
ఆలయంలో కొలువుదీరిన జయలలిత, ఎంజీఆర్ విగ్రహాలు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే శ్రేణుల గుండెల్లో కొలువైన దేవతగా భావించే ‘అమ్మ’కు ఏకంగా ఆలయం నిర్మించారు. ఈ ఆలయాన్ని శనివారం తమిళనాడు ప్రజలకు అంకింతం చేయనున్నారు. తమిళనా డు ప్రజల దృష్టిలో అమ్మ అంటే అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత. పార్టీ శ్రేణులు సైతం అమ్మ అనే పిలుస్తారు, గౌరవిస్తారు. జయ కన్నుమూసి ఐదేళ్లవుతున్నా అమ్మపై అభిమానం ఇసుమంత కూడా తగ్గలేదు. తన లోని భక్తి ప్రపత్తులను పదికాలాల పాటు పదిలం చేసుకునేలా రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఆలయం నిర్మించారు. మదురై జిల్లా తిరుమంగళం సమీపం టీకున్రత్తూరులో రూపుదిద్దుకు న్న ఈ ఆలయాన్ని ముఖ్య మంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్సె ల్వం నేడు శనివారం ప్రారంభించనున్నారు.
ఇందు కోసం మంత్రి ఉదయకుమార్ కొన్నిరోజుల క్రితమే కాషాయవస్త్రాలు ధరించి దీక్షబూనారు. ప్రజలు సందర్శించుకునేందుకు వీలుగా 12 ఎకరాల విస్తీర్ణంలో ని ర్మించిన ఈ ఆలయంలో మూలవిరాట్టులుగా అన్నాడీ ఎంకే వ్యవస్థాపక అధ్యక్షులు ఎంజీ రామచంద్రన్, జయలలితల ఏడు అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాలను ప్రతిష్టించారు. ఒక్కో విగ్రహం 40 కిలోల బరువుతో రూపొందించారు. ఆలయ ప్రాంగణంలో పలు కళారూపాలను చెక్కించారు. ప్రధాన గాలిగోపురంపై కలశాలను ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం కోసం యాగశాలను, 11 హోమగుండాలను సిద్ధం చేశారు. ఆలయాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తలు కాలినడకన బయలుదేరారు.