
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నమస్తే’(నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్) పథకానికి రాబోయే జూలై నాటికి రెండేళ్లు పూర్తికానున్నాయి. ఈ కాలంలో చేతులతో మానవ మలాన్ని ఎత్తడం, మురుగునీటిని తొలగించడంలాంటి ఉపాధి సంబంధిత పనులకు ముగింపు పలకడం జరిగిందని, మాన్యువల్ స్కావెంజర్ వ్యవస్థను వీలైనంతవరకూ రూపుమాపామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
దేశవ్యాప్తంగా సుమారు 80 వేల మంది మురుగునీటి, సెప్టిక్ ట్యాంక్ కార్మికులు(Sewage and septic tank workers)) (ఎస్ఎస్డబ్ల్యు), 11 వేల మంది వ్యర్థాలను తీసేవారిని గుర్తించినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. పథకం అమలు చేశాక, దాని ప్రభావాన్ని అంచనా వేసే అధ్యయన బృందం డిసెంబర్ నాటికి తన నివేదికను సమర్పించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. గుర్తింపు పొందిన పారిశుద్ధ్య కార్మికులలో ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 11,700 మంది, మహారాష్ట్రలో 7,649 మంది, తమిళనాడులో 6,975 మంది, కర్ణాటకలో 6,307 మంది, గుజరాత్లో 5,436 మంది, పంజాబ్లో4,407 మంది, ఆంధ్రప్రదేశ్లో 4,036 మంది, ఢిల్లీలో 3,626 మంది ఉన్నారు.
దేశంలోని అన్ని మురుగునీటి పనులను యాంత్రీకరించడం, ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకుని కార్మికులు మరణించడాన్ని నిరోధించడం లక్ష్యంగా ప్రభుత్వం నమస్తే పథకాన్ని చేపట్టింది. మాన్యువల్ స్కావెంజర్ల పునరావాసం, స్వయం ఉపాధి కోసం ఈ పథకం చేయూతనందించనుంది. అలాగే ఇది ఈ పథకం మాన్యువల్ స్కావెంజింగ్(Manual scavenging), మురుగునీటి, సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరచడం మధ్య వ్యత్యాసాన్ని వివరించడంలో ఎంతగానో దోహదపడిందని మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. కాగా గత జనవరిలో సుప్రీంకోర్టు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్లలో మాన్యువల్ స్కావెంజింగ్ను పూర్తిగా నిషేధించాలని ఆదేశించింది. పార్లమెంటు సామాజిక న్యాయం, సాధికారత కమిటీ ఇటీవల.. భద్రతా పరికరాలు అందుబాటులో లేకపోవడం వల్ల పారిశుధ్య కార్మికుల మరణాలు చోటుచేసుకుంటున్నాయని, వీటికి సంబంధించిన వార్తలు పత్రికలలో వస్తున్నాయని పేర్కొంది. పారిశుధ్య కార్మికుల సామర్థ్యాన్ని పెంపొందించడం చాలా అవసరమని సూచించింది.
ఇది కూడా చదవండి: శశిథరూర్ దౌత్య విజయం.. వైఖరి మార్చుకున్న కొలంబియా