయబారులకు భారత విదేశీ వ్యవహారాల శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు స్వాగతం పలికారు. విదేశీ ప్రతినిధులు రెండు బృందాలుగా విడిపోయి జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ సంస్థతో పాటు బయోలాజికల్–ఈ సంస్థను సందర్శించారు. భారత్ బయోటెక్ సీఎండీ ఎల్లా కృష్ణ, జేఎండీ సుచిత్రా ఎల్లాలు కోవాగ్జిన్ తయారీ ప్రక్రియను వారికి వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులు వారితో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పారిశ్రామికాభివృద్ధి, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న సానుకూలతల గురించి సీఎస్ సోమేశ్ కుమార్ వివరించారు. విదేశీ ప్రతినిధులు తమ పర్యటనను ముగించుకుని సాయంత్రం వెళ్లిపోయారు. నవంబర్ నుంచే మూడో దశ ట్రయల్స్ భారత్ బయోటెక్ సంస్థను సందర్శించిన విదేశీ రాయబారులు, హైకమిషనర్లకు వ్యాక్సిన్ ఉత్పత్తి గురించి ఆ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్లా వివరించారు. ఇప్పటికే రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని నవంబర్ నుంచి మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించామని చెప్పారు. దాదాపు 26 వేల మంది వలంటీర్లు ఇందులో పాల్గొంటున్నారని తెలిపారు. ఇప్పటివరకు 30 కోట్ల డోసుల టీకాలు తయారు చేసిన వేరోసెల్ విభాగంలో పరిశోధనాత్మక ఉత్పత్తి చేపట్టామని వెల్లడించారు. తక్కువ సమయంలో అద్భుత పురోగతి ఏర్పాటైన అతి తక్కువ సమయంలోనే తెలంగాణ అద్భుత పురోగతి సాధించిందని విదేశీ రాయబారులతో సోమేశ్కుమార్ పేర్కొన్నారు. గత ఆరేళ్లుగా దేశంలో సులభతర వ్యాపారం (ఈవోడీబీ) చేయడంలో రాష్ట్రం ముందుందని చెప్పారు. విమాన, రోడ్డు రవాణా సదుపాయాలతో రాష్ట్రం అనుసంధానమై ఉందని, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల అంతర్జాతీయ అగ్రశేణి సంస్థలైన గూగుల్, యాపిల్, ఫేస్బుక్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు తమ యూనిట్లను హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఫార్మా రంగ ఉత్పాదక విలువ దాదాపు 50 బిలియన్ డాలర్లుగా ఉందని చెప్పారు. దేశంలోనే 33 శాతం టీకా ఉత్పత్తి హైదరాబాద్లో జరుగుతోందని, ప్రపంచంలోనే హైదరాబాద్ వ్యాక్సిన్ కేంద్రంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. పరిశ్రమలకు త్వరితగతిన అనుమతుల కోసం రాష్ట్రంలో కొత్తగా టీఎస్ఐపాస్ విధానాన్ని రూపొందించామని వివరించారు. రాష్ట్ర పెట్టుబడి సామర్థ్యాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జయేశ్రంజన్ విదేశీ ప్రముఖులకు వివరించారు. హైదరాబాద్లో ఫార్మాసిటీ కొన్ని నెలల్లోనే ప్రారంభమవుతుందని, ఓఆర్ఆర్ సమీపంలో 500 ఎకరాల్లో వైద్య పరికరాల పార్కు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి వినయ్కుమార్, సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి, బయోలాజికల్–ఈ సంస్థ ఎండీ మహిమ దాట్ల, భారత్ బయోటెక్ ఈడీ సాయిప్రసాద్ పాల్గొన్నారు. హైదరాబాద్ బిర్యానీ ఇష్టంగా తిన్నారు.. రాష్ట్ర పర్యటనకు వచ్చిన విదేశీ దౌత్యవేత్తలు హైదరాబాదీ బిర్యానీని ఇష్టంగా తిన్నారు. శామీర్పేట మండలం తుర్కపల్లిలోని భారత్ బయోటెక్ సంస్థ ప్రాంగణంలోనే వీరికి భోజన ఏర్పాట్లు చేశారు. షెర్టాన్ ఫైవ్స్టార్ హోటల్ నుంచి ఆయా ఖండాలు, దేశాల అభిరుచులకు అనుగుణంగా ఆహార పదార్థాలను ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయించింది. -
హైదరాబాద్కు 64 దేశాల రాయబారుల బృందం
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడికి కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించేందుకు 64 దేశాల రాయబారులు బృందం హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఈ బృందంలో పలు దేశాల హైకమిషనర్లు కూడా ఉన్నారు. వీరు ఎయిర్పోర్టు నుంచి శామీర్పేటలోని జీనోమ్ వ్యాలీకి మరికాసేపట్లో చేరుకోనున్నారు. ఈ హైకమిషనర్, రాయబారుల బృందం రెండు గ్రూపులుగా విడిపోయి కోవిడ్ 19 వ్యాక్సిన్పై పనిచేస్తున్న భారత్ బయోటెక్ లిమిటెడ్, ఈ బయోలాజికల్స్ లిమిటెడ్ సంస్థలను సందర్శించి వ్యాక్సిన్పై చర్చించన్నారు. ఈ నేపథ్యంలో టీకాల పురోగతిని పరిశీలించి అనంతరం ఈ విదేశీ బృందం శాస్త్రవేత్తలతో భేటీ కానుంది. ఇక సమావేశం ముగిసిన తర్వాత సాయంత్ర 5:50 గంటలకు అంబాసిడర్, హైకమిషనర్లు తిరిగి ఢిల్లీకి బయల్దేరనున్నారు. విదేశి పత్రినిధుల పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్టు వద్ద భద్రత ఏర్పాట్లు చేసింది. భారత్ బయోటెక్ అభివృద్ది చేస్తున్న కొవాగ్జిన్ టీకా ప్రస్తుతం మూడోదశ ట్రయల్స్లో ఉన్న విషయం తెలిసిందే. బయోలాజికల్ ఈ-సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఫేజ్-1, ఫేజ్-2 క్లినికల్ ట్రయల్స్కు కేంద్ర గత నెలలలో అనుమతిచ్చింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హైదరాబాద్కు వచ్చి భారత్ బయోటెక్ను సందర్శించిన విషయం తెలిసిందే. -
కోవిడ్ వ్యాక్సిన్పై చర్చించనున్న విదేశీ రాయబారులు
-
వ్యాక్సిన్ తీసుకున్నా.. మంత్రికి పాజిటివ్
చండీగఢ్: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ బయోటెక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ను ఒక వలంటీర్గా తీసుకున్న హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్కు పాజిటివ్గా నిర్ధారణ అయింది. నవంబర్ 20న ప్రయోగాత్మకంగా టీకా తొలి డోసు తీసుకున్న ఆయనకు రెండు వారాలు తిరిగిందో లేదో వైరస్ సోకినట్టు తేలింది. 67 ఏళ్ల వయసున్న విజ్ తనకు కరోనా సోకిన విషయాన్ని శనివారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అంబాలా కాంట్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోండి’’ అని విజ్ ట్వీట్ చేశారు. కొద్ది రోజుల క్రితం పానిపట్ వెళ్లిన విజ్ అక్కడ బీజేపీ నాయకుడిని కలుసుకున్నారు. అతనికి తర్వాత కరోనా వచ్చిందని తేలింది. దీంతో ఎందుకైనా మంచిదని విజ్ తొలుత పరీక్షలు చేయించుకుంటే నెగెటివ్ వచ్చింది. ఆ మర్నాడు కాస్త లక్షణాలు కనిపించడంతో మళ్లీ పరీక్ష చేయించుకుంటే పాజిటివ్గా నిర్ధారణ అయింది. వ్యాక్సిన్ తీసుకున్న 42 రోజులయ్యాకే యాంటీ బాడీలు విజ్కు కరోనా సోకిందన్న విషయం తెలియగానే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిపై వివరణ ఇచ్చింది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ పనితీరుపై ఎలాంటి సందేహాలు పెట్టుకోనక్కర్లేదని స్పష్టం చేసింది. కోవాగ్జిన్ రెండు డోసులు తీసుకోవాలని, మంత్రికి ఇంకా ఒక్క డోసు మాత్రమే ఇచ్చినట్టుగా తెలిపింది. కోవాగ్జిన్ రెండో డోసు తీసుకున్న 14 రోజుల తర్వాతే వైరస్ నుంచి తట్టుకునే యాంటీబాడీలు శరీరంలో వృద్ధి చెందుతాయి. మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు ఇస్తారు. అది తీసుకున్న 14 రోజుల తర్వాత యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని అంటే మొత్తంగా వ్యాక్సిన్ పని చేయడానికి 42 రోజులు పడుతుంది. ఈ మధ్యలో కోవిడ్ నుంచి వ్యాక్సిన్ ద్వారా రక్షణ ఉండదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదే విషయాన్ని మంత్రి విజ్ కూడా చెప్పారు. తన ఆరోగ్యం బాగానే ఉందని కాస్త జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్నాయని తెలిపారు. -
వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా బారిన పడ్డ మంత్రి!
చండీగఢ్: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్-19 టీకా 'కోవాక్సీన్' ను హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ నవంబర్ 20న తీసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్లో భాగంగా అనిల్ టీకాను తీసుకున్నారు. అయినప్పటికీ ఆయన తాజాగా కరోనా బారిన పడటం వ్యాక్సిన్ విశ్వసనీయతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం అంబాలా కాంట్ లోని సివిల్ ఆసుపత్రిలో చేరినట్లు అనిల్ విజ్ తెలియజేశారు. తనతో సన్నిహితంగా ఉన్నవారు కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని విజ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. నవంబర్ 20న ఇదే ఆసుపత్రిలో విజ్కు కోవిడ్-19 టీకా ‘‘కోవాక్సిన్’’ ఇచ్చారు. (చదవండి: దేశంలో కొత్తగా 36,652 కరోనా కేసులు) మూడోదశ మొదటి వాలంటీర్గా విజ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సహకారంతో భారత్ బయోటెక్.. కోవ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తోంది. అయితే మొదటి, రెండో దశ ట్రయల్స్లో ఈ వ్యాక్సిన్ ద్వారా ఉత్తమ ఫలితాలు రావడంతో.. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) అనుమతితో ఈ నెల 16 నుంచి కోవ్యాక్సిన్ మూడోదశ ప్రయోగాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. మూడోదశ ట్రయల్స్లో మొదటి వాలంటీర్గా విజ్ ముందుకొచ్చారు. -
అత్యంత వేగంగా టీకా పరిశోధనలు...
అహ్మదాబాద్, హైదరాబాద్, పుణే: కరోనా మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్న వేళ టీకా పురోగతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా సమీక్షించారు. శనివారం వరసగా మూడు నగరాల్లో టీకా తయారీ కేంద్రాలను సందర్శించారు. అహ్మదాబాద్లోని జైడస్ బయోటెక్ పార్క్, హైదరాబాద్లోని భారత్ బయోటెక్, పుణే లోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలకు వెళ్లా రు. అక్కడ శాస్త్రవేత్తలను కలుసుకొని మాట్లాడారు. వ్యాక్సిన్ ప్రయోగాలు, డోసుల ఉత్పత్తి, టీకా పంపిణీలో సవాళ్లను అధిగమించేలా జరుగుతున్న ఏర్పాట్లపై నేరుగా సమాచారాన్ని తెలుసుకోవడం కోసమే ప్రధాని మోదీ ఈ పర్యటన చేపట్టారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత్ దేశీయంగా రూపొందిస్తున్న జైకోవ్–డీ, కొవాగ్జిన్ టీకాలపై పరిశోధనలు అత్యంత వేగంగా సాగుతూ ఉండడం దేశానికే గర్వ కారణమని ప్రధాని పేర్కొన్నారు. వ్యాక్సిన్ ప్రజలందరికీ చేరేలా మెరుగ్గా పంపిణీ చేయడానికి పలు సూచనల్ని కూడా శాస్త్రవేత్తలను అడిగి ప్రధాని తెలుసుకున్నారు. ప్రధాని రాకతో శాస్త్రవేత్తల్లో ఉత్సాహం జైడస్ బయోటెక్ పార్కుకి ప్రధాని రాక అక్కడ శాస్త్రవేత్తల్లో నైతిక స్థైర్యాన్ని పెంచింది. కోవిడ్ వ్యాక్సిన్ను ప్రజలకి అందుబాటులోకి తేవాలన్న తమ లక్ష్యానికి ప్రధాని రాక ఎంతో స్ఫూర్తినిచ్చిందని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం జైకోవ్–డీ రెండో దశ ప్రయోగాల్లో ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రయోగాలు పూర్తి చేసి ఏడాదికి 10 కోట్ల డోసుల్ని ఉత్పత్తి చేస్తామని జైడస్ క్యాడిలా చైర్మన్ పంకజ్ పటేల్ ఇప్పటికే ప్రకటించారు. సీరమ్ ఇన్స్టిట్యూట్లో అందరిలోనూ ఆశలు పెంచుతున్న ఆస్ట్రాజెనికా–ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిపి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కొవిషీల్డ్ ప్రయోగాలు చేస్తోంది. ఈ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అత్యవసర లైసెన్స్ మంజూరు కోసం అవసరమయ్యే ప్రక్రియ కొనసాగుతోందని ఆ సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా వెల్లడించారు. హైదరాబాద్ సందర్శన పూర్తయ్యాక మధ్యాహ్నం 3.20కి మోదీ పుణేకి బయల్దేరారు. సాయంత్రం గం.4.30కి పుణే విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ్నుంచి 17 కి.మీ. దూరంలో సీరమ్ ఇన్స్టిట్యూట్కి హెలికాప్తర్లో వెళ్లారు. ఈ సంస్థ తయారు చేస్తున్న కొవిషీల్డ్ ప్రయోగాలను సమీక్షించారు. వ్యాక్సిన్ అభివృద్ధి, నిల్వ చేయడం వంటి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. సీరమ్ చైర్మన్ డాక్టర్ సైరస్ పూనావాలా, ఆయన కుమారుడు సంస్థ సీఈఓ అదార్ పూనావాలాలు ప్రధానికి వ్యాక్సిన్ పురోగతికి సంబంధించిన వివరాలు తెలిపారు. అక్కడ శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బందితో కూడా ప్రధాని మాట్లాడారు. ‘‘సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో శాస్త్రవేత్తలతో చర్చలు బాగా జరిగాయి. వ్యాక్సిన్ పురోగతి, రాబోయే రోజుల్లో జరిగే పనుల గురించి వారు వివరించారు. టీకా తయారీ కేంద్రాన్ని కూడా పరిశీలించాను’’అని మోదీ ట్వీట్ చేశారు. సాయంత్రం 6 గంటల వరకు సీరమ్లోనే గడిపిన మోదీ 6.30కి ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. పీపీఈ కిట్లో ప్రధాని గుజరాత్లోని అహ్మదాబాద్కి 20 కి.మీ. దూరంలో ఉన్న జైడస్ క్యాడిలా రీసెర్చ్ సెంటర్కు ప్రధాని పీపీఈ కిట్లో వెళ్లారు. శాస్త్రవేత్తలతో గంట సేపు సమావేశమయ్యారు. ‘‘జైడస్ బయోటెక్ పార్క్ని సందర్శించాను. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ప్రయోగాల గురించి మరింత లోతైన సమాచారం కోసం స్వయంగా వెళ్లాను. అక్కడ శాస్త్రవేత్తల సమష్టి కృషి అభినందనీయం. కేంద్ర ప్రభుత్వం వారికి అన్ని విధాలా సహకరిస్తుంది’’అని మోదీ అహ్మదాబాద్ పర్యటన అనంతరం ట్వీట్ చేశారు. అక్కడ్నుంచి 11.40 గంటలకి హైదరాబాద్కి బయల్దేరారు. హకీమ్పేట వైమానిక స్థావరానికి చెందిన విమానాశ్రయంలో మధ్యాహ్నం ఒంటిగంటకు దిగిన ప్రధాని అక్కడ్నుంచి జినోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ సంస్థను సందర్శించారు. భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా రూపొందిస్తున్న కొవాగ్జిన్ టీకా పురోగతిపై సమీక్ష జరిపారు. వేసవి నాటికి పది వ్యాక్సిన్లు! జెనీవా: వచ్చే ఏడాది వేసవి ముగిసేవరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 కరోనా వ్యాక్సిన్లు రెడీగా ఉంటాయని ఐఎఫ్పీఎంఏ డైరెక్టర్ జనరల్ ధామస్ క్యూని అంచనా వేశారు. అయితే టీకాల ఆవిష్కర్తలకు పేటెంట్ రక్షణ దొరకాలన్నారు. ప్రస్తుతానికి ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనికా టీకాలు క్లినికల్ట్రయిల్స్లో మంచి ఫలితాలు చూపుతున్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్, నోవాక్స్, సనోఫి, జీఎస్కే, మెర్క్ లాంటి కంపెనీల టీకాలు సైతం క్రమంగా రేసులోకి వస్తాయని అంతర్జాతీయ ఫార్మా ఉత్పత్తిదారులు, సమాఖ్యల ఫెడరేషన్ అధినేత అంచనా వేశారు. పలు ఫార్మా, బయోటెక్ కంపెనీలు కరోనా టీకా అభివృద్ధి, తయారీపై చాలా మొత్తాలు వెచ్చించాయని తామస్ చెప్పారు. అందువల్ల కంపల్సరీ లైసెన్సింగ్ కోసం పేటెంట్ రక్షణ ఎత్తివేస్తే తప్పిదం చేసినట్లేనన్నారు. పేటెంట్ భద్రత లేకపోతే సరైన నిపుణత లేకుండా టీకాలు తయారు చేసే ప్రమాదం ఉందన్నారు. వ్యాక్సిన్లకు కంపల్సరీ లైసెన్సింగ్ తీసుకురావాలని డబ్లు్యటీవోలో భారత్, దక్షిణాఫ్రికా ఇటీవల ప్రతిపాదించాయి. కానీ ఈ ప్రతిపాదనను యూఎస్ సహా ధనిక దేశాలు తిరస్కరించాయి. బ్రిటన్లో టీకా పంపిణీకి మంత్రి లండన్: కరోనా టీకా పంపిణీ పర్యవేక్షణకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఒక మంత్రిని ప్రత్యేకంగా నియమించారు. ప్రస్తుతం వ్యాపార, పారిశ్రామిక, శక్తివనరుల మంత్రిగా ఉన్న నదీమ్ జహవిని ఆరోగ్యమంత్రిగా నియమించారు. దీంతో పాటు ఆయనకు కోవిడ్ వ్యాక్సిన్ బాధ్యతలను అప్పగించారు. వచ్చే వేసవి వరకు నదీమ్ ఈ పదవిలో ఉంటారని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. పది రోజుల్లో టీకా అందుబాటులోకి వస్తుందన్న వార్తల నేపథ్యంలో జాన్సన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. టీకా పంపిణీ పెద్ద బాధ్యతని అధికారులు హెచ్చరిస్తుండడంతో ఇందుకోసం ఏకంగా మంత్రినే నియమించారు. ముందుగా ఎన్హెచ్ఎస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. డిసెంబర్లో ఫైజర్ టీకా అందుబాటులోకి రానుంది. ఈ టీకాను అల్ప ఉష్ణోగ్రతల వద్ద దాచిఉంచాలి. అలాగే సరిపడా డోసులు అందుబాటులోకి తేవాల్సిఉంటుంది. ఇవన్నీ సక్రమంగా జరిగితేనే టీకా పంపిణీ విజయవంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. నదీమ్ నియామకానికి రాణి ఆమోదం తెలిపారు. అమెరికాలో బరిలోకి వైమానిక సేవలు వాషింగ్టన్: ఫైజర్ రూపొందిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ను దేశమంతా పంచేందుకు అమెరికా ఎయిర్లైన్స్ శుక్రవారం చార్టర్ విమానాలను రంగంలోకి దించింది. యూఎస్ఎఫ్డీఏ అనుమతి లభించిన తక్షణం టీకాను సరఫరా చేసేందుకు వీలుగా అమెరికా ఎయిర్లైన్స్ ఏర్పాట్లు చేస్తోంది. అనుమతులు లభిస్తే డిసెంబర్ రెండో వారం అనంతరం మాస్ ఇనాక్యులేషన్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. టీకాను సురక్షితంగా ఉంచేందుకు డ్రైఐస్ కావాల్సి ఉంటుంది. కానీ దీన్ని విమానాల్లో అనుమతించరు. టీకా కోసం నిబంధనల సవరణకు అనుమతుల కోసం ఎయిర్లైన్స్ చేసుకున్న దరఖాస్తును వైమానిక అ«థార్టీ ఎఫ్ఏఏ ఆమోదించింది. ఫైజర్ వ్యాక్సిన్ను –70 డిగ్రీల వద్ద స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఫైజర్ డ్రైఐస్ కూర్చిన సూట్కేసుసైజు బాక్సులను సిద్ధం చేసింది. అలాగే, కంపెనీ అసెంబ్లీ కేంద్రాలవద్ద రిఫ్రిజిరేటెడ్ స్టోరేజ్ సైట్లను ఏర్పాటు చేస్తోందని వాల్స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. బ్రసెల్స్ నుంచి చికాగోకు టీకా రవాణా చేసేందుకు యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానాలను సిద్ధం చేసింది. అనుమతులు వచ్చిన తొలివారంలో 64 లక్షల డోసుల టీకాను పంపిణీ చేయాలని యూఎస్ఏ భావిస్తోంది. డిసెంబర్ 10న టీకాకు అనుమతులివ్వడంపై చర్చించేందుకు యూఎస్ఎఫ్డీఏ సమావేశం కానుంది. టీకా అత్యవసర వాడకానికి త్వరలో దరఖాస్తు ఎస్ఐఐ సీఈఓ ఆదార్ పూనావాలా వెల్లడి న్యూఢిల్లీ: కరోనా వైరస్ నియంత్రణకు ఆస్ట్రాజెనెకా–ఆక్స్ఫర్డ్ వర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ను ఇండియాలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) నిర్వహిస్తోంది. ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికిగాను రానున్న రెండు వారాల్లో డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేయనున్నట్లు ఎస్ఐఐ సీఈఓ ఆదార్ పూనావాలా శనివారం చెప్పారు. ఎమర్జెన్సీ యూజ్ లైసెన్స్ వచ్చిన తర్వాతే వ్యాక్సిన్ పంపిణీ సాధ్యమవుతుందన్నారు. ఇందుకోసం అవసరమైన డేటాను త్వరలో ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఆస్ట్రాజెనెకా–ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ను తొలుత భారత్లో, అనంతరం ఆఫ్రికా దేశాల్లో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ సీరం సంస్థను సందర్శించడం తమకు గొప్ప రోజు అని పేర్కొన్నారు. కొత్త కేసులు 41,000 న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 41,322 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 93,51,109కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 485 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,36,200కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య శనివారానికి 87,59,969కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 93.68 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,54,940గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 4.87% ఉన్నాయి. మరణాల శాతం 1.46గా ఉంది. ఈ నెల 27 వరకూ 13.82 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శుక్రవారం 11,57,605 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మరణిస్తున్న వారిలో 70% మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది. టీకా పంపిణీకి ఆరోగ్య విభాగం సన్నద్ధం కోవిడ్–19 టీకా పంపిణీ, నిర్వహణపై కేంద్ర ఆరోగ్య శాఖతో భాగస్వామ్యం కలిగిన నిపుణుల కమిటీ చురుగ్గా ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కె.విజయ్ రాఘవన్ తెలిపారు. జాతీయ స్థాయి ఎన్నికల నిర్వహణ, సార్వత్రిక టీకా పథకం అమలు అనుభవాన్ని ఉపయోగించుకుంటూ ఆరోగ్య సేవల విషయంలో రాజీ పడకుండా టీకాను పంపిణీ చేస్తామన్నారు. -
టీకా పురోగతి భేష్
సాక్షి, హైదరాబాద్, మేడ్చల్: దేశంలో కరోనా టీకా అభివృద్ధి కోసం మూడు ఫార్మా దిగ్గజ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలను ప్రత్యక్షంగా తెలుసుకొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అహ్మదాబాద్, హైదరాబాద్, పుణేలలో సుడిగాలి పర్యటన చేపట్టారు. తొలుత గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న జైడస్ కాడిలా కంపెనీని సందర్శించిన మోదీ అక్కడ నుంచి భాగ్యనగరానికి విచ్చేశారు. భారత వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలసి దేశీయంగా టీకా క్యాండిడేట్ను అభివృద్ధి చేస్తున్న హైదరాబాద్ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ను మోదీ సందర్శించారు. తెల్ల రంగు పీపీఈ కిట్ ధరించి లేబొరేటరీలోకి ప్రవేశించిన మోదీ అక్కడ జరుగుతున్న ప్రయోగాలను తిలకించారు. సుమారు గంటపాటు అక్కడే గడిపారు. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లాతోపాటు శాస్త్రవేత్తలు, కంపెనీ ఉన్నతాధికారులతో మాట్లాడారు. టీకా అభివృద్ధిలో ఇప్పటివరకు సాధించిన పురోగతి గురించి కంపెనీ శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. సాదర స్వాగతం... గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి (జైడస్ క్లాడిలా ఫార్మా కంపెనీ సందర్శన అనంతరం) హకీంపేట్లోని ఎయిర్ఫోర్స్ స్టేషన్కు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక విమానంలో చేరుకున్న ప్రధానికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతి, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్, హకీంపేట ఎయిర్ ఆఫీస్ కమాండెంట్ సాదర స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా 18 కి.మీ. ప్రయాణించి శామీర్పేట మండలం తుర్కపల్లిలోని జినోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ కంపెనీని మోదీ సందర్శించారు. తయారీ ఈ స్థాయికి చేరినందుకు గర్విస్తున్నా... దేశంలో టీకా తయారీ ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయికి చేరినందుకు గర్విస్తున్నట్లు తెలిపారు. టీకా అభివృద్ధి కార్యక్రమంలో దేశం శాస్త్రీయ సిద్ధాంతాలపై ఆధారపడిందని, టీకా పంపిణీ సమర్థంగా జరిగేందుకు సలహా, సూచనలు ఇవ్వాలని కోరారు. ఆరోగ్యంతోపాటు లోక కల్యాణానికి టీకా కీలకమని భారత్ భావిస్తోందని వ్యాఖ్యానించారు. కరోనాపై పోరులో ఇరుగుపొరుగుతోపాటు ఇతర దేశాలకు సాయం అందించడం మన ధర్మమన్నారు. దేశంలో డ్రగ్ రెగ్యులేటరీ పద్ధతులను మరింత మెరుగుపరిచేందుకు శాస్త్రవేత్తలు స్వేచ్ఛగా, నిష్కర్షగా అభిప్రాయాలు తెలపాలని సూచించారు. ఈ సందర్భంగా కరోనాను ఎదుర్కొనే విషయంలో ఎలా కొత్త మందులు తయారు చేస్తున్నదీ... పాత మందులను కరోనా కట్టడి కోసం ఎలా మారుస్తున్నదీ శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు. అనంతరం కంపెనీ నుంచి బయటకు వచ్చిన మోదీ సమీపంలో ఉన్న ప్రజలకు అభివాదం చేశారు. ప్రధాని మధ్యాహ్నం 3:20 గంటల ప్రాంతంలో పుణే బయలుదేరారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకాలు సిద్ధం చేస్తున్న కోవిషీల్డ్ టీకాను పుణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అతిపెద్ద ప్రయోగం: భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాపై ప్రస్తుతం జరుగుతున్న మూడో దశ మానవ ప్రయోగాలు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జరుగుతున్న అతిపెద్ద కోవిడ్ టీకా ప్రయోగమని భారత్ బయోటెక్ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా సుమారు 25 కేంద్రాల్లో 26,000 మంది వలంటీర్లకు టీకా ఇస్తున్నామని, జినోమ్ వ్యాలీలోని బీఎస్ఎల్–3 స్థాయి కేంద్రంలో వ్యాక్సిన్ తయారవుతోందని కంపెనీ తెలిపింది. ప్రధాని మోదీ తమ ఫ్యాక్టరీని సందర్శించడంపై భారత్ బయోటెక్ హర్షం వ్యక్తం చేసింది. టీకా తయారీలో నిమగ్నమైన శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బందికి ప్రధాని పర్యటన స్ఫూర్తినిస్తుందని, ప్రజారోగ్య సమస్యల పరిష్కారంలో తమ నిబద్ధతను మరింత పెంచుతుందని భారత్ బయోటెక్ ఒక ప్రకటనలో తెలిపింది. టీకా అభివృద్ధి విషయంలో తమకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన కేంద్ర ప్రభుత్వానికి, నియంత్రణ సంస్థలకు, వైద్య సిబ్బంది, ఆసుపత్రులు, టీకా ప్రయోగాల్లో పాలుపంచుకుంటున్న వలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపింది. -
భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ బయోటెక్ పర్యటన ముగిసింది. మూడు నగరాల పర్యటనలో భాగంగా శనివారం హైదరాబాద్కు వచ్చని ఆయన నేరుగా భారత్ బయెటెక్కి వెళ్లారు. కరోనా వ్యాక్సిన్ పురోగతిపై శాస్త్రవేత్తలతో ప్రధాని సమీక్షించారు. వాక్సిన్ తయారీ కోసం అహర్నిహలు శ్రమిస్తున్న శాస్త్రవేత్తలతో మోదీ సమీక్షించారు. వ్యాక్సిన్ తయారీపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్న భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ మోదీ ట్వీట్ చేశారు. ఈ సంస్థ కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసేందుకు ఐసీఎంఆర్తో కలిసి పని చేస్తోందన్నారు. కోవిడ్-19 నిరోధానికి స్వదేశీ వ్యాక్సిన్ తయారీలో సాధించిన పురోగతిని శాస్త్రవేత్తలు తనకు వివరించారని తెలిపారు. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన మోదీ.. నేరుగా గుజరాత్లోని అహ్మదాబాద్ చేరుకున్నారు. అక్కడి జైడస్ బయోటెక్ పార్క్ సందర్శించారు. ఈ కార్యక్రమం అనంతరం అహ్మదాబాద్ నుంచి నేరుగా హైదరాబాద్ పయనమయ్యారు. హైదరాబాద్ పర్యటన అనంతరం పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్కు చేరుకుంటారు. (ప్రధాని మోదీ రాక; కేసీఆర్ అవసరం లేదు) -
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన; ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 29న హైదరాబాద్ నగరానికి రానున్నారు. భారత్ బయోటెక్ సంస్థ కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు. భారత్ బయోటెక్లో తయారవుతున్న తొలి భారతీయ కరోనా వ్యాక్సిన్ పురోగతిని ఆయన పరిశీలిస్తారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి హకీంపేట్కు ప్రత్యేక విమానంలో మోదీ నగరానికి చేరుకుంటారు. మరోవైపు కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో టీకా పంపిణీపై కసరత్తు చేస్తున్న ప్రధాని నవంబర్ 28వ తేదీన పుణె నగరానికి వెళ్ళనున్నారు. అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్పై ప్రధాని సమీక్ష జరపనున్నారు. టీకా ఉత్పత్తి పంపిణీ తయారీని సమీక్ష నిమిత్తం ప్రధాని ఈ నెల 28న పుణేలోని సీరంను సందర్శిస్తారని పూణే డివిజనల్ కమిషనర్ సౌరభ్ రావు వెల్లడించారు. ఇందులో భాగంగానే హైదరాబాద్లోని భారత్ బయోటక్ సంస్థను కూడా ప్రధాని సందర్శించనున్నట్టు సమాచారం. కాగా గ్రేటర్ ఎన్నికల ప్రచార పర్వంలో బీజేపీ, అధికార టీఆర్ఎస్ మధ్య రగులుతున్న మాటల మంటల మధ్య ప్రధాని మోదీ రాక ప్రాధన్యతను సంతరించుకుంది. అదీ ప్రచారం ముగియడానికి కేవలం 50 నిమిషాల ముందు హైదరాబాద్ చేరుకోనున్నారనే అంచనా మరింత ఉత్కంఠ రేపుతోంది. అటు అవసరమైతే ప్రధానమంత్రి మోదీని జీహెచ్ఎంసీ ప్రచారానికి పిలుచుకొస్తారంటూ తెలంగాణ మునిసిపల్ మంత్రి కేటీఆర్ సెటైర్ వేయడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై ఆసక్తి ఏర్పడింది. అయితే, మోదీ పర్యటనకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ఏ మాత్రం సంబంధం లేదనే వాదన వినిపిస్తోంది. -
భారత్ బయోటెక్ మరో గుడ్న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. తొలి దశలో కోవిడ్ సృష్టించిన విలయం మరువరక ముందే మరోసారి వైరస్ విజృంభిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే భయం వెంటాడుతోంది. ముందస్తు జాగ్రత్తగా ఇప్పటికే పలు దేశాలు లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి. ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని, లేకపోతే ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్యం సంస్థ సైతం హెచ్చరికలు జారీచేసింది. మరోవైపు కరోనా వ్యాక్సిన్పై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. శాస్త్రవేత్తలు అహర్నిషలు కృషి చేస్తున్నారు. ఇక భారత్లోనూ వ్యాక్సిన్ తయారీ ప్రయోగాలు ఊపందుకున్నాయి. ఈ వరుసలో దేశీయ కంపెనీ భారత్ బయోటెక్ ముందంజలో ఉంది. (ఇంకోసారి లాక్డౌన్ అవసరమా?) తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్న ‘కోవాగ్జిన్’ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ లోకి ప్రవేశించిందని భారత్ బయోటెక్ ఇది వరకే ప్రకటించింది. తాజాగా మరో కీలక విషయాన్ని వెల్లడించింది. తాము రూపొందిస్తున్న కోవాక్సిన్ 60 శాతం ప్రభావం చూపింస్తుందని, వచ్చే ఏడాది ద్వితియార్థంలో దీనిని అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొంది. వైరస్పై పోరులో తమ వ్యాక్సిన్ మంచి ఫలితాన్ని ఇస్తుందని ధీమా వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత్ బయోటెక్ సంస్థ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ప్రసాద్ ఆదివారం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఐసీఎంఆర్ భాగస్వామ్యంతో 25 కేంద్రాల్లో 26,000 మంది వాలంటీర్లతో ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ కోసం నిర్వహించిన అతిపెద్ద క్లినికల్ ట్రయల్ ఇదేనని వెల్లడించారు. కోవాగ్జిన్ మొదటి, రెండో దశ ట్రయల్స్ తాత్కాలిక విశ్లేషణ విజయవంతంగా పూర్తి అయిందని ఇటీవల సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మా టీకా 94.5% ప్రభావవంతం
న్యూయార్క్: తాము అభివృద్ధి చేస్తున్న కరోనా వైరస్ టీకా 94.5 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు పరీక్షల్లో తేలిందని అమెరికాలోని ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ మోడెర్నా సోమవారం ప్రకటించింది. కరోనాను అంతం చేసే విషయంలో తాము ఉమ్మడిగా అభివృద్ధి చేస్తున్న టీకా 90 శాతానికి పైగానే ప్రభావం చూపుతున్నట్లు ఫైజర్, బయోఎన్టెక్ సంస్థలు వెల్లడించిన సంగతి తెలిసిందే. మోడెర్నా సంస్థ ఎంఆర్ఎన్ఏ–1273 పేరిట కరోనా వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తోంది. ఇది 94.5 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలోని డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డు మూడోదశ పరీక్షల్లో వెల్లడైందని మోడెర్నా తాజాగా పేర్కొంది. వ్యాక్సిన్ను తీసుకొచ్చే విషయంలో ఇదొక కీలకమైన ముందడుగు అని వెల్లడించింది. తమ టీకా వినియోగానికి వీలుగా యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి ఎమర్జెన్సీ హెల్త్ ఆథరైజేషన్(ఈయూఏ) దరఖాస్తు చేసుకోవాలని మోడెర్నా భావిస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ వినియోగం కోసం అనుమతులు తీసుకోవాలని నిర్ణయించింది. మూడో దశ ప్రయోగాల్లో ‘కోవాగ్జిన్’.. హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా ‘కోవాగ్జిన్’ మూడో దశ ప్రయోగాల్లోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని ఆ సంస్థ చైర్మన్, ఎండీ కృష్ణ ఎల్లా సోమవారం తెలియజేశారు. ఆయన సోమవారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన వర్చువల్ సదస్సులో మాట్లాడారు. ముక్కు ద్వారా చుక్కల రూపంలో అందించే మరో కరోనా వ్యాక్సిన్ను సైతం తాము అభివృద్ధి చేస్తున్నామని, ఇది వచ్చే ఏడాది కల్లా సిద్ధమవుతుందని తెలిపారు. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)తో కలిసి అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ మూడో దశ ప్రయోగాల్లోకి అడుగుపెట్టిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా బయోసేఫ్టీ లెవల్3 (బీఎస్ఎల్3) ఉత్పత్తి సదుపాయం ఉన్న ఏకైక సంస్థ భారత్ బయోటెక్ అని గుర్తుచేశారు. కోవాగ్జిన్ ఫేజ్–1, ఫేజ్–2 ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు భారత్ బయోటెక్ గత నెలలో వెల్లడించింది. ఫేజ్ 1/2 దశల్లో బీఈ సంస్థ వ్యాక్సిన్ బయోలాజికల్ ఈ.లిమిటెడ్(బీఈ) సంస్థ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ఫేజ్ 1/2 క్లినికల్ ట్రయల్స్లోకి ప్రవేశించింది. హైదరాబాద్కు చెందిన ఈ సంస్థ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి విషయంలో చురుగ్గా పనిచేస్తోంది. ఈ టీకా క్లినికల్ ట్రయల్స్కు డీజీసీఐ అనుమతి లభించింది. టీకా పంపిణీ సవాలే న్యూఢిల్లీ: కోవిడ్–19 నిరోధానికి అభివృద్ధి చేస్తున్న టీకాలు అందుబాటులోకి వచ్చినా దేశంలోని 135 కోట్ల మందికి వాటిని పంపిణీ చేయడం పెను సవాలేనని శీతలీకరణ వ్యవస్థల నిపుణుడు, నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్ చెయిన్ డెవలప్మెంట్ సీఈవో పవనేశ్ కోహ్లీ తెలిపారు. దేశం మొత్తమ్మీద 28 వేల టీకా కోల్డ్ స్టోరేజ్ యూనిట్ల నెట్వర్క్ అందుబాటులో ఉండగా వీటన్నింటిలోనూ –25 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలున్న టీకాలను నిల్వ చేసుకునే సౌకర్యం లేదన్నారు. ఈ సమస్యను ఎదో ఒకలా పరిష్కరించగలిగినా వాటిని స్థానిక మెడికల్ షాపులు, ఇతర దుకాణాల్లోనూ అందుబాటులో ఉంచడం మరో సవాలని పవనేశ్ తెలిపారు. -
కీలక దశకు దేశీయ కరోనా వ్యాక్సిన్
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నివారణకు వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఇప్పటికే రెండు అమెరికా దిగ్గజ కంపెనీలు కీలక విషయాన్ని ప్రకటించగా, దేశీయంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్న ‘కోవాక్సిన్’ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ లోకి ప్రవేశించిందని భారత్ బయోటెక్ సోమవారం ప్రకటించింది. ఐసీఎంఆర్ భాగస్వామ్యంతో 25 కేంద్రాల్లో 26,000 మంది వాలంటీర్లతో ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ కోసం నిర్వహించిన అతిపెద్ద క్లినికల్ ట్రయల్ ఇదని సంస్థ చైర్మన్ ఎండీ కృష్ణ ఎల్లా వెల్లడించారు. కోవిడ్19 కి సంబంధించిన ఇతర వ్యాక్సీన్ల విషయంలో కూడా తమ కంపెనీ అధ్యయనం చేస్తోందన్నారు. ఈ ట్రయల్ 2021 ప్రారంభంలో పూర్తవుతుందన్నారు. ఇది ముక్కులో వేసుకునే డ్రాప్స్ మాదిరిగా ఉండే ఈ వ్యాక్సిన్ వచ్చే ఏడాది నాటికి సిద్దమవుతుందని వివరించారు. కాగా తొలి దేశీయ వ్యాక్సిన్గా భావిస్తున్న కోవాక్సిన్ ప్రపంచంలోనే చౌకైన వ్యాక్సిన్గా ఉంటుందని అంచనా. కోవాక్సిన్ మొదటి, రెండో దశ ట్రయల్స్ తాత్కాలిక విశ్లేషణ విజయవంతంగా పూర్తి అయిందని ఇటీవల సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. (వ్యాక్సిన్: ఊరటినిస్తోన్న మోడర్నా) -
ఫిబ్రవరికల్లా కోవాగ్జిన్
న్యూఢిల్లీ: కోవిడ్పై పోరుకు భారత్ బయోటెక్ కంపెనీ సిద్ధం చేస్తున్న వ్యాక్సిన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కోవాగ్జిన్ పేరుతో కంపెనీ తయారు చేస్తున్న టీకా మూడో దశ మానవ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. భారత్ బయోటెక్ భారతీయ వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్) లు కలిసి ఈ టీకాను తయారు చేస్తున్నాయి. వ్యాక్సిన్ సామర్థ్యం బాగానే ఉందని ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త, టీకా టాస్క్ఫోర్స్ సభ్యుడు రజనీకాంత్ గురువారం న్యూఢిల్లీలో తెలిపారు. ‘‘వచ్చే ఏడాది మొదట్లో.. ఫిబ్రవరి లేదా మార్చిలలో అందుబాటులోకి (టీకా) వస్తుంది’’అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే నిజమైతే భారత్ సిద్ధం చేసిన తొలి కోవిడ్ నిరోధక టీకాగా కోవాగ్జిన్ రికార్డు సృష్టిస్తుంది. భారతీయులను నిలిపేసిన చైనా భారత్ నుంచి చైనాకు వెళ్లేందుకు కేటాయించిన విమానాలను చైనా నిలిపివేసింది. కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో భారతీయులు తమ దేశంలోకి ప్రవేశించడాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు చైనా ఎంబసీ ప్రకటించింది. దాదాపు 2 వేల మంది ఈ చర్య వల్ల భారత్లోనే ఆగిపోయే అవకాశం ఉంది. సరైన పర్మి ట్లు ఉన్నప్పటికీ నిలిపివేస్తున్నట్లు చెప్పింది. మళ్లీ 50 వేలు దేశంలో ఇటీవల కరోనా కొత్త కేసులు రోజుకు 50 వేల లోపు నమోదు కాగా, గురువారం ఆ సంఖ్య 50 వేలు దాటింది. గత 24 గంటల్లో 50,210 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 83,64,086కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 704 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,23,611కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కోలుకున్న వారి సంఖ్య 77,11,809కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 92.20 శాతానికి చేరింది. -
ఫిబ్రవరి నాటికే కోవాక్సిన్ : ఐసీఎంఆర్ శాస్త్రవేత్త
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై ఆందోళన కొనసాగుతున్న తరుణంలో వాక్సిన్ల విషయంలో ఊరటనిచ్చే వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే వచ్చే ఏడాది జనవరి నాటికి తమ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సీరం సంస్థ ప్రకటించింది. తాజాగా హైదరాబాద్కు చెందిన భారత్ బయెటెక్ త రూపొందిస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ ఫిబ్రవరి, 2021 లోనే లాంచ్ చేసే అవకాశం ఉందని సీనియర్ సైంటిస్టు ఒకరు ప్రకటించారు. ఊహించిన సమయానికి కంటే ముందే కరోనావైరస్ వ్యాక్సిన్ కోవాక్సిన్ను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నామని తెలిపారు. తొలి స్వదేశీ వ్యాక్సిన్గా భావిస్తున్న కోవాక్సిన్ చివరి దశ ట్రయల్స్ దాదాపు 25 వేలమందితో ఈ నెలలో ప్రారంభం కానున్నాయి. (జనవరి నాటికి, అందుబాటు ధరలో కరోనా వ్యాక్సిన్) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)తో కలిసి రూపొందిస్తున్న కోవాక్సిన్ను 2021 రెండవ త్రైమాసికంలో విడుదల చేయనుందని ఐసీఎంఆర్ రీసర్చ్ మేనేజ్మెంట్ హెడ్, సీనియర్ శాస్త్రవేత్త, కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు రజనీ కాంత్ వెల్లడించారు. మొదటి, రెండవ దశ ప్రయోగాల్లో టీకా మంచి సామర్థ్యాన్ని చూపించిందన్నారు. అయితే మూడో దశ ప్రయోగాలు కూడా ముగిస్తే తప్ప100 శాతం ఖచ్చి తత్వాన్ని నిర్ధారించలేమన్నారు. మూడో దశ ట్రయల్స్ ముగిసేలోపు కోవాక్సిన్ షాట్లను ప్రజలకు ఇవ్వవచ్చో లేదో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుందని కాంత్ తెలిపారు. అయితే దీన్ని భారత్ బయోటెక్ సంస్థ ఇంకా నిర్ధారించలేదు. మరోవైపు జనవరి, 2021నాటికి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆస్ట్రాజెనెకా రూపొందించిన కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులో రానుందని పుణేకు చెందిన సీరం సంస్థ సీఈవో అదార్ పూనావాలా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కోవిడ్ వ్యాక్సిన్
న్యూఢిల్లీ: అనుమతులు వస్తే కోవిడ్–19 వ్యాక్సిన్ కోవాగ్జిన్ వచ్చే ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య విడుదల చేయాలని భావిస్తున్నట్టు భారత్ బయోటెక్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో మూడవ దశ ఔషధ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేయడంపైనే ప్రస్తుతం దృష్టిసారించామని కంపెనీ ఇంటర్నేషనల్ ఈడీ సాయి ప్రసాద్ తెలిపారు. మూడవ దశ ప్రయోగాలకు సంబంధించిన బలమైన ప్రయోగాత్మక సాక్ష్యాల ఏర్పాటు, సమాచారం, సామర్థ్యం, భద్రతా సమాచారం ఆధారంగా భారత నియంత్రణ సంస్థల నుంచి అన్ని అనుమతులు లభిస్తే 2021 రెండవ త్రైమాసికంలో వ్యాక్సిన్ విడుదల చేస్తామన్నారు. కాగా, ప్రస్తుత నెలలోనే ఫేజ్–3 ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. ఇందుకు డీసీజీఐ నుంచి కంపెనీ అనుమతులను పొందింది. 14 రాష్ట్రాల్లో 25–30 కేంద్రాల్లో ఔషధ ప్రయోగాలు జరగనున్నాయని సాయి ప్రసాద్ చెప్పారు. ఇందుకోసం ఒక్కో ఆసుపత్రిలో సుమారు 2,000 మంది వాలంటీర్లను నియమించుకుంటామని చెప్పారు. వ్యాక్సిన్ అభివృద్ధి, కొత్త తయారీ కేంద్రాలు, మూడవ దశ ఔషధ ప్రయోగాలకు సుమారు రూ.350–400 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వంతోపాటు ప్రైవేటు సంస్థలకూ ఈ వ్యాక్సిన్ను విక్రయిస్తామన్నారు. వ్యాక్సిన్ ఎగుమతికై పలు దేశాలతో చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని వివరించారు. ధర ఇంకా నిర్ణయించలేదని స్పష్టం చేశారు. -
ఏడాదికి 50 కోట్ల డోసులు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నియంత్రణకు భారత బయోటెక్ తయారు చేస్తున్న టీకా కోవాగ్జిన్ మూడో దశ మానవ ప్రయోగాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 25–26 వేల మందిపై టీకాను ప్రయోగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, సమర్థత తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మూడో దశ మానవ ప్రయోగాలను నిర్వహిస్తున్నామ ని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి ప్రసాద్ ఓ ఇంగ్లిష్ పత్రికకు తెలిపారు. 25కుపైగా నగరాల్లో ప్రయోగాలు జరగవచ్చునని చెప్పారు. కోవాగ్జిన్ టీకా తయారీ బాధ్యత మొత్తం భారత్ బయోటెక్దేనని, టీకా కొనుగోలు కోసం కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదని సాయి ప్రసాద్ తెలిపారు. కానీ, ఇప్పటికే కొన్ని డోసులను తయారు చేసి ఉంచామని తెలిపారు. ఏడాదికి 15 కోట్ల టీకా డోసులను తయారు చేయగల సామర్థ్యం ఉండగా దీన్ని 50 కోట్ల డోసులకు పెంచేందుకు హైదరాబాద్, మరో చోట ఫ్యాక్టరీలను సిద్ధం చేస్తున్నామన్నారు. టీకాలను భద్రపరిచే శీతల వ్యవస్థలు హైదరాబాద్, బెంగళూరు, అంకాలేశ్వర్లలో ఉన్నాయన్నారు. తమ టీకా కొనుగోలుకు 20 దేశాలు ఆసక్తి కనబరిచాయని చెప్పారు. 50 వేల లోపే కేసులు దేశంలో గత 24 గంటల్లో 50 వేల కంటే తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో 50 వేల కంటే తక్కువ కేసులు నమోదు కావడం ఇది రెండోసారి. సోమవారం 45,148 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,09,959కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 480 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,19,014కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 71,37,228 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,53,717గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 8.26 శాతం ఉన్నాయి. కరోనా రోగుల రికవరీ రేటు 90.23 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల శాతం 1.50గా ఉంది. -
ముక్కుద్వారా కరోనా టీకా
సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతక మహమ్మారి కరోనాను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం తాజాగా మరిన్ని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఒకవైపు భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలు ఇప్పటికే రెండు వ్యాక్సిన్ల ప్రయోగాలు కొనసాగిస్తూండగా.... తాజాగా ఈ రెండు సంస్థలు వేర్వేరుగా రెండు సరికొత్త వ్యాక్సిన్ల ప్రయోగాలకు సిద్ధమయ్యాయి. ముక్కు ద్వారా అందించే ఈ రెండు కొత్త వ్యాక్సిన్లపై ప్రయోగాలు త్వరలో మొదలవుతాయని ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ స్వయంగా ఆదివారం ప్రకటించడం గమనార్హం. నియంత్రణ సంస్థల నుంచి తగిన అనుమతులు లభించిన తరువాత ఈ రెండు సంస్థలు ముక్కు ద్వారా అందించే కోవిడ్–19 నిరోధక వ్యాక్సిన్ల ప్రయోగాలు మొదలు పెడతాయని డాక్టర్ హర్షవర్ధన్ తన సండే సంవాద్ కార్యక్రమంలో ప్రకటించారు. మొత్తం నాలుగు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ కోవిడ్–19 నియంత్రణ కోసం మొత్తం నాలుగు రకాల టీకాలను అభివృద్ధి చేస్తూండగా.. ఇందులో ఒకటైన కోవాగ్జిన్ ఇప్పటికే రెండు దశల మానవ ప్రయోగాలను పూర్తి చేసుకుంది. మిగిలిన మూడు వ్యాక్సిన్లలో ఒకటి భారత వైద్య పరిశోధన సమాఖ్య సహకారంతో తయారవుతోంది. ఈ కొత్త వ్యాక్సిన్ కోసం వాషింగ్టన్ యూనివర్సి టీ, సెయింట్ లూయిస్ యూనివర్శిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా భారత్ బయోటెక్కు ముక్కుద్వారా అందించే టీకా ప్రయోగాలు, తయారీ, పంపిణీలపై హక్కులు లభిస్తాయని డాక్టర్ హర్షవర్ధన్ తన ప్రసంగంలో తెలిపారు. ఎలుకల్లో ఈ టీకా మెరుగైన ఫలితాలు కనబరిచింది. ఇంజెక్షన్, సిరంజి వంటివి లేకుండానే ఈ టీకాను అందరికీ అందివ్వవచ్చు. సీరమ్ ఇన్స్టిట్యూట్ కూడా ఇదే రకమైన టీకా ప్రయోగాలను భారీ ఎత్తున చేపట్టనుందని మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. అన్నీ సవ్యంగా సాగితే మరికొన్ని నెలల్లోనే ఈ కొత్త టీకాల ప్రయోగాలు మొదలు కానున్నాయి. దేశంలో ప్రస్తుతం మూడవ దశ ప్రయోగాలు జరుపుకుంటున్న టీకాలన్నీ ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేవి మాత్రమే కావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఇదిలా ఉండగా.. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్–వీ టీకాపై రెండు, మూడవ దశ ప్రయోగాలు జరిపేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీకి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇటీవలే అనుమతి జారీ చేసింది. వీటన్నింటి ఆధారంగా చూస్తే భారత్లో రానున్న ఆరు నెలల్లో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ టీకా ముందుగా వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలకు ఇచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ఆరోగ్యంగా ఉన్న వారికి కోవిడ్–19 నిరోధక టీకా అందేందుకు మరికొంత సమయం పడుతుంది. -
ఏడాది చివరికి కొవాక్జిన్
సాక్షి, హైదరాబాద్: కోవిడ్కు సరైన వ్యాక్సిన్ కోసం యావత్ ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మంగళవారం ఆమె జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ కంపెనీని సందర్శించారు. కోవిడ్ నిర్మూలన కోసం తయారుచేస్తున్న కొవాక్జిన్ వ్యాక్సిన్ గురించి అక్కడి శాస్త్రవేత్తలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ తయారీకి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారంటూ వారిని ప్రశంసించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కొవాక్జిన్ వ్యాక్సిన్ ఈ ఏడాది చివరి నాటికి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమర్థమైన, సరసమైన, సురక్షితమైన వ్యాక్సిన్ను మన శాస్త్రవేత్తలు తీసుకొస్తారని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోందన్నారు. ‘తక్కువ ధరతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ వ్యాక్సిన్ చేరేలా చూడాలి. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితి, జాతీయతతో సంబంధం లేకుండా అందరికీ టీకా అందాలి’అని ఆమె ఆకాంక్షించారు. కొవాక్జిన్ పరిశోధనలకు నాయకత్వం వహించినందుకు డాక్టర్ సుమిత్రా ఎల్లాకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ రుగ్మతలకు మూడు బిలియన్ల డోసుల వేర్వేరు వ్యాక్సిన్లను రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్కు గవర్నర్ అభినందనలు తెలిపారు. కంపెనీ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ ఎల్లా, శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
జంతువులపై కోవాగ్జిన్ సత్ఫలితాలు
న్యూఢిల్లీ/లండన్: కరోనా వైరస్కు వ్యతిరేకంగా తయారు చేస్తున్న కోవాగ్జిన్ టీకా జంతువులపై జరిపిన ప్రయోగాల్లో మంచి ఫలితాలు చూపిందని భారత్ బయోటెక్ వెల్లడించింది. కోతులపై జరిపిన ప్రయోగాల్లో వాటి శరీరాల్లో బలమైన వ్యాధినిరోధకత కనిపించినట్లు తెలిపింది. దీనివల్ల ప్రైమేట్ జీవుల్లో వ్యాధి నిరోధకత పెంచే విషయంలో అంచనాలు మరింత మెరుగయ్యాయని తెలిపింది. ప్రయోగాల కోసం 20 రీసస్ కోతులను నాలుగు గ్రూపులుగా విభజించామని, వీటిలో ఒక గ్రూప్ కోతులకు ప్లాసిబో(ఎటువంటి ఔషధం లేని డోసు)ను ఇచ్చామని, మిగిలిన గ్రూపుల్లో కోతులకు మూడు రకాల వ్యాక్సిన్స్ను ఇచ్చామని వివరించింది. 14 రోజుల అనంతరం అన్ని కోతులను వైరస్కు గురిచేశామని, అనంతరం వ్యాక్సిన్ తీసుకున్న కోతుల్లో ఐజీ–జి యాంటీబాడీలు పెరిగి, గొంతు, ముక్కు, ఊపిరితిత్తుల్లో వైరస్ పెరుగుదలను తగ్గించినట్లు తెలిసిందని తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్న కోతుల్లో న్యుమోనియా లక్షణాలు కనిపించలేదంది. టీకా ఇచ్చిన కోతుల్లో భారీ సైడ్ఎఫెక్ట్లు కానరాలేదని తెలిపింది. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలు మళ్లీ షురూ ఇటీవల కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలను ఆపేసిన అతిపెద్ద ఔషధ కంపెనీ ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బ్రిటన్లో మళ్లీ ట్రయల్స్ను మొదలుపెట్టాయి. ఈ ట్రయల్స్ సురక్షితమని మెడిసిన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (ఎంహెచ్ఆర్ఏ) నిర్థారించడంతో ప్రయోగాలను పునఃప్రారంభించినట్లు ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చెప్పాయి. భారత్లో ఆస్ట్రాజెనెకా క్లీనికల్ ట్రయల్స్ను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి పొందాక పునఃప్రారంభిస్తామని సీరమ్ ఇనిస్టిట్యూట్ శనివారం తెలిపింది. ట్రయల్స్ పూర్తిగా ముగిసేవరకు ఒక నిర్ధారణకు రాకూడదని కంపెనీ సీఈఓ పూనావాలా చెప్పారు. -
గుడ్ న్యూస్ చెప్పిన భారత్ బయోటెక్
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలన్ని కరోనా వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే అందరి చూపు ఆక్స్ఫోర్డ్ ఆస్ట్రాజెనెకా మీదనే ఉండగా.. అనూహ్యంగా ఆ వ్యాక్సిన్ ట్రయల్స్కు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి మరింత ఆలస్యమవుతుందనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ శుభవార్త చెప్పింది. తాము అభివృద్ధి చేసిన కోవాక్జిన్ జంతువుల్లో సత్ఫలితాలిచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు భారత్ బయోటెక్ ట్వీట్ చేసింది. Bharat Biotech proudly announces the animal study results of COVAXIN™ - These results demonstrate the protective efficacy in a live viral challenge model. Read more about the results here - https://t.co/f81JUSfWpD@icmr_niv #BharatBiotech #COVAXIN #Safety #Vaccine #SARSCoV2 pic.twitter.com/fva1SOcLOr — BharatBiotech (@BharatBiotech) September 11, 2020 ‘జంతువులపై కోవాక్జిన్ ప్రయోగాలు సత్ఫలితాలిచ్చాయని గర్వంగా తెలియజేస్తున్నాం. వ్యాక్సిన్ ఇచ్చిన జంతువుల్లో ఇమ్యూనిటీ పెరిగింది. ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో వైరస్ వృద్ధిని నియంత్రించినట్టు గుర్తించాము. రెండో డోస్ ఇచ్చిన 14రోజుల తర్వాత మరోసారి జంతువులను పరిశీలిస్తాం’ అంటూ భారత్ బయోటెక్ ట్వీట్ చేసింది. ఇక ఇప్పటికే నిమ్స్లో కోవాక్జిన్ రెండో దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. (చదవండి: ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఆగిందా?) -
డిసెంబరు నాటికి భారత్లో వ్యాక్సిన్!
న్యూఢిల్లీ: ఐసీఎంఆర్తో కలిసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ ‘కోవాక్సిన్’ ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. మరోవైపు ట్రయల్స్ అన్ని విజయవంతమైన పక్షంలో ఆక్స్ఫర్డ్ టీకా ‘కోవిషీల్డ్’ 2020 చివరి నాటికి భారతీయులకు అందుబాటులోకి రావచ్చునని కూడా పలు రిపోర్టులు చెప్తున్నాయి. వీటితోపాటు జైడుస్ కాడిలా తయారు చేస్తున్న ‘జైకోవ్ డీ’, ఆక్స్ఫర్డ్ ‘ఆస్ట్రాజెనికా’తో జతకట్టిన సీరం ఇన్స్స్టిట్యూట్ ట్రయల్స్ కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే మరో నాలుగు నెలల్లో ఇవి కూడా అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని హర్షవర్ధన్ వెల్లడించారు. వ్యాక్సిన్ల తయారీలో భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తోందని అన్నారు. (చదవండి: ప్లాస్మా థెరపీ: అనుమతులు నిలిపివేసిన యూఎస్!) సురక్షిత వ్యాక్సిన్తోపాటు సరసమైన ధరలకే దానిని ప్రజలకు అందించే దిశగా ఆయా కంపెనీలు పనిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఇక భారత్లో అందుబాటులోకి వచ్చే వ్యాక్సిన్ ఏదైనా తొలుత 50 లక్షల వ్యాక్సిన్లు కరోనా వారియర్లకే ఇవ్వాలని కేంద్రం ఇదివరకే నిర్ణయించింది. దానికోసం ఆర్డర్లు కూడా ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇదిలాఉండగా.. వ్యాక్సిన్ తయారీలో భారత్ సక్సెస్ అవుతుందని రష్యా పేర్కొంది. ఆ సత్తా భారత్కు ఉందని తెలిపింది. కాగా, స్పుత్నిక్ వీ పేరుతో రష్యా తొలి కరోనా వ్యాక్సిన్ను అందబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే, సరైన నిబంధనలు పాటించకుండా ఆగమేఘాల మీద రష్యా వ్యాక్సిన్ను తెచ్చిందనే విమర్శలు వెలువడుతున్నాయి. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ పనితీరు త్వరలో వెల్లడి కానుంది. (డిసెంబరు 3 నాటికి కరోనా కనుమరుగు!) -
కరోనా పడగ నీడలో 200 రోజులు
కంటికి కనిపించని సూక్ష్మ క్రిమి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా మహమ్మారి భారత్పై పంజా విసిరి 200 రోజులైంది. ఈ ఆరునెలల కాలంలో అత్యధిక కేసులున్న దేశాల్లో ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకున్నాం. కేసుల పెరుగుదల భయపెడుతున్నప్పటికీ రికార్డు స్థాయిలో రికవరీ భారత్ సాధించిన విజయంగా చెప్పాలి. జనాభాతో కిటకిటలాడే భారత్కి కరోనా మహమ్మారిని ఎదుర్కొనే శక్తి లేదని తొలుత అందరూ భావించారు. కరోనాని కట్టడి చేసే ఏకైక ఆయుధమైన భౌతిక దూరం మన దేశంలో పాటించడం దుర్లభమని అనుకున్నారు. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ భారత్ వైరస్ను సమర్థంగా ఎదుర్కొంటోంది. ముఖ్యంగా రికవరీ, మరణాలు, కరోనా పరీక్షల్లో మన దేశం బాగా ముందుంది. కేరళలో జనవరి 30న తొలి కేసు నమోదైన దగ్గర్నుంచి ఇప్పటి వరకు కేంద్రం పకడ్బందీ ప్రణాళికతోనే ముందుకు అడుగులు వేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరైన సమయంలో స్పందించి మార్చి 25 నుంచి లాక్డౌన్ విధించడంతో కేసులు పెరగకుండా అడ్డుకోగలిగారు. మే 3 నుంచి లాక్డౌన్పై ఆంక్షలు సడలించడంతో కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. ఈ 200 రోజుల్లోనే కేసుల సంఖ్య 26 లక్షలకి చేరుకుంది. మొత్తం కేసుల్లో 92% లాక్డౌన్ తర్వాతే నమోదయ్యాయి. అయితే రికవరీ అంశంలో భారత్ అనూహ్యమైన పురోగతిని సాధించింది. ఏప్రిల్లో 26% మాత్రమే ఉన్న రికవరీ రేటు ఆగస్టు నాటికి 72శాతానికి పెరిగింది. మొత్తం మృతుల సంఖ్య 50 వేలు దాటినప్పటికీ మరణాల రేటు 1.9% ఉండడం భారీగా ఊరటనిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో తొలి మరణం నమోదైన 23 రోజుల్లోనే 50 వేల మంది ప్రాణాలు కోల్పోతే భారత్కి తొలి మరణం నుంచి 50 వేలకు చేరుకోవడానికి 156 రోజులు పట్టింది. కరోనాకి వ్యాక్సిన్ కనుక్కోవడంలో అడుగులు ముందుకు పడుతున్నాయి. హైదరా బాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్, అహ్మదాబాద్లోని జైడస్ కేడిలా లిమిటెడ్ ప్రయోగాలు తుది దశలో ఉన్నాయి. కరోనా కొమ్ముల్ని సమర్థంగా వంచిన కేరళ ముఖ్యమంత్రి పి.విజయన్ కరోనా వైరస్ సందర్భంలో ట్వీట్ చేస్తూ మనం అనుభవిస్తున్న కష్టనష్టాల కంటే మహమ్మారిని ఎదుర్కొనే ధైర్యసాహసాలు, మనుగడ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు, సంక్షోభాన్ని సానుకూలంగా మార్చుకోగలిగే శక్తి సామర్థ్యాలు స్ఫూర్తిని ఇస్తున్నాయని అన్నారు. ఏడాది చివరికి కోటి ? ప్రపంచంలోని కేసుల్లో ప్రస్తుతం 23% భారత్లోనే నమోదవుతున్నాయి. ప్రతీ 10 లక్షల మందిలో 1857 మందికి వైరస్ సోకుతోంది. 25 లక్షలకు పైగా కేసులు నమోదైన దేశాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ నిలిచింది. పెరుగుదల ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరికి కోటికి పైగా కేసులు నమోదవుతాయని ఆరోగ్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మృతుల సంఖ్య 1.74 లక్షల వరకు చేరే అవకాశం ఉంది. జూన్ 8 నుంచి అన్లాక్ 1.0 ప్రక్రియ మొదలయ్యాక దేశంలో కేసుల సంఖ్య చాలా త్వరగా రెట్టింపవుతోంది. అమెరికా, బ్రెజిల్తో పోల్చి చూస్తే 5 లక్షలు దాటిన తర్వాత మన దేశంలో తక్కువ రోజుల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మొదట్లో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు కోవిడ్ హాట్స్పాట్లుగా ఉంటే ఇప్పుడు కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్నుంచి అత్యధిక కేసులు వస్తున్నాయి. సెప్టెంబర్ రెండో వారానికి కేసుల సంఖ్య అత్యధిక స్థాయికి చేరుకుంటుందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ) తన తాజా నివేదికలో వెల్లడించింది. రికవరీ పెరిగిందిలా .. ! కోవిడ్–19 రికవరీ రేటు జూన్ నుంచి బాగా పెరగడం మొదలైంది. వైరస్పై ప్రజల్లో అవగాహన పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు ఫలించడం, వైద్య సదుపాయాలు మెరుగుపరచడం, పరీక్షలు కూడా భారీగా పెంచి తొలి దశలోనే కోవిడ్ రోగుల్ని గుర్తించడం రికవరీలో రికార్డులు సృష్టిస్తున్నాం. తొలుత పుణేలో ఒక్క ల్యాబ్లో మాత్రమే పరీక్షలు జరిగేవి, అలాంటిది ఇప్పుడు దేశవ్యాప్తంగా 1433 ల్యాబొరేటరీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కర్ణాట క, పశ్చిమ బెంగాల్ లో అత్యధికంగా పరీక్షలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా రోజుకి 8 లక్షలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోజుకి 10 లక్షల టెస్టులు జరపాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటివరకు 2.9 కోట్ల మందికి పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ కేసులు 9% నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో 10 వేల పడకలతో ప్రపంచంలోనే అతి పెద్ద కోవిడ్ ఆస్పత్రి సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ నిర్మించారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారి ప్లాస్మా సేకరించడానికి ఢిల్లీలో ప్లాస్మా బ్యాంకు ఏర్పాటు చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కోవిడ్ చికిత్సకి అనుమతినివ్వడంతో రికవరీ రేటు భారీగా పెరిగింది. -
వ్యాక్సిన్ బాటలో భారత్ బయో- బయెలాజికల్-ఇ
న్యూఢిల్లీ: ఐసీఎంఆర్తో కలసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ తొలి దశ ప్రాథమిక పరీక్షలలో సత్ఫలితాలు వచ్చినట్లు ఎయిమ్స్ ఢిల్లీ ప్రిన్సిపల్ సంజయ్ రాయ్ వెల్లడించారు. కోవాగ్జిన్ పేరుతో రూపొందిస్తున్న వ్యాక్సిన్ తొలి దశ క్లినికల్ పరీక్షలలో 12 ప్రాంతాలలో 375 మందిపై పరిశీలించినట్లు రోహ్తక్లోని పీజీఐలో పరీక్షలు నిర్వహిస్తున్న సవితా వర్మ పేర్కొన్నారు. తొలి దశలో ఎలాంటి సమస్యలూ ఎదురుకాలేదని తెలియజేశారు. దీంతో రెండోసారి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా రోగనిరోధక శక్తి ఎలా ప్రభావితమవుతున్నదీ గమనించనున్నట్లు వెల్లడించారు. ఇందుకు వీలుగా ప్రస్తుతం రెండో డోసేజీ ఇవ్వడం ద్వారా రక్త నమూనాలను సేకరిస్తున్నట్లు సంజయ్ రాయ్ వెల్లడించారు. ఈ పరీక్షలు కూడా విజయవంతమైతే.. తదుపరి రెండో దశ క్లినికల్ పరీక్షలకు అనుమతించవలసిందిగా డీసీజీఏను అభ్యర్థించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెలాఖరుకల్లా తొలి దశ పరీక్షలు పూర్తికానున్నట్లు భావిస్తున్నారు. బయొలాజికల్-ఇ హైదరాబాద్: యూఎస్ దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్తో కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హైదరాబాద్ కంపెనీ బయొలాజికల్-ఇ వెల్లడించింది. తద్వారా భారీ స్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తిని చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఇదేవిధంగా బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్తో లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కంపెనీ ఎండీ దాట్ల మహిమ పేర్కొన్నారు. తద్వారా చౌక ధరల్లో కోవిడ్-19 వ్యాక్సిన్ను అందించే ప్రణాళికల్లో ఉన్నట్లు వివరించారు. -
కోవాక్జిన్ రెండో దశ ట్రయల్స్ షురూ
నాగ్పూర్: హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన కోవిడ్–19 టీకా ‘కోవాక్జిన్’రెండోదశ మానవ ప్రయోగాలు నాగ్పూర్లో బుధవారం మొదలయ్యాయి. కోవాక్జిన్ను మనుషులపై ప్రయోగించేందుకు దేశవ్యాప్తంగా మొత్తం 12 ఆస్పత్రులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందులో హైదరాబాద్లోని నిమ్స్, వైజాగ్లోని కేజీహెచ్ కూడా ఉన్నాయి. వలంటీర్ల నమూనాలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కు పంపి... సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నారని నిర్ధారణ జరిగిన తర్వాత వారికి టీకాను ఇస్తున్నారు. నాగ్పూర్లోని గిల్లూర్కర్ ఆస్పత్రిలో బుధవారం రెండో దశ ప్రయోగం ప్రారంభమయ్యింది. టీకా సమర్థత, రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తున్న తీరు, సైడ్ ఎఫెక్ట్స్ పరిశీలిస్తారు. వందల మంది వలంటీర్లపై ఈ ప్రయోగం ఉంటుంది. -
ప్రపంచం చూపు మన వైపు
సాక్షి, హైదరాబాద్: ‘టీకా’తాత్పర్యం తెలంగాణ చెప్పగలదని మన దేశమే కాదు, ప్రపంచదేశాలూ భావిస్తున్నాయి. అందుకు తగ్గట్టే ఇక్కడ కరోనాకు దేశంలో తొలి స్వదేశీ వ్యాక్సిన్ను భారత్ బయోటెక్ రూపకల్పన చేస్తోంది. ‘బయోలాజికల్ ఇ’ కంపెనీ సైతం ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తోంది. వ్యాక్సి న్ల తయారీలో ప్రపంచానికి తెలంగాణ రాజ ధాని కావడంతో కోవిడ్–19 వ్యాక్సిన్ అభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంద’ని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. కరోనా సమస్య పరిష్కారానికి యావత్ ప్రపంచం మరోసారి భారతదేశం వైపు చూస్తోందన్నా రు. కరోనాకు దేశంలో తొలి స్వదేశీ వ్యాక్సి న్ను భారత్ బయోటెక్ రూపకల్పన చేయడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ‘బయోలాజికల్ ఇ’ కంపెనీ సైతం కరోనా వ్యా క్సిన్ అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించిందని కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశా రు. కోవిడ్–19 వ్యాక్సిన్ అభివృద్ధిలో పురోగతిని తెలుసుకోవడానికి కేటీఆర్ మంగళవారం ఇక్కడి జినోమ్ వ్యాలీని సందర్శించి భా రత్ బయోటెక్, ‘బయోలాజికల్ ఇ’ సంస్థల నాయకత్వ బృందాన్ని కలుసుకున్నారు. టీకా అభివృద్ధిలో ఈ కంపెనీలు ఎదుర్కొం టున్న సవాళ్లను తెలుసుకోవడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవసరమైన సహకారాన్ని అందించడానికి మంత్రి కేటీఆర్ ఈ పర్యటన జరిపారు. కరోనా కష్టకాలంలో లైఫ్ సైన్సెస్ కీలకం ‘వ్యాక్సిన్ రేస్: బ్యాలెన్సింగ్ సైన్స్ అండ్ అర్జెన్సీ’అనే అంశంపై జినోమ్ వ్యాలీలో మంత్రి కేటీఆర్ చర్చ నిర్వహించడంతోపాటు సం ధానకర్తగా వ్యవహరించారు. కరోనా కష్టకాలంలో లైఫ్ సైన్సెస్ రంగం కీలకంగా ఉద్భవించిందని, టీకా పరిశ్రమ అతిపెద్ద ఆశాకిరణంగా మారిందన్నారు. ప్రపంచవ్యాప్త పం పిణీ కోసం వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తిలో భారత వ్యాక్సిన్ రంగం కీలక పాత్ర పోషి స్తుందని పదేపదే చెప్పుకుంటున్నారన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ చిత్రపటంలో హైదరాబా ద్కు మాత్రమే ప్రాధాన్యత పెరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో టీకాల పరిశ్రమల అభివృద్ధి, కొత్త ఔషధ పరిశ్రమల ఏర్పాటుకు కేటీఆర్ దూరదృష్టితో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని భారత్ బయోటెక్ చైర్మన్, ఎండీ డాక్టర్ క్రిష్ణ ఎం.ఎల్లా ప్రశంసించారు. వ్యాక్సిన్లకు అనుమతిచ్చే ప్ర క్రియను వికేంద్రీకరించాలని, రాష్ట్రాల్లో వీటి కి సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాల ను ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఫార్మా, లైఫ్సైన్సెస్ పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారని బయోలాజికల్ ఇ సంస్థ ఎండీ మహిమ దాట్ల కొనియాడారు. ప్రపం చంలోని ప్రతి ఒక్కరికీ టీకాలు చేరాలనేది తమ కంపెనీ అభిమతమని చెప్పారు. విస్తృ త స్థాయిలో కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్ష లు నిర్వహించి వైద్యసదుపాయం కల్పించడానికి ప్రభుత్వం సమగ్ర ప్యాకేజీని తీసుకురావాలని డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అ న్నారు. దేశంలో వ్యాక్సిన్ను అభివృద్ధి చేసేపనిలో ఉన్న సంస్థలన్నీ ఒకేతాటిపైకి రావాలని, డాక్టర్ ఆనంద్కుమార్ సూచించారు. -
దేశంలో వ్యాక్సిన్ పరీక్షల జోరు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతున్న భారత్ స్వదేశీ వ్యాక్సిన్ ప్రయోగాలను వేగవంతం చేసింది. భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా సంస్థలకు చెందిన వ్యాక్సిన్లను దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో మనుషులపై ప్రయోగించి చూస్తున్నారు. హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ను ఢిల్లీలో ఎయిమ్స్ ఆస్పత్రిలో 30 ఏళ్ల వ్యక్తికి తొలి డోసు ఇచ్చారు. ఈ రెండు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లు మొదటి, రెండో దశ ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇక బ్రిటన్కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన వ్యాక్సిన్ను పుణేకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ రెండు/మూడో దశ ప్రయోగాల అనుమతుల కోసం వేచిచూస్తోంది. స్వల్పంగా సైడ్ ఎఫెక్ట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) భాగస్వామ్యంతో భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్ను మొత్తం 12 ఆస్పత్రుల్లో 500 మంది వాలంటీర్లపై ప్రయోగించి చూశారు. 18–55 మధ్య వయసున్న వీరికి వ్యాక్సిన్ డోసు ఇచ్చాక స్వల్పంగా సైడ్ ఎఫెక్ట్లు వచ్చినట్టుగా ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. కొద్దిగా జ్వరం తప్ప ఇతరత్రా అనారోగ్య సమస్యలేవీ రాలేదని ఢిల్లీలో ఎయిమ్స్ డైరెక్టర్ వెల్లడించారు. జూలై 29 నుంచి రెండో దశ ప్రయోగాలు మొదటి దశలో చేసిన ప్రయోగాలు విజయవంతంగా ముగిస్తే ఈ నెల 29 నుంచి రెండో దశ వ్యాక్సిన్ ప్రయోగాలు చేపడతారు. మొదటి దశలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేవని నిర్ధారించుకోవడం, యాంటీ బాడీలు ఏ స్థాయిలో ఉత్పన్నమయ్యాయో తెలుసుకోవడానికి వాలంటీర్లకు మరికొన్ని టెస్టులు చేయాల్సి ఉందని ఎయిమ్స్ పట్నా డైరెక్టర్ సింగ్ చెప్పారు. కొవాగ్జిన్ ట్రయల్స్ హైదరాబాద్, పట్నా, కాంచీపురం, రోహ్తక్, ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. నాగపూర్, భువనేశ్వర్, బెల్గామ్, గోరక్పూర్, కాన్పూర్, గోవా, విశాఖపట్నంలలో ప్రయోగించాల్సి ఉంది. రెండో దశ ప్రయోగాలు పట్నా, రోహ్తక్లలో 26 నుంచి ప్రారంభం కానున్నాయి. జైడస్కి చెందిన జైకోవిడ్ టీకాని అహ్మదాబాద్లో ప్రయోగించి చూస్తున్నారు. -
చైనా గ్రీన్ సిగ్నల్: వ్యాక్సిన్ తయారీలో పోటీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేసిన నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మొదలైన ప్రయోగాల్లో ప్రపంచ దేశాలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే చైనా శాస్త్రవేత్తలు ఆదివారం కీలక ప్రకటన చేశారు. తాము రూపొందించిన వ్యాక్సిన్ అన్ని ప్రయోగాల్లో విజయవంతమై.. విడుదలకు అనుమతి పొందిందని ప్రకటించారు. కరోనాకు విరుగుడుగా డ్రాగాన్ తయారు చేసిన కిన్సినో బయో వ్యాక్సిన్ లిమిటెడ్కు చైనా ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఆ దేశానికే చెందిన వూహన్, సినోవాక్ వ్యాక్సిన్లు మూడు దశల్లోనూ ప్రయోగాలను పూర్తిచేసుకున్నాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆశలు రేకెత్తించిన ఆక్స్ఫర్డ్తో చైనా కంపెనీలు పోటీపడుతున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ ఇప్పటికే మూడు ఫేజ్లను పూర్తిచేసుకుని బహిరంగ మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తినెలకొంది. ఇక ఆస్ట్రేలియా సైతం కరోనా విరుగుడు తయారీలో దూసుకుపోతోంది. ఆ దేశ శాస్త్రవేత్తల కృషి ఫలితంగా మార్డోక్ వ్యాక్సిన్ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలోనే బహిరంగ మార్కెట్లో విడుదల చేయడానికి ఆ దేశ వైద్య పరిశోధన మండలి అనుమతి కోసం ఎదురుచేస్తున్నారు. ఇక భారత్ బయోటెక్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న కోవాగ్జిన్ సైతం ప్రయోగాల్లో సత్ఫలిస్తోందని ఐసీఎంఆర్ ఇదివరకే ప్రకటించింది. అయితే మన దేశంలో తయారు చేసే వ్యాక్సిన్ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా, చైనా, ఆస్ట్రేలియా దేశాలు తయారుచేసిన వ్యాక్సిన్పై భారత్ ఆధారపడక తప్పదని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లోకి వ్యాక్సిన్ వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున ఆర్డర్ ఇచ్చేందుకు భారత్కు చెందిన కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. అయితే అవి భారత్లో వ్యాపించిన కరోనా వైరస్ని చంపగలవా? దేశ ప్రజలపై అది ప్రభావం చూపుతుందా అనే సందేహం పలువురిలో వ్యక్తమవుతోంది. దీనిపై సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు లోతైన పరిశోధనలు జరిపారు. ప్రపంచ దేశాలకు ఎలాంటి కరోనా వైరస్ సోకిందో, భారత్లోనూ అదే వైరస్ వ్యాప్తి చెందిందని అందువల్ల ప్రపంచ దేశాలు వాడే వ్యాక్సిన్ భారతీయులూ వాడొచ్చని డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు. -
నిమ్స్ ట్రయల్స్ .. తొలి అడుగు సక్సెస్
లక్డీకాపూల్ (హైదరాబాద్): కరోనా వ్యాక్సిన్ క్లినిక ల్ ట్రయల్స్ దిశగా నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) తొలి అడుగు విజయవం తమైంది. కరోనా వైరస్ నిరోధానికి హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన కొవాక్జిన్ను సోమవారం నిమ్స్లో ఇద్దరు వలంటీర్లకు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో మంగళవారం డిశ్చార్జి చేసినట్టు నిమ్స్ వైద్యులు తెలిపారు. 14 రోజుల పాటు వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తామని నిమ్స్లోని కొవాక్జిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సీ ప్రభాకర్రెడ్డి చెప్పారు. రోజూ ఫోన్, వీడియో కాల్స్ ద్వారా వలంటీర్ల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తామని, తర్వాత మళ్లీ ఆస్పత్రికి తీసుకువచ్చి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తామన్నారు. టీకాలోని అచేతన (అన్యాక్టివేటెడ్) వైరస్ వల్ల శరీరంలో యాంటీబాడీస్ ఏ మేరకు వృద్ధి చెందాయి, సమస్యలున్నాయా అనేది పరిశీలిస్తామన్నారు. అంతా సవ్యంగా ఉంటే వారికే రెండో డోస్ టీకా ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం టీకా తీసుకున్న వారిలో అలర్జీ, ఇతర ఆరోగ్య సమస్యలు లేవన్నారు. కొవాక్జిన్ టీకా మానవ ప్రయోగంలో తొలి ప్రయత్నం విజయవంతమైందని నిమ్స్ క్లినికల్, ఫార్మకాలజీ విభాగం వైద్యులు హర్షం వ్యక్తంచేశారు. నేడు మరో ఇద్దరికి! క్లినికల్ ట్రయల్స్లో భాగంగా నిమ్స్ వైద్యులు 13 మంది వలంటీర్ల రక్త నమూనాలను ఢిల్లీలోని ఐసీఎంఆర్ ఆమోదించిన ల్యాబ్కు పం పించారు. వీరిలో 8 మందికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ అయినట్టు తెలిసింది. ఈ సర్టిఫికెట్ల ఆధారంగానే బుధవారం మరో ఇద్దరికి టీకా డోస్ ఇవ్వనున్నారు. దీంతో టీకా తీసుకున్న వారి సంఖ్య నాలుగుకి చేరనుంది. వాస్తవానికి మంగళవారం కూడా ట్రయల్స్ నిర్వహించా ల్సి ఉన్నా.. వలంటీర్లు ఎవరూ రాని కారణం గా టీకా ఇవ్వలేదని నిమ్స్ క్లినికల్ ట్రయల్స్ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ చెప్పారు. ఈ ట్రయల్స్లో భాగంగా ఆరోగ్యవంతమైన 60 మందిపై మొదటి, రెండో దశ ప్రయోగాలను నిర్వహించనున్నారు. మూడో దశలో వంద మందిపై ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా ఐదు డోస్ల మేరకు టీకా ఇస్తారు. టీకా ప్రయోగాన్ని 2 – 3 నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నారు. పరీక్షలు విజయవంతమైతే ఈ ఏడాది చివరికి లేదా కొత్త సంవత్సరం ఆరంభంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని నిమ్స్ వైద్యులు చెబుతున్నారు. -
నిమ్స్లో ట్రయల్స్ షురూ
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్కు దేశీయంగా తొలి వ్యాక్సిన్ తయారీలో ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఇంట ర్నేషనల్ మరో ముందడుగు వేసింది. తాము అభి వృద్ధి చేస్తున్న ‘కోవాగ్జిన్’ను మనుషులకు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే ఎయిమ్స్ (పాట్నా) సహా రోహతక్ (హరియాణా)లో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిన ఆ సంస్థ తాజాగా సోమవారం హైదరాబాద్లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లోనూ మనుషులపై టీకాను ప్రయోగిం చింది. సోమవారం ఇద్దరు వలంటీర్లకు మూడు మైక్రోగ్రాముల చొప్పున వ్యాక్సిన్ ఇచ్చారు. 24 గంటల పాటు వీరిని ఆస్పత్రి ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, ఆ తర్వాత డిశ్చార్జి చేస్తారు. బయట తిరిగితే ఇన్ఫెక్షన్ బారినపడే ప్రమాదం ఉండటంతో వీరిని పూర్తిగా ఇంటికే పరి మితం చేయనున్నారు. వైద్యులు వీడియో కాల్లో రోజూ వలంటీర్ల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తారు. ఈ సమయంలో వీరికి అవసరమైన పౌష్టికాహారం సహా అన్ని రకాల మందులను అందజేస్తారు. 14 రోజుల తరువాత శరీరంలో యాంటీబాడీస్ ఏ మేరకు వృద్ధి చెం దాయి? వ్యాక్సినేషన్ తర్వాత ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తాయా? వంటివి విశ్లేషించి, వచ్చే ఫలితాలను బట్టి వీరికి అదే బ్యాచ్కి చెందిన ఆరు మైక్రో గ్రాముల చొప్పున రెండో డోస్ ఇవ్వనున్నారు. మంగళవారం మరో ఆరుగురికి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మూడో ప్రయోగం.. కరోనా వైరస్కు విరుగుడుగా వ్యాక్సిన్ తెచ్చేందుకు అంతర్జాతీయంగా వందకుపైగా ఫార్మా కంపెనీలు పోటీపడుతున్నాయి. ఆయా దేశాలు వ్యాక్సిన్ల తయారీపై చేస్తున్న పరిశోధనలు వివిధ దశల్లో ఉన్నాయి. చైనా, బ్రిటన్ తదితర దేశాలకు చెందిన ఫార్మా కంపెనీలు సెప్టెంబర్లోగా వ్యాక్సిన్ తేనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. దేశీయ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్స్ మాత్రం అంతకంటే ముందే (అక్టోబర్) వ్యాక్సిన్ తీసుకొస్తామని ప్రకటించింది. భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్), పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) సహకారంతో భారత్ బయోటెక్ కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం నిమ్స్ సహా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 12 పరిశోధన కేంద్రాల్లో ఇప్పటికే 375 మంది వలంటీర్లపై ర్యాండమైజ్డ్ డబుల్ బ్లెండ్, ప్లాసిబో కంట్రోల్డ్ క్లినికల్ ట్రయల్స్ను ప్రారంభించింది. జూలై 15న పాట్నా ఎయిమ్స్లో, 17న హరియాణాలోని రోహతక్లో పోస్ట్గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ముగ్గురికి వ్యాక్సిన్ ఇవ్వగా, ఎలాంటి దుష్ఫలితాలు కనిపించలేదు. దీంతో తాజాగా నిమ్స్లో ఇద్దరు వలంటీర్లకు తొలి డోస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ నోడల్ అధికారి డాక్టర్ సి.ప్రభాకర్రెడ్డి తెలిపారు. మిలీనియం బ్లాక్ 6వ అంతస్తులోని నిమ్స్ క్లినికల్ ఫార్మాకాలజీ విభాగం ఈ టీకా ప్రయోగాన్ని నిర్వహిస్తోంది. కాగా, నిమ్స్లో ప్రయోగానికి ఇప్పటి వరకు 60 మంది వలంటీర్లను ఎంపిక చేశారు. వీరికి కరోనా సహా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న వారి పేర్లను ఐసీఎంఆర్కు పంపి, ఫిట్నెస్ అనుమతి వచ్చాకే వారికి వ్యాక్సిన్ డోస్ ఇస్తారు. -
టీకా రేసులో భారత్ జోరు
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల ప్రజలందరూ కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందాని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వేళ భారత్ తన జోరు చూపిస్తోంది. వివిధ దేశాల్లో 150కి పైగా వ్యాక్సిన్ పరిశోధనలు జరుగుతూ ఉంటే భారత్ కూడా తన సత్తా చాటుతోంది. మన దేశంలో టీకా అభివృద్ధి రేసులో 7 ఫార్మా కంపెనీలు దూసుకుపోతున్నాయి. ఆ ఏడూ ఇవే.. భారత్ బయోటెక్, సెరమ్ ఇనిస్టిట్యూట్, జైడస్ కాడిలా, పనాసియా బయోటెక్, బయోలాజికల్ ఈ , ఇండియన్ ఇమ్యునోలాజికల్స్, మైన్వాక్స్ స్వదేశీ ఫార్మా సంస్థలు కోవిడ్ టీకా తయారీలో తలమునకలై ఉన్నాయి. ఏ సంస్థ పరిశోధనలు ఎంతవరకు ? ► హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్కు మొదటి, రెండో దశ ప్రయోగాలకు అనుమతులు లభించాయి. గత వారమే మనుషులపై ప్రయోగాలు మొదలు పెట్టింది. ► దేశంలోనే వ్యాక్సిన్ తయారీలో అగ్రగామి సంస్థ సెరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అస్ట్రాజెనెకా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ 3 దశ క్లినికల్ ప్రయోగాల్లో ఉంది. ఈ ఏడాది చివరికి టీకాను అభివృద్ధి చేస్తామని ఆ సంస్థ అంటోంది. అమెరికాకు చెందిన బయోటెక్ సంస్థ కోడాజెనిక్స్తో పాటు మరిన్ని దేశాలు చేస్తున్న పరిశోధనల్లో ‘సెరమ్’ పాల్గొంటోంది. ► జైడస్ కేడిలా సంస్థ అభివృద్ధి చేస్తున్న జైకోవ్–డి టీకా మరో 7 నెలల్లో క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసే దిశగా ముందుకుసాగుతోంది. ► పనాసియా బయోటెక్ కంపెనీ అమెరికాకు చెంది రెఫానా ఇంక్ కంపెనీతో కలిసి ఐర్లాండ్లో జాయింట్ వెంచర్ని ప్రారంభించింది. వ్యాక్సిన్ అభివృద్ధిలో ముం దుంది. రెఫానా భాగస్వామ్యంతో ఈ కంపెనీ 50 కోట్ల టీకా డోసుల్ని సిద్ధం చేసే పనిలో ఉంది. వచ్చే ఏడాదికి టీకా డోసులు అందుబాటులోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది. ► నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ)కి అనుబంధంగా నడిచే ఇండియన్ ఇమ్యునోలాజికల్ సంస్థ వ్యాక్సిన్ తయారీకి ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. ► బయోలాజికల్ ఈ, మైన్వాక్స్ సంస్థలు కూడా వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాయి కానీ ఆ సంస్థల పరిశోధనలు ఎంతవరకు వచ్చాయో అధికారిక సమాచారం లేదు. -
దేశంలో కరోనా మిలియన్ మార్చ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతి కొనసాగుతోంది. దేశంలో కోవిడ్–19 కేసులు మొదటి లక్షకు చేరుకునేందుకు 110 రోజులు పట్టగా 9 లక్షల మార్కును 59 రోజుల్లోనే దాటేయడం గమనార్హం. శుక్రవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 34,956 మందికి పాజిటివ్ తేలడంతో మొత్తం కేసుల సంఖ్య 10,03,832కు చేరుకుందని కేంద్రం తెలిపింది. ఒక్క రోజులోనే అత్యధికంగా మరో 687 మంది కోవిడ్ బారిన పడి చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 25,602కు పెరిగిపోయింది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 22,942 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు 6,35,756 మంది రికవరీ కాగా, దేశంలో 3,42,473 యాక్టివ్ కేసులున్నాయని కేంద్రం పేర్కొంది. రికవరీ రేటు 63.33 శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఈనెల 16వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 1,30,72,718 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. దేశంలో ప్రతి పది లక్షల జనాభాకు 658 చొప్పున కరోనా కేసులు నమోదు కాగా, యూరప్ దేశాలతో పోల్చుకుంటే ఇది 4 నుంచి 8 రెట్లు తక్కువ. క్వారంటైన్లో 31.6 లక్షల మంది కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా 31.6 లక్షల మంది బాధితులను క్వారంటైన్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. వీరిలో యూపీలో అత్యధికంగా 11 లక్షల మంది, ఆ తర్వాత మహారాష్ట్రలో 7.27 లక్షలు, గుజరాత్లో 3.25 లక్షలు, ఒడిశాలో 2.4 లక్షల మంది క్వారంటైన్లో ఉన్నారని పేర్కొన్నారు. ‘కోవాక్సిన్’ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం భారత్ బయోటెక్ తయారు చేసిన కోవిడ్–19 టీకా కోవాక్సిన్ క్లినికల్ పరీక్షలు రొహ్తక్లోని పోస్టుగ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ ప్రకటించారు. ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యా రాయ్ బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్, ఆమె కూతురు ఆరాధ్య శుక్రవారం తీవ్ర జ్వరంతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరారు. కోవిడ్ పాజిటివ్గా తేలడంతో ఇప్పటికే భర్త అభిషేక్, మామ అమితాబ్ బచ్చన్ అదే ఆస్పత్రిలో ఉన్న విషయం తెలిసిందే. ఐశ్వర్య, ఆరాధ్య కూడా కోవిడ్ పాజిటివ్గా తేలడంతో ఇన్నాళ్లు హోం క్వారంటైన్లో ఉన్నారు. కోవిడ్ పరీక్షల్లో అమెరికా తర్వాత భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికా 4.2 కోట్ల కోవిడ్–19 పరీక్షలు చేపట్టగా, ఆ తర్వాతి స్థానంలో భారత్ 1.20 కోట్ల మందికి పరీక్షలు చేసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్ష భవనం ప్రెస్ సెక్రటరీ కేలీ మెకెననీ వెల్లడించారు. అమెరికా ప్రభుత్వం అత్యధికంగా 4.2 కోట్ల మందికి పరీక్షలు చేయగా 35 లక్షల మందికి పాజిటివ్గా తేలిందని ఆమె తెలిపారు. కోవిడ్ పరీక్షల దృష్ట్యా చూస్తే అమెరికా మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానంలో భారత్ ఉందన్నారు. మోడెర్నా సంస్థ రూపొందించిన కోవిడ్–19 వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షల్లో ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయనీ, ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మూడో దశ జూలై చివర్లో జరుగుతాయన్నారు. -
కోవాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ షురూ!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 10 లక్షల మార్క్ను దాటేసింది. ఈ క్రమంలో హర్యానా ఆరోగ్య శాఖా మంత్రి అనిల్ విజ్ శుక్రవారం కాస్త ఊరటనిచ్చే కబురు చెప్పారు. భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కరోనా విరుగుడు టీకా కోవాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ ఈ రోజు ప్రారంభమైనట్లు తెలిపారు. రోహతక్లోని పీజీఐ (పండిత్ భగవత్ దయాళ్ శర్మ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో ముగ్గురిపై టీకా ప్రయోగించగా.. వారంతా బాగానే ఉన్నారని.. ఎలాంటి ప్రతికూల ఫలితాలు, దుష్ప్రరిణామాలు చోటుచేసుకోలేదని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా కోవాక్సిన్ మానవ పరీక్షల మొదటి దశను ప్రారంభించినట్లు హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ ఈనెల 15న అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐసీఎంఆర్ ఎంపిక చేసిన 12 కేంద్రాల్లో ఈ మేరకు కోవ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఇప్పటికే ఎయిమ్స్- పట్నాలో ఆస్పత్రి అధికారులు ఎంపిక చేసిన పది మంది వాలంటీర్లపై వ్యాక్సిన్ పరీక్షలు ప్రారంభించిన విషయం విదితమే. (ఎయిమ్స్-పట్నాలో వ్యాక్సిన్ పరీక్షలు ప్రారంభం) Human trial with Corona vaccine (COVAXIN) of Bharat Biotech started at PGI Rohtak today. Three subjects were enrolled today. All have tolerated the vaccine very well. There were no adverse efforts. — ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) July 17, 2020 -
కోవ్యాక్సిన్ : మానవ పరీక్షలు షురూ
పట్నా : కరోనా వైరస్ కట్టడికి స్వదేశీ వ్యాక్సిన్ను సత్వరం అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. ఐసీఎంఆర్తో కలిసి హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవ్యాక్సిన్ మానవులపై పరీక్షలు పట్నాలోని ఎయిమ్స్లో ప్రారంభమయ్యాయి. ఎయిమ్స్- పట్నాలో ఆస్పత్రి అధికారులు ఎంపిక చేసిన పది మంది వాలంటీర్లపై వ్యాక్సిన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. వీరికి వాక్సిన్ తొలి డోసు ఇచ్చిన అనంతరం 14 రోజుల విరామం తర్వాత వీరిపై రెండవ డోస్ను పరీక్షిస్తారు. నిర్ణీత వ్యవధి పూర్తయిన అనంతరం వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా ఏమైనా సైడ్ఎఫెక్ట్స్ కనిపించాయా అనేది పరిశీలిస్తారు. కోవ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలకు ఐసీఎంఆర్ ఎంపిక చేసిన 12 కేంద్రాల్లో ఈ ఆస్పత్రి ఒకటి. కాగా, 22 నుంచి 50 సంవత్సరాల లోపున్న ఆరోగ్యవంతులపై వ్యాక్సిన్ పరీక్ష చేపడతామని ఎయిమ్స్-పట్నా సూపరింటెండెంట్ డాక్టర్ సీఎం సింగ్ పరీక్షలకు ముందు వెల్లడించారు. మరోవైపు సార్స్-కోవ్-2 వైరస్పై తమ ప్రయోగ్మాతక వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని ఆశిస్తున్నామని భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా అంతకుముందు ఓ జాతీయ వెబ్సైట్తో మాట్లాడుతూ పేర్కొన్నారు. కాగా తమ వ్యాక్సిన్పై తొలి రెండు దశల మానవ పరీక్షలకు భారత్ బయోటెక్కు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) ఆమోదం లభించింది. చదవండి : కరోనా: ఆ దశకు భారత్ ఇంకా చేరుకోలేదు -
కరోనా వ్యాక్సిన్ : ప్రకటనలో గందరగోళం
న్యూఢిల్లీ : కరోనాను అంతం చేయడంలో దేశీయ వ్యాక్సిన్లు ఏ విధంగా పోటీలో ఉన్నాయో తెలుపుతూ కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో గందగోళం చోటుచేసుకుంది. తొలుత సదరు మంత్రిత్వ శాఖ పేరిట పీఐబీలో ఒక ప్రకటన కనిపించింది. అందులో ‘కోవిడ్-19 వ్యాక్సిన్పై 6 భారతీయ కంపెనీలు పనిచేస్తున్నాయి. భారత్కు చెందిన ‘కోవాక్సిన్’, 'జైకోవ్- డీ'లతోపాటుగా ప్రపంచంలోని 140 వ్యాక్సిన్లలో 11 క్లినికల్ ట్రయల్స్లో ఉన్నాయి. ఇందులో ఏది కూడా 2021 కన్నా ముందుగా ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు’ అని పేర్కొన్నారు. అయితే కొద్దిసేపటికే ‘2021 కంటే ముందుగా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు’ అనే లైన్ను తొలగించారు. (చదవండి : కోవిడ్-19 టీకా: ఐసీఎంఆర్ కీలక ప్రకటన) మరోవైపు కరోనా వ్యాక్సిన్కు సంబంధించి భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) చేసిన ప్రకటనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోని మొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ ఆగస్టు 15నాటికి విడుదల చేయాలన్నదే తమ లక్ష్యమని ఐసీఎంఆర్ పేర్కొంది. అయితే దీనిపై వైద్య నిపుణలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు వ్యాక్సిన్కు సంబంధించి తేదీని నిర్ణయించారనే పలువురు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తమ ప్రకటనపై ఐసీఎంఆర్ స్పష్టతనిచ్చింది. వ్యాక్సిన్ ప్రీ-క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్నందునే.. తదుపరి అనుమతులు ఇచ్చినట్టు తెలిపింది.దేశంలో అత్యవసర పరిస్థితిని పరిగణలోకి తీసుకొని వ్యాక్సిన్ను వేగంగా తీసుకురావడంలో భాగంగా అంతర్జాతీయ నిబంధలను అనుగుణంగా ప్రయోగాలు చేపడుతున్నట్టు స్పష్టం చేసింది.(చదవండి : కరోనా ‘కోవాక్సిన్’పై కొత్త గొడవ) భారత్లో కరోనా వ్యాక్సిన్కు సంబంధించి హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కోవ్యాక్సిన్’, ఫార్మా సంస్థ జైడస్ తయారు చేసిన ‘జైకోవ్- డి’ ల క్లినికల్ ట్రయల్స్ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఏ) అనుమతించిన సంగతి తెలిసిందే. క్లినికల్ ట్రయల్స్ తొలి దశలో భద్రతపై దృష్టి సారించగా, రెండో దశలో వ్యాక్సిన్ సమర్ధతను పరీక్షించనున్నారు. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే కరోనా వ్యాక్సిన్ ఈ ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశాలపై మరోసారి సందిగ్ధత నెలకొంది. (చదవండి : ‘కోవాక్సిన్’ తీసుకున్న తొలి వ్యక్తి ఈయనేనా?) -
ప్రజారోగ్యానికే ప్రాధాన్యం
న్యూఢిల్లీ: కరోనాని కట్టడి చేయడానికి వ్యాక్సిన్ రూపకల్పనలో భారత్ పురోగతి సాధించడంతో ప్రపంచ దేశాల దృష్టి భారత్పై పడింది. ఈ వ్యాక్సిన్ను ఆగస్టు 15నాటికి అందుబాటులోకి తెస్తామన్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) చేసిన ప్రకటనపై సందేహాలు వెల్లువెత్తాయి. హైదరాబాద్లోని భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ని ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో నిర్వహించాలని ఆగస్టు 15 వరకు గడువు ఇస్తూ ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ రాసిన లేఖ బయటకి వచ్చి వివాదాస్పదమైంది. అంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఆచరణ సాధ్యం కాదని చాలా మంది వైరాలజిస్టులు తేల్చేయడంతో ఐసీఎంఆర్ వివరణనిచ్చింది. అంతర్జాతీయ నిబంధనలకు లోబడే ఫాస్ట్ ట్రాక్ ప్రయోగాలు చేస్తున్నామని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అధికారికంగా అనుమతుల మంజూరులో జాప్యాన్ని నివారించడానికే ఫాస్ట్ ట్రాక్ పద్ధతి అవలంబిస్తున్నామని స్పష్టం చేసింది. ప్రజారోగ్య ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే ప్రక్రియని వేగవంతం చేశామని తెలిపింది. ఈ ఏడాది వ్యాక్సిన్ రాదు: సీసీఎంబీ కోవిడ్ వ్యాక్సిన్ ఈ ఏడాది వచ్చే అవకాశాల్లేవని సీఎస్ఐఆర్–సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మొలెక్యులర్ బయోలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్ కె మిశ్రా చెప్పారు. వ్యాక్సిన్ అభివృద్ధిలో జరిగే ప్రక్రియలో పెద్ద సంఖ్యలో క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉంటుందని వచ్చే ఏడాది లోపు అది పూర్తి చెయ్యడం సాధ్యం కాదని అన్నారు. వ్యాక్సిన్ ప్రయోగాలను పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకువెళ్లినప్పటికీ ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుందని అన్నారు. ఎందుకంటే వ్యాక్సిన్ను అత్యంత ఎక్కువ మందిపై ప్రయోగాలు చేయాల్సి ఉంటుందని అన్నారు. వ్యాక్సిన్ అంటే అదేదో మందు కాదని, అది వేశాక తగ్గిపోతుందో లేదో చూడడానికని మిశ్రా అన్నారు. మానవ ప్రయోగాలకి 12–18 నెలలు మొత్తం మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి. మొదటి దశలో వ్యాక్సిన్ మనుషులకి సురక్షితమా కాదా అని తెలుసుకోవడానికి చాలా తక్కువ మందిపై ప్రయోగించి చూస్తారు. రెండో దశలో అన్ని వయసుల వారికి వ్యాక్సిన్ ఎలా పని చేస్తుందో చూస్తారు. ఇక మూడో దశలో కొన్ని నెలల పాటు ఈ వ్యాక్సిన్ సమర్థతను పరీక్షించి చూస్తారు. ఈ దశలో వేలాది మంది పాల్గొనాల్సి ఉంటుంది. అన్ని రకాలుగా వ్యాక్సిన్ పనిచేస్తోందని నిర్ధారణయ్యాకే ప్రజలకి టీకాని అందుబాటులోకి తెస్తారు. ఒక వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటు రావాలంటే కనీసం 12–18 నెలల కాలం పడుతుందని కోల్కతాకు చెందిన వైరాలజిస్టు ఉపాసన రే అన్నారు. -
కరోనా టీకా: ఐసీఎంఆర్ కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ టీకా ప్రయత్నాలపై భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) శనివారం ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ స్థాయి ప్రమాణాల మేరకే కరోనా వ్యాక్సిన్ తయారీ, పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. దేశీయంగా వ్యాక్సిన్ తయారీకి ‘భారత్ బయోటెక్’కు అనుమతి ఇచ్చామని.. ఐసీఎంఆర్, నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి ఆ కంపెనీ కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తోందని పేర్కొంది. దేశ ప్రజల ప్రయోజనాలు, భద్రతను దృష్టిలో పెట్టుకొని వేగవంతంగా వ్యాక్సిన్ తయారీ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. లోతైన పరిశీలన, డేటా విశ్లేషణ తర్వాతే కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్కు అనుమతిస్తామని స్పష్టం చేసింది. (కరోనా ‘కోవాక్సిన్’పై కొత్త గొడవ) కాగా కరోనా మహమ్మారి కట్టడికి హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ ‘కోవాక్సిన్’ను మానవులపై ప్రయోగించేందుకు భారత డ్రగ్ కంట్రోలర్ అనుమతి లభించిన విషయం తెల్సిందే. ఇందుకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్లో పాల్గొనే వారు జూలై 7లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ఆగస్టు 15వ తేదీలోగా కోవాక్సిన్ను ఆవిష్కరించాలంటూ ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ గురువారం లేఖ రాయడం పట్ల వైద్య నిపుణులు, పరిశోధనా వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. అదే విధంగా మానవులపై ట్రయల్స్ జరగకముందే వ్యాక్సిన్ విడుదలకు తేదీని ఎలా ఖరారు చేస్తారని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో శనివారం ఈ మేరకు స్పందించిన ఐసీఎంఆర్.. భారత్ బయోటెక్ ప్రీ క్లినికల్ డేటాను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే డ్రగ్స్ కంట్రోలర్ అనుమతించారని ప్రకటన విడుదల చేసింది. (కరోనా: 7నుంచి నిమ్స్లో క్లినికల్ ట్రయల్స్) -
‘కోవాక్సిన్’ తీసుకున్న తొలి వ్యక్తి ఈయనేనా?
సాక్షి, న్యూఢిల్లీ: భారత 74వ స్వతంత్ర దినోత్సవం నాటికి కరోనా వైరస్ అంతుచూసే ‘కోవ్యాక్సిన్’ను భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్), హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్, పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో(ఎన్ఐవీ) కలిసి తేవడానికి కృషి చేస్తోందన్న వార్త మనమందరం విన్నాం. మనుషులపై కోవాక్సిన్ ప్రయోగానికి ఇటీవలే ఐసీఎంఆర్, భారత్ బయోటెక్కు అనుమతి కూడా ఇచ్చింది. ఇదే సమయంలో వ్యాక్సిన్కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. (కరోనా ‘కోవాక్సిన్’పై కొత్త గొడవ) అందులో మెడికల్ ప్రొటెక్షన్ గేర్లో ఉన్న ఓ మహిళ, భారత్ బయోటెక్ వైస్ ప్రెసిడెంట్ వీకే శ్రీనివాస్కు ఇంజెక్షన్ ఇస్తోంది. కోవాక్సిన్ను తొలుత సంస్థ వైస్ ప్రెసిడెంటే తీసుకున్నారని సదరు ఫొటోకు జోడించిన సారాంశం. దీంతో చాలా మంది ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్లో ఈ ఫొటోను షేర్ చేశారు. దాంతో పాటు ‘తమ ఉత్పత్తిపై నమ్మకం ఉన్న భారత్ బయోటెక్, తొలుత సంస్థ వైస్ ప్రెసిడెంట్కే కోవాక్సిన్ డోస్ ఇచ్చింది. భారత్లో వ్యాక్సిన్ తీసుకున్న తొలి వ్యక్తి శ్రీనివాసే’ అనే కామెంట్లను జోడించారు. (రికార్డు స్థాయిలో రికవరీ) కానీ, ఇదో నకిలీ వార్త. స్వయంగా భారత్ బయోటెకే దీనిపై ట్విట్టర్లో ఓ ప్రకటన విడుదల చేసింది. ఫొటోలో చూపించినది క్లినికల్ ట్రయల్ కాదని వెల్లడించింది. సంస్థ ఉద్యోగులకు రెగ్యులర్గా నిర్వహిస్తున్న టెస్టుల్లో భాగంగానే శ్రీనివాస్ నుంచి బ్లడ్ శాంపిల్ సేకరించామని చెప్పింది. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న ఫొటోలు, సమాచారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. ఈ నెల 1వ తేదీన భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఓ జాతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరో పది రోజుల్లో మనుషులపై ‘కోవాక్సిన్’ట్రయల్స్ మొదలవుతాయని చెప్పారు. ఇలా చూసుకున్నా శ్రీనివాసన్ కోవాక్సిన్ తీసుకున్నారన్న వార్త అబద్ధం అని అర్థం అవుతుంది. -
కరోనా ‘కోవాక్సిన్’పై కొత్త గొడవ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ ‘కోవాక్సిన్’ను మానవులపై ప్రయోగించేందుకు భారత డ్రగ్ కంట్రోలర్ అనుమతి లభించిన విషయం తెల్సిందే. ఈ మానవ ట్రయల్స్లో పాల్గొనే వారు జూలై 7లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ఆగస్టు 15వ తేదీలోగా కోవాక్సిన్ను ఆవిష్కరించాలంటూ భారత వైద్య పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ గురువారం లేఖ రాయడం పట్ల వైద్య నిపుణులు, పరిశోధనా వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. (గుడ్న్యూస్: ఆగస్ట్ 15కి వ్యాక్సిన్) మానవులపై ట్రయల్స్ జరగకముందే ఎలా వ్యాక్సిన్ విడుదలకు తేదీని ఖరారు చేస్తారని ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్’ సంపాదకులు అమర్ జెసాని ప్రశ్నించారు. మానవులపై వ్యాక్సిన్ ట్రయల్స్ విజయం అవుతాయన్న నమ్మకం ఏమిటని ఆయన అన్నారు. మానవ ట్రయల్స్లో పాల్గొంటున్న 12 సంస్థల్లో మెజారిటీ సంస్థలు కూడా భార్గవ లేఖ పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఎథిక్స్ కమిటీ అనుమతి ఇవ్వకుండా తాము మానవ ట్రయల్స్ పాల్గొనలేమని, ఆగస్టు 15వ తేదీ కాదుగదా, డిసెంబర్ 15వ తేదీ నాటికి కూడా ఇది సాధ్యమయ్యే పని కాదని ఒడిశాలోని ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ సమ్ హాస్పిటల్’ ట్రయల్స్ ఇంచార్జి వెంకట్రావు తెలిపారు. (టీకా కోసం ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ జట్టు) ఇది జంతువులపై ట్రయల్స్ అని, మానవులపై ట్రయల్స్ అని, సాక్షాత్తు ప్రధాన మంత్రి జోక్యం చేసుకున్నా రెండు, మూడు నెలల్లో ట్రయల్స్ పూర్తి కావని మరో ప్రభుత్వాస్పత్రికి చెందిన ఎథిక్స్ కమిటీ పేర్కొంది. భార్గవ లేఖ గురించి తనకు తెలియదని, నిర్దేశించిన కాల వ్యవధిలో వ్యాక్సిన్ను ఆవిష్కరించడం అసాధ్యమని, ఎంత సత్వర నిర్ణయాలు తీసుకున్నా ఆవిష్కరణకు కనీసం ఏడాది కాలం పడుతుందని ఐసీఎంఆర్ ఎథిక్స్ అడ్వైజరీ కమిటీ చైర్పర్సన్ వసంత ముత్తుస్వామి చెప్పారు. ఇలా అనవసరంగా తొందరపెడితే తాము మానవ ట్రయల్స్లో పాల్గొనమని 12 సంస్థల్లో కొన్ని సంస్థలు హెచ్చరిస్తున్నాయి. (మనుషులపై ప్రయోగానికి 'భారత్' వ్యాక్సిన్) -
కరోనా వ్యాక్సిన్పై ఐసీఎంఆర్ ప్రకటన
-
గుడ్న్యూస్: ఆగస్ట్ 15కి వ్యాక్సిన్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న తరుణంలో ప్రముఖ ఔషధ కంపెనీలన్నీ వైరస్ విరుగుడును కనిపెట్టే ప్రకియలో నిమగ్నమయ్యాయి. కరోనా నివారణకు వ్యాక్సిన్ను కనిపెట్టామని ఇప్పటికే పలు కంపెనీలు ప్రకటించినా అవేవీ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలోనే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది ఆగస్ట్ 15 కల్లా వ్యాక్సిన్ను విడుదల చేస్తామని చల్లని కబురు చెప్పింది. వ్యాక్సిన్ ప్రస్తుతం మానవ ప్రయోగ దశలో ఉందని, ఇప్పటికే నిర్వహించిన జంతువులపై ప్రయోగం మెరుగైన ఫలితాలు ఇచ్చాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ను ఐసీఎంఆర్ క్లినికల్ టెస్టులు వేగవంతం చేయనుంది. (మలి దశకు వ్యాక్సిన్ ప్రయోగాలు) పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో కరోనా నివారణ కోవాక్సిన్ను భారత్ బయోటిక్తో కలిసి ఐసీఎంఆర్ రూపొందిస్తోంది. మానవులపై కోవాక్సిన్ ప్రయోగాలు విజయవంతమైతే వైరస్పై సమర్థవంతమైన వ్యాక్సిన్గా ఈ ఔషధం నిలువనుంది. మరోవైపు ప్రపంచం నలుమూలల్లో కనీసం మూడు నాలుగు కొత్త వ్యాక్సిన్లు ఆశాజనక ఫలితాలు చూపుతున్నాయి. కోవిడ్–19ను జయించగలమన్న భరోసాను ప్రజల్లో కల్పిస్తున్నాయి. అంతర్జాతీయ ఫార్మా కంపెనీ ఫైజర్, చైనాలోని కాన్సైనో, ఆస్ట్రేలియాలోని వ్యాక్సైన్లు కీలకమైన దశలు దాటుకుని వేగంగా వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చే దిశగా సాగుతున్నాయి. -
కరోనా టీకా: మరో కీలక అడుగు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కరోనా మహమ్మారి వ్యాక్సిన్ తయారీలో మరో కీలక ముందడుగు వేసింది. తొలి స్వదేశీ వ్యాక్సిన్ ‘కో వ్యాక్సిన్’ ఫేజ్-1, ఫేజ్-2 పరీక్షలకు అనుమతులను సాధించింది. జూలైలో దేశవ్యాప్తంగా హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతులిచ్చింది. కోవిడ్ నియంత్రణకు ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్), నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)సహకారంతో భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారత్ బయోటెక్ రూపొందిస్తున్న వ్యాక్సిన్ ‘కో వ్యాక్సిన్’. కరోనా కట్టడికి మొట్టమొదటి స్వదేశీ వ్యాక్సిన్ను ప్రకటించినందుకు గర్విస్తున్నామని, ఇదొక మైలురాయి లాంటిదని భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా ప్రకటించారు. ఈ టీకా అభివృద్ధిలో ఐసీఎంఆర్, ఎన్ఐవి సహకారం కీలక పాత్ర పోషించాయనీ, అలాగే తమ ఆర్అండ్డి, తయారీ బృందాలు అవిశ్రాంతంగా కృషి చేశాయని పేర్కొన్నారు. కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నఔషధ తయారీదారులు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రేసులో భారత్, వ్యాక్సిన్లు, జెనెరిక్ ఔషధాల తయారీలో కీలక పాత్ర పోషించనుంది. టీకాను అందుబాటులోకి తెచ్చేందుకు 30 గ్రూపులు పనిచేస్తున్నాయని మేలో ప్రభుత్వం తెలిపింది. కాగా భారతదేశంలో 16,475 మంది సహా ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల మంది ఈ మహమ్మారికి బలి కాగా, భారతదేశంలో దాదాపు 5.5 లక్షలతో సహా ప్రపంచవ్యాప్తంగా 1.01 కోట్లకు పైగా ప్రజలు వైరస్ బారిన పడ్డారు. కరోనాకు భారీగా ప్రభావితమైన నాల్గవ దేశంగా భారత్ నిలిచింది.