![Bomb Explodes On Roof Of A School In West Bengal Titagarh - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/17/bomb-blast-school-roof.jpg.webp?itok=XWzi5HlK)
కోల్కతా: పశ్చిమ బెంగాల్ టీటాగఢ్లో ఓ పాఠశాలపై బాంబు పేలడం కలకలం రేపింది. విద్యార్థులు, టీటర్లంతా స్కూల్లో ఉన్న సమయంలోనే శనివారం మధ్యాహ్నం 1:00గంటలకు ఈ ఘటన జరిగింది. భారీ పేలుడు శబ్దం వినగానే సిబ్బంది, స్టూడెంట్స్ భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఒక్కరు కూడా గాయపడకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాంబు స్క్యాడ్ నిపుణులతో తనిఖీలు చేయించారు.
అయితే స్కూల్ భవనంపైకప్పుపై ఈ బాంబు ఎలా పేలి ఉంటుందనే విషయంపై మాత్రం పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. ఈ బాంబును భవనంపైనే ఎవరైనా కావాలని పెట్టారా? లేక బయటి నుంచి స్కూల్ పైకి విసిరారా? అనే విషయం తెలియాల్సి ఉంది. అదృష్టవశాత్తు పేలుడు జరిగినప్పుడు విద్యార్థులంతా స్కూల్ లోపలే ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ఒకవేళ భవనంపై కాకుండా పాఠశాల లోపల పేలుడు జరిగి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదని పేర్కొన్నారు.
ఈ పేలుడు ఘటనపై అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. క్రూడ్ బాంబులు, అక్రమ ఆయుధాల పరిశ్రమలే బెంగాల్లో పుట్టుకొస్తున్నాయని కమలం పార్టీ తృణమూల్ ప్రభుత్వంపై మాటల దాడికి దిగింది. ప్రభుత్వంపై బురద జల్లేందుకు బీజేపీ ఎలాంటి అవకాశన్నైనా వదులుకోదని టీఎంసీ దీటుగా బదులిచ్చింది.
చదవండి: ప్రధాని మోదీని ఆకాశానికెత్తిన అమెరికా మీడియా
Comments
Please login to add a commentAdd a comment