
హైదరాబాద్: కోవిడ్ -19 వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి, కోవాగ్జిన్ ఉత్పత్తికి అవసరమయ్యే పదార్థాలను తయారుచేసే ఒప్పందంలో భాగంగా మొదటి బ్యాచ్ కోవాగ్జిన్ డ్రగ్ పదార్థాలను భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లాకు ఐఐఎల్ ఎమ్డీ డాక్టర్ కే. ఆనంద్కుమార్ శుక్రవారం రోజున అందజేశారు. కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్(బీబీఐఎల్), ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్(ఐఐఎల్)తో చేతులు కలిపాయి. 2021 ఏప్రిల్లో వీరి మధ్య ఒప్పందం కుదిరింది.
ఈ సందర్బంగా ఐఐఎల్ ఎమ్డీ డాక్టర్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ..రికార్డు సమయంలో కోవాగ్జిన్ ముడిపదార్థాలను తయారుచేయడం ఇతర స్టేక్ హోల్డర్స్ సహాయంతో లక్ష్యాన్ని ఛేదించామని పేర్కొన్నారు. నిర్వీరామంగా కంపెనీలోని ఉద్యోగులు పనిచేయడంతోనే ముడిపదార్థాల ఉత్పత్తి సాధ్యమైందని వెల్లడించారు. నీతి-ఆయోగ్, బీఐఆర్ఏసీ, డీబీటీ, మిషన్ కోవిడ్ సురక్ష బృందం, కేంద్ర రాష్ట్ర ఔషధ నియంత్రణ అధికారులు అందించే నిరంతర మద్దతుతో ఐఐఎల్ తమ లక్ష్యాన్ని సాధించిందని తెలిపారు. ఐఐఎల్ అతి తక్కువ సమయంలో బీబీఐఎల్ కంపెనీతో నాలుగు ఒప్పందాలను కుదుర్చుకుంది.