భారత్‌ దిశగా చైనా గూఢచార నౌక | Chinese Spy Ship In Indian Ocean Post Operation Sindoor | Sakshi
Sakshi News home page

భారత్‌ దిశగా చైనా గూఢచార నౌక

May 17 2025 5:34 AM | Updated on May 17 2025 5:34 AM

Chinese Spy Ship In Indian Ocean Post Operation Sindoor

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర ఘటన అనంతరం భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ డ్రాగన్‌ దేశం కపటబుద్ధి మరోసారి బయట పెట్టుకుంది. ఆ దేశానికి చెందిన గూఢచార నౌక ‘ద యాంగ్‌ యి హవో’ భారత్‌ దిశగా వస్తోంది. ఈ విషయాన్ని డామియెన్‌ సిమోన్‌ అనే ఓపెన్‌సోర్స్‌ ఇంటెలిజెన్స్‌ నిపుణుడు తెలిపారు. చైనాకున్న గూఢచార నౌకల్లో ఇదొకటి. వీటిని పరిశోధన నౌకలని చైనా చెప్పుకుంటున్నప్పటికీ, వీటిని నిఘా నౌకలుగానే భారత్‌ తదితర దేశాలు పరిగణిస్తున్నాయి. 

శాస్త్రీయ పరిశోధనలతో పాటు పౌర, సైనిక అవసరాలను తీర్చేలా వీటిని రూపొందించారు. సముద్ర జలాల్లో పరిశోధనలు, సముద్ర గర్భం మ్యాపింగ్, ఖనిజ, జీవ వనరుల అన్వేషణ పేరుతో సంచరించే ఈ నౌకలు క్షిపణుల గమనాన్ని ట్రాక్‌ చేయగలవు, సబ్‌మెరీన్ల కదలికలను పసిగట్టడం వంటివి చేయగలవు. తాజాగా, మలక్కా నుంచి బయలుదేరిన ఈ నౌక శ్రీలంక దక్షిణ తీరం దిశగా సాగుతున్నట్లు మ్యాప్‌ను బట్టి సిమోన్‌ విశ్లేషించారు.

 ఈ నౌకతో ప్రమాదమేమంటే.. ఇందులో మనుషులతో అవసరం లేకుండా సముద్రం అడుగున సంచరిస్తూ నిఘా కార్యకలాపాలను నిర్వహించే వాహనాలుంటాయి. సముద్రం అడుగున మందుపాతరలు, ఇతర సైనిక కార్యకలాపాలను కనిపెట్టి మ్యాపింగ్‌ చేస్తాయి. భారత్‌లో క్షిపణి పరీక్షలు, ఇతర సైనిక కార్యకలాపాల సమయంలో చైనా నిఘా నౌకలు పొరుగుదేశాలకు చేరుకుని గూఛచర్యం చేయడం ఇటీవలి కాలంలో మామూలై పోయింది.

 గతేడాది ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని–5ను ప్రయోగించిన సమయంలో చైనాకే చెందిన జియాంగ్‌ యాంగ్‌ హాంగ్‌ 01 అనే గూఢచర్య మన దేశ సమీపానికి వచ్చింది. ఒడిశాలోని బాలాసోర్‌ తీరం వెంబడి క్షిపణి పరీక్షలప్పుడు సైతం చైనా నిఘా నౌకలు తూర్పు తీరానికి సమీపంలోకి వచ్చినట్లు తెలిసింది. విశాఖ తీరంలోని సబ్‌మెరీన్లలోని అణు క్షిపణుల సిగ్నళ్లను సైతం ఇవి కనిపెట్టే అవకాశముందని సమాచారం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement